ఉట్నూర్రూరల్: ప్రజావాణి దరఖాస్తులు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో మంద మకరందు ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కి వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పిడుగుపాటుతో మృతి చెందిన ఎనిమిది మేకలకు పరిహారం ఇవ్వాలని జైనూర్ మండలం జెండాగూడకు చెందిన గుణవంత్రావ్, ఆసరా పింఛన్ ఇప్పించాలని ఇంద్రవెల్లి మండలం పెద్ద కేస్లాపూర్ గ్రామానికి చెందిన శేకు, అటవీహక్కు పత్రం మంజూరు చేయాలని జన్నా రం మండలం దేవునిగూడెం గ్రామస్తులు దరఖాస్తులు అందజేశారు. ఇంకా పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్య ల పరిష్కారం, తదితర అంశాలపై తమ వినతిపత్రాలు అందజేశారు. ప్రతీ దరఖాస్తును సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అధికారులకు సూచించారు.


