బెల్లంపల్లి: సబ్ కలెక్టర్ మనోజ్కు వినతిపత్రం ఇస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులు
పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (వైఐఎస్యూలో) లోకి విలీనం చేయొద్దని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని జీవో 97ను రద్దు చేయాలని పట్టుబడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులంతా వారం రోజులుగా నల్లబ్యాడ్జీలు ధరించి తరగతులకు హాజరై నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే పలుసార్లు ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి జీవో రద్దు చేసే దాకా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. వీరికి విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు పలుకుతున్నారు. వైఐఎస్యూలోకి పాలిటెక్నిక్ కళాశాలల విలీనంతో వారికి జరిగే నష్టం వారి మాటల్లోనే..
– బెల్లంపల్లి/నిర్మల్రూరల్/ఆదిలాబాద్టౌన్
ఉన్నత చదువులకు దూరమవుతాం
ప్రభుత్వ నిర్ణయంతో బీటెక్, ఉన్నత చదువులకు దూరమవుతాం. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేయడం సరికాదు. బీటెక్ చదవాలనుకునే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. రైల్వే, జూనియర్ ఇంజినీర్, ఆర్ఆర్బీ, ఇతర ఉద్యోగాలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంటుంది.
– రాధేశ్యామ్,
సంజయ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాల, ఆదిలాబాద్


