ఆదిలాబాద్టౌన్: వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటరాములు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సీఐ టీ యూ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ పేదలను ఆర్థికంగా బలోపేతం చేసే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు పెంచుతూ పేదల నడ్డీ విరుస్తున్నారని విమర్శించారు. ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని జూలై 1న దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు తెలిపా రు. అలాగే ఈనెల 20 నుంచి 22 వరకు మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్వామి, లంకా రాఘవులు, ఆశన్న, చింటు, రాజక్క తదితరులు పాల్గొన్నారు.


