breaking news
Visakhapatnam - Andaman
-
ప్రకృతి హితం.. మన అభిమతం
సాక్షి, అమరావతి: భావితరాలకు స్వచ్ఛమైన భూమి, గాలి, నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు చేపట్టే పర్యావరణ హిత కార్యక్రమాల్లోను భాగమవుతోంది. పర్యావరణ హితం.. తమ అభిమతం.. అని చాటుతోంది. ‘పుడమి సేవలో పరిశ్రమిస్తూ.. కాలుష్యాన్ని ప్రతిఘటిస్తూ.. పచ్చదనం పెంచుకుంటే.. ప్రకృతిని కాపాడుకుంటే.. మనిషికి అదే మనుగడ.. జీవకోటికదే తోడూ.. నీడ’ అంటూ ఈ ప్రయత్నంలో ‘భాగస్వామ్యం కండి’ అనే నినాదాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. సకల జీవులకు నిలయమైన ఈ భూమిని రక్షించే ఉమ్మడి కార్యాచరణలో మన దేశంతోపాటు మన రాష్ట్రం సైతం పాలుపంచుకుంటోంది. ఈ పవిత్రయజ్ఞంలో భాగంగా 2028నాటికి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం వ్యక్తిగత, సామూహిక చర్యలు తీసుకోవడానికి కనీసం ఒక బిలియన్ మంది భారతీయులు, ఇతర ప్రపంచ పౌరులను సమీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘మిషన్ లైఫ్’ ప్రాజెక్టులో ఏపీ భాగమవుతోంది. దీనిద్వారా రానున్న నాలుగేళ్లలో 80శాతం గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలను పర్యావరణ అనుకూలమైనవిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బృహత్తర యజ్ఞానికి విశాఖపట్నం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. జీవుల మనుగడకు అనుకూల చర్యలు ప్రకృతిలో ప్రతి ప్రాణి స్వేచ్ఛగా జీవించేందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా క్లైమేట్ చేంజ్ సెల్(ఈఈఈ)ను రూపొందించింది. ఈ సెల్ వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికతో సమానంగా పర్యావరణ వ్యవస్థ ఆధారిత అప్రోచ్(ఈబీఏ) ద్వారా రాష్ట్రంలో వాతావరణ మార్పుల సమస్యలను పరిష్కరిస్తుంది.ఇందులో ఆయా రంగాల నిపుణులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు, అర్బన్ డెవలప్మెంట్, రవాణా శాఖలతోపాటు పలు ప్రభుత్వ రంగ సంస్థలకు భాగస్వామ్యం కల్పించింది. భూమి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం కోసం మిషన్ లైఫ్ ఎనర్జీ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అడాప్షన్ ఆఫ్ సస్టెయినబుల్ ఫుడ్ సిస్టమ్స్, వేస్ట్ రిడక్షన్, హెల్తీ లైఫ్ స్టైల్స్, ఈ–వేస్ట్ తగ్గింపు అనే ఏడు విభాగాల్లో 75 కార్యక్రమాలను మన రాష్ట్రంలో అమలుచేస్తున్నారు. అదేవిధంగా కాలుష్యాన్ని తగ్గించడం కోసం స్థానికంగా లైఫ్ గ్రూపులను ఏర్పాటుచేశారు. సైకిల్ ర్యాలీలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లపై స్పెషల్ డ్రైవ్లు, సోషల్ మీడియాలో ప్రచారం, కమ్యూనిటీ వర్క్షాపులు, సెమినార్లు, క్విజ్ ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నారు. కాలుష్య కారక వాహనాలను అరికట్టడం కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లను చేపడుతున్నారు. పాఠశాలల్లో ఎనర్జీ క్లబ్ల ఏర్పాటు ద్వారా భూమి పరిరక్షణ ఆవశ్యకతపై చైతన్యం తీసుకువస్తున్నారు. విశాఖలో లైఫ్ మిషన్ అమలుపర్యావరణ హిత జీవనశైలిని అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించడమే లక్ష్యంగా మొదలైన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ పథకం అమలుకు రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతంలో ఉన్న విశాఖ నగరం అనుకూలమని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) గుర్తించింది. దేశవ్యాప్తంగా 2028 నాటికి 5.15 లక్షల గ్రామాలు, 3,700 పట్టణ స్థానిక సంస్థల్లోని కోటి మంది ప్రజలను ‘ప్రో ప్లానెట్ పీపుల్’గా మార్చాలనేది లైఫ్ మిషన్ లక్ష్యం. పుడమి, జీవ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ పథకాన్ని విశాఖలో అమలు చేయనున్నట్లు బీఈఈ ఇటీవల ప్రకటించింది. విశాఖతోపాటు విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి నగరాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు బీఈఈ వెల్లడించింది. లైఫ్ మిషన్ అమలుకు బీఈఈ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దశలవారీ కార్యాచరణ రూపొందిస్తోంది. -
నౌకాభారం
- విశాఖ-అండమాన్ నౌక టికెట్ ధరల పెంపు - కూలీలు, సామాన్య ప్రయాణికులపై భారం సాక్షి, విశాఖపట్నం: అండమాన్ నౌక టికెట్ ధరలు మళ్లీ పెరిగాయి. డీలక్స్ నుంచి ఫస్ట్క్లాస్ క్యాబిన్, సెకండ్ క్లాస్, బంక్.. ఇలా అన్ని విభాగాల్లోనూ పెంచారు. జలమార్గం ద్వారా అండమాన్కు వెళ్లాలనుకునే వారికి విశాఖ నుంచి నడిచే ఈ నౌకే ఏకైక ఆధారం. దీన్ని సాకుగా తీసుకుని అండమాన్ ప్రభుత్వం ఏటేటా ధరలు పెంచుకుంటూ పోతోంది, గతేడాది ఒక్కో విభాగానికి రూ.500 చొప్పున పెంచగా, ఈసారి గరిష్టంగా రూ.400 చొప్పున పెంచింది. మరోపక్క రాష్ట్రం నుంచి నడిపే ఈ నౌకలో అసలే మాత్రం కనీస సౌకర్యాలతోపాటు భద్రత ఉండడం లేదు. ఇవేవీ పట్టించుకోకుండా సామాన్య, పర్యాటక ప్రయాణికులపై అదే పనిగా భారం మోపుతుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలకోసారి నడిపే ఈ నౌకకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. విశాఖ నుంచి నికోబార్, నాన్కౌరీ, స్వరాజ్దీప్ అనే మూడు నౌకలను అండమాన్ ప్రభుత్వం నడుపుతుంది. ఒక్కో నౌకలో డీలక్స్, ఫస్ట్క్లాస్ క్యాబిన్, సెకండ్ క్లాస్ క్యాబిన్, బంక్ నాలుగు రకాల టికెట్లుంటాయి. ఒక్కోదానికి ఒక్కో రేటు. ప్రస్తుతం స్వరాజ్దీప్ నౌకలో డీలక్స్ క్యాబిన్ టికెట్ ధర రూ.8,420 కాగా రేటు పెంచిన తర్వాత రూ. 8,814కు చేరింది. ఫస్ట్క్లాస్ క్యాబిన్ ధర రూ.6,970 నుంచి రూ,7319, సెకండ్ క్లాస్ రూ.5,540 నుంచి రూ.5,817, కూలీలు అధికంగా ప్రయాణించే బంక్ ధర రూ.2150 నుంచి రూ.2,268 వరకు పెరిగింది. అండమాన్కు వెళ్లే నౌకలో అతి తక్కువ ధరైన బంక్ విభాగానికి కూలీల నుంచి అధిక డిమాండ్ ఉంటుంది. బంక్ విభాగం ధర పెంచవద్దని అదేపనిగా ప్రయాణికులు ఆందోళన చేస్తున్నా అండమాన్ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. అండమాన్లో ఏళ్లతరబడి స్థిరపడిన వాళ్లకు అక్కడి ప్రభుత్వం పౌరసత్వం ఉంది. వీళ్లల్లో తెలుగువాళ్లు చాలామందే ఉన్నారు. వీరితోపాటు అండమాన్ పౌరులు కూడా వివిధ పనుల పై విశాఖకు వస్తుంటారు. వీళ్లకు నౌక టికెట్లో సగానికిపైగా రాయితీ అమలవుతోంది. పెరిగిన ధరల ప్రకారం ప్రస్తుతం వీరికి డీలక్స్ టికెట్ రూ.4, 568, ఫస్ట్క్లాస్ క్యాబిన్ టిక్కెట్ రూ.3, 740 నుంచి రూ.4127, సెకండ్ క్లాస్ రూ.2,810 నుంచి రూ.3098, బంక్ రూ.750 నుంచి రూ.830కి పెరిగింది.