సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. రుతుపవనాల ముందస్తు రాకకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొంది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు.. అండమాన్ను తాకనున్నాయని.. ఈ నెలాఖరులోపే కేరళంలోకి రుతు పవనాలు ప్రవేశించనుందని వెల్లడించింది. మే 16, 17 తేదీల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలుపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలో నైరుతి రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది. సాధారణంగా నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు మే 15 నాటికి ప్రవేశిస్తాయి.. అలాగే మే 20 నాటికి అండమాన్ సముద్రం అంతటా విస్తరిస్తాయి. ఈ ఏడాది రుతుపవనాల రాక ఈ కాలక్రమానికి అనుగుణంగానే ఉండబోతోందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంపై రుతుపవనాల రాక దాదాపు షెడ్యూల్ ప్రకారమే ఉన్నట్లు కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు.
గతేడాది నైరుతి రుతుపవనాలు సాధారణ షెడ్యూల్ కంటే ముందే.. అంటే మే 13 నాటికే దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులకు చేరుకున్నాయి. వాతావరణ రికార్డుల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు మే 20 నాటికి అండమాన్ సముద్రాన్ని కవర్ చేసి.. జూన్ 1 నాటికి కేరళం తీరాన్ని తాకుతాయి. అయితే, 2026 నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని ఐఎండీ ముందస్తు అంచనాలు పేర్కొన్నాయి.


