-
పాత శిల్పాలకు కొత్త ఊపిరి
సాక్షి, హైదరాబాద్: ‘నేను ఇటీవల పరిగి సమీపంలోని ఓ గ్రామానికెళ్లా.. ఆ ఊరి నిండా శిల్పాలే. వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దుస్థితి కొంత దూరమవుతుందన్న ఆశాభావం కలుగుతోంది. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావటమే ఇందుకు కారణం. ఆలయ శిల్పాలే యునెస్కోను ఆకర్షించాయి. ఫలితంగా శిల్పాలకు కొంతగుర్తింపు పెరుగుతుంది. నిరాదరణకు గురవుతున్న పురాతన శిల్పాలకు కొంత గౌరవం దక్కుతుంది’అని ప్రముఖ స్తపతి, రామప్ప దేవాలయ నిర్మాణానికి వినియోగించిన ఎర్ర ఇసుక రాతిని తొలిచిన క్వారీలను ఇటీవల వెలుగులోకి తెచ్చిన పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కిన నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఇది గొప్ప మలుపు కర్ణాటకలోని హంపికి యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. 10 వేల కుటుంబాలకు ఉపాధి రావటమే కాకుండా, నిత్యం విదేశీ పర్యాటకులతో ఆ ప్రాంతం కొత్త అందాలతో పాటు వేగంగా పురోగమించేందుకు అవకాశం కలిగింది. పట్టడకల్ దేవాలయాలకు ఆ గుర్తింపు వచినప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు రామప్పకు యునెస్కో గుర్తింపు రావటంతో మనవద్ద కూడా అలాంటి అభివృద్ధికి అవకాశం ఉంది. కాలక్రమంలో వాటిల్లో చాలావరకు దాడులకు గురై ధ్వంసం కావటంతో వాటి శిల్పాలు ఊరూవాడ చిందరవందరగా పడిపోయాయి. అవగాహనలేని స్థానికులు వాటిని గాలికొదిలేశారు. ఇప్పుడు రామప్పకు గుర్తింపుతో ప్రజల్లో కొంత చైతన్యం వచ్చి ఆ శిల్పాలకు కొంత గుర్తింపు వస్తుందని భావిస్తున్నా. శిల్పులకూ గౌరవం వస్తుంది రామప్ప దేవాలయంలోని నల్లరాతితో చెక్కిన శిల్పాలు, స్తంభాల ముందు నిలబడితే అద్దంలో చూసుకుంటున్నామన్న భావన వస్తుంది. రాతిని గాజులాగా మార్చేసిన 8 శతాబ్దాల క్రితం నాటి శిల్పుల ఘనతకు ఇప్పుడు మరింత గుర్తింపు వస్తుంది. వారిపై గౌరవం పెరుగుతుంది. ఎలాంటి యంత్రాలు అందుబాటులో లేని సమయంలో.. ఉలితోనే రాతిని అద్దంలా మార్చిన ప్రతిభ నేటి తరానికి తెలుస్తుంది. శిథిల ఆలయాల పునరుద్ధరణ అవసరం.. కాకతీయుల కాలంలో అద్భుత దేవాలయాలను నిర్మించారు. అంతకుముందు చాళక్యులు కట్టిన అలంపూర్ లాంటి ఆలయాలున్నాయి. కానీ చాలావరకు శిథిలమవుతున్నాయి. రామప్పకు ప్రపంచ గుర్తింపు నేపథ్యంలో.. శిథిలమవుతున్న పాత దేవాలయాలను పునరుద్ధరించాలన్న ఆలోచన కూడా గ్రామాలకు కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ధోలావీరాకు యునెస్కో గుర్తింపు
ధోలవిరా: హరప్పా నాగరికత కాలం నాటి నగరం ధోలావీరాను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తున్నట్లు యునెస్కో మంగళవారం ప్రకటించింది. చైనాలోని ఫుఝౌలో జరుగుతున్న 44వ యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నెల 16వ తేదీ నుంచి ఇక్కడ జరుగుతున్న ఈ సమావేశాల్లోనే తెలంగాణలోని 13వ శతాబ్దానికి చెందిన రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ప్రకటించడం తెల్సిందే. తాజా ప్రకటనతో భారత్లోని