ఆదిలాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సర్ శిక్షణ శిబిరం, సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఓటరు నమోదు ప్రక్రియలో కార్యకర్తలు చొరవ చూపాలని సూచించారు. కొత్త ఓటర్లను నమోదు చేయించడం, జాబితాలో సవరణలు ఉంటే పూర్తి చేయడం వంటి అంశాలపై శ్రేణులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రతి శక్తి కేంద్రం, బూత్ స్థాయిలో నాయకులు సమన్వయంతో పనిచేసి ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్ర పార్టీ సర్ ఇన్చార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటర్లకు సరైన సమాచారం అందించడంలో కార్యకర్తల పాత్ర కీలకమన్నారు. ఇందులో పార్టీ రాష్ట్ర, జిల్లా పదాధికారులు, కౌన్సిలర్లు, శక్తి కేంద్ర అధ్యక్షులు, బూత్ స్థాయి నాయకులు, ఏజెంట్లు, తదితరులు పాల్గొన్నారు.


