-
దాహం తీరనుంది..!
బొబ్బిలి: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రూ.261.02 కోట్ల ఏఐఐబీ(ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్) నిధులతో సమగ్ర తాగునీటి పథకాలను నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. మున్సిపాల్టీల సమీపాల్లో ఉన్న నదుల్లో ఇన్ఫిల్టర్ బావులను నిర్మించి అధునాతన తాగునీటి పథకాలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ పైప్లైన్ల నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖతో కలసి ప్రజారోగ్య శాఖ సంయుక్త పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీలో కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. పరిపాలనామోదం పొందడంతో ఇక నిర్మాణాలే మిగిలాయి. మొదలైన అధికారుల పరిశీలన తాగునీటి పథకాల నిర్మాణం కోసం మంజూరైన రూ.261 కోట్ల నిధులను రెండేసి ప్యాకేజీలుగా విభజించారు. పార్వతీపురం మున్సిపాలిటీకి రూ.63.63 కోట్లు, బొబ్బిలికి రూ.93.62 కోట్లు, సాలూరుకు రూ.68.98 కోట్లు, నెల్లిమర్ల నగర పంచాయతీకి రూ.34.97 కోట్లు కేటాయించారు ఈ నిధులను రెండు ఫేజ్లుగా విభజించారు. జిల్లాలోని పట్టణ సమగ్ర తాగునీటి పథకాల నిర్మాణం కోసం మెయిన్ పైప్లైన్లు, డిస్ట్రిబ్యూటరీ లైన్లను నిర్మించాల్సి ఉంది. వీటిని మున్సిపాలిటీల్లోని ప్రధాన రోడ్ల వెంబడి నిర్మిస్తారు. ఇందుకోసం ఆర్అండ్బీ రోడ్లను దాదాపు నాలుగు మీటర్ల వెడల్పుతో తవ్వాల్సి ఉంది. వీటిని తవ్వాలంటే ఆ శాఖ అనుమతులు తప్పనిసరి! ఇందుకోసం జిల్లాలోని మున్సిపాలిటీల్లో అధికారులు సంయుక్తంగా పరిశీలనలు చేపడుతున్నారు. బొబ్బిలి పరిశీలనలో ఆర్అండ్బీ ఈఈ కె.చంద్రన్, ప్రజారోగ్య ఈఈ ఎ.కృష్ణారావు, ఆర్అండ్బీ ఏఈ ఐ.వి.ఎస్.జగన్నాతరావు, మున్సిపల్ డీఈఈ రమేష్, ఏఈ షమీమ్, ఇతర సిబ్బంది పైపుల కోసం తవ్వాల్సిన రోడ్లను పరీశీలించారు. రెండు ఫేజుల్లో మంజూరు ఇలా... పట్టణ సమగ్ర తాగునీటి పథకాల నిర్మాణంలో భాగంగా మంజూరైన రూ.261 కోట్లను రెండు ఫేజులుగా విభజించారు. ఇందులో పార్వతీపురం మున్సిపాలిటీకి మొదటి విడత రూ. 31.19 కోట్లు, రెండో విడత రూ.32.44 కోట్లు, బొబ్బిలికి రూ,55.06 కోట్లు, రెండో విడత రూ.38.02 కోట్లు, సాలూరుకు మొదటి విడత రూ.44.54కోట్లు, రెండో విడత రూ.24.44 కోట్లు, నెల్లిమర్ల నగర పంచాయతీకి మొదటి విడత రూ.17.64 కోట్లు, రెండో విడత రూ.17.33 కోట్లు మంజూరు చేస్తున్నారు. రెండో ఫేజ్ టెండర్ల ప్రక్రియ ముగియగా మొదటి ఫేజ్ పెండింగ్లో ఉంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం నిధులు మంజూరైన సమగ్ర తాగునీటి పథకాలకు సంబంధించి మొదటి, రెండో ఫేజుల్లో నిధులు మంజూరయ్యాయి. వీటిలో కొన్ని టెండర్ల దశకు చేరుకున్నాయి. అవి పూర్తవ్వగానే పనులు ప్రారంభిస్తాం. – ఎ.కృష్ణారావు, ఈఈ, ప్రజారోగ్య శాఖ, విజయనగరం -
