పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. మండలంలోని వంతాడపల్లి పంచాయతీ సప్పిపుట్టు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మంగళవారం జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి హోంమంత్రి పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. రహదారి పక్కన మొక్కలు నాటి, గిరిజన రైతులకు అవకాడో మొక్కలు, రాజ్మా తదితర పంటల విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్తులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో హోంమంత్రి మాట్లాడుతూ, ఏజెన్సీలో గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గిరిజనులకు సుస్థిర జీవనోపాధి, ఆదాయ వనరుల పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పింఛన్లు, మాతృభాషా వలంటీర్ల రెన్యువల్, మౌలిక వసతుల కల్పన వంటి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. మన్యంలో ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయని, ప్రతి సీజన్లోనూ పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ ప్రాంతం మరో ఊటీని తలపిస్తోందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీ రవికృష్ణ, కలెక్టర్ నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ, జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, అధికారులు పాల్గొన్నారు.
మంత్రులు సంధ్యారాణి, అనిత


