● వరి నాట్లు వేస్తున్నజెడ్పీ చైర్పర్సన్ సుభద్ర
ముంచంగిపుట్టు: ప్రజాప్రతినిధిగా ఎంత బిజీగా ఉన్నా రైతు కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని మరువలేదని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర నిరూపించారు. మంగళవారం మండలంలోని జోలాపుట్టు పంచాయతీ పరిధిలోని తన స్వగ్రామం లబ్బూరులో జరుగుతున్న వరినాట్లలో ఆమె గిరిజన మహిళలతో కలిసి బురదలోకి దిగి వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ, తాను రైతు కుటుంబంలో పుట్టిన గిరిజన బిడ్డనని, ప్రజా సేవలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యవసాయ పనుల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు. వ్యవసాయం పట్ల తనకున్న అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్తో పాటు సుజనకోట ఎంపీటీసీ మజ్జి సుబ్బలక్ష్మి కూడా వరినాట్లలో పాల్గొని రైతులు, గిరిజన మహిళలతో కలిసి పనిచేశారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెను ఆప్యాయంగా పలకరించి అభినందించారు.