‘జల’గాటం!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సాగునీరు..రైతులకు ఎంతో విలువైనది. ఇటు ఖరీఫ్, అటు రబీ సీజన్లలో పంటలు చేతికొచ్చే దశలో నీరందకుంటే కర్షకుడి పరిస్థితి తలకిందులే. ఇలాంటి కష్టం నుంచి గట్టెక్కించేందుకు, రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో భూగర్భ జలాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు జలనిధి పథకంపై కనీస ప్రచారం లేకపోవడంతో ఎవరికీ తెలియని దుస్థితి నెలకొంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతు జలనిధి (ఫారంపాండ్లు) నిర్మించాలనేది అసలు ఉద్దేశం. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాలోని ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ..అసలు పనులే చేపట్టకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 2,17,584 రైతు జలనిధి (ఫారంపాండ్లు)మంజూరయ్యాయి. ఇందుకోసం రూ.85.23కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు కేవలం 47,109 ఫారంపాండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందుకోసం రూ.32.34 కోట్లు ఖర్చు పెట్టారు. జిల్లాలో రైతులు ఫారంపాండ్లు నిర్మించుకునేందుకు అంగీకారం తెలిపితే చాలు..నిధులు మంజూరు చేసేందుకు, అన్ని ప్రాంతాల్లో వీటి నిర్మాణాలు చేపట్టేందుకు నిధుల కొరత లేదు. కానీ..ప్రచారమే కరువైంది. రైతు జలనిధి అంటే.. వర్షాకాలంలో కురిసిన నీటిని నిల్వ చేసుకునేందుకు, తద్వారా భూగర్భ జలాలు పెంచుకునేందుకు ఫారంపాండ్లు నిర్మించుకునేందుకు ఈ రైతు జలనిధి పథకాన్ని చేపట్టారు. ప్రస్తుతం వ్యవసాయ భూముల్లో పడ్డ వాననీరంతా వృథాగా సమీప కుంటలు, చెరువుల్లో కలుస్తోంది. సారవంతమైన మట్టి కూడా కొట్టుకుపోతోంది. రైతు పొలంలో పడ్డ వర్షపు నీటిని పొదుపు చేసుకుని, పంట అత్యవసర సమయాల్లో తడులు కట్టుకునేందుకు ఈ రైతుజలనిధి (ఫారంపాండ్) ఎంతో ఉపయోగపడుతుంది. రైతు పొలం, పై ప్రాంతాల్లో పడిన వర్షపునీరు ఏవైపు నుంచి ప్రవహించి బయటకు వెళుతుందో..పల్లపు ప్రాంతాన్ని గుర్తించి అక్కడ జలనిధిని కుంటను నిర్మించుకోవాలి. నీటిని ఎక్కువకాలం నిల్వ చేసుకునే ఉద్దేశం ఉంటే మొత్తం ఫారంపాండ్ అడుగుభాగం నుంచి అంచుల వరకు పాలిథిన్ లేదా ప్లాస్టిక్ షీట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. నీరు ఇంకి పోకుండా కొన్ని నెలలపాటు నిల్వ ఉంటుంది. తద్వారా భూమిలో తేమశాతం పెరుగుతుంది. చుట్టుపక్కల బోర్లు, బావుల్లో నీటి లభ్యత అధికమవుతుంది. అత్యవసర సమయాల్లో నీటిని విద్యుత్ మోటార్లతోకానీ, మనుషులతో కానీ పంటకు తడి అందించొచ్చు. ఫారంపాండ్ నిర్మించుకోవడానికి రైతులు ఉపాధిహమీ జాబ్కార్డు వివరాలతో ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా ఉపాధిహామీ పథకం ఏపీఓ, ఎంపీడీఓను సంప్రదించవచ్చు. జలనిధిలో రకాలు.. ► ఉపాధి హామీ పథకంలో నాలుగు రకాల సైజుల్లో జలనిధి కుంటలను తవ్వుకోవచ్చు. ► అందుకు అవసరమైన ఖర్చు మొత్తం ఉపాధి హామీ పథకం నుంచి చెల్లిస్తారు. ► రెండు కుంటల భూమిలో నిర్మించుకునేందుకు రూ.50,588 చెల్లిస్తారు. 1.28లక్షల లీటర్ల వర్షపు నీటిని నిల్వ చేసుకోవచ్చు. ► కుంటన్నర భూమిలో నిర్మించుకునేందుకు రూ.32,594 చెల్లిస్తారు. 50వేల లీటర్ల నీరు నిల్వ ఉంటుంది. ► కుంట భూమిలో నిర్మాణానికి రూ.23,106 చెల్లిస్తారు. 16వేల లీటర్ల వర్షపు నీరు నిలుస్తుంది. ► అర కుంట భూమికి రూ.14,926 చెల్లిస్తారు. 8వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఫారంపాండ్ను నిర్మిస్తారు. -
సప్లిమెంట్ మాయాజాలం!
