అన్నా.. మీవోడినే
మొదలైన మున్సిపల్ ప్రచారం ఓటర్ల బాటపట్టిన అభ్యర్థులు మిగిలింది ఆరు రోజులే ఊపందుకున్న పట్టణ పోరు
సాక్షి,ఆదిలాబాద్: ‘అన్నా.. నమస్తే, అవ్వా.. బాగున్నావా, అక్కా.. మీ తమ్మున్ని మరువద్దు.. ఆపద సంపదకు వచ్చేటోన్ని.. మన గుర్తు తెలుసు కదా..’ ప్రస్తుతం ఏ గల్లీలో చూసినా మున్సిపల్ అభ్యర్థుల నుంచి వినిపిస్తున్న మాటలివి. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడమే ఆలస్యం.. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అనుచరగణంతో ప్రచారంలోకి దిగిపోయారు. సమయం ఆరు రోజులే ఉండడంతో వార్డును కనీసం ఒకటి రెండు సార్లయినా చుట్టేయాలని భావిస్తున్నారు. ప్రధాన పార్టీల ప్రచార రథాలు రోడ్డెక్కాశాయి.
ప్రచార పర్వంలోకి..
అభ్యర్థులను పార్టీలు ఖరారు చేయడం, మిగతా వారిలో కొంత మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడం, అనేక మంది బరిలో ఉండటం, స్వతంత్రులకు గుర్తులు కేటాయించడం వంటివి మంగళవారం వరకు జరిగాయి. సమయం తక్కువగా ఉండడంతో కొందరు అభ్యర్థులు తమ గుర్తు ఆధారంగా ఫ్లెక్సీలు, ప్రచార వాహనాలను సిద్ధం చేసుకుని రంగంలోకి దిగేశారు. మరికొందరు నేటి నుంచి షురూ చేయనున్నారు. దీంతో ఒక్కసారిగా పుర పోరు వేడెక్కింది.
రాష్ట్ర నేతలు కూడా..
ఎంఐఎం పార్టీ ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డులలో పోటీ చేస్తుండగా, ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రచారానికి వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణంలో రోడ్షో, సభ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు ప్రచారం కోసం రాష్ట్ర నేతలు వచ్చేది ఖరారు కాకపోయినప్పటికీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్చార్జి సుదర్శన్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి తాహెర్బిన్ హందాన్ ప్రచారంలో పాల్గొననున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బీజేపీకి సంబంధించి ముఖ్యనేతల ఆదిలాబాద్ పర్యటన ఇప్పటివరకు ఖరారు కాలేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ పడ్నవీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఆదిలాబాద్కు తీసుకొచ్చే ప్రయత్నంలో పార్టీ నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జోగు రామన్న పూర్తిస్థాయిలో వార్డుల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు.


