● డ్రైవర్ నిర్లక్ష్యంతో మునగపాకకు చెందిన ఎల్ఐసీ ఏజెంటు మృతి ● బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన
మునగపాక: క్వారీ లారీ వ్యక్తిని బలి తీసుకుంది. పూడిమడక రోడ్డులో భారీ వాహనాలు రాకపోకలకు అనుమతులు లేకున్నా ఇవేమీ పట్టనట్టు వాహన యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పూడిమడక రోడ్డులో భారీ వాహనాలను అనుమతించవద్దంటూ పలు మార్లు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం కనిపించడం లేదు. దీనికి తోడు లారీ డ్రైవర్లు కూడా ట్రిప్పులకు కక్కుర్తి పడి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. కొంతకాలంగా రాంబిల్లి మండలంలోని నేవల్ బేస్కు బండరాళ్లను లారీలపై తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రాళ్లు రహదారిపై పడిపోతున్నాయి. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించేవారు నిత్యం భయాందోళనకు గురవుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆదివారం మునగపాకకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్ మాడా కన్నారావు(53) రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మునగపాక గ్రామానికి చెందిన మాడా కన్నారావు ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం కన్నారావు తన బైక్పై గుడికి వెళ్లేందుకు అవసరమయ్యే సామగ్రి కొనుగోలు కోసం వెళుతుండగా ఇదే సమయంలో రాంబిల్లి మండలం నేవల్ బేస్కు రాయి తరలించి తిరిగి అనకాపల్లి వైపు వస్తున్న భారీ లారీ వెనుక నుంచి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో కన్నారావు బైక్పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలంలో భోరున విలపించారు. కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచిన కన్నారావు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ దుర్ఘటన విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ పూడిమడక రోడ్డులో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమస్య జటిలం కావడంతో కశింకోట సీఐ స్వామినాయుడు, మునగపాక పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన కారులతో చర్చించారు. పూడిమడక రోడ్డులో పగటిపూట భారీ వాహనాలు రాకుండా చూడాలని , అలాగే ప్రమాదాలకు నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం కన్నారావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్కు తరలించగా సంబంధిత డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు మునగపాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణం తీసిన క్వారీ లారీ
ప్రాణం తీసిన క్వారీ లారీ