► తాగునీటి పథకాల టెండర్లులో భారీ గోల్మాల్ ► రూ.27లక్షల టెండర్కు రూ.65లక్షల అదనం ► ఆ మేరకే బిల్లులు చెల్లింపులు ► ఎస్ఈ కార్యాలయం నుంచే దిశానిర్దేశం ► బినామీ కాంట్రాక్టర్తో పనులు చేయిస్తున్న ఈఈ, ఉన్నతాధికారి పీఏ తాగునీటి ఇక్కట్లు సత్వరమే తీర్చాలనే తలంపు లేకపోగా, నిధులను దండుకోవాలనే దిశగా ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగం పనిచేస్తోంది. టెండర్ల కంటే రెండురెట్లు అధికంగా సంప్లిమెంట్ అగ్రిమెంటు ద్వారా పనులు అప్పగించి బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రపంచబ్యాంకు నిధులు సైతం క్లాస్4 కాంట్రాక్టర్కు కేటాయిస్తూ బినామీ కాంట్రాక్టర్ను ప్రోత్సహిస్తున్నారు. ఉన్నతా«ధికారి కార్యాలయం నుంచే దిశానిర్దేశం చేస్తూ కిందిస్థాయి యంత్రాంగంపై హుకుం ప్రదర్శిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: సీపీడబ్ల్యూ స్కీమ్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ నుంచి పనులు పూర్తయ్యే వరకూ ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తోంది. కేటాయించిన దాని కంటే కేవలం 10 శాతం అదనంగా సప్లిమెంటు అగ్రిమెంటు ద్వారా పనులు అప్పగించాల్సి ఉండగా, టెండర్ కంటే రెండు నుంచి రెండున్నర్ర రెట్లు అధికంగా పెంచి అప్పగిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా యోగివేమన సీపీడబ్ల్యూ స్కీం చెప్పవచ్చు. పెండ్లిమర్రి, వల్లూరు మండలాల్లోని గ్రామాలతోపాటు వైవీయూకు నీటి పథకాన్ని రూ.27 లక్షలతో చేపట్టారు. ఆమేరకు టెండర్లు నిర్వహించి పనులు అప్పగించారు. కాగా అవే పనులకు సప్లిమెంట్ అగ్రిమెంటు కింద రూ.64.5 లక్షలు కలిపారు. అంటే ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా అదనంగా రూ.64.5లక్షల పనిని సదరు కాంట్రాక్టర్కు అప్పగించారు. సప్లిమెంట్ అగ్రిమెంట్లో కేబుల్ వైరు దాదాపు రూ.50 లక్షల విలువైనది వేయాల్సి ఉంది. వాస్తవానికి టెండర్ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరిధిలో 5 శాతం, ఎస్ఈ పరధిలో 10 శాతం, సీఈ పరిధిలో 15 శాతం పనులు మాత్రమే అప్పగించే అర్హత ఉంది. ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.27లక్షల పనికి రూ.64.5 లక్షల సప్లిమెంట్ అగ్రిమెంట్ అప్పగించడం నిబంధనలకు పూర్తి విరుద్ధమని పలువురు వివరిస్తున్నారు. ఎస్టిమేట్ నిర్వహించిన ఇంజనీరింగ్ అధికారులు ముందస్తుగా టెండరు ప్రక్రియలో చోటుచేసుకున్న విధంగా కాకుండా అనువైన రీతిలో సప్లిమెంట్ అగ్రిమెంట్ పుట్టించడం వెనుక ఎస్ఈ కార్యాలయం కీలక భూమిక పోషిస్తున్నట్లు సమాచారం. అధికారుల భాగస్వామితో బినామీ కాంట్రాక్టర్: ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయ అధికారుల భాగస్వామ్యంతో బినామీ కాంట్రాక్టర్కు పనులు అప్పగించి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈక్రమంలో నిబంధనలను తొక్కిపెడుతున్నట్లు సమాచారం. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే పనులకు నిర్వహణ చేసే కాంట్రాక్టర్కు క్రిమినల్ కేసులు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా క్లాస్–4 కాంట్రాక్టర్కు లక్కిరెడ్డిపల్లెలో రూ.2కోట్ల పనులు అప్పగించినట్లు సమాచారం. ఎస్ఈ కార్యాలయం అధికారులకు అతను భాగస్వామి కావడంతో నిబంధనలకు విరుద్ధంగా పనులు అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు పలు టెండర్లలో ఎస్ఎస్ఆర్ రేట్లు కంటే అధికంగా బిల్లులు చెల్లిస్తున్నట్లు సమాచారం. చేసిన పనులకు సైతం సత్వరమే బిల్లులు చెల్లించకుండా దాదాపు ఏడాది తర్వాత చేయని పనులకు సైతం రికార్డులు పొందుపరుస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈక్రమంలో ఏఈ, డిఈ స్థాయి అధికారులు అడ్డంకిగా మారితే ఎస్ఈ కార్యాలయం నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ఉంటున్నాయి. అందులోభాగంగా పలువురు ఏఈలను పరుషపదజాలంతో ఇబ్బందిపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో దాదాపు రూ.6 కోట్ల పనులు బినామీ కాంట్రాక్టర్ ద్వారా చేపట్టినట్లు సమాచారం. ఆ పనులన్నింటిలో ప్రధానంగా టెండర్ ప్రక్రియ ఒకలా ఉంటే సప్లిమెంట్ అగ్రిమెంట్ జోడిస్తూ నిధులు దండుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండడం విశేషం. