breaking news
womens bank
-
‘మెగా ఎస్బీఐ’కి లైన్ క్లియర్..!
• ఐదు అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర కేబినెట్ ఓకే • భారతీయ మహిళా బ్యాంకుపై వెలువడని నిర్ణయం న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగంలో స్థిరీకరణ దిశగా మరో కీలక అడుగు పడింది. ఐదు అనుబంధ బ్యాంకులను తనలో విలీనం చేసుకునేందుకు ఎస్బీఐకి కేంద్ర కేబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకు ఎస్బీఐలో విలీనానికి కేంద్ర ప్రభుత్వం గతంలో సూత్రప్రాయ ఆమోదం మాత్రమే తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ తుది అనుమతి మంజూరు చేసింది. అయితే, భారతీయ మహిళా బ్యాంకు విలీనం విషయంలో ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు. ‘‘విలీన ప్రణాళికకు గతంలో కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం మాత్రమే తెలిపింది. ఆ తర్వాత ఎస్బీఐలో విలీనానికి అనుబంధ బ్యాంకుల బోర్డులు ఆమోదముద్ర వేశాయి. బోర్డుల సిఫారసులను పరిశీలించిన అనంతరం విలీన ప్రతిపాదనకు ఆమోదం తెలియజేశాం’’ అని కేబినెట్ భేటీ అనంతరం మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. విలీనం అనంతరం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా అతిపెద్ద బ్యాంకు అవతరిస్తుందన్నారు. విలీనం వల్ల సమర్థత గణనీయంగా పెరుగుతుందని, ఈ బ్యాంకుల మధ్య నిర్వహణ పరమైన వ్యయాలు తగ్గుతాయని జైట్లీ చెప్పారు. విలీనంతో ఏ ఉద్యోగికీ ముప్పు ఏర్పడదని స్పష్టం చేశారు. భారతీయ మహిళా బ్యాంకు విలీనంపై సమావేశంలో నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కాగా, ఎస్బీఐకి లోగడ అనుబంధ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్లను సైతం విలీనం చేసుకున్న అనుభవం ఉంది. రూ.1,000 కోట్లు ఆదా కాగా, విలీనం వల్ల తొలి ఏడాదిలోనే రూ.1,000 కోట్ల మేర ఆదా ఆవుతాయని అధికారిక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. అనుబంధ బ్యాంకుల విలీనానికి అనుమతి ఇచ్చినందున ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల చట్టం–1959, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ చట్టం–1956లను రద్దు చేసేందుకు వీలుగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విలీనం ప్రభుత్వరంగ బ్యాంకుల స్థిరీకరణ ద్వారా బ్యాంకింగ్ రంగం బలోపేతానికి కీలక అడుగుగా పేర్కొంది. విలీనం అయ్యే బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎస్బీఐలో విలీనం అవుతాయి. విలీనం అనంతరం 22,500 శాఖలు, 58,000 ఏటీఎంలు, రూ.37 లక్షల కోట్ల విలువైన ఆస్తులతో ఎస్బీఐ భారీ స్థాయి బ్యాంకుగా మారుతుంది. ఎస్బీఐ బోర్డు గతంలో ఆమోదించిన విలీన ప్రణాళిక ప్రకారం... స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ వాటాదారులు తమ వద్దనున్న ప్రతీ 10 షేర్ల (రూ.10 ముఖ విలువ)కు 28 ఎస్బీఐ షేర్లు (రూ.1 ముఖ విలువ) పొందుతారు. అలాగే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ వాటాదారులు తమ వద్దనున్న ప్రతీ 10 షేర్లకు గాను 22 ఎస్బీఐ షేర్లు పొందుతారు. ఇక, ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రెండింటిలోనూ నూరు శాతం వాటా ఎస్బీఐ చేతుల్లోనే ఉంది. -
బుక్కాపురంలో మహిళా బ్యాంక్
వెల్దుర్తి రూరల్ : మండల పరిధిలోని బుక్కాపురంలో గురువారం మహిళా బ్యాంక్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్) గౌరవ సలహాదారురాలు విజయభారతి, గ్రామాన్ని దత్తత తీసుకున్న ఢిల్లీ ఇంటర్ గ్లోబ్ ఫౌండేషన్ నిర్వాహకులు రోహిణీ, నీలాంజన్లు పొదుపు మహిళలకు ప్రత్యేక కార్యాలయం, అందులో కుట్టుశిక్షణా కేంద్రం, కంప్యూటర్ సెంటర్ను ప్రారంభించారు. పొదుపు మహిళల డిపాజిట్లతో(20మంది ఒకొక్కరు రూ.5,200లు) మహిళాబ్యాంకును ఏర్పాటు చేశారు. గ్రామంలో వర్మీ కంపోస్ట్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం గ్రామ సచివాలయ ఆవరణలో స్వయం సహాయక మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. ఎంపీడీఓ అబ్దుల్ వహీద్, ఉపాధి ఏపీడీ పద్మావతి, ఏపీఓ లక్ష్మన్న, ఆర్డబ్లూ్యఎస్ ఏఈ ప్రవీష, సర్పంచ్ రాజమ్మ పాల్గొన్నారు. -
నవంబర్ నుంచి మహిళా బ్యాంక్ కార్యకలాపాలు
న్యూఢిల్లీ: భారత మహిళా బ్యాంక్ కార్యకలాపాలు ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పూర్తిగా మహిళల కోసమే ఉద్దేశించిన ఈ బ్యాంక్ తాజాగా 115 ఆఫీసర్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఈ నెల 30లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత, ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం కావలసిన అర్హతలు. ఈ ఏడాది అక్టోబర్ 15 కల్లా ఆరు చోట్ల బ్రాంచీలను ఏర్పాటు చేయాలని భారత మహిళా బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ఇండోర్, గువాహటిల్లో ఈ బ్రాంచీలను ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు బెంగళూరు, జైపూర్, లక్నో, మైసూర్లో కూడా బ్రాంచీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంక్ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడిని కేటాయించింది. మహిళల బ్యాంకింగ్ అవసరాలు తీర్చడం, ఆర్థిక సాధికారతకు తోడ్పడం లక్ష్యంగా భారత మహిళా బ్యాంక్ ఏర్పాటు చేశారు.