బరిలో 314 మంది
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. 155 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో కలిపి 314 మంది బరిలో మిగిలారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఉదయం 11గంటల నుంచి ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున టికెట్లను ఆశిస్తూ పలువురు నామినేషన్లు వేశారు. అయితే టికెట్ దక్కకపోవడంతో కొందరు ఉపసంహరించుకున్నారు. ఆయా రాజకీయ పార్టీల నాయకులు వారితో బుజ్జగింపులు, మంతనాలు జరిపారు. దీంతో కొంతమంది అభ్యర్థులతో కలిసి వచ్చి విత్ డ్రా చేసుకున్నారు. 24వ వార్డుకు చెందిన వర్షాజోషి అనే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకునేందుకు తన భర్త విజయ్కుమార్తో కలిసి వచ్చారు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో చేసేదిలేక నిరాశతో వెనుదిరిగారు. అనంతరం అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ చేపట్టారు. జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీలతో పాటు ఇతర గుర్తింపు పొందిన పార్టీలను ఒక కేటగిరీలో చేర్చారు. వార్డుల వారీగా అభ్యర్థులను లోపలకు పిలుస్తూ అక్షరక్రమం ప్రకారం గుర్తులను కేటాయించారు. ఇండిపెండెంట్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించిన 76 రకాల గుర్తుల్లో నామినేషన్లో వారు ఎంపిక చేసుకున్న గుర్తులను కేటాయించారు. ఈ ప్రక్రియ రాత్రి 10గంటల వరకు కొనసాగింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు మినహా ఇతరులెవరనీ లోపలికి అనుమతించలేదు.
ఆర్వోలతో కలెక్టర్ సమీక్ష
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేపథ్యంలో కలెక్టర్ రాజర్షి షా ఉదయం నుంచి రాత్రి వరకు టీటీడీసీలోనే ఉన్నారు. ఉపసంహరణ ప్రక్రియ తీరును పరిశీలించారు. 17 మంది రిటర్నింగ్ అధి కారులతో సమావేశమై గుర్తుల కేటాయింపు ప్రక్రియపై పలు సూచనలు చేశారు. రాత్రి వరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, మున్సిపల్ కమిషనర్ జి.రాజు, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


