జిల్లాకేంద్రంలోని ఎస్బీహెచ్ నం.2 పాఠశాలలో 1985–86 బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 40 ఏళ్ల తర్వాత వీరి అపూర్వ సమ్మేళనానికి జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్ వేదికై ంది. ఎక్కడెక్కడో స్థిరపడినవారు మిత్రులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. మిత్రులు ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు లింబగిరి స్వామి, కుటుంబరావు, చక్రపాణి, టి.రాములు తదితరులను సన్మానించి జ్ఞాపికలు బహుకరించారు.
–ఆదిలాబాద్టౌన్
హైదరాబాద్ నుంచి వచ్చా
మూడు సెక్షన్లు కలిపి దాదాపు 70 మంది ఉంటాం. సమ్మేళనం ఉందని సమాచారంతో హైదరాబాద్ నుంచి వచ్చాను. గురువులు విలువలతో కూడిన విద్య అందించారు. నేను ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాను. అప్పుడప్పుడు చిన్ననాటి మిత్రులతో ఫోన్లో మాట్లాడతాను.
– కుంట గంగయ్య, రిటైర్డ్ ఆర్మీ
సంతోషంగా ఉంది
చిన్ననాటి మిత్రులను కుటుంబ సమేతంగా కలుసుకోవడం సంతోషంగా ఉంది. మిత్రుడి కుమారుడి పెళ్లికి వెళ్లిన సమయంలో స్నేహితులందరూ ఒకేచోట కలవాలని నిర్ణయించాం. రెండు నెలల నుంచి ఫోన్ నంబర్లు, వివరాలు సేకరించి గ్రూప్ తయారు చేశాం. సమ్మేళనం ఉందని చెప్పడంతో అందరూ వచ్చారు.
– దొగ్గలి గంగయ్య, పూర్వ విద్యార్థి
మరుపురాని అనుభూతి
40 ఏళ్ల క్రితం కలిసిన స్నేహితులందరినీ ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉంది. అనాటి మధురస్మృతులను గుర్తుచేసుకున్నాం. ఆరోగ్య క్షేమాలు, ఇతర విషయాల గురించి పలకరింపులు మరవలేను. కష్టసుఖాల్లో అందరు పాలుపంచుంటాం.
– భీమన్న, పూర్వ విద్యార్థి


