breaking news
Treasure excavations
-
అదృష్టం తలుపు తడితే... దురదృష్టం దూసుకొచ్చింది..
ఉత్తరప్రదేశ్: అదృష్టం తలుపు తడితే... దురదృష్టం దూసుకు వచ్చిందంటే ఇదేనేమో..! ఉత్తరప్రదేశ్లో ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతున్న వ్యక్తికి ఏకంగా రూ. 25లక్షల విలువ చేసే ఆభరణాలు దొరికాయి. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనట్లు...నిధి దొరికిందని సంబరపడేలోపే విషయం కాస్త పోలీసుల దాకా వెళ్లడంతో సదరు వ్యక్తి నుంచి పోలీసులు ఆ నిధిని స్వాధీనం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. కాగా వందేళ్ల క్రితానికి చెందినవిగా భావిస్తున్న 650 గ్రాముల బంగారం, 4.53 కిలోల వెండి ఆభరణాలుగా గుర్తించారు. హార్డోయి ఎస్పీ అలోక్ ప్రియదర్శి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఆ వస్తువులకు పురావస్తు ప్రాముఖ్యత ఉన్నందున వాటిని సదరు వ్యక్తి నుంచి స్వాధీన పరుచుకున్నట్లు చెప్పారు. ఆభరణాలకు సంబంధించి ఎవరి వద్ద ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేవని నిర్ధారించారు. పరిసర ప్రాంతాల్లో ఈ విషయం వ్యాపించడంతో చాలా మంది ఆ నిధిని పొందడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆభరణాలను కనుగొన్న వ్యక్తి మొదట ఈ సంఘటనను గూర్చి చెప్పడానికి నిరాకరించినా, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో వాటి గురించి తెలియజేశాడు. ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్-1878, ప్రకారం తవ్వకాలలో బయటపడిన ఏవైనా ఆభరణాలు లేదా ఖరీదైన వస్తువులను చట్టబద్ధంగా ‘నిధి’ అని పిలుస్తారు. ఈ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం, ఆ నిధి దొరికిన వ్యక్తి రెవెన్యూ అధికారికి తెలియజేయాలి. విచారణ అనంతరం చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం, ఆ నిధి ఎవరికి సంబంధించింది కాదని పోలీసులు నిర్ధారిస్తే ఆ నిధిని కనుగొన్న వ్యక్తి వాటిని సొంతం చేసుకునే అవకాశం ఉంది. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
కలిగిరి (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ ముగ్గురు వ్యక్తులు గ్రామస్తులకు పట్టుబడ్డారు. వీర్నకల్లు గ్రామ చెరువులో మంగళవారం రాత్రి తవ్వకాలు జరుపుతున్న ముగ్గురు వ్యక్తుల్ని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా తాము మొత్తం ఏడుగురమని, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నామని వారు విచారణలో వెల్లడించారు. దీంతో మిగతా నలుగురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పట్టుబడిన వారిలో ఇదే మండలానికి చెందిన శ్రీరాములు, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
మంత్రాలయం (కర్నూలు) : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలో గుర్తుతెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. గ్రామంలోని తోట హనుమప్ప ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు విగ్రహాలను చిందరవందరగా పడేసి తవ్వకాలు చేశారు. తవ్వకాలు జరపడానికి ముందు పూజలు నిర్వహించినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. శనివారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.