-
క్వశ్చన్ పేపర్ చూడగానే పగలే చుక్కలు.. ఆన్సర్షీట్లో బాలీవుడ్ పాటలు ..!
చండీగఢ్: పరీక్షలు రాయడానికి కూర్చున్న ఆ స్టూడెంట్కు క్వశ్చన్ పేపర్ చూడగానే పగలే చుక్కలన్నీ కట్టకట్టుకుని కన్పించాయి. ఒక్కదానికీ ఆన్సర్ తెలియదు! ఏం చేయడమా అని తల పట్టుకున్నాడు. బాగా ఆలోచించి... బాలీవుడ్ పాటలన్నీ తీరుబడిగా ఒకదాని తర్వాత ఒకటి రాస్తూ పోయాడు. అలా ఆన్సర్ షీటు నిండా జవాబులకు బదులుగా పాటలే రాసేసి ఇచ్చాడు. చండీగఢ్లో ఒక స్కూలులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆన్సర్ షీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సదరు విద్యార్థి ఆమిర్ ఖాన్ నటించిన సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలు త్రీ ఇడియట్స్లోని ‘గివ్ మి సమ్ సన్షైన్...’, పీకేలోని ‘భగవాన్ హే కహా రే తూ...’ అంటూ తన అవస్థకు అద్దం పట్టే పాటలే రాశాడు! దాంతో పేపర్ను దిద్దిన టీచర్ సున్నా మార్కులిచ్చింది. అయితే, ‘మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సింది’ అంటూ చివరి పేజీలో సరదా కామెంట్ రాయడంతో నెటిజన్లు హాయిగా నవ్వుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో దీనిని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. -
అక్షర పూదోటలో విహారం
‘తోటలో అడుగుపెట్టినప్పుడు చెట్లకు పూచిన అందమైన పూలను చూస్తాం, వాటి పరిమళాలను ఆస్వాదిస్తాం. ఎండి రాలిన ఆకులను చూసి బాధపడుతూ కూర్చోం. జీవితమూ అంతే... మనం దేనిని తీసుకోవాలో తెలిస్తే అదే మన జీవితం అవుతుంది’ అంటారు అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన సాహితీ ప్రేమికురాలు ఆమె. అక్షరం అమూల్యమైనది. మనసు పలికిన అక్షరాలను మాలలుగా అల్లుతున్న ఈ కవయిత్రి... విశ్రాంత జీవనాన్ని హైదరాబాద్లో ఆమె అల్లుకున్న అక్షర పూదోటలో విహరింప చేస్తున్నారు. రాయాలి... ఏం రాయాలి? రాయాలంటే... రాయాలనే తపన ఉండాలి. అంతకంటే ముందు చదవాలనే తృష్ణ దహించి వేయాలి. అలా లైబ్రరీ మొత్తం చదివేసిందామె. ‘పెద్ద లైబ్రరీలో తనకు నచ్చిన రచనలకు మాత్రమే పరిమితమై ఉంటే... సాహిత్యంలో కొన్ని కోణాలను మాత్రమే స్పృశించగలిగేదాన్ని. లైబ్రరీ మొత్తం అక్షరం అక్షరం చదివేశాను... కాబట్టి, అందులో కొన్ని రచనల మీద పెద్దవాళ్ల విశ్లేషణను, అభిప్రాయాలను విన్నాను కాబట్టి ఏం రాయకూడదో తెలిసివచ్చింది. నా బాల్యంలోనే జై ఆంధ్ర ఉద్యమాన్ని చూశాను, ఇండో – పాక్ యుద్ధాన్ని చూశాను... కాబట్టి మనిషి ఎదుర్కొనే అసలైన కష్టం ఏమిటో అర్థమైంది. మనం కష్టాలుగా భావించే ఏదీ నిజానికి కష్టం కాదు. ఇవన్నీ మనకు మనంగా కల్పించుకున్న వెతలు మాత్రమే. వాటికి పరిష్కారం కూడా మనలోనే ఉంటుంది. ఆ పరిష్కారం కోసం మనలోకి మనం తరచి చూసుకుంటే సరిపోతుంది. నా