ఇచ్చోడ: ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులపై కొన్నిచోట్ల సిబ్బంది నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. చిన్నారులకు ఆరోగ్య సమస్యలు వచ్చినా వారి తల్లిదండ్రులను సైతం కలవనివ్వకుండా అడ్డుపడుతున్నారు. నేరడిగొండ మండలం కుంటాల బాలికల ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఊరటి రమాదేవి చేతికి గాయం ఏర్పడి నొప్పితో బాధపడుతుంది. తండ్రి గంగాధర్ ఆదివారం సాయంత్రం కూతురు యోగక్షేమాలు తెలుసుకునేందుకు పాఠశాలకు వెళ్లాడు. అయితే సి బ్బంది అతడిని లోనికి అనుమతించలేదు. చేసే దిలేక ఇలా గేటు బయట నుంచే మాట్లాడి వెళ్లి పోవడం అతడి వంతయింది. ఈ విషయమై ఇచ్చోడ ఏటీడీవోను ‘సాక్షి’ వివరణ కోరగా.. సాయంత్రం వరకు పేరెంట్స్ను అనుమతించామని, సోమవారం నాగుల పంచమి ఉండడంతో విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లేందుకు కొందరు అడుగుతున్న క్రమంలోనే సిబ్బంది గేటు మూసివేసినట్లుగా పేర్కొన్నారు.


