breaking news
Trafficking case
-
బాలికల అక్రమ రవాణా కేసులో 33 మందికి శిక్ష
హైదరాబాద్: బాలికల అక్రమ రవాణా, వ్యభిచారంలోకి నెట్టడం, లైంగిక దోపిడీకి పాల్పడిన కేసులో 33 మంది నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ హైదరాబాద్ హకా భవన్లోని పోక్సో ప్రత్యేక సెషన్స్ కోర్టు (ఎఫ్టీఎస్సీ) బుధవారం తీర్పు వెలువరించింది. వీరిలో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. మరో 28 మందికి వివిధ కాలపరిమితులతో కఠిన కారాగార శిక్షలు విధించింది.సీఐడీ హైదరాబాద్ పోలీస్స్టేషన్లో 2015లో నమోదైన క్రైం నంబర్ 14/2015కు సంబంధించిన కేసులో విచారణ పూర్తయింది. మహిళల భద్రత విభాగం ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగిన ఈ కేసులో పోక్సో చట్టం, ఐపీసీ, ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి.ఉద్యోగం పేరుతో మోసం..2015 జులై 17న బాధితురాలు సీఐడీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఆమెకు పరిచయస్తుడైన వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అనంతరం ఆమెను ఏ1 నుంచి ఏ3 నిందితులకు పరిచయం చేసి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టడంతోపాటు పలువురితో లైంగికంగా సంబంధాలు పెట్టుకునేలా ఒత్తిడి చేసినట్లు తెలిపింది. సుమారు నాలుగు నెలల పాటు నిందితుల నియంత్రణలో ఉన్న బాధితురాలు వారి నుంచి తప్పించుకుని సీఐడీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించారు.9 మంది బాలికలకు విముక్తిదాడుల సందర్భంగా ఏ1 నుంచి ఏ45 వరకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది మంది మైనర్ బాలికలతో పాటు పలువురు బాధితులను రక్షించారు. నేరానికి సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శాస్త్రీయ, సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక సెషన్స్ జడ్జి ఉదయ్ భాస్కర్రావు విచారణ అనంతరం 33 మంది నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు విధించారు. ఐదుగురికి జీవిత ఖైదు, ముగ్గురికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 14 మందికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 11 మందికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించారు.బాధితులకు రూ.45 లక్షల పరిహారంనిందితుల దారుణ చర్యల కారణంగా శారీరక, మానసిక వేదనకు గురైన తొమ్మిది మంది బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.45 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. చట్ట ప్రకారం ఇప్పటికే అందిన పరిహారానికి అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించాలని పేర్కొంది. పరిహారం చెల్లింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డీఎల్ఎస్ఏ కార్యదర్శిని ఆదేశించింది. నిందితులపై విధించిన జరిమానా మొత్తాన్ని కూడా బాధితులకు పరిహారంగా అందించాలని కోర్టు సూచించింది. -
అరెస్ట్లు చేయొద్దు
వైఎస్సార్సీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసుపై హైకోర్టు స్టే నాయుడుపేటటౌన్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలను భయభ్రాంతులకు గురి చేసేందుకు అధికార పార్టీ పన్నిన కుయుక్తులకు హైకోర్టు చెక్పెట్టింది. అక్రమ కేసులతో ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వైఎస్సార్ సీపీ నాయకులపై నాయుడుపేట పోలీస్స్టేషన్లో అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద నమోదైన కేసుపై గురువారం హైకోర్టు స్టే విధించింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, నాయుడుపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ షేక్ రఫీ, సూళ్లూరుపేట నాయకులు పెమ్మారెడ్డి త్రిలోక చంద్రారెడ్డిపై నాయుడుపేట పోలీస్స్టేషన్లో కేసు నమోదైన విషయం విదితమే. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు తమపై కక్షకట్టి అక్రమంగా కేసు నమోదు చేశారని హైకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థన మేరకు న్యాయస్థానం ఈ ముగ్గురు నాయకులను అరెస్ట్ చేయరాదంటూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం నుంచి తదుపరి ఉత్తర్వులు అందే వరకు వీరిని అరెస్ట్ చేయకుండా ఈ కేసుపై విచారణను పోలీసులు కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పరిణామంతో వైఎస్సార్ సీపీ నాయకులకు ఊరట లభించింది. -
దళితుల కోసం..