రచనల్లో అదే చెప్పాను’ అన్నారామె. చిన్న జీవితం మనది, ఆ చిన్న జీవితాన్ని హాయిగా, ఆహ్లాదంగా జీవించాలి. ఇదీ ఆమె ఫిలాసఫీ. ‘మగాడు’ కథ కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం అమ్మాయి... గోదావరిలో ఈతకొడుతూ పెరిగిన అమ్మాయి, చెట్టునే మగ్గిన మామిడి పండును కొరికి తిని టెంకను చెట్టుకే వదిలేసిన అందమైన అల్లరి బాల్యం, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికల్లోని అక్షరాల్లో ప్రపంచాన్ని చూసింది. ఆ అక్షరాలతోనే స్నేహం చేసింది. ముగ్గురు అక్కలు, అన్న పెంపకంలో ఒకింత పెద్ద లోకాన్ని అర్థం చేసుకుంది. వాళ్ల ఊరి నుంచి పొరుగూళ్ల థియేటర్లలో కూడా మారిన సినిమాలన్నీ చూసేసింది. ఆడపిల్ల చదువుకోవడానికి పొరుగూరికి వెళ్తుంటే ఆశ్చర్యంగా కళ్లు పెద్దవి చేసి చూసే అతి చిన్న ప్రపంచంలో ఆమె సైకిల్ మీద కాలేజ్కి వెళ్లి ఓ ట్రెండ్ను సెట్ చేసింది. డిగ్రీ చదివిన తొలి అమ్మాయిగా ఊరికి ఒక రికార్డునిచ్చింది. గోదావరి నదిని ఈదినంత సునాయాసంగా సాహిత్యసాగరంలో ఈదుతున్నప్పుడు కూడా ఆమెలో రాయాలనే ఆలోచన కలగలేదు. మనసును చివుక్కుమనిపించిన ఓ రచన ఆ పని చేసింది. ఆ కథ పేరు ‘ఆడది’. ‘‘మల్లిక్ గారు రాసిన ‘ఆడది’ కథలో భారతీయ సమాజంలో సగటు గృహిణి పాత్రను వర్ణిస్తూ కథ చివరిలో ‘పాపం ఆడది’ అని ముగించారు. నాకు వెంటనే కోపం వచ్చేసింది. ‘మగాడు’ అని హెడ్డింగ్ పెట్టి ‘పాపం ఎంతైనా మగాడు’ అని చివరి వాక్యం రాశాను. కానీ ఎలా మొదలుపెట్టాలో, కథనం ఎలా సాగాలో తెలియదు. పూర్తి చేయడానికి నెలలు పట్టింది. ‘విజయ’ మాస పత్రికకు పంపిచాను. వాళ్ల నుంచి రిప్లయ్ లేదు. నా కథ చూసి నవ్వుకుని ఉంటారని తలచు కుని తలచుకుని సిగ్గుపడిపోయాను. ఆరు నెలలకు పోస్టులో ‘విజయ’ మంత్లీ మా ఇంటికి వచ్చింది. అందులో నా కథ. అలా మగాడు కథతో రైటర్నయ్యాను’’ అన్నారు గౌరీ లక్ష్మి నవ్వుతూ. చేయి చాచవద్దు! ‘‘ఆడవాళ్లు సమానత్వ సాధన కోసం శ్రమిస్తున్నారు. వాణిజ్య ప్రపంచంలో స్త్రీ అయినా పురుషుడైనా ఒక మనిషి గుర్తింపుకు సంపాదనే కొలమానం అవుతోంది. కాబట్టి ఆర్థిక స్వావలంబనతోనే సమానత్వ సాధన సాధ్యమవుతుందంటారు గౌరీలక్ష్మి. సంపాదనలో పురుషుడికి దీటుగా నిలిచినప్పుడు ‘మమ్మల్ని గౌరవించండి, సమానమైన అవకాశాలివ్వండి’ అని ఎవరినీ అడగాల్సిన అవసరం ఉండదంటారామె. ‘‘సమానత్వం కోసం చేయి చాచి యాచించవద్దు... అంటూనే ఆర్థిక స్థిరత్వాన్ని సాధించినప్పుడు ఇక సమానత్వ సాధన కోసం పిడికిలి బిగించి పోరాడాల్సిన అవసరమూ ఉండదు. వరకట్నం అనే దురాచారం కనుమరుగయ్యే మంచి తరుణం కూడా అప్పుడే వస్తుంది. కన్యాశుల్కంతో పోరాడి బయటపడేటప్పటికి వరకట్నం రూపంలో మరో దురాచారం కోరల్లో చిక్కుకుంది భారతీయ స్త్రీ. చదువుకుంటే అన్నీ చక్కబడతాయనుకుంటే... మహిళ ఎంత