పోటెత్తిన పూడిమడక
● వేణుగోపాలస్వామి తీర్థానికి వెల్లువెత్తిన జనం
● భక్తులకు కరువైన మౌలిక వసతులు
అచ్యుతాపురం రూరల్: ఇసుక వేస్తే రాలనంత జనంతో పూడిమడక తీరం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. అంచనాలను మించి భక్తులు ఇక్కడకు చేరి పుణ్యస్నానాలు ఆచరించారు. శనివారం రాత్రంతా జాగరణ ఆచరించిన భక్తులు ఆదివారం వేకువ జామున సముద్ర స్నానాలు, సూర్యనమస్కారాలు చేశారు. భక్తులు పండితులు, పురోహితులు, జంగమదేవరలతో ప్రత్యేక పూజలు చేయించారు. సముద్ర స్నానాలు ఆచరించి తీరంలో ఉన్న శ్రీవేణుగోపాల లక్షీ సమేత జగన్నాధస్వామిని దర్శించుకున్నారు. పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నారు. కానీ భక్తులకు తగ్గట్టుగా ప్రభుత్వం మౌలిక సౌకర్యాలు కల్పించలేకపోయింది. ఎక్కడా బయోటాయిటెట్స్ ఏర్పా టు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో పాటు స్నానపు గదులు కూడా సరిలేకపోవడంతో మహిళలు దుస్తులు మార్చుకోవడంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తీరం వెంబడి రోప్ పార్టీ, ఎన్సీసీ కెడిట్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పరిచారు. డ్రోన్ కెమెరా సహాయంతో సముద్రం తీరమంతా పోలీసులు పర్యవేక్షించారు. లైఫ్ జాకెట్స్ అందుబాటులో ఉంచారు.
పోటెత్తిన పూడిమడక