మొత్తం 40 కట్టడాలు, ప్రాంతాలు యునెస్కో జాబితాలో చేరినట్లయింది. అదేవిధంగా, గుజరాత్లో యునెస్కో గుర్తించిన ప్రాంతాల జాబితాలో పావగఢ్ సమీపంలోని చంపానెర్, పటన్లోని రాణీ కీ వావ్, చారిత్రక అహ్మదాబాద్ సరసన నాలుగో ప్రాంతంగా ధొలావి చేరింది. భారతదేశ చరిత్రలో గుజరాత్ రాష్ట్రం రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతం ఖదీర్ దీవిలో ధోలావీరా మహానగరానికి ప్రముఖ స్థానం ఉంది. ఇక్కడ క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1,800 సంవత్సరం వరకు సుమారు 1,200 ఏళ్లపాటు సింధులోయ నాగరికత విలసిల్లింది. ఆనాటి కట్టడాలు, వస్తువులు, ఆధారాలు పురాతత్వశాఖ తవ్వకాల్లో లభించాయి. -
తెలుగు చరితకు విశ్వ ఘనత
తెలుగు జాతికిది సంతోష సందర్భం. తెలుగు ఖ్యాతికిది విశ్వవిఖ్యాత సంబరం. కొన్నేళ్ళ ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. ఎనిమిదొందల ఏళ్ళ నాటి కాకతీయుల శిల్పకళావైభవ ప్రతీక రామప్ప దేవాలయం ‘ప్రపంచ వారసత్వ కట్టడం’గా గుర్తింపు తెచ్చుకుంది. గర్వంతో తెలుగు వారి ఛాతీ ఉప్పొంగేలా చేసింది. ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయమైన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ప్రపంచ పట్టం సాధించిన తొలి నిర్మాణంగా రామప్ప కొత్త చరిత్ర సృష్టించింది. హైదరాబాద్కు 220 కిలోమీటర్ల దూరంలో, తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప గుడికి ఈ విశ్వవిఖ్యాత పట్టం రావడానికి వారసత్వ ప్రియుల మొదలు ప్రభుత్వాల దాకా ఎందరో కృషి చేశారు. పురాస్మరణకూ, పర్యాటకం పుంజు కోవడానికీ తోడ్పడే ఈ విశ్వఘనత అనేక రకాల ప్రత్యేకమైనది. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక రంగాలలో అంతర్జాతీయ సహకారంతో శాంతి, భద్రతలను ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి పెట్టిన ప్రత్యేక సంస్థ ‘యునెస్కో’. ఆ సంస్థ నుంచి 1972లో ఓ అంతర్జాతీయ ఒప్పందంగా వార సత్వ కట్టడాల గుర్తింపు ప్రారంభమైంది. 1977లో మన దేశం ఆ ఒప్పందంలో భాగమైంది. 1983లో మన దేశం నుంచి తొలిసారిగా అజంతా, ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్మహల్ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు పొందాయి. అప్పటి నుంచి దేశంలోని ఖజురహో శిల్పాలు, కోణార్క్ ఆలయం, మహాబలిపురం, హంపీ నిర్మాణాలు, ఎర్రకోట, ఖజిరంగా జాతీయ పార్క్ తదితర 38 సాంస్కృతిక నిర్మాణాలు, సహజ అభయారణ్యాలు ‘యునెస్కో’ గుర్తింపు పొందాయి. ఇప్పుడు ఆ వరుసలో 39వదిగా మన రామప్ప ఆ జాబితాకు ఎక్కింది. ఇప్పటికి ఇలా మొత్తం 167 దేశాల్లోని 1130 నిర్మాణాలు ఈ ప్రత్యేక గుర్తింపు సాధించాయి. రామప్ప గుడి కట్టి 800 ఏళ్ళు పూర్తయినప్పటి నుంచి ఈ గుర్తింపు కోసం మన ప్రభుత్వాలు కృషి చేస్తూ వచ్చాయి. 2014 ఏప్రిల్లో ప్రయత్నించి, విఫలమయ్యాం. అప్పటి నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో మటుకు కొనసాగుతూ, గుర్తింపు కోసం రామప్ప గుడి నిరీక్షించాల్సి వచ్చింది. 