సాధించినా పని చేసే చోట వివక్ష, లైంగిక వేధింపులను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఇంకా ఉంది. అదే పిటీ. అలాగని మహిళలు సెల్ఫ్ పిటీలోకి వెళ్లకుండా ధైర్యంగా నిలబడాల్సింది ఇక్కడే. నేను 36 ఏళ్లు ఉద్యోగం చేసిన అనుభవంతో చెప్తున్నాను. మహిళ తన ఉనికిని నిలుపుకోవడానికి అవసరమైతే ఎన్ని ఉలి దెబ్బలను తట్టుకోవడానికైనా సరే సిద్ధంగా ఉండాలి’’ అన్నారామె. ఆమె రచనల్లో స్త్రీ ఒక గృహిణిగా, ఒక ఉద్యోగినిగా, వైవాహిక జీవితంలో అపసవ్యతలు ఎదురైన మహిళగా సమాజంలో ఎదొర్కొనే రకరకాల సమస్యలను ప్రస్తావించారు. సరైన నిర్ణయమే! గౌరీ లక్ష్మి తన ముఖంలో ప్రసన్నతకు కారణం జీవితం పట్ల ఎటువంటి ఎక్ట్పెక్టేషన్లు లేకపోవడమేనంటారు. ‘‘ఉద్యోగం మానేసి పూర్తి సమయాన్ని రచనల కోసమే కేటాయించమని యండమూరి సూచించినప్పుడు... ‘నాకు చదవడం, రాయడం ఇష్టం. అక్షరాలంటే ప్రేమ. అక్షరాలను కమర్షియల్గా మార్చుకోవడం ఇష్టం లేదు. ఉద్యోగం చేసుకుంటూ, రాయాలనిపించినప్పుడు రాస్తుంటాను’... అని చెప్పాను. అది సరైన నిర్ణయమే. నా రచనకు ఎంత గుర్తింపు వచ్చింది, ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయి, రివ్యూలు ఎలా వచ్చాయి, ఎంత పారితోషికం వస్తోంది... వంటి లెక్కలేవీ ఉండవు నాకు. కీర్తికాంక్ష కోసం వెంపర్లాట కూడా లేదు. నా స్పందనకు అక్షరరూపమిస్తున్నాను. ఆ స్పందనకు ఏ కమర్షియల్ కొలమానాలూ అక్కరలేదు. అందుకే హాయిగా ఉన్నాను’’ అన్నారామె. గౌరీలక్ష్మితో మాట్లాడినప్పుడు వృత్తి ప్రవృత్తి మధ్య సమతూకం తెలిసినప్పుడు జీవితంలో అన్నీ తూకంగానే ఉంటాయనిపించింది. తామరాకు మీద నీటి బిందువులా జీవించడానికి సద్గురువుల బోధనలు అక్కరలేదు, అనవసరపు అంచనాల, ఆకాంక్షల పరిభ్రమణానికి దూరంగా ఉండగలిగితే చాలు... అని తెలిసింది. అక్షరాల మడి హైదరాబాద్లోని హయత్నగర్లో ఉండేవాళ్లం. సిటీలోకి వచ్చి వెళ్లడానికి రోజూ నలభై కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేసి ఉద్యోగం చేశాను. వారాంతాల్లో కథా సదస్సుల్లో పాల్గొంటూ నా అభిరుచిని చిగురింపచేసుకున్నాను. ఇవన్నీ భర్త, ఇద్దరు పిల్లలతో ఇంటిని చక్కబెట్టుకుంటూనే. వీటి మధ్యలోనే పొలిటికల్ సైన్స్లో పీజీ చేశాను. సాహిత్యపరంగా నాలుగు కథా సంపుటాలు, మూడు నవలలు, రెండు కవితా సంపుటాలు, రాజకీయ వ్యంగ్య కథనాలు కూడా రాశాను. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కాలమ్స్ రాస్తున్నాను. నన్ను నిత్యనూతనంగా ఉంచుతున్నది సాహిత్యమే. మనిషి వ్యక్తిత్వాన్ని చక్కటి శిల్పంలా తీర్చిదిద్దగలిగిన గొప్ప సాధనం సాహిత్యం. అందుకే సాహిత్యంతో స్నేహం చేయడం అందరికీ మంచిదని చెబుతాను. నాకంటూ నేను పెంచుకున్న సాహిత్యవనంలో విహరిస్తూ విశ్రాంత జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నాను. – అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి, జనరల్ మేనేజర్ (రిటైర్డ్), ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్రెడ్డి -
