అరాచకాలను ప్రశ్నిస్తే గృహ నిర్బంధాలా..?
ఆదిలాబాద్: ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే రాష్ట్రంలో అక్రమ గృహ నిర్బంధాలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కొందరు గుండాలు దాడికి ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఆ అరాచక శక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం తప్పా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే ధ్యేయంగా ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన సాగిస్తోందని విమర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఆ ఘటనను నిరసిస్తున్న తమను గృహనిర్బంధం చేయడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని, బెదిరింపులకు, నిర్బంధాలకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు ముకుంద్, శివ, మనోజ్ పవార్ తదితరులున్నారు.


