ఘనంగా వెంకన్న కల్యాణం
● భారీగా తరలివచ్చిన భక్తులు
● గోవింద నామస్మరణతో మార్మోగిన గిరిజాంబ కొండ
బుచ్చెయ్యపేట: అశేష భక్తుల గోవింద నామస్మరణ, మంగళవాయిద్యాల నడుమ ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి 153వ కల్యాణ మహాత్సవాలు శుక్రవారం రాత్రి అంగరంగవైభవంగా జరిగాయి. గురువారం రాత్రి అంకురార్పణ,ధ్వజారోహణ చేసి దొంగపెండ్లి నిర్వహించారు. శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు కుటుంబ సభ్యులకు తొలిదర్శనం కల్పించారు. కల్యాణోత్సవాల సందర్భంగా గోవింద నామ స్మరణతో వడ్డాది గిరిజాంబ కొండ మార్మోగింది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి రాష్టం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వేంకటేశ్వరస్వామి తొలి దర్శనం కోసం ఆలయం వద్ద బారులు తీరారు. మెట్ల మార్గం,కొండ ముందు,వెనక ఉన్న సిమ్మెంట్ రోడ్డు మార్గం నుంచి భక్తులు తరలివెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. రాత్రి గిరిజాంబ కొండపై ఆలయ మండపంలో స్వామి వారి కల్యాణంను వేడుకగా నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని దగ్గర నుంచి చూసిన భక్తులు పులకించిపోయారు. తిరువీధి ఉత్సవంలో స్వామి వారి పల్లకి మోయడానికి పలువురు పోటీపడ్డారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి,కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, బుచ్చెయ్యపేట, రావికమతం,కొత్తకోట,రోలుగుంట ఎస్ఐలు పలు శాఖల అధికార్లు స్వామివారిని దర్శించుకోగా దేవస్ధానం ఈవో శర్మ దగ్గరుండి పూజా కార్యక్రమాలు చేయించి ప్రసాదాలు అందించారు. ఆలయ ధర్మకర్త దొండా కన్నబాబు ఆరోగ్యం సహకరించకపోవడంతో అతని అన్న కుమారుడు శ్రీరామ్తో వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహించారు.