‘తెలంగాణ నడువలో అతనొక తెగువైన నడక’
ఒకరకంగా కాలానికి పట్టిన అద్దం కవిత్వం అంటారు. ఆయా కాలమాన పరిస్థితుల్ని ప్రతిబింబించే కవిత్వంతో ఓ పార్శ్వం నుంచి చరిత్రను లిఖిస్తూ వెళ్తారు కవులు. అందుకేనేమో సాహిత్యం విస్తృతార్థంలో చరిత్రే అంటారు. ఈ మాటను రుజువుపరి చేదిగా ఉంటుంది నందిని సిధారెడ్డి కవిత్వం. నాలుగుదశాబ్దా లకు పైబడిన కాలంలో ఆయన వెలువరించిన వచన కవిత్వం తెలుగునాట సగటు మనిషి బతుకు ఎలా సాగుతోందో ఇట్టే బోధపరుస్తుంది. ఆయన వెలువరించిన ఏ పుస్తకం, ఏ శీర్షిక, ఏ కవిత, అందులో ఏ చిన్న ఖండిక తీసుకున్నా... మనిషి జీవితపు ఏదో పార్శ్వం మనకు తగులుతూనే ఉంటుంది. ఒకింత మెత్తగా, ఒకింత గరుకుగా! ఓసారి మిట్టమధ్యాహ్నపు సూరీ డంత వేడిగా, ఇంకోసారి కార్తీకమాసపు తొలిపొద్దు కిరణాలంత వెచ్చగా, ఇంకా ఒకోసారి రివ్వున వీచే శీతగాలిలా, మరోమారు డిసెంబరు చివరిపాదం నడిరాతిరి ఎముకల్ని కొరికేంత చలిగా తగులుతుంటుంది. ఏం రాసినా... మనిషి, ఆతని జీవితం, ఊరు, రైతు, పంటపొలాలు, ధాన్యం, మార్కెట్లు, రాజ్యం–రాక్ష సత్వం, సర్కార్లు, వారి వ్యవస్థలు, అందులోని మనుషులు, ఆర్తి–ఆరాటాలు, అణచివేత–పోరాటాలు... ఇలా ఎంతసేపూ ఆయన మనసు వీటిచుట్టే తిరగాడుతుంది. బహిర్–అంతర్ సంఘర్షణల ఆనవాళ్లు పట్టిస్తూనే ఉంటుంది. మట్టి పొరల నుంచి మెలమెల్లగా లేచే భావనలు.. ఓ దశలో సరిహద్దులన ధిగమించి ఆకాశమంత ఎత్తెదిగి ఆరుస్తాయి. వాస్తవికత, హేతు బద్ధత ప్రధానంగా కనిపించే తన కవిత్వంలో అడుగడుగునా నిజం– నిజాయితీ, ఆరళ్లు–పోరాటాలు, కలలు–కడగండ్లు తగు లుతూనే ఉంటాయి. ఆయనే చెప్పినట్టు ఒకసారి అక్షరమై, ఇంకోమారు నదిౖయె, మరొకమారు తీగై, వెన్నెలై, కన్నీరై... ఇలా సాగిపోతూనే ఉంటాడు తప్ప కవి ఎక్కడా నిలిచిపోడు. ‘కవిత్వం వేడుక కాదు, గాయాల గొంతుక’ అని తనకు తాను నిర్వచించుకొని మరీ కర్తవ్యదీక్షతో సాగుతాడు. కృత్రిమ విల యాలకు, కాళ్లకింద కర్కశంగా సామాన్యుని నలిపే రాజ్యపు అంగాల దాష్టీకాలకు బాధ పడతాడే తప్ప భయపడడు. ‘... కవిత్వం ఊట మీద లాఠీ వేలాడుతూంది’ అంటూనే ‘... మరింత గట్టిగా నిర్భయంగా కలలు కన్నంత స్వేచ్ఛగా కవిత్వం రాయాల్సి ఉంది’ అనడమే పంథా ప్రకటన! స్థానిక మాండలిక భాషా పదాలు అతికించినట్టు కాకుండా అలవోకగా సిధా రెడ్డి కవితాఝరిలో ఒదిగిపోతాయి. ఇచ్చంత్రం, పడావు, అంజుమన్ బ్యాంకు, బుగులు, మనాది వంటి మాటలు అస్తిత్వపు బలమైన జాడలు గానే కాక నిండైన అభివ్యక్తికి పాదుల్లా నిలుస్తాయి. అర్ర, మాసిక, అచ్చుకట్టు, దస్కత్, అల్కుపిడచ, గీర, నువద్దె, నిగురాన్, తండ్లాట