breaking news
Verusanagakaya
-
బొట్టు.. బొట్టు.. మెట్ట భూముల్లో పచ్చని పంట చిగురించేట్టు!
మారుతున్న కాలానుగుణంగా.. వ్యవసాయ పద్ధతులలో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకు నిదర్శనంగా.. కొందరు రైతులు మైదానంలాంటి మెట్ట భూముల్లో కూడా పంటలు పండిస్తున్నారు. వర్షాకాలం వరకు ఎందుకు ఎదురుచూపులంటూ.. వారి వద్దనున్న నూతన టెక్నాలజీతో కూడిన పరికరాలను ఉపయోగించి పచ్చని పంటలు పండిస్తున్నారు. వారిని గురించి తెలుసుకుందాం. స్ప్రింక్లర్లతో సాగు చేస్తున్న కొత్తిమీర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మాడుగులపల్లి మండలంలోని సాగర్ ఆయకట్టేతర ప్రాంత రైతులు బిందు, తుంపర సేద్యంపై దృష్టి సారించారు. డ్రిప్పు, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకొని మెట్ట భూముల్లో పచ్చని పంటలు పండిస్తున్నారు. తీగజాతి కూరగాయలు, ఆకుకూరలు, వేరుశనగ తదితర పంటలను సాగు చేస్తున్నారు. మండలవ్యాప్తంగా 3 నుంచి 4 వేల ఎకరాల్లో వేరుశనగ, కొత్తమీర, దోస, ఇతర కూరగాయలు పండిస్తున్నట్లు మండల ఉద్యానశాఖ అధికారి అనంతరెడ్డి తెలిపారు. ప్రభుత్వం బిందు, తుంపర సేద్యం పరికరాలు సబ్సిడీపై అందిస్తే మరింత మంది రైతులు ప్రత్యామ్నాయ పంట సాగు చేసి ఆదాయం గడించే అవకాశం ఉంది. ఇవి చదవండి: ఈ సీసన్లో.. బెండసాగుతో అధిక దిగుబడులు! -
త్వరలో శనగ కొనుగోళ్లు ప్రారంభం
జైనథ్ : మండలకేంద్రంలోని మార్కెట్ యార్డులో త్వరలోనే శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని మార్క్ఫెడ్ డీఎం పుల్లయ్య, మార్కెటింగ్శాఖ ఏడీఎం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కొనుగోలు కేంద్రాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. వేసవికాలం దృష్ట్యా తాగునీరు, నీడకోసం చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన రైతులను న్యాయం జరిగేలా కూపన్లు జారీ చేసి తేదీల వారీగా కొనుగోలు చేపట్టాలన్నారు. దళారులకు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సర్సన్ లింగారెడ్డి, బేల ఎంపీపీ రఘుకుల్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ తల్లెల చంద్రయ్య, ఏఎంపీ వైఎస్ చైర్మన్ ఎల్టి భూమారెడ్డి, నాయకులు గంభీర్ టాక్రే, పూండ్రు వెంకట్రెడ్డి, తహసీల్దార్ బొల్లెం ప్రభాకర్, ఏఎంసీ కార్యరద్శి శ్రీకాంత్రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి వివేక్ పాల్గొన్నారు. -
పల్లి ధర పైపైకి..
- తెలంగాణలోనే ఖమ్మం మార్కెట్లో గరిష్టంగా రూ.5400కు కొనుగోలు - పంట ఉత్పత్తి తగిన స్థాయిలో లేకపోవటంతోనే పెరిగిన ధర - మద్దతు కన్నా రూ.1400 అధికం ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం వేరుశనగకాయ ధర రికార్డు స్థాయిలో పలికింది. క్వింటాలు వేరుశనగ ధర రూ.5400కు కొనుగోలు చేశారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఈ ధర అధికం. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో గత సోమవారం రూ.5,225 పలికింది. దానినే గరిష్ట ధరగా అనుకున్నారు. ఆ ధరకు మించి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ రేటు పలికింది. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, కేసముద్రం, జనగామ, సూర్యాపేట, తిరుమలగిరి, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లలో వేరుశనగకాయను కొనుగోలు చేస్తారు. రబీలో వేరుశనగ కాయను విస్తారంగా పండిస్తారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట సాగు బాగా తగ్గటంతో డిమాండ్ ఏర్పడుతోంది. సాగుతగ్గటం.. ధర పెరగటం.. జిల్లాలో రబీ వేరుశనగ సాధారణ విస్తీర్ణం 5,873 హెక్టార్లు కాగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 4,019 హెక్టార్లలో పంటను సాగు చేశారు. సాధారణం కన్నా సాగు విస్తీర్ణం తగ్గటం, పంట దిగుబడులు కూడా ఆశించిన మేరకు లేకపోవటంతో వేరుశనగకు డిమాండ్ పెరిగింది. వేరుశనగ కాయకు ఈ ఏడాది ప్రభుత్వం క్వింటాలుకు రూ.4,000 మద్దతు ధరగా ప్రకటించింది. దాదాపు నెల రోజులుగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా ఎక్కువ ధరకు వ్యాపారులు సరుకును కొనుగోలు చేస్తున్నారు. 10 రోజులుగా క్వింటాలుకు గరిష్టంగా రూ.5000 నుంచి రూ.5,200 వరకు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన రైతు ప్రసాద్ బుధవారం 10 బస్తాల వేరుశనగ కాయను అమ్మకానికి తెచ్చారు. కాయ నాణ్యంగా ఉండటంతో ఆ సరుకుకు తాటికొండ ఉపేందర్ అనే వ్యాపారి రూ.5400 ధర పెట్టాడు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కన్నా అదనంగా రూ.1400 ధర పలికింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం వేరుశనగ సాగుకు పెట్టింది పేరు. అక్కడ మార్కెట్లో ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తుంది. ఈ ఏడాది అక్కడ కూడా పంట ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవటంతో సరుకుకు డిమాండ్ పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పండిన పంట ఇప్పటికే చెన్నై ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఈ కారణంగానే వేరుశనగకు డిమాండ్ పెరుగుతందని వేరుశనగ వ్యాపారి నున్నా సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం మార్కెట్లో రైతు సరుకు కొనుగోలు చేయటం ఆనందంగా ఉందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎస్.వినోద్కుమార్, గ్రేడ్-2 కార్యదర్శి ఖాదర్బాబు, సూపర్వైజర్ డి.నిర్మల తెలిపారు.