కేజీహెచ్లో ‘పెయిన్ క్లినిక్’ ప్రారంభం
డాబాగార్డెన్స్: రాష్ట్రంలోనే మొట్టమొదటి పెయిన్ క్లినిక్ను విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్)లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక క్యాన్సర్ నొప్పులతో బాధపడుతున్న రోగులకు ఈ క్లినిక్ సేవలు ఊరటనిస్తాయన్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ నార్త్ అమెరికా అలుమ్ని ఈ క్లినిక్ ఏర్పాటు కోసం రూ.కోటి విరాళం అందించడంపై మంత్రి అభినందనలు తెలిపారు. ఇటీవల గుంటూరులో 600 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటులోనూ, విశాఖ, కాకినాడ ప్రభుత్వ వైద్య సంస్థల అభివృద్ధిలోనూ పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.


