
ముస్లింల మనోభావాలను దెబ్బతీయొద్దు
అమలాపురం టౌన్: వక్ఫ్ బోర్డు ఆస్తుల ద్వారా ముస్లిం సమాజ సంక్షేమం జరుగుతోందని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ అన్నారు. అలాంటి వక్ఫ్ ఆస్తులపై సవరణ బిల్లు తీసుకురావడం అంటే ముస్లింల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన స్పష్టం చేశారు. శనివారం అమలాపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వక్ఫ్ ఆస్తులంటే తమ ఇష్ట దైవం అల్లాకు సంబంధినవేనని సెంట్మెంట్గా భావిస్తామని చెప్పారు. వక్ఫ్ చట్టాన్ని సవరణ చేయడం కేంద్రంలోని ప్రభుత్వానికి తగదని ధ్వజమెత్తారు. ఎన్డీయే ప్రభుత్వం ఆది నుంచి ముస్లింలను శత్రువులుగా చూస్తోందన్నారు. ముస్లింలకు వక్ఫ్ ఆస్తులు రాజ్యాంగపరంగా సిద్ధించినవేనని, ముస్లింల హక్కులను హరించేలా ఇప్పుడు చట్ట సవరణలు చేయడం అంటే తమ మత స్వేచ్ఛను కాలరాయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఖాదర్ డిమాండ్ చేశారు. లోక్సభలో వైఎస్సార్ సీపీ ఎంపీలు సవరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంపై ముస్లిం సమాజం హర్షిస్తోందన్నారు. జిల్లాలో దాదాపు 2,100 ఎకరాల భూములను వక్ఫ్ బోర్డు ద్వారా పరిరక్షిస్తుంటే, ఆ హక్కులను కలెక్టర్ల చేతిలో పెట్టడం ఎంత వరకూ సమంజసమని ఖాదర్ ప్రశ్నించారు.
నయనానందం..
బాలాజీ రూపం
మామిడికుదురు: అప్పనపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీబాల బాలాజీ స్వామివారి క్షేత్రం నయనానందకంగా మారింది. పవిత్ర శ్రావణ మాసం, రెండో శనివారం సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఉదయం నుంచే వైనతేయ గోదావరి నదీతీరంలోని స్నానఘట్టం, పాత, కొత్త ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. తొలుత స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం బాలాజీ స్వామిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,73,187 ఆదాయం లభించిందని ఈఓ గ్రంధి మాధవి తెలిపారు. లడ్డూ ప్రసాదం, దర్శనం టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,03,820, నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.69,367 విరాళాలుగా వచ్చిందన్నారు. స్వామివారిని 3,582 మంది దర్శించుకోగా, 2,896 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.
లైన్మేన్లకు
పదోన్నతులు కల్పించాలి
రాయవరం: జూనియర్ లైన్మేన్ గ్రేడ్–2 ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జేఎల్ఎం గ్రేడ్–2 అసోసియేషన్ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం పసలపూడిలో అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులను మాతృ సంస్థకు పంపిస్తున్నందున జూనియర్ లైన్మేన్ గ్రేడ్–2 ఉద్యోగులను ఏపీఈపీడీపీసీఎల్లో అనుసంధానం చేయాలన్నారు. సచివాలయ వ్యవస్థలో ఎనర్జీ అసిస్టెంట్లుగా నియమితులైన తమను జూనియర్ లైన్మేన్లుగా గుర్తించాలన్నారు. 2021 అక్టోబర్ 2 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన జేఎల్ఎంలను 2022 జూలై 1న ప్రొబేషన్ డిక్లేర్ చేసినందున 9 నెలల సర్వీసును కోల్పోతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల సర్వీసును ప్రొబేషన్ కలపాలని వారు కోరారు. అలాగే ఇతర జిల్లాల్లో, డివిజన్లతో ఉన్న జేఎల్ఎం గ్రేడ్–2లకు కూడా బదిలీలు కల్పించాలని, పదోన్నతి ఛానల్ వర్తింపజేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జేఎల్ఎం గ్రేడ్–2 అసోసియేషన్ అధ్యక్షుడు ఐ.తాతాజీ, ఉపాధ్యక్షుడు కె.వీరబాబు, ప్రధాన కార్యదర్శి జి.సూర్యనారాయణ, సలహాదారుడు ఎం.రాము, సభ్యులు పి.సత్యరాజేష్, డి.రాంజీ తదితరులు పాల్గొన్నారు.

ముస్లింల మనోభావాలను దెబ్బతీయొద్దు

ముస్లింల మనోభావాలను దెబ్బతీయొద్దు