breaking news
Telangana Treasury
-
‘గ్యారంటీ’ల బండ!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ‘గ్యారంటీ’ల గండం పట్టుకుంది. ప్రభుత్వరంగ సంస్థలు చేస్తున్న అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా గ్యారంటీలు ఇవ్వటంతో పరిస్థితి విషమించింది. అధికారిక అప్పులకు తోడు లెక్కల్లోకి రాని ఈ ‘గ్యారంటీ’ అప్పులు కొండలా పేరుకుపోయాయి. గ్యారంటీ అప్పుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ తాజా నివేదికలో ప్రకటించింది. ఇది చాలా ప్రమాదకరమైన ఆర్థిక నిర్వహణ అని హెచ్చరించింది. గ్యారంటీ అప్పులు జీఎస్డీపీలో ఏకంగా 15.1 శాతానికి చేరాయని వెల్లడించింది. నిధులన్నీ సంక్షేమం, సబ్సిడీలకే పోతున్నాయని.. భవిష్యత్తుకు కీలకమైన విద్య, వైద్య రంగాలను గాలికి వదిలేశారని తూర్పారబట్టింది. బడ్జెట్ అంచనాలు ఏకంగా 21 శాతం గల్లంతవుతుండటం ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి అద్దం పడుతోందని నివేదిక పేర్కొంది. అప్పుల ఊబిలోకి రాష్ట్రం.. ‘స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్’నివేదిక తెలంగాణ రాష్ట్ర ఖజానా డొల్లతనాన్ని బయటపెట్టింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని హెచ్చరించింది. ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఇచ్చిన గ్యారెంటీలు జీఎస్డీపీలో 15.1 శాతానికి చేరగా, ఇందులో సింహభాగం (37%) నీటిపారుదల రంగానికే ఉండటం గమనార్హం. దేశంలో మరే రాష్ట్రం ఇంతటి భారీ గ్యారెంటీలను ఇవ్వలేదని నివేదిక పేర్కొంది. ఈ గ్యారెంటీలకు తోడు, 2025 మార్చి నాటికి అధికారిక అప్పులు సైతం జీఎస్డీపీలో 26 శాతానికి చేరాయి. ఇది ఎఫ్ఆర్బీఎం కమిటీ నిర్దేశించిన 20% పరిమితి కంటే చాలా ఎక్కువ. రాష్ట్రం బడ్జెట్ వెలుపల చేసే అప్పులు కూడా కొనసాగుతున్నాయి. 2024–25లో ఇవి రూ.2,697 కోట్లుగా ఉన్నాయి. కాగితాలపై కోటలు.. వాస్తవాలకు బీటలు పీఆర్ఎస్ నివేదిక ప్రకారం రాష్ట్ర బడ్జెట్ అంచనాలకు, వాస్తవ రాబడులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. 2015–23 మధ్య కాలంలో బడ్జెట్లో వేసిన అంచనాలకు, వాస్తవంగా వచ్చిన ఆదాయానికి మధ్య ఏకంగా 21% వ్యత్యాసం (లోటు) కనిపించింది. దేశంలో అత్యంత దారుణమైన పనితీరులో ఇది ఒకటి అని నివేదిక పేర్కొంది. కాగితాలపై కోటలు కట్టడం, తీరా ఆదాయం రాకపోవడంతో.. చివరకు అభివృద్ధి పనులకు భారీగా కోత పెట్టాల్సి వస్తోంది. ఇదే కాలంలో రాష్ట్రం తన మూలధన వ్యయంలో 12% కోత విధించింది. రాష్ట్రం సొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో బలంగా ఉంది. మొత్తం ఆదాయంలో 77% సొంత వనరుల (63% సొంత పన్నులు, 14% పన్నేతర ఆదాయం) నుంచే వస్తోంది. జీఎస్డీపీలో సొంత పన్నుల వాటా 8.1%గా ఉంది. ఆదాయం ఇలా బలంగా ఉన్నప్పటికీ, బడ్జెట్ ప్రణాళిక మాత్రం దారుణంగా విఫలమవుతోంది. విద్య, వైద్యానికి మంగళం: రాష్ట్ర ఖజానాలో సంక్షేమం, సబ్సిడీలకు పెద్ద పీట వేస్తున్న క్రమంలో కీలకమైన మౌలిక రంగాలకు తీరని అన్యాయం జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. రెవెన్యూ ఆదాయంలో 14% సబ్సిడీలకే పోతోంది. ఇందులో సింహభాగం 76% కరెంట్ సబ్సిడీలకే వెళ్తుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంక్షేమానికి బడ్జెట్లో 12.4% వాటా ఇచ్చి దేశంలో రెండో స్థానంలో నిలిచారు. కానీ, భవిష్యత్ తరాలను నిర్మించే కీలక రంగాలను పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజారోగ్యంపై తెలంగాణ తన బడ్జెట్లో 4.8% మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇది దేశంలోనే