రెండు రోజులు పోలీస్స్టేషన్లోనే చెవిరెడ్డి బైఠాయింపు అరుగుపైనే నిద్ర.. పుదిపట్ల(తిరుపతి రూరల్): అక్రమ కేసులో అరెస్ట్ చేసిన దళితుల్ని వదిలిపెట్టాలంటూ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి రెండు రోజులపాటు ముత్యాలరెడ్డిపల్లి పోలీస్స్టేషన్లోనే బైఠాయించారు. అమాయకులను వదిలి పెట్టేవరకు తాను పండుగ చేసుకోనని భీష్మించుకున్నారు. బాధితులతోనే కలసి పోలీస్స్టేషన్ అరుగుపైనే నిద్రించారు. రెండు రోజులపాటు వారితోనే ఉండి న్యాయపరంగా విడిపించుకుని ఇంటికి తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళ్లితే.. సీఎం చంద్రబాబు సంక్రాంతికి నారావారిపల్లెకు వస్తున్నారని టీడీపీ కార్యకర్తలు కట్టిన ఫ్లెక్సీలను చించారనే అనుమానంతో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పుదిపట్ల పంచాయతీ దళితవాడకు చెందిన మణి, భానుప్రకాష్, నవీన్కృష్ణ, గోపాలకృష్ణ, జగపతి, బాలలపై మాజీమంత్రి గల్లా అరుణకుమారి వర్గీయులు ఇటీవల దాడి చేసి, వారు ప్రయాణిస్తున్న కారు అద్దాల్ని ధ్వంసం చేసిన సంగతి విదితమే. ఈ దాడి గురించి ఫిర్యాదు చేస్తే స్వీకరించని పోలీసులు, గల్లా వర్గీయులిచ్చిన ఫిర్యాదుపై బాధితులపైనే కేసు నమోదు చేసి వారినే అరెస్ట్చేశారు. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి వారికి అండగా స్టేషన్లోనే ఉన్నారు. కోర్టునుంచి బాధితులకు బెయిల్ మంజూరయ్యాక వారితో కలసి ఎమ్మెల్యే వెళ్లారు. -
ఎమ్మెల్యే పులపర్తి ఘెరావ్
► మార్కెట్యార్డును ముట్టడించిన కాపులు ► అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ అంబాజీపేట : తుని ఘటనల నేపథ్యంలో పెట్టిన కేసుల్లో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలనిన్న డిమాండ్తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమసారథి ముద్రగడకు మద్దతుగా కాపు ఉద్యమకారులు సోమవారం అంబాజీపేటలో పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తిని ఘెరావ్ చేశారు. మార్కెట్ యార్డులో నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే పులపర్తిని వందలాదిమంది కాపులు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం చంద్రబాబు డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్ల సాధనకు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే కొందరు ప్రజాప్రతినిధులు వ్యంగ్యంగా మాట్లాడుతూ కాపు జాతిని కించపరుస్తున్నారని మండిపడుతూ ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. ముద్రగడ ఆమరణ దీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. తమ నాయకుడు చావుబతుకుల మధ్య ఉంటే సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు ఎంతవరకూ సబబని నిలదీశారు. ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఒక దశలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో భారీగా పోలీసులను మోహరించారు. తుని ఘటనలో అమాయకులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తి వేయాలని, కాపులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళాలని ఎమ్మెల్యేకి వినతి పత్రం సమర్పించారు. కాపు నాయకుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్ళడంతో పాటు అసెంబ్లీ సమావేశంలో చర్చించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.