వంటి పదాలు, తనకు తెలుసు కనుక కవి వాడుతున్నట్టు కాకుండా అక్కడ అదే సరిపోయే పదం అనిపించేంత సహజంగా ఒదిగిపోవడ మొక భాషాసౌరభం! బలమైన భావా లకు అతికే పదాలతో బంధ మల్లడం వల్లే కవిత్వం మాటల కూర్పు దశ దాటి... దృశ్యమానమయింది. ఉన్నపళంగా ఊరు ఖాళీ చేయ(వలసి రావ)డం... ఎంత దయనీయమో! కళ్లకు కట్టి నట్టు, గుండె లోతుల్లో చేయూడ్చి దేవినట్టు ‘ఉసురు’ కవితలో చెబుతాడు. అది పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు నీట మునిగే ఊరు ఖాళీ చేయడమైనా, పూట గడవక పొట్టకూటి కోసం వల సవెళ్లడమైనా, పిల్లలకు నక్సలైట్ ముద్రేసే పోలీసు వేధింపుల్ని తట్టుకోలేకైనా... కారణమేదైనా బలవంతంగా ఊరిడిచి వెళ్లాల్సి వస్తే! ఎవరికైనా ఎలా ఉంటుందో చెబుతూ, ‘‘ఇల్లు ఖాళీ చేసి నంత సునాయాసంగా జీవితం ఖాళీ చేయలేం! ఇల్లు ఖాళీ చేసినంత సుతారంగా ఊరు కూడా ఖాళీ చేయలేం!... అన్నీ అయి తలచిక్కులు తీసిన అమ్మఒడి ఖాళీ చేయడమంటే సన్నటి గునపంతో గుండెను తవ్వుతు న్నట్టుంటది. నేరమూ ఉండదు, నెత్తురూ మిగలదు’’ ఎంత గొప్ప భావుకత! కష్టాలను, కన్నీళ్లను అంత సహ జంగా, గుండెకు తాకేలా చెబుతాడన్న మాటే గాని ఎక్కడా మనోధైర్యాన్ని జార నీయకపోవడం సిధారెడ్డి ప్రత్యేకత. భవి ష్యత్తును ఆశావహంగా చూపుతాడు. అవ సరమైతే తప్పని తరుణోపాయాల సంకే తాలిస్తాడు. అందులో ఓ హెచ్చరికా తొంగి చూస్తుంది. ‘‘నాకు నిశ్శబ్దం నిశ్శ బ్దం కాదు మౌనంగా ఉన్న కంచు! నిస్పృహ నిస్పృహ కాదు పొదుగులో ఉన్న గుడ్డు’’ అనడం, భవిష్యత్తుపై భరో సాయే! ‘గోడకు వేలాడే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంద’నేది హెచ్చరిక. రాజ్యం గ్రహించాల్సిన ప్రాపంచిక సత్యాలూ ఉన్నాయనే భావాల్నీ దాచుకోకపోవడం విశేషం! ‘‘ఎంత అద్భుతమైన గంధపు చెక్కయినా సరే, మండితే ఎర్రటి నిప్పే అవుతుంది’’ అన్నది అసాధారణ అభివ్యక్తి. వీరుడు వింటి నారి సంధించడాన్ని గొప్పగా సమర్థిస్తాడు. ‘చీకటితో యుద్ధానికి వెళ్లిన కొడుకు రాత్రికి రాత్రి బూడిదయిన కలల జలతారు.. తల్లడిల్లుతున్న తల్లికి ఎవరు జవాబుదారీ? .. జరి గింది హత్యో? కాదో? విచ్చుకున్న తురాయిపూలు చెబు తాయి.. తలపండిన కొంగలు మాత్రం తపోభంగాల కథలే మళ్లీ మళ్లీ వల్లిస్తాయి... స్వప్నం గాలానికి చిక్కిన చేపయినపుడు, విశ్వాసం కంపించిన భూమయినపుడు, విషాదమే మోయాల్సి వస్తే తప్పేదేముంది? తల్లడిల్లేతల్లి శపించక చేసేదేముంది? ... విజయం కోసం వింటిని సంధించక వీరునికి దారేముంది?’