2019 సెప్టెంబర్లో అక్కడి అధికారులొచ్చి, మన శిల్పకళా సౌందర్యాన్ని చూసి వెళ్ళారు. దరఖాస్తు లోని లోటుపాట్ల సవరణ, నృత్య శిఖామణుల వివరణతో మన వాదనకు బలం చేకూరింది. ఇంతలో కరోనా కారణంగా గత ఏడాది సమావేశం వాయిదా పడింది. చివరకు చైనాలోని ఫ్యూజు వేదికగా యునెస్కో 44వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం వర్చ్యువల్గా జరిగినప్పుడు ఈ ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలు దాటాక తీపి కబురందింది. మొత్తం 21 సభ్యదేశాలలో నార్వే అభ్యంతరం చెప్పింది. కానీ, మన ప్రభుత్వ దౌత్యం ఫలించి, రష్యా చొరవతో 17పైగా సభ్య దేశాలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అలా రామప్పకు విశ్వవిఖ్యాతి దక్కింది. పది వేర్వేరు అంశాలను బట్టి ఈ గుర్తింపు ఈసారి రామప్పతో పాటు చైనా, ఇరాన్, స్పెయిన్లలోని కట్టడాలకూ లభించింది. ‘విలక్షణ శైలి... సూక్ష్మరంధ్రాలుండి నీటిలో తేలే తేలికైన ఇటుకలతో కట్టిన ఆలయ విమానం... కాకతీయ సంస్కృతినీ, నృత్య సంప్రదాయాలనూ ప్రతిఫలించే అద్భుత ఆలయ శిల్పాలు...’ అంటూ యునెస్కో ఈ ప్రాచీన ఆలయ నిర్మాణ విశేషాలను వేనోళ్ళ పొగడడం విశేషం. రామప్పగా పేరుపడ్డ శివాలయమైన రుద్రేశ్వరాలయం కాకతీయ శిల్పకళా విశిష్టతకు మకుటాయ మానం. విశాల కాకతీయ సామ్రాజ్యంలో గణపతిదేవుని పాలనలో, సేనాని రేచర్ల రుద్రుడు నిర్మిం చిన ఈ ఆలయ సముదాయానిది పెద్ద కథ. క్రీ.శ. 1213లో నిర్మాణమైన ఈ గుడిలో ఎన్నెన్నో విశే షాలు. ఇది భక్తులకు గుడి. నల్లని రాళ్ళపై చెక్కిన అపురూపమైన స్త్రీమూర్తులతో కళాప్రియులకు అద్భుత శిల్పసౌందర్యశాల. ‘శాండ్ బాక్స్ టెక్నాలజీ’లో ఇసుక మీద పేర్చిన రాళ్ళతో నిర్మాణ నిపుణులకు అపూర్వ ఇంజనీరింగ్ అద్భుతం. వెరసి, రాశిగా పోసిన విశేషాల కుప్ప– రామప్ప. దాదాపు 40 ఏళ్ళు ఈ నిర్మాణం కోసం శ్రమించిన శిల్పి రామప్ప పేరు మీదే ఎనిమిదొందల ఏళ్ళ నాటి ఈ గుడికి ఆ పేరొచ్చిందని కథ. ఆ తరువాత కట్టిన వాటెన్నిటికో గుర్తింపు దక్కినా, ఇప్పటి దాకా ఆ భాగ్యం రామప్పకు దక్కకపోవడం విచారకరమే. చరిత్రపై శ్రద్ధ, ఘనవారసత్వాన్ని కాపాడుకోవాలనే ధ్యాస లేని సమాజంలో ఈ ప్రాచీన శిల్పవిన్నాణానికి ఇప్పటికైనా గుర్తింపు రావడమే ఉన్నంతలో ఊరట. మన తెలుగు నేలపై ఇంకా వేయిస్తంభాల గుడి, లేపాక్షి లాంటి అద్భుతాలు, పునరుద్ధరిం చాల్సిన శిథిల నిర్మాణాలు, మరుగునపడిన చారిత్రక కట్టడాలెన్నో ఉన్నాయి. ఆలనాపాలనా లేని వాటిపై ఇకనైనా దృష్టి పెట్టాలి. కళలు, సంస్కృతి, చరిత్రపై తమిళ, కన్నడిగ, మలయాళీలకున్న అక్కర తెలుగువారికి లేదనే అపఖ్యాతి తరతరాలుగా మూటగట్టుకున్నాం. ఆ మచ్చను తుడిచేయా లంటే, ఇది సరైన సమయం! ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో, ఈ బండల మాటున ఏ గుండెలు మోగెనో’ అన్న సినారె సాక్షిగా చరిత్రకెక్కని చరితార్థుల కథలు వెలికి తీయడానికి ఇదే సందర్భం! రామప్పకు దక్కిన గుర్తింపు మన జాతి చరిత్ర, సంస్కృతి, కళలపై స్వాభిమానం పెంచుకోవడానికి అందివచ్చిన అవకాశం! కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ లాంటి సంస్థలు, కొందరు కళాప్రియులు రెండు రాష్ట్రాల్లో ఇతోధికంగా శ్రమిస్తున్నా, అదొక్కటే సరిపోదు. భారతీయ పురావస్తు శాఖ తోడ్పాటు, తగిన నిధుల కేటాయింపుతో ప్రభుత్వాలు ముందుకు రావాలి. చరిత తెలుకోనిదే భవితను నిర్మించలేమనే చైతన్యంతో ప్రజలు భాగస్వాములు కావాలి. సమష్టిగా బాధ్యతను భుజానికెత్తుకొని, మన ఘనతను విశ్వానికి చాటాలి. ఆ దీక్షలో రామప్ప నుంచే తొలి అడుగు వేయాలి! -
వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయం
-
రామప్పకు విశ్వఖ్యాతి
‘వారసత్వ హోదా’ ప్రయోజనాలు ఎన్నో.. ►ఆలయం యునెస్కో అధీనంలోకి వెళ్తుంది. ప్రపంచ పటంలో రామప్పకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ►రామప్పకు యునెస్కోతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గణనీయంగా నిధులు అందుతాయి. వసతులు, రవాణా సౌకర్యాలు పెరుగుతాయి. ►యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాలు/కట్టడాలను చూసేం దుకు విదేశీ పర్యాటకులు లక్షల్లో వస్తారు. ఇక ముందు రామప్పకూ పోటెత్తిన అవకాశం ఉంటుంది. ►యునెస్కో ప్రచారం, వసతులు, రవాణా సౌకర్యాలు మెరుగుపడితే దేశీయ పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. ►రామప్పకు వచ్చేవారు ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించే అవకాశం ఉంటుంది. ఇది టూరిజానికి ఊపునిస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, వరంగల్/ న్యూఢిల్లీ: వందల ఏళ్లనాటి ఇంజనీరింగ్ నైపుణ్యం.. నీటిలో తేలియాడే ఇటుకలు, అద్దంలా ప్రతిబింబాన్ని చూపే నల్లరాతి శిల్పాలు, ఇసుకను పునాది కింద కుషన్గా వాడిన శాండ్బాక్స్ టెక్నాలజీ, సూది మొన కంటే సన్నటి సందులతో నగిషీలు.. అద్భుతాలన్నీ ఒకచోట పేర్చిన రామప్ప దేవాలయానికి ‘ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో)’ గుర్తింపు లభించింది. చైనాలోని వూహాన్ కేంద్రంగా ఆదివారం జరిగిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశంలో.. 28 సభ్య దేశాలకుగాను మెజారిటీ దేశాలు రామప్ప ఆలయానికి హోదా ఇచ్చేందుకు అనుకూలంగా ఓటు వేశాయి. అనంతరం యునెస్కో అధికారిక ప్రకటన చేసింది. ఏళ్లుగా చేస్తున్న కృషితో.. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు పంపింది. కానీ నిర్ణీత నమూనాలో డోజియర్ (దరఖాస్తు) రూపొందకపోవటంతో తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే లోపాలను సరిదిద్దుతూ మరో డోజియర్ను పంపారు. దాన్ని యునెస్కో పరిశీలనకు స్వీకరించింది. ప్రముఖ నర్తకి, యునెస్కో కన్సల్టెంట్గా ఉన్న చూడామణి నందగోపాల్ రెండు రోజుల పాటు రామప్ప ఆలయాన్ని పరిశీలించి.. శిల్పాలు, ఇతర ప్రత్యేకతలను అందులో పొందుపర్చారు. తర్వాత యునెస్కో అనుబంధ ‘ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మ్యాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐకొమాస్)’ ప్రతినిధి వాసు పోష్యానందన 2018లో రామప్ప ఆలయాన్ని సందర్శించారు. మూడు రోజులపాటు ఉండి.. ఆలయం ప్రత్యేకతలను, యునెస్కో గైడ్లైన్స్ ప్రకారం