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సంజీవరావును వివరణ కోరగా సప్లిమెంట్ అగ్రిమెంటు విషయమై తనకు అవగాహన లేదని, పరిశీలించాల్సి ఉందని వివరించారు. ప్రపంచ బ్యాంకు నిధుల పనులు కూడా పరిశీలించనున్నట్లు వివరించనున్నారు. -
ఏం ఒరగబెట్టారని వస్తున్నారు బాబూ
- నియోజకవర్గంలో సాగు, తాగు నీటిపై స్పష్టమైన హామీ ఇవ్వాలి - లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం - వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి అనంతపురం : శింగనమల నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారని ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారో చంద్రబాబు చెప్పాలని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఈనెల 6న బుక్కరాయసముద్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ ఏ మేరకు చేశారో చంద్రబాబే చెప్పాలన్నారు. రుణమాఫీ చేసిన సొమ్ము వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. రూ. 2–3 వడ్డీకి తెచ్చుకుని బ్యాంకుల్లో రెన్యూవల్ చేసుకున్నారన్నారు. కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పంటల పెట్టుబడులకు ప్రైవేటుగా అప్పులు చేశారన్నారు. వీటిపై నియోజకవర్గంలోని ఆరు మండలాల రైతులకు ఏం సమాధానం చెబుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా రుణాలు ఎవరూ కట్టొద్దని అన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ఓట్లేస్తే.. ఈరోజు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని మహిళలు వాపోతున్నారన్నారు. మోసపోయిన మహిళలకుS ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారు బయటకు రావాలంటూ బాబు అధికారంలోకి రావాలంటూ ప్రచారాలు చేశారని, ఈరోజు ఒక్క మహిళ బంగారు కూడా విడిపించలేదన్నారు. చివరకు బ్యాంకుల నుంచి వేలం నోటీసులు వచ్చాయన్నారు. ఆ మహిళలకు ఏం సమాధానం చెబుతారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. జాబు కావాలంటే బాబు రావాలని ఊదరగొట్టారని, కానీ రెండేళ్లు దాటినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. శింగనమల నియోజకవర్గంలో వేలాదిమంది ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వారికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వీటికితోడు నియోజకవర్గంలో తాగు, సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ఈ సమస్య తీర్చలేని చంద్రబాబు నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. ఆయకట్టుకు సంబంధించి రెండేళ్లుగా చుక్క నీరు రాకపోవడంతో రైతులు తమ భూములన్నీ బీళ్లు పెట్టారన్నారు. వెనుకబడిన అనంత జిల్లాకు కేంద్రం మంజూరు చేసిన రూ. 50 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ, జిల్లా ప్రజల సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ముఖ్యమత్రి పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గువ్వల శ్రీకాంత్రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్, పుట్లూరు మండల కన్వీనర్ రాఘవరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకటరామిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి బాబాసలాం తదితరులు పాల్గొన్నారు. -
ఎడారిలా..