అని ప్రశ్నవుతాడు. మారుమూల పల్లె నుంచి పట్నం మీదుగా నగరా నికి సాగిన జ్ఞానతృష్ణ సిధారెడ్డి. రాజధాని నగరంలో, మేటి విశ్వ విద్యాలయపు వినువీధుల్లో భాషను, దానికి మించి భావాలను పరిపుష్టం చేసుకుని పల్లెకు వెనుదిరిగిన భూమిపుత్రుడాతడు. ఒకే పుటుక పుట్టిన మనుషుల మధ్య అంతరాలను జీర్ణించు కోలేక, చలించి కవితైనాడు. సాహితీవంతెన కట్టేందుకు యత్నిం చాడు. దశాబ్దాల కిందటే, ‘విపణి వీధి వేయి కోరల రాకాసి, విపణి వీధి నూరు బారల ఉరితాడు’ అన్నాడు. కనబడకుండానే కవిత్వమంతటా తొంగి చూస్తాడు తానే ఒక ప్రశ్నై! పలు పుస్తకాలుగా విస్తరించిన నందిని సిధారెడ్డి కవిత్వాన్ని సూత్రబద్ధం చేసే అంశం మనిషి ఆర్తి. మనిషి మనుగడ, ఒడి దొడుకులు, ఆశ–నిరాశలు, ఊరు–ఊరుమ్మడి బతుకులు.. ఇదే పూలదండలో ఒదిగిన దారం! పచ్చి నిజాలే ముడిసరుకు. కఠోర వాస్తవాలే వస్తువు. గొంతెత్తడం సాహితీ ధర్మం! ఎక్కడా అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాల జాడే ఉండదు. ‘సరదా పడటానికి ఒక్కరోజు చీకటి కాదు సర్దుకుపోవడానికి ఒక్కనాటి చావు కాదు..’ అని జీవితాన్ని నెమరేస్తాడు. అలా అని నిరాశ చెందడు. తనకు తన కలలే వస్తాయంటూ ‘నేల నిద్ర లేచినట్టు అలుకుబోనం చేసి మొలక చల్లినట్టు అవి మొలచి సేనై ఊగి నట్టు’ ఆశావహ దృక్పథాన్ని కలగంటాడు. తెలంగాణ ఏర్పడ టానికి ఒకటిన్నర దశాబ్దాల ముందరే ‘నాగేటి చాల్లల్ల నా తెలం గాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలం గాణ’ అని గొంతెత్తి పాడిన పాట సిధారెడ్డి. ‘శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్టితాత్ స్వధర్మే నిధనమ్ శ్రేయః..’ అని గీతలో కృష్ణుడు చెప్పినట్టు సిధారెడ్డి స్వధర్మాన్ని నిష్టతో, కవిత్వమే ఊపిరిగా ఆచరించారు. ‘మనది కాని జీవితంలో మన మేమీ రాయలేము’(తలవంచని గీతం) అంటాడు. తన మట్టిని, తన నేలను, తన గాలిని, తన సేలను... ఇలా అన్నీ తనవే వస్తు వుగా కవిత్వం అల్లిన యోగి. తానే చెప్పినట్టు ఆయన, ఆయన కవిత్వం ‘‘అలల రెప్పల కింద కలలు దాచుకున్న కడలి’’ (రేపటినుంచి నగరంలో ‘డా‘‘ నందిని సిధారెడ్డి కవిత్వ జీవన ప్రస్థానం’ రెండు రోజుల జాతీయ సదస్సు సందర్భంగా) – సవ్యసాచి -
పోయెమ్ రాశాక ప్రశాంతంగా అనిపిస్తుంది
‘విత్ హ్యాండ్స్ ఫుల్ ఆఫ్ మార్బుల్స్/ హెడ్ ఫిల్డ్ విత్ డ్రీమ్స్’ అనే భావ కవితాత్మక వాక్యాలున్న ‘చైల్డ్హుడ్ డ్రీమ్స్’ అనే కవితతో ప్రారంభమయ్యే ‘వైల్డ్ వింగ్స్’.. ఓ అచ్చ తెలుగు అమ్మాయి రచించిన ఆంగ్ల పద్య కావ్యం! ఇటీవల ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన స్రష్ట వాణి కొల్లి ‘సాక్షి’తో తన మనోభావాలు పంచుకున్నారు. ∙మొదటి కవిత ఎప్పుడు రాశారు? స్కూల్లో చదువుతున్నప్పుడు ఇచ్చిన అసైన్మెంట్కి కొత్తగా ఉంటుందని హిందీలో మొదట పద్యం రాశాను. అప్పుడు నా వయసు పదమూడు సంవత్సరాలు. ఆ తరవాత మరో అసైన్మెంట్లో వ్యవసాయ సంబంధితంగా ‘ఫార్మర్’ అనే పద్యం రాసి, మా ఇంగ్లిషు టీచర్కి చూపించాను. ఆవిడ చిన్న చిన్న మార్పులు చేయమని సూచన ఇచ్చారు. ఆ ప్రోత్సాహంతోనే çకవిత్వం రాయడం ప్రారంభించాను. ∙చదువుకు