మరో ఐదు రోజులు పత్తి కొనుగోళ్లు
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందారు. దీంతో కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆయా పార్టీల నాయకులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ స్పందించి మరో ఐదు రోజుల పాటు కొనుగోలు చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పత్తి రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఈనెల 20 వరకు పత్తి కొనుగోళ్లు చేపట్టిన విషయం తెలిసిందే. చివరి రోజు వెయ్యికి పైగా పత్తి బండ్లను రైతులు ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు.
గడువు పెంపు..
కేంద్ర ప్రభుత్వం ఈనెల 27 వరకు సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 15,26,436 క్వింటాళ్లను రైతులు విక్రయించారు. ఇందులో సీసీఐ 14లక్షల 78వేల వరకు పత్తి కొనుగోళ్లు చేపట్టింది. 47,630 క్వింటాళ్ల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. మద్దతు ధర ప్రస్తుతం రూ.8,010తో కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.7వేలతో విక్రయిస్తున్నారు. ఈ సారి ఆలస్యంగా పంట దిగుబడి రావడంతో రైతులు విక్రయించుకోవడానికి ఆలస్యమైంది. ఏటా సీసీఐ మార్చి వరకు కొనుగోలు చేస్తుండగా, ఈసారి ఫిబ్రవరిలోనే కొనుగోళ్లను నిలిపివేస్తుంది. మార్చి వరకు కొనుగోలు చేయాలని రైతులతో పాటు ఆయా పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


