కుక్కల దాడిలో అరుదైన చిరుతపిల్లి మృతి
మర్రివాడలో అటవీ శాఖ అధికారుల విచారణ
కొయ్యూరు: అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న ఒక అరుదైన చిరుత పిల్లి మృతిపై పెదవలస ఇన్చార్జి రేంజర్ ప్రశాంతి కుమారి గురువారం మర్రివాడలో విచారణ చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సుమారు రెండేళ్ల వయసున్న ఒక చిరుత పిల్లిని కొన్ని కుక్కలు తరుముకుంటూ వచ్చాయి. భయంతో పరుగులు తీసిన ఆ పిల్లి, ఎదురుగా ఉన్న ఒక వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.ఆ వ్యక్తి భయంతో గ్రామస్తులకు తాను ’చిరుతపులి’ని చూశానని చెప్పాడు. అదే సమయంలో కుక్కల బారి నుంచి తప్పించుకోవడానికి ఆ చిరుత పిల్లి నేరుగా గ్రామంలోకి ప్రవేశించింది.గ్రామస్తులు దానిని బంధించగా, కొద్దిసేపటికే అది ప్రాణాలు విడిచింది. తొలుత దానిని బయట పారేయాలని భావించినా, తర్వాత ఒక చెట్టు కొమ్మపై ఉంచి అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పెదవలస రేంజర్ ప్రశాంతి కుమారి మర్రివాడ చేరుకుని విచారణ నిర్వహించారు. పిల్లి శరీరంపై ఉన్న గాయాలను బట్టి అది కుక్కల దాడిలోనే మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.చనిపోయిన పిల్లి గోళ్ల గట్టితనం, ఇతర లక్షణాలను బట్టి దాని వయసు రెండేళ్లు ఉండవచ్చు. ఇవి సాధారణంగా 12 ఏళ్ల వరకు జీవిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎస్ఎస్ఓ శ్రీరాములు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అంతరించి పోతున్న జాతుల జాబితాలో..
పశుసంవర్థక శాఖ వైద్యాధికారి కె. రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. ఇది అత్యంత అరుదైన ప్రాణి అని, అందుకే దీనిని అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చారని తెలిపారు. ఇవి సాధారణంగా బ్రెజిల్, జపాన్ వంటి దేశాల్లో కనిపిస్తాయని, మనుషులకు కంటపడకుండా చాలా రహస్యంగా జీవిస్తాయని పేర్కొన్నారు. గతంలో 2016లో కాట్రగెడ్డ సమీపంలో కూడా ఇటువంటి చిరుత పిల్లి కనిపించినట్లు ఆయన గుర్తు చేశారు.
గాయపడి మృతి
చెందిన చిరుతపిల్లి
స్థానికులు బంధించిన చిరుతపిల్లి
కుక్కల దాడిలో అరుదైన చిరుతపిల్లి మృతి
కుక్కల దాడిలో అరుదైన చిరుతపిల్లి మృతి