రచన అడ్డు కాలేదా? ఇంటర్మీడియెట్ చదువుతున్న రెండు సంవత్సరాలు ఒక్క పద్యం కూడా రాయలేకపోయాను. ఆ రెండేళ్లు ఏదో మిస్సింగ్ అనిపించింది. ఇంటర్లో సెంట్ పర్సెంట్తో పరీక్షలు ప్యాసయ్యాక మళ్లీ కవిత్వం రాయడం ప్రారంభించాను. ఇన్నాళ్ల విరామాన్ని మరచిపోయేలా మూడు నెలల కాలంలో దాదాపు 50 దాకా కవితలు రచించాను. అన్ని కవితలకూ మంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం బీబీఏ ఎల్ఎల్బీ రెండో సంవత్సరం చదువుతున్నాను. ∙కవిత్వం రాయడానికి మీకు ప్రేరణ ఎవరు? నాకు ఖలీల్ జిబ్రాన్ రచనలంటే చాలా ఇష్టం. ఆయన నా అభిమాన రచయిత. అప్పుడప్పుడు టాగూర్ని చదువుతాను. షేక్స్పియర్ రచించిన హామ్లెట్ చదివాను. ‘మ్యాక్బత్’ నాటకంలో మ్యాక్బత్ వేషం వేయడం కోసం ఆ పాత్ర గురించి మొత్తం ^è దివాను. అర్థం కాని చోట వేరే వాళ్లను అడిగి చెప్పించుకున్నాను. ∙మీ కవిత్వానికి ప్రేరణ ఏమిటి? ఒక్కో పోయమ్ వెనకాల ఒక్కో చరిత్ర ఉంది. చిన్నప్పుడు ఎవరినైనా నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని అడిగితే, నేను డాక్టరు, నేను ఇంజనీరు ఇలా చెబుతారు. నేను రోజుకోరకం చెప్పేదాన్ని. బాల్యం అంతా కలలు కంటూనే ఉంటాం. అలా రాసినదే ‘చైల్డ్ హుడ్ డ్రీమ్స్’. సీఎస్ లూయిస్ రచించిన నార్నియా అనే సిరీస్ చదివి బయటకు రాలేకపోయాను. దాని నుంచి ‘ఒన్ వింటర్ నైట్’ రాశాను. కాలేజీ నుంచి ఇంటికి వచ్చే దారిలో రకరకాల రంగురంగుల పూలు చూసేదాన్ని. వాటి నుంచి వచ్చినదే ‘ఫ్లవర్’. నా గదిలో కూర్చుని కిటికీలో నుంచి గదిలోకి వెలుగు రావడం చూసి, ‘లైట్’ పద్యం రాశాను. ప్రతి పోయెమ్ పక్కన వేసిన బొమ్మ నా ఆలోచనకు అనుగుణంగా చేసినదే. ‘బ్రేవ్’ పోయెమ్ నాకు నేను చెప్పుకున్నట్లుగా రాసుకున్నాను. ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలనుకుంటాను. ∙ఒక్కో కవిత రాయడానికి ఎంత సమయం పడుతుంది? మనసులోకి ఆలోచన రాగానే భావాలు రాసుకుంటాను. తరవాత దానిని ఫ్రేమ్ చేసుకుంటాను. మొత్తం పూర్తయ్యాక ముందుగా అమ్మకి వినిపిస్తాను. ఆవిడకు బాగున్నా బాగుండకపోయినా బాగానే ఉంది అంటుంది. నా ఐడియాని ప్రొజెక్ట్ చేసేది నాన్న. నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాను. వీకెండ్స్లో చిరాకుగా అనిపిస్తే, పోయెమ్ రాశాక ప్రశాంతంగా అనిపిస్తుంది. కవిత్వం రాయడం నా జీవితంలో భాగంగా మారిపోయింది. ∙మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? వర్తమాన రాజకీయాల మీద వ్యాసాలు రాస్తున్నాను. లాగే కరెంట్ టాపిక్స్ మీద కూడా రాస్తున్నాను. ‘ట్రిపుల్ తలాక్’ గురించి రాసిన ఆర్టికల్ను ఫేస్బుక్లో ఏడువేల మంది షేర్ చేశారు. నేషనల్ సెమినార్లో ఆర్టికల్స్ ప్రజెంట్ చేశాను. నా తరవాతి పుస్తకం ఈ ఆర్టికల్స్ మీదే. ∙మీ కుటుంబం గురించి... నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. నాన్న అరవింద్ కొల్లి జర్నలిస్టు, అమ్మ ఆశ హౌస్ వైఫ్. ప్రస్తుతం బెంగళూరు రేవా యూనివర్సిటీలో చదువుతున్నాను. వాస్తవానికి ఇంగ్లిషు లిటరేచర్ చేద్దామనుకున్నాను. కాని లా డిగ్రీలో నాకు టైమ్ స్పేస్ కనిపించింది. మా యూనివర్సిటీ వారు నా పుస్తకాన్ని స్టూడెంట్స్ సమక్షంలో రిలీజ్æ చేస్తానన్నారు. భవిష్యత్తులో షార్ట్ స్టోరీస్, నవలలు కూడా రాయాలనుకుంటున్నాను. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
రాయలసీ కన్నీటి పాట పెన్నేటి పాట
‘వినిపింతునింక రాయలసీమ కన్నీటి పాటకోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజెరి కొట్టుకొనుచు’ అంటూ విద్వాన్ విశ్వం గానం చేసిన ‘పెన్నేటి పాట’ రాయలసీమ కరువు నేపథ్యంగా (1954లో) వచ్చిన తొలి కావ్యం. నదిలా ప్రవహించినప్పుడు పరిపూర్ణమైనట్టే, ఎండిపోయినప్పుడు జీవితం స్తంభించిపోతుంది. ఎండిపోయిన పెన్నానది ఇసుకతో నిండిపోయి ఆ ప్రాంతపు జీవన వాస్తవికతను ఈ కావ్యంలో విశ్వం కళ్లకు కట్టినట్టు చూపించారు. ‘ఇదే పెన్న! ఇదే పెన్న! నిదానించి నడు విదారించు నెదన్, వట్టి ఎడారి తమ్ముడు! ఎదీ నీరు? ఎదీ హోరు? ఎదీ నీటి చాలు? ఇదే నీరు! ఇదే హోరు! ఇదే ఇసుక వాలు!’ అంటూ సాగే పంక్తులతో రాగయుక్తంగా కావ్యగానం చేసే వారు ఈ సీమలో ఇప్పటికీ ఉన్నారు.ఈ కావ్య కథానాయకుడు రంగడు ఒక పెద్ద రైతుకు పుట్టిన ఏకైక సంతానం. ఆస్తినంతా తండ్రి పోగొట్టగా రంగడికి మిగిలింది శారీరక శ్రమ మాత్రమే. అతను అడవినుంచి కట్టెలు కొట్టితెచ్చి అమ్ముకునే కూలి. అతని భార్య గంగమ్మ ఇరుగుపొరుగు ఇళ్లలో ఒడ్లో, అటుకులో దంచి నూకలు, తవుడు తెచ్చుకుంటుంది. ఇద్దరి పరస్పర ప్రేమ, పరోపకార బుద్ధి, అంతులేని దారిద్య్రం, గంగమ్మ గర్భవతి కావడం, విశ్రాంతి లేకపోవడం, రంగడు నిస్సహాయుడై పోవడం ఇందులోని కథాంశం. ‘దైవమా; ఉంటివా? చచ్చినావ నీవు? హృదయమా; మానవుడు నిన్ బహిష్కరించె! చచ్చె నీలోకమున నాత్మసాక్షి యనుచు నెత్తినోరిడు కొట్టుకోనిండు నన్ను’ అంటూ నిర్వేదంతో కావ్యం ముగుస్తుంది. ఈ కావ్యంలో కథ రేఖామ్రాతమే కానీ, పేదరికం వల్ల కలిగే విధ్వంసానికి ప్రాధాన్యమిచ్చిన తొలి సంపూర్ణ కావ్యం. రాయలసీమలో ప్రవహించే ప్రధానమైన పెన్నానది, ఇక్కడి ప్రకృతి, గ్రామాలు, జీవన సరళి, శ్రమ వంటి వన్నీ ఈ కావ్యంలో ప్రతిబింబిస్తాయి. ఈ కావ్యం ప్రాచీన ఆధునిక రీతుల మేలు కలయిక. ఇందులో సీస పద్యాలున్నాయి, గేయాలున్నాయి, వృత్తాలున్నాయి, వచనంలా భాసించే పంక్తులున్నాయి. ఇందులో దస్త్రము, జీవాలు, సందకాడ, ఎనుము వంటి మాండలికాలున్నాయి. గంపంత దిగులు, అంబటిపొద్దు వంటి తెలుగు నుడికారాలూ ఉన్నాయి. రాఘవశర్మ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement