breaking news
Test results
-
వాయిస్ విని వైరస్ గుట్టు చెప్పేస్తుంది
లండన్: కృత్రిమ మేథ మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్ఫోన్ యాప్ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ‘మనిషి గొంతు విని అతనికి కోవిడ్ సోకిందో లేదో ఈ యాప్ చెప్పగలదు. కోవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఫలితాలు ఇస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా, త్వరగా, సులభంగా కోవిడ్ జాడ కనిపెట్టే విధానమిది. వాయిస్ను రికార్డ్ చేసి చెక్ చేస్తే సరిపోతుంది. నిమిషంలో ఫలితం వచ్చేస్తుంది. అల్పాదాయ దేశాల్లో ఇది ఎంతో ఉపయోగకరం’ అని పరిశోధకులు చెప్పారు. స్పెయిన్లోని బార్సిలోనా నగరంలో నిర్వహించిన యురోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్లో ఈ యాప్ సంబంధ వివరాలను బహిర్గతంచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ యాప్ 89 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తుందని రీసెర్చ్లో పాల్గొన్న అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా వ్యక్తి గొంతులో శ్వాస మార్గం, స్వరపేటికలు ఇన్ఫెక్షన్కు గురవుతాయి. దాంతో వచ్చిన మార్పులను ఈ యాప్ గుర్తిస్తుందని నెదర్లాండ్స్లోని మాస్ట్రిచ్ యూనివర్సిటీ మహిళా పరిశోధకులు వఫా అజ్బవీ చెప్పారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గణాంకాల నుంచి సేకరించిన స్వరనమూనాలను ఈ యాప్లో పొందుపరిచారు. ఆరోగ్యవంతులు, అస్వస్తులైన వారివి కలిపి 4,352 మందికి చెందిన 893 ఆడియో శాంపిళ్లను తీసుకున్నారు. ఇందులో 308 మంది కోవిడ్ రోగుల వాయిస్లూ ఉన్నాయి. యాప్ టెస్ట్లో భాగంగా నోటితో మూడు నుంచి ఐదుసార్లు గట్టిగా శ్వాస తీసుకోవాలి. మూడు సార్లు దగ్గాలి. స్క్రీన్ మీద చిన్న వాక్యాన్ని చదవాలి. వీటిని రికార్డ్ చేసిన యాప్ నిమిషంలో ఫలితాలు చూపిస్తుంది. -
ఒక్క సెకనులో ‘కరోనా’ ఫలితం
న్యూఢిల్లీ: కరోనా నిర్థారణ పరీక్షలు ఇకపై క్షణాల్లోనే నిర్వహించే పద్దతిని అమెరికాలోని ఫ్లోరియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. బయో సెన్సార్ల సాయంతో క్షణాల్లోనే మన శరీరంలో కరోనా వైరస్ ఉన్నది లేనిది తెలిసిపోతుంది. రక్త పరీక్షలు చేసే తరహాలోనే ఇందులో కూడా స్ట్రిప్ ఉంటుంది. దానిలో లాలా జలం తీసుకుంటే .... బయో సెన్సార్లు ఆ లాలాజలాన్ని పాలిమర్ చైన్ రియాక్షన్ పద్దతిలో క్షణాల్లోనే పరీక్షిస్తాయి. శరీరంలో కరోనా వైరస్ ఆనవాళ్లు సెన్సార్లు గుర్తించినట్టయితే వెంటనే ఆ సమాచారం తెలియ జేస్తుంది. పరీక్ష ముగిసిన తర్వాత స్ట్రిప్ను మారిస్తే సరిపోతుంది. బయో సెన్సార్ను మళ్లీ ఉపయోగించుకునే వీలుంటుంది. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో వేగంగా కరోనా నిర్థారణ పరీక్షలు జరిపే వీలుంటుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న కరోనా పరీక్షా విధానాల్లో ఆర్టీ పీసీఆర్ పద్దతికే కచ్చితత్వం ఎక్కువ. అయితే ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో ఫలితాలు రావడానికి గంటలు, కొన్ని సార్లు రోజుల కొద్ది సమయం పడుతుంది. అదే బయో సెన్సార్లు ఉపయోగించనట్టయితే సమయం ఎంతో ఆదా అవుతుంది. తక్కువ ఖర్చుతోనే చేయోచ్చు. ఈ బయో సెన్సార్ స్ట్రిప్ పద్దతికి సంబంధించిన సమాచారం జర్నల్ ఆఫ్ వాక్యూమ్ సైన్స్ , టెక్నాలజీలో ప్రచురితమైంది. రాబోయే రోజుల్లో రోగ నిర్థారణ పరీక్షల్లో బయో సెన్సార్లు కీలకం కానున్నాయంటూ సైంటిస్టులు చెబుతున్నారు. -
రెండు గంటల్లో కోవిడ్–19 ఫలితం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నదీ, లేనిదీ రెండు గంటల్లోనే ఫలితమిచ్చే ఆర్టీ–పీసీఆర్ టెస్ట్ కిట్ను రిలయన్స్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్టీ–పీసీఆర్ కిట్లు ఫలితాన్నిచ్చేందుకు 24 గంటల సమయాన్ని తీసుకుంటున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థయే రిలయన్స్ లైఫ్ సైన్సెస్. సార్స్ కోవిడ్–2కు సంబంధించి 100 జీనోమ్లను విశ్లేషించిన అనంతరం ఈ కిట్ను రిలయన్స్ లైఫ్ సైన్సెస్ శాస్తవేత్తలు రూపొందించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరోనా నిర్ధారణకు ఆర్టీ పీసీఆర్ పరీక్షను అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ప్రత్యేకంగా నిర్వహించిన మరో అధ్యయనంలో.. కరోనా కారణంగా మరణాల రేటు 2020 చివరికి గణనీయంగా తగ్గుతుందని తెలిసింది. -
కరోనా: వేగంగా పరీక్షల ఫలితాలు
నేటి నుంచి జిల్లాలో కరోనా పరీక్షల వేగం పుంజుకోనుంది. శాంపిళ్లకు సంబంధించిన ఫలితాలు వాయు వేగంగా రానున్నాయి. ఇప్పటికే జిల్లాలోని గుంటూరు, తెనాలి, మాచర్ల, నరసరావుపేటలప్రాంతాల్లో ట్రూనాట్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో 18 మిషన్ల ద్వారా కరోనా పరీక్షలు చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకి 200 లోపు ఫలితాలు మాత్రమే వస్తున్నాయి. ఇక నుంచి రోజుకి 760 శాంపిళ్ల ఫలితాలు రానున్నాయి. పాజిటివ్ వ్యక్తుల కాంటాక్ట్లు, అనుమానిత లక్షణాలు ఉన్న వారి శాంపిళ్లు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల రాకలో జాప్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సాక్షి, గుంటూరు: జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల వేగం సైతం పెంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శాంపిళ్లు సేకరించి ఫలితాలు త్వరగా వచ్చేలా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకి 1000 నుంచి 1200 శాంపిళ్లు తీస్తున్నారు. ల్యాబ్ల సామర్థ్యం పెంపు, ఆధునిక పరికరాల వల్ల ఇక నుంచి రోజుకి 760 శాంపిళ్ల ఫలితాలు తీయనున్నారు. గుంటూరు, తెనాలి, మాచర్ల, నరసరావుపేటల ప్రాంతాల్లో ట్రూనాట్ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా రోజు 360 కరోనా పరీక్షా ఫలితాలు రానున్నాయి. ప్రస్తుతం గుంటూరు మెడికల్ కళాశాల ల్యాబ్లో 200 కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం ఉండగా, దాని సామర్థ్యాన్ని 400కు పెంచే దిశగా ఏర్పాట్లు చేశారు. ర్యాపిడ్ టెస్టులకు సంబంధించి విజయవాడలో శుక్రవారం డాక్టర్లకు శిక్షణ ఇచ్చారు. మంగళవారం నాటికి జిల్లాలో రాపిడ్ టెస్టులు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు నగరంపై ప్రత్యేక దృష్టి.. గుంటూరు నగరంలో పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఇప్పటికే జిల్లాలో 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిలో 93 కేసులు గుంటూరు నగరంలోనే ఉన్నాయి. శుక్రవారం నమోదైన పాజిటివ్ కేసులు మూడు గుంటూరు నగరంలోనే ఉండటం విశేషం. ఈ కేసులు ఆనందపేటలో ఒకటి, సంగడిగుంటలో రెండు నమోదయ్యాయి. మరో కేసు పొన్నూరులో నమోదైంది. ప్రధానంగా గుంటూరు నగరంలోని ఆనందపేటలో 25కు పైగా కేసులు, కుమ్మరిబజారులో 20కుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆప్రాంతాలపైన అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రెడ్జోన్లలో కరోనా పాజిటివ్ వ్యక్తుల కాంటాక్ట్లు, కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారి శాంపిళ్లు తీసే ప్రక్రియను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల సహకారంతో వారు మత పెద్దలతో చర్చించి కరోనా వ్యాప్తి రాకుండా ఉండేందుకు వీలుగా మసీదుల నుంచి మైక్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ ఉన్నవారు క్వారెంటైన్ సెంటర్లకు తరలివెళ్లాలని, పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. హోం క్వారంటైన్కు తరలించే ఏర్పాటు.. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 21 క్వారెంటైన్ సెంటర్లలో 1800 మందికిపైగా ఉన్నారు. వారిలో 14 రోజుల క్వారెంటైన్ పూర్తి చేసుకున్న వారు 360 మంది ఉన్నారు. వారికి కరోనా టెస్టులు చేశారు. ఆ ఫలితాలు రాగానే వారందరిని హోం క్వారంటైన్కు తరలించి ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గత రెండు రోజుల క్రితం ట్రానార్ట్ కిట్ల ద్వారా 89 పరీక్షలు చేయగా, ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. శుక్రవారం రోజు 211 మందికి పరీక్షలు చేయగా, అందులో కేవలం ఒక్క పాజిటివ్ మాత్రమే రావడం కొంత ఊరటనిచ్చే విషయం. ప్రస్తుతం తీసిన శాంపిళ్లకు సంబంధించిన ఫలితాలు రెండురోజుల్లో రానున్న దృష్ట్యా కరోనా వ్యాప్తికి సంబంధించి ఓ అవగాహన వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతున్నాం కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తిని కలిసిన వారు, కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షల సామర్థాన్ని పెంచుతున్నాం. కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా రెడ్, ఆరంజ్, గ్రీన్జోన్లుగా విభజిస్తున్నాం. – ఐ. శామ్యూల్ ఆనందకుమార్, కలెక్టర్ మాచర్లలో కరోనా పరీక్షల కేంద్రం ప్రారంభం మాచర్ల : రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని, దీని వల్ల ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండవచ్చునని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో రూ. 10 లక్షల విలువైన నూతన ఆధునీకరణ యంత్రాలతో శుక్రవారం కరోనా టెస్టు నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని జిల్లా నోడల్ అధికారి రమేష్, స్పెషలాఫీసర్ శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పేదలు ఇబ్బందులు పడకుండా చూస్తుందన్నారు. కొందరు దీనినీ రాజకీయం చేయటం మంచిది కాదన్నారు. మాచర్ల పట్టణంలో మొదట ఐదు కేసులు వచ్చినా లాక్డౌన్ వలన నియంత్రణ చర్యలు పెరిగి అధికారుల కృషితో ఒక్క కేసు కూడా రాకపోవటం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పీఆర్కే మే 3 వరకు ఏఎన్యూకి సెలవులు ఏఎన్యూ: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి మే నెల 3వ తేదీ వరకు సెలవులు ప్రకటించామని రిజి్రస్టార్ ఆచార్య కె. రోశయ్య తెలిపారు. యూనివర్సిటీ కళాశాలలు, కార్యాలయాలు, ఒంగోలు పీజీ సెంటర్, యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు అన్నింటికీ ఈ సెలవులు వర్తిస్తాయన్నారు. యూనివర్సిటీ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది తమ హెడ్ క్వార్టర్లోనే ఉండాలని, అవసరమైన పరిస్థితుల్లో విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. యూనివర్సిటీలోని అత్యవసర సేవలకు చెందిన విద్యుత్, నీటి సరఫరా, సెక్యూరిటీ, శానిటరీ, హెల్త్ సెంటర్ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులందరూ తగు జాగ్రత్తలు పాటిస్తూ యథాతథంగా విధుల్లో పాల్గొనాలని కోరారు. -
విద్యాపీఠంలో రీసెట్ ఫలితాలు విడుదల
యూనివర్సిటీ క్యాంపస్: రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో రీసెట్ (విద్యావారధి) ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం వీసీ హరేకృష్ణశతపతి విడుదల చేశారు. గత నెల 9న దేశంలోని 17 కేంద్రాల్లో ఈ ప్రవేశపరీక్ష నిర్వహించారు. 1,690 మంది దరఖాస్తు చేయగా 1,076 మంది పరీక్ష రాశారు. వారిలో 633 మంది అర్హత సాధించారు. ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీకి చెందిన లాల్బహుదూర్శాస్త్రి సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ ఆర్సీ పాండే, రాష్ట్రీయ సంస్కృత సంస్థ పరీక్షల నియంత్రణాధికారి జీఆర్ మిశ్రా, రిజిస్ట్రార్ ఉమాశంకర్ పాల్గొన్నారు.