పరిస్థితులు ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించి.. యునెస్కోకు నివేదిక ఇచ్చారు. తర్వాత యునెస్కో ప్రధాన కార్యాలయం ఉన్న ప్యారిస్లో జరిగిన సదస్సుకు రాష్ట్రం నుంచి పురావస్తుశాఖ అధికారులు, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ప్రతినిధులు వెళ్లి.. మరిన్ని వివరాలు అందజేశారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కేలా చూడాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఆక్రమణలను చూసి బిత్తరపోవడంతో.. నిజానికి ప్రపంచ వారసత్వ హోదా కోసం ఉమ్మడి రాష్ట్రం సమయంలోనే చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్షాహీ సమాధులతో ప్రతిపాదన పంపారు. హైదరాబాద్కు వచ్చిన యునెస్కో ప్రతినిధి బృందం.. ఆ కట్టడాల చుట్టూ ఉన్న ఆక్రమణలు చూసి బిత్తరపోయి, ప్రతిపాదన సమయంలో తిరస్కరించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయాలను ఉమ్మడిగా ప్రతిపాదించింది. మళ్లీ సమస్య ఎదురైంది. వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట చుట్టూ భారీగా ఆక్రమణలు ఉండటం, సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో వాటిని కూడా తిరస్కరించింది. చివరగా ఆక్రమణల బెడద లేని రామప్ప దేవాలయాన్ని ప్రతిపాదించాలని అధికారులు నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ‘ద గ్లోరియస్ కాకతీయ టెంపుల్స్ అండ్ గేట్ వే’ పేరుతో ప్రతిపాదన పంపారు. ఇందులో ‘కేంద్ర పురావస్తు విభాగం (ఏఎస్ఐ)తోపాటు వరంగల్ కేంద్రంగా ఉన్న కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కీలకంగా వ్యవహరించింది. 2019లో యునెస్కో ప్రతినిధుల బృందం రామప్ప ఆలయాన్ని సందర్శించి పరిరక్షణకు కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఆలయం చుట్టూ బఫర్ జోన్ ఏర్పాటు చేసింది. సమీపంలోని ఆలయాలను రామప్ప పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రత్యేక అభివృద్ధి అథారిటీ, కమిటీలను నియమించింది. సౌకర్యాలు కల్పించాలి.. ప్రస్తుతం రామప్ప కట్టడం కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఏఎస్ఐ పరిధిలో ఉంది. కట్టడం పర్యవేక్షణ మాత్రమే దానిది. మిగతా వసతుల కల్పన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. రెండేళ్ల క్రితం యునెస్కో ప్రతినిధుల బృందం పరిశీలించి వెళ్లాక.. కేంద్రం రామప్పలో రూ.15 కోట్లతో పలు పనులు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏఎస్ఐ ఎనిమిది కట్టడాల బాధ్యత చూస్తోంది. కేంద్రం ఒక్కోదాని నిర్వహణకు ఏటా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఇస్తోంది. అయితే రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో ఏటా రూ.4 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన స్థాయిలో నిధులు ఇస్తే.. రామప్ప రూపురేఖలు మారుతాయి. పీవీ అప్పుడే ఆకాంక్షించారు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 55 ఏళ్ల కిందటే రామప్పకు ప్రపంచ గుర్తింపు గురించి ఆకాంక్షించారు. ఆలయంలోని అద్భుతాలను చూసి అబ్బురపడిన ఆయన తన భావాలకు ‘రామప్ప– ఏ సింఫనీ ఇన్ స్టోన్స్’ పేరుతో అక్షర రూపం ఇచ్చారు. ఆ నిర్మాణం ప్రపంచ ఖ్యాతి పొందగలిగినదని అందులో పేర్కొన్నారు. ఆ శిల్పాలు అద్భుతాలే.. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు 1213వ సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని కట్టించాడు. కాకతీయుల సామ్రాజ్యంలో ఎన్నో అద్భుత ఆలయాల నిర్మాణం జరిగినా రామప్ప ఎంతో ప్రత్యేకమైనది. ఆలయం నిర్మాణంలో ఎక్కువగా ఎర్ర ఇసుకరాయిని వినియోగించారు. కీలకమైన ద్వార బంధాలు, స్తంభాలు, పైకప్పు, మదనిక, నాగనిక శిల్పాలు, నంది విగ్రహం, గర్భాలయంలోని శివలింగాలకు మాత్రం అత్యంత కఠినమైన బ్లాక్ డోలరైట్ (నల్లశానపు) రాయిని వాడారు. ►సాధారణంగా పునాదులపై నేరుగా ప్రధాన ఆలయ భాగం ఉంటుంది. కానీ రామప్పలో దాదాపు ఆరడుగుల ఎత్తుతో నక్షత్రాకారపు ఉపపీఠం (ప్రదక్షిణ పథం) ఏర్పాటు చేసి.. దాని మీద ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. ►వాన నీళ్లు ఐదారు అడుగుల దూరం పడేలా పైకప్పులో ప్రత్యేకంగా రాతిచూరు ఏర్పాటు చేశారు. దాని అంచుల్లో ఉన్న ప్రత్యేక నగిషీల మీదుగా వాన నీళ్లు దూరంగా పడతాయి. ►నాట్య గణపతి, ఆయుధాలు ధరించిన యోధులు, భటులు, భైరవుడు, వేణుగోపాలస్వామి, మల్లయుద్ధ దృశ్యాలు, నాట్యగత్తెలు, వాయిద్యకారులు, నాగిని, సూర్య, శృంగార శిల్పాలు ఎన్నో ఉన్నాయి. ఇది హిందూ ఆలయమే అయినా ప్రవేశ ద్వారం, రంగమండపం అరుగు తదితర చోట్ల జైన తీర్థంకరులు, బౌద్ధమూర్తుల చిత్రాలు ఉండటం గమనార్హం. ►ఇక్కడ నంది కోసం ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. ►గర్భాలయ ప్రవేశానికి పక్కనే గోడకు చెక్కిన వేణుగోపాలస్వామి విగ్రహాన్ని సున్నితంగా మీటితే సప్తస్వరాలు వినిపిస్తాయి. ►భారీ గండ శిలల శిల్పాలు, నగిషీలను వాడినందున మరింత బరువు పడకూడదని.. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా నీటిపై తేలే ఇటుకలను శిఖర నిర్మాణంలో వాడారు. బంకమట్టి, తుమ్మ చెక్క, కరక్కాయ తొక్కలు, వట్టివేళ్లు, ఊక తదితరాల మిశ్రమాన్ని పోతపోసి కాల్చి ఈ ఇటుకలను తయారు చేశారు. కప్పు వరకు రాతితో నిర్మించి మూడంతస్తుల శిఖరాన్ని ఇటుకలతో కట్టారు. అద్దంలాంటి నునుపుతో.. ఆలయంలో భారీ రాతి స్తంభాలు, మదనిక–నాగనిక శిల్పాలు అద్దం వంటి నునుపుతో ఉంటాయి. ఎలాంటి యంత్రాలు లేని ఆ కాలంలో రాళ్లను అద్దాల్లా చెక్కడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా రంగమండపం మధ్యనున్న నాలుగు స్తంభాలు, దూలాలు, కప్పు రాళ్లలో అద్దం చూసినట్టుగా మన ప్రతిబింబం కనిపిస్తుంది. ►ఇక్కడి ఆగ్నేయ స్తంభంపై అశ్వపాదం, నాట్యగణపతి, శృంగార భంగిమలో ఉన్న దంపతులు, సైనికుడు అతని భార్య, నాట్యగత్తెల చిత్రాలున్నాయి. నైరుతి స్తంభంపై నాట్యగత్తెలు, రతీ మన్మథ, సాగరమథనం దృశ్యాలు, వాయవ్య స్తంభంపై గోపికా వస్త్రాపహరణం, నాటగాళ్లు, ఈశాన్య స్తంభంపై నగిషీలు కనిపిస్తాయి. ►దూలాలపై శివ కల్యాణసుందరమూర్తి, బ్రహ్మవిష్ణువుల మధ్య నటరాజు, ఏకాదశ రుద్రులు, త్రిపుర సంహారమూర్తి, నందీశ్వర, బ్రహ్మ, విష్ణు దిక్పాలకులు, సప్త రుషులు, గజాసురసంహారమూర్తి, అమృత కలశానికి అటూ ఇటూ దేవతామూర్తులు వంటి చిత్రాలు ఉన్నాయి. ►ఆలయ గోడలపై ఓ శిల్పం విదేశీ వస్త్రధారణతో చిత్రంగా కనిపిస్తుంది. ఆ కాలంలో వచ్చిన విదేశీ పర్యాటకుల వేషధారణ ఆధారంగా ఆ శిల్పాన్ని చెక్కారన్న అభిప్రాయం ఉంది. హైహీల్స్ను పోలిన చెప్పులు ధరించిన ఓ యువతి శిల్పం, తల వెంట్రుకలను మలిచిన తీరు, చెవులకు పెద్దసైజు దిద్దులు అబ్బురపరుస్తాయి. రామప్పకు ఎలా వెళ్లాలి? వరంగల్కు 77 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో రామప్ప ఆలయం ఉంది. దీనికి సమీపంలోని ప్రధాన విమానాశ్రయం హైదరాబాద్లోనిదే. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా రామప్పకు చేరుకోవచ్చు. రైలు మార్గంలో అయితే వరంగల్ నగరం శివార్లలో ఉన్న కాజీపేట జంక్షన్లో దిగాలి. అక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా రామప్పకు చేరుకోవచ్చు. బస్సుల ద్వారా అయితే.. వరంగల్ నగరంలోని హన్మకొండ బస్టాండ్కు చేరుకోవాలి. అక్కడ ములుగు వెళ్లే బస్సు ఎక్కి వెంకటాపురంలో దిగాలి. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో పాలంపేట (రామప్ప టెంపుల్ ప్రాంతం) ఉంటుంది. ఆటోలు, ప్రైవేటు వాహనాలలో వెళ్లొచ్చు. అభివృద్ధి పనులు షురూ.. రామప్పను ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక, శిల్పకళా వేదికగా మార్చేందుకు ఇప్పటికే పనులు చేపట్టారు. రూ.5 కోట్లతో ఆడిటోరియం, రెండు స్వాగత తోరణాలు కట్టారు. ఆలయం పక్కన చెరువు మధ్యలో ఉన్న ద్వీపంలో భారీ శివలింగం ఏర్పాటు కోసం నమూనాలను సిద్ధం చేశారు. 10 ఎకరాల స్థలంలో శిల్ప కళావేదిక, శిల్పుల కోసం, శిల్పకళా అధ్యయనం కోసం కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. తరలిరానున్న పర్యాటకులు రాష్ట్రంలో గొప్ప చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, కట్టడాలున్నా తగిన ప్రచారం, వసతులు లేక దేశ, విదేశీ పర్యాటకులు పెద్దగా రావడం లేదు. అదే పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, కేరళలకు పోటెత్తుతున్నారు. తాజాగా రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా రావడంతో పర్యాటకపరంగా ఎంతో ప్రాధాన్యత సమకూరనుంది. వందల ఏళ్లనాటి ఆలయాన్ని పరిరక్షించడంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రామప్పకు సగటున నెలకు దేశీయ పర్యాటకులు 25 వేల మంది, విదేశీయులు 20 మంది మాత్రమే వస్తున్నారు. ఇకపై లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. దివ్యంగా ఉంది. ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు అభినందనలు. కాకతీయ రాజవంశ విశిష్ట శిల్పకళా వైభవం రామప్ప ఆలయంలో కళ్లకు కడుతోంది. ఆ దేవాలయ సముదాయాన్ని అందరూ సందర్శించాలని, ఆలయ మహత్మ్యం తెలుసుకొని స్వయంగా అనుభూతి పొందాలని కోరుతున్నా. – ప్రధాని మోదీ కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించడానికి మద్దతిచ్చిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనది. తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. – సీఎం కేసీఆర్ గొప్ప వారసత్వానికి గొప్ప గుర్తింపు 13వ శతాబ్దపు కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించబడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది తెలంగాణ గొప్ప వారసత్వానికి గొప్ప గుర్తింపు. దీనిపై తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నా. – ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు టీమ్ ఇండియాకు అభినందనలు భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలకు, శిల్ప కళా చాతుర్యానికి రామప్ప ఆలయం ఓ చక్కని ఉదాహరణ. టీమ్ ఇండియాకు అభినందనలు. – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంతోషకరమైన వార్త రామప్ప ఆలయానికి వారసత్వ హోదా దక్కడం గొప్ప వార్త. ఇది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. –కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో ఆనందంగా ఉంది రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇవ్వడం ఎంతో ఆనందం కలిగించింది. దీనికి మార్గదర్శనం, మద్దతు ఇచ్చిన ప్రధాని మోదీకి దేశం తరఫున, ముఖ్యంగా తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో విదేశాంగ శాఖ, భారత పురావస్తు శాఖ చేసిన కృషిని అభినందిస్తున్నా. – ట్విట్టర్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రామప్ప తర్వాతి లక్ష్యం హైదరాబాద్ నగరమే ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో 800 ఏళ్ల చరిత్ర కలిగిన రామప్ప దేవాలయాన్ని చేర్చడం సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు లభించడంలో పాలుపంచుకున్న అందరికీ అభినందనలు. తెలంగాణ నుంచి రామప్ప తొలి వారసత్వ కట్టడంగా గుర్తింపు సాధించింది. తర్వాత హైదరాబాద్ నగరానికి ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. –ట్విట్టర్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చరిత్రలో చిరస్థాయిగా.. తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజిది. ఈ గుర్తింపుతో ‘రామప్ప’ కట్టడం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించడం సంతోషకరం. – శ్రీనివాస్గౌడ్, ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి చాలా సంతోషం.. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో సంతోషంగా ఉంది. ఇది తెలంగాణకే గర్వకారణం. ఈ గుర్తింపు రావడానికి కృషిచేసిన సీఎం కేసీఆర్ సహా అందరికీ ధన్యవాదాలు. – పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ మా కృషి ఫలించింది రామప్పకు ప్రతిష్టాత్మక గుర్తింపు రావటంతో ఆనందంగా ఉంది. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషిలో మా ట్రస్టు కీలకపాత్ర పోషించింది. పర్యాటకపరంగా రామప్ప ప్రాంత రూపురేఖలు మారతాయి. – పాపారావు, కాకతీయ హెరిటేజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement