అటవీశాఖ విస్తృత తనిఖీలు
ఆదిలాబాద్టౌన్: అటవీశాఖ అధికారులు మంగళవారం జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కలప అక్రమ దందా సాగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ ‘రక్షకులే.. భక్షకులా’ శీర్షికనన మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈమేరకు జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ స్పందించారు. జిల్లాలోని తొమ్మిది రేంజ్ల పరిధిలో తనిఖీలకు ఆదేశించారు. తదనుగుణంగా రంగంలోకి దిగిన ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందిరమ్మ గృహాలు, ఆయా గ్రామాల్లోని కార్పేంటర్ల నివాసాలు, కొత్తగా నిర్మిస్తున్న ప్రైవేట్ ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఇచ్చోడ రేంజ్ పరిధిలోని నవేగాం, బజార్హత్నూర్ మండలంలోని మంజరాం తండా, మావల మండలంలోని వాగాపూర్ తదితర గ్రామాల్లో తనిఖీలు చేశారు. నవేగాంవ్లో ఐదుగురిపై, వాగాపూర్లో ముగ్గురిపై, బజార్హత్నూర్లో ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. రూ.2లక్షల విలువ గల కలపను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇంద్రవెల్లి రేంజ్ పరిధిలో వడ్గాంవ్, గుడిహత్నూర్ మండలంలోని మాన్కాపూర్ గ్రామాల్లో తనిఖీలు చేశారు. ఆదిలాబాద్ రేంజ్ పరిధిలో కుచులాపూర్లో తనిఖీలు నిర్వహించి రూ.50వేల విలువ గల కలపను పట్టుకుని పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో ఇచ్చోడ, ఆదిలాబాద్, ఇంద్రవెల్లి రేంజ్ల ఎఫ్ఆర్వోలు పుండలిక్, రాథోడ్ గులాబ్సింగ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
అటవీశాఖ విస్తృత తనిఖీలు
అటవీశాఖ విస్తృత తనిఖీలు