అత్యల్పం. విద్యారంగానికి చేసిన కేటాయింపులు 9.0% మాత్రమే. ఇది కూడా దేశంలోనే అత్యంత తక్కువ కావడం గమనార్హం. మౌలిక వసతులైన రోడ్లు, వంతెనల కోసం ఖర్చు చేస్తున్నది 1.9% మాత్రమే. సొంత ఆదాయం బలంగా ఉన్నా ఆ డబ్బంతా సబ్సిడీలకే పోతుండటం, మరోవైపు గ్యారెంటీల పేరుతో అప్పుల ఊబిలో కూరుకుపోవడం రాష్ట్రాన్ని ప్రమాదపు అంచున నిలబెట్టిందని నివేదిక హెచ్చరించింది. కీలకమైన విద్య, వైద్యం కుంటుపడటంతో రాబోయే తరాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని నివేదిక పేర్కొంది. -
ట్రెజరీ ఉద్యోగుల అధ్యక్షుడిగా పురుషోత్తంరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రెజరీ, అకౌంట్స్ గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గంగుల పురుషోత్తంరెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం రాత్రి నిర్వహించిన ఎన్నికల్లో పురుషోత్తంరెడ్డి సమీప ప్రత్యర్థిపై ప్రదీప్కుమార్పై 30 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఫలితాలను ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు సోమవారం విడుదల చేశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పురుషోత్తంరెడ్డి ప్రస్తుతం రామన్నపేట ఎస్టీవోగా పనిచేస్తున్నారు. సహ అధ్యక్షుడిగా శ్రీనివాసరా వు, ప్రధాన కార్యదర్శిగా పరుశరామ్లతో పా టు ఆరుగురు ఉపాధ్యక్షులు, ఐదుగురు కార్యదర్శులతో పాటు ఇతర కార్యవర్గం ఎన్నికైంది -
ఉమ్మడి బిల్లులు ఎవరు చెల్లించాలి?
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోని పెండింగ్ బిల్లులతో పాటు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం విడిపోయాక పలు శాఖలు సమర్పించిన బిల్లులను ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. దీంతో ఈ పంచాయతీని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలోని అపెక్స్ కమిటీ ముందు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ నిర్ణయించింది. వాస్తవానికి ఇలాంటి సమస్యలు తలెత్తకూడదని, ఉమ్మడి రాష్ట్ర బిల్లులన్నింటినీ రాష్ట్ర విభజనకు వారం రోజుల ముందే అంటే మే 25నే చెల్లించేందుకు ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని శాఖల్లో నిధులు అందుబాటులో లేని కారణంగా రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కాగా, వీటిని తొలు త తెలంగాణ ఖజానా చెల్లించాలని, ఆ తర్వాత అకౌంటెంట్ జనరల్ ద్వారా అందులో 58% మేర నిధులను ఆంధ్రా ఖజానా నుంచి తెలంగాణకు బదిలీ చేయాలని ఏపీ ఆర్థిక శాఖ పేర్కొంది. రాష్ట్ర విభజన అనంతరం, విభజనకు ముందు నెలలకు సంబంధించి దాదాపు రూ.3,000 కోట్ల మేరకు బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లులన్నింటిపై నిర్ణయం తీసుకునేందుకు ఏపీ ఆర్థిక శాఖ సంబంధిత ఫైలును అపెక్స్ కమిటీకి పంపిం ది. ఏ జిల్లాల్లో పెండింగ్ బిల్లులు ఉంటే ఆ జిల్లాల రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని చెల్లించాలనే ప్రతిపాదన చేసింది. -
సీమాంధ్రకు కొత్త ట్రెజరీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) ట్రెజరీని కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ట్రెజరీని తెలంగాణకు కొనసాగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీని ప్రస్తుత ట్రెజరీ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకు ఇది అమల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పీడీ ఖాతాలతో సహ ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలన్నీ దీని ద్వారానే కొనసాగుతాయి.