తడి ఆరిన రక్షిత నీటి పథకాలు పడకేసిన మంచినీటి పథకాలు వెంటాడుతున్న నిధుల కొరత కనీస మరమ్మతులకు నోచుకోని వైనం ఎండిపోతున్న చెరువులు, బావులు పాలకుల వైఫల్యంపై గ్రామస్తుల ధ్వజం నిధుల లేమి.. అధికారుల నిర్లక్ష్యం.. వెరసి గ్రామీణులకు గుక్కెడు నీరందని దౌర్భాగ్య పరిస్థితి జిల్లాలో నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల సామూహిక రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) పడకేశాయి. ఇందులోని మోటార్లు మరమ్మతులకు గురైనా పట్టించుకునే నాథుడే లేడు. తాగునీటిని సరఫరా చేసే పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడినా కనీస మరమ్మతులు చేయలేని పరిస్థితి. ఫలితంగా వేసవికి ముందే జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. విజయవాడ : జిల్లాలో 374 తాగునీటి చెరువులు ఉన్నాయి. వర్షాభావం, కాలువలకు నీటి విడుదలలో జాప్యం కారణంగా అడుగంటాయి. సామూహిక రక్షిత మంచినీటి పథకాల ద్వారా బిందెడు నీరు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందని దుస్థితి నెలకొంది. ఈ చెరువుల ఆధారంగానే రక్షిత నీటి పథకాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ఉప్పునీరే దిక్కవుతోంది. ఈ నీరు తాగడం వల్ల రకరకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. నిధుల కొరత గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు జిల్లా పరిషత్కు జమ అయ్యేవి. ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పలువురు సర్పంచులు సామూహిక రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు ఆలోచిస్తుండడంతో గ్రామీణ నీటి సరఫరా శాఖను నిధుల కొరత వేధిస్తోంది. దీనికితోడు జెడ్పీ పాలకవర్గ సభ్యులు తాగునీటి సరఫరాలో నిధులకు సంబంధించి పొదుపును పాటిస్తుండడంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్ బిల్లుల భారం, మోటార్ల కొనుగోలు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని వివిధ సామూహిక రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. జిల్లాలోని 717 గ్రామాలకు సీపీడబ్ల్యు పథకాల ద్వారా తాగునీరు అందించేందుకు ఏడాదికి రూ. 15.84 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నా తాగునీటి కొరత తీరడం లేదు. కంచికచర్ల మండలంలోని 42 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు కృష్ణానదిలో బత్తినపాడు తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. నదిలో నీరు లేకపోవడంతో నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. గన్నవరం నియోజకవర్గంలో ఏలూరు కాలువపై ఆధారపడి నడుస్తున్న రక్షిత నీటి పథకాల్లో అల్లాపురం, తెంపల్లి, బాపులపాడు, పెరికీడు ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నాయి. సాధారణంగా ఏలూరు కాలువ నుంచి నీటిని మోటార్ల ద్వారా ఈ ప్రాజెక్టులకు తరలించాల్సి ఉంది. అనంతరం ప్రాజెక్టులోని నీటిని ఫిల్టర్బెడ్ల ద్వారా శుద్ధిచేసి గ్రామాలకు సరఫరా చేస్తుంటారు. ఏడాది కాలంలో ఏలూరు కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయకపోవడంతో ఈ ప్రాజెక్టులకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల సుమారు 30 గ్రామాలకు నీటిని సరఫరా చేసే అల్లాపురం, తెంపల్లి ప్రాజెక్టులు నీరు లేక పూర్తిగా ఎండిపోయాయి. బాపులపాడు ప్రాజెక్టు నిర్మించి ఆరేళ్లయినా మరమ్మతుల కారణంగా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. పెరికీడు ప్రాజెక్టుకు నీటిని లిప్ట్ చేసే పైపులైన్లు రెండేళ్ల కిందట రోడ్డు విస్తరణలో పగిలిపోవడంతో మూలనపడింది. పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరులో 49 రక్షిత మంచినీటి పథకాలు, 17 డెరైక్ట్ పంపింగ్ స్కీములు ఉన్నాయి. 1.85 లక్షల జనాభాకు తాగునీటి అవసరాలు తీర్చటానికి కొత్తగా నాలుగు ట్యాంకులకు శంకుస్థాపనలు చేశారు. పనులు ప్రారంభానికి నోచలేదు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 45 రక్షిత మంచినీటి పథకాలుండగా వీటిలో ఆరు పథకాలు ఆర్డబ్ల్యుఎస్ నిర్వహణలో ఉన్నాయి. కోడూరు, నాగాయలంక మండలాల్లోని పది గ్రామ పంచాయితీలకు తాగునీరు అందించే కమ్మనమోల రక్షిత మంచినీటి చెరువు పూర్తిగా అడుగంటింది. ఇక్కడ రెండురోజులకొకసారి ఒకపూట మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగాయలంక మండలంలో ఎదురుమొండి రక్షితనీటి పథకం పూర్తిగా ఎండిపోయింది. జగ్గయ్యపేట మండలంలోని అనుమంచిపల్లిలో ఏర్పాటు చేసిన తాగునీటి పెలైట్ పథకం నిరుపయోగంగా మారింది. అనుమంచిపల్లి, తక్కెళ్లపాడు, గరికపాడు, రామచంద్రునిపేట గ్రామాలకు గత ఏడాది గ్రామీణ నీటి సరఫరా శాఖ రూ.2.10 కోట్ల నిధులతో పెలైట్ ప్రాజెక్టు ద్వారా పాలేటిలో బోరు వేసి నీరు అందించేందుకు చర్యలు చేపట్టింది. మైలవరం మండలంలో కృష్ణా జలాల పంపిణీకి పైలట్ ప్రాజెక్టు పనులు పూర్తయినా శివారు గ్రామాలకు పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరా కావడంలేదు. ఆయా గ్రామాల ప్రజలు బోరునీటినే తాగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు, కేతనకొండ, దాములూరు, చిలుకూరు, కాచవరం, కొటికలపూడి గ్రామాల్లో తాగునీటి సమస్య వుంది. ఈ గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ. 450కోట్లతో పైలట్ ప్రాజెక్ట్ల నిర్మాణం చేపట్టినా పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాట్రాయి మండలంలోని చిన్నంపేట, కోటపాడు, తుమ్మగూడెం, చనుబండ, చీపురుగూడెం, పోతనపల్లిలలో గ్రామాలలో బోర్లు ఎండిపోవడం వల్ల నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పామర్రు మండలం ఐనంపూడిలో తాగునీటికి వినియోగించే బావిలో నీరు అడుగంటడంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. ఎలకుర్రులో చెరువులు ఎండిపోవడంతో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అధికారులు అందజేస్తున్నారు. నెమ్మలూరు తాగునీటి చెరువులో నీరు అడుగంటడంతో కొద్దిపాటిగా ఉన్న నీటినే తాగునీరుగా వాడుకుంటున్నారు. జుఝవరంలో ఫిల్టర్ బెడ్లు లేకపోవడంతో చెరువు నుంచినేరుగా కలుషిత నీరే ఉపయోగించుకుంటున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement