ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం శ్రీశ్రీ లక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్థానిక భక్తులు ఈ ఏడాది నుంచి తొలిసారిగా ఈ కొండతిరుగుడు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర భర్త జేవీవీఎన్ మూర్తి కొబ్బరికాయ కొట్టి, జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం స్థానిక రామాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా మినుములపుట్టు, జంగంసరియా, మజ్జిగూడ, సెల్లుం గ్రామాల మీదుగా గిరి ప్రదక్షిణ కొనసాగింది. భక్తులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని స్మరించుకుంటూ ‘గోవింద‘ నామస్మరణ, శరణఘోషలతో గిరి ప్రదక్షిణను భక్తిమయంగా నిర్వహించారు. జి. మాడుగుల సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ నాని కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.
మార్గమధ్యంలో గ్రామాల ప్రజలు భక్తులకు హారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు. థింసా నృత్యాలతో భక్తిశ్రద్ధలు వెల్లివిరియగా, గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. మండలంలోని నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


