పీఎం జన్మన్ ఇళ్ల బకాయిలు చెల్లించాలి
ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్
చింతపల్లి: పీఎం జన్మన్ పథకం కింద ఆదివాసీలకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని బలపం, కుడుముసారి పంచాయతీల పరిధిలో గల రాళ్లగెడ్డ, కప్పలు, గుంజివీధి, కొత్తూరు, నిమ్మపాడు, కోటగున్నలు, కోటగున్నలు కాలనీ గ్రామాల్లో గిరిజనులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బకాయిల సాధన కోసం ఈనెల 27న పాడేరులో చేపట్టే భారీ ధర్నా కార్యక్రమంలో గిరిజనులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొర్రా సుబ్బారావు, రమేష్, కోటేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
పాడేరు రూరల్: పీఎం జన్మన్ పథకం కింద నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. గురువారం గుత్తులపుట్టు సంతలో ఈ మేరకు కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం మండల కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ.. గిరిజనులు అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకుంటే, ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా నెలల తరబడి ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. బకాయిలు వెంటనే చెల్లించకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకటరమణ, సుబ్బారావు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
పీఎం జన్మన్ ఇళ్ల బకాయిలు చెల్లించాలి


