గోవాడ ఫ్యాక్టరీ ఆస్తులు కొల్లగొట్టేందుకు కుట్ర
● ఫ్యాక్టరీకి పీపీపీ పద్ధతి అమలు
చేయాలనడం అన్యాయం
● రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అప్పారావు
అనకాపల్లి: గోవాడ సుగర్ ఫ్యాక్టరీని పీపీపీ పేరుతో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చోడవరం ఎమ్మెల్యే ప్రకటించడం అన్యాయమని, ఫ్యాక్టరీ ఆస్తులను కాపాడి, రైతులు, ఉద్యోగులను ఆదుకోవాలసిన ఎమ్మెల్యే ఇటువంటి చర్యలకు పాల్పడం అన్యాయమని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం రైతులతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్) పద్ధతికి ఇవ్వాలని శాసనసభలో చోడవరం ఎమ్మెల్యే రాజు ప్రభుత్వానికి విన్నవించడం ఫ్యాక్టరీ ఆస్తులను కొల్లగొట్టడం, ప్రైవేట్కు అప్పగించడం కోసమేనని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో గోవాడ ఘగర్ ఫ్యాక్టరీని అదుకుంటామని రైతులు, స్థానిక ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే అధికారం చేపట్టిన తరువాత అక్కడ ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతారని వారు పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను గెలిపిస్తే ఫ్యాక్టరీని ఆధునికీకరిస్తానని చెప్పిన మాటలు, లోకేష్ చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయన్నారు. సహకార రంగంలో నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీని కూటమి ప్రభుత్వం ఈ ఏడాది క్రషింగ్ చేయకపోవడం, రైతులు, కార్మికుల బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇటీవల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరిగిందన్నారు. సహకార రంగంలో నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీని ఆధునికీకరించి వచ్చే ఏడాదైనా క్రషింగ్ చేస్తారనే రైతులు, కార్మికులు ఆశలపై నీళ్లు చల్లినట్టుగా ఎమ్మెల్యే అసెంబ్లీలో మాటలున్నాయన్నారు. ఫ్యాక్టరీని ప్రైవేట్ శక్తులు కట్టబెట్టే ఎటువంటి చర్యలను ఈ ప్రాంతంలోని రైతులు, ప్రజలు సహించరని అన్నారు. చోడవరం ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే ఫ్యాక్టరీలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించి రైతుల మధ్య పీపీపీ పద్ధతిపై ప్రకటన చేయాలన్నారు. ఇప్పటికై నా రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం గోవాడ ఫ్యాక్టరీని సహకార రంగంలోనే నిర్వహించాలని లేని పక్షంలో రైతు, స్థానిక ప్రజల సహకారంతో ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.వి.నాయుడు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ ఆర్.దేవినాయుడు పాల్గొన్నారు.


