హక్కుల సాధన కోసం ఐటీడీఏ ముట్టడి
తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా నుంచి భారీగా తరలివచ్చి..
ర్యాలీగా బయలుదేరి.. కార్యాలయం ఎదుట బైఠాయించి
పీవో హామీతో ఆందోళన విరమణ
ఉట్నూర్రూరల్: రాజ్యాంగబద్ధమైన హక్కుల పరి రక్షణ, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలు కదం తొక్కా రు. తుడుందెబ్బ పిలుపుమేరకు సోమవారం నిర్వహించిన ‘చలో ఐటీడీఏ’ ముట్టడి కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. ఉట్నూర్లోని గిరిజన భవన్కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా ఐటీడీఏ కార్యాలయం వరకు సంప్రదాయ డోలు, సన్నాయి వాయిద్యాలతో ర్యాలీగా బయలుదేరారు. ప్రధాన ద్వారం ఎదు ట రహదారిపై బైఠాయించారు. దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. ముట్టడి నేపథ్యంలో ఉదయం నుంచే వ్యాపారులు స్వచ్ఛందంగా దుకా ణాలు మూసివేయడంతో బంద్ వాతావరణం కని పించింది. ఈ సందర్భంగా తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణల లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షు డు గోడం గణేశ్, ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ మాట్లాడారు. ఏళ్లుగా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారని, చట్టాలను పకడ్బందీగా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మండిపడ్డారు. 1/70 చట్టాన్ని సవరించాలని సుప్రీంకోర్టులో కేసు వేసిన గిరిజనేతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మే ఆదివాసీల పక్షాన కౌంటర్ రిట్ పిటిషన్ దాఖ లు చేయాలన్నారు. జీవో ఎంఎస్ 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంత పోలీస్ ఉద్యోగాల్లో స్థానిక ఆదివాసీ లకు 75శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, జీవో నంబర్ 3 పునరుద్ధరించి, స్థానిక ఆదివాసీల ఉపాధి, ఉద్యోగ హక్కులను కాపాడాలన్నారు. గిరిజనేతరుల భూ దురాక్రమణలు, అక్రమ భూ బదిలీలు అరికట్టాలని, వలస లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే అంశంపై సమగ్ర విచారణకు ప్ర త్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఆదివాసీ నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని, ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అటవీ హ క్కులచట్టం 2006 ప్రకారం సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 120 రాయ్ సెంటర్లకు పక్కా భవనాలు నిర్మి స్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలన్నారు. ‘కోర్ ఏరియా’, ’బఫర్ ఏరియా’, ’టైగర్ జోన్’ పేర్లతో ఆదివాసీలపై అట వీ అధికారుల దాడులు నిలిపివేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోకూడదన్నారు. ప్రభుత్వాలు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చే స్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ, ఆదివాసీ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు నగేష్, సిడాం జంగుదేవ్, పెందుర్ పుష్పారాణి, స త్యం, ఇందిరా, నారాయణ, రాజన్న, మడావి వెంకటేశ్, సోయం చిన్నయ్య, అర్క శేషరావు, కొడప నగేశ్,మనోజ్ ఆదివాసీలుతదితరులు పాల్గొన్నారు.
హామీ ఇచ్చిన ఐటీడీఏ పీవో..
విరమించిన ఆందోళన
ఆదివాసీలు ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్ట డించిన విషయం తెలుసుకున్న పీవో మంద మకరందు స్వ యంగా అక్కడికి చేరుకున్నారు. వారి నుంచి వినతి పత్రం స్వీకరించారు. సమస్యలు అడిగి తెలు సుకున్నారు. ప్రభుత్వందృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఆదివాసీల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఐటీడీఏ ఎల్లప్పుడు క ట్టుబడి ఉంటుందని తెలిపారు. సమస్యలను ప్రా ధాన్యత క్రమలో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆదివాసీలు ఆందోళన విరమించారు.
కట్టుదిట్టమైన బందోబస్తు..
ఐటీడీఏ ముట్టడి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో అడ్మిన్ ఏఎస్పీ మౌనిక, ఉట్నూరు, ఆదిలాబాద్ ఏఎస్పీలు రుత్విక్ సాయి కొట్టే, సురేందర్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానద్వారం వద్ద, ఎన్టీఆర్ చౌక్, ఐబీ చౌరస్తాలో భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు ఆదివాసీల భారీ ర్యాలీ, ధర్నా కారణంగా ఉట్నూర్ ఎక్స్రోడ్డు, చెక్పోస్ట్ కొత్తగూడ పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


