breaking news
telangana bar council
-
‘బార్’ బరి.. గెలుపెవరిదో మరి!
ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల నగారా ఎట్టకేలకు మోగింది. 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయినా.. హైకోర్టు మాత్రం 2018 డిసెంబర్ వరకు కలిసే పనిచేసింది. 2019 నుంచి ఇరు హైకోర్టులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత బార్ కౌన్సిల్కు జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే. అంటే.. తెలంగాణ బార్ కౌన్సిల్ మొదటి ఎన్నికలివి. దీంతో తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే ‘ప్రాధాన్యత’ క్రమంలో సభ్యులను ఎన్నుకుంటారు. సభ్యులు.. చైర్మన్, వైస్ చైర్మన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సభ్యుడిని ఎన్నుకుంటారు. 25 మంది సభ్యుల కోసం జరిగే ఈ ఎన్నికల్లో దాదాపు 100 మందికి పైగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు జిల్లాల్లోని కోర్టుల్లో తిరుగుతూ ప్రచారం షురూ చేశారు. మరికొందరు త్వరలో రంగంలోకి దిగనున్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పడింది? దాని విధులేంటి?.. తదితర ఆసక్తికర అంశాలపై కథనమిది. – సాక్షి, హైదరాబాద్వృత్తిపరమైన విభేదాలతో న్యాయవాదిపై దాడి చేసినా.. హింసించినా ఎవరిని ఆశ్రయించాలి?.. న్యాయవాది (Advocate) సంక్షేమాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు? న్యాయ విద్యాలయాలకు అనుమతులు, సీట్ల కేటాయింపు.. వీటికి సమాధానమే బార్ కౌన్సిల్. ఇది ఓ చట్టబద్ధమైన సంస్థ. న్యాయవాదిగా నమోదు చేసుకోవడం, వారి హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు కాపాడటం, దుష్ప్రవర్తనకు పాల్పడితే ఫిర్యాదులు స్వీకరించి చర్యలు చేపట్టడం.. ఇదంతా బార్ కౌన్సిల్ విధి. దేశవ్యాప్తంగా అతిపెద్ద చట్టబద్ధమైన సంస్థలో బీసీఐ ఒకటి. న్యాయవాదుల చట్టం ప్రకారం రాష్ట్ర కౌన్సిల్లో న్యాయవాదుల సంఖ్య 10,000 దాటితే సభ్యులు 25 మంది ఉండాలి. ఈ మేరకు తెలంగాణ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య 25. వీరు చైర్మన్, వైస్ చైర్మన్ను ఎన్నుకుంటారు. బరే యాక్ట్ చాప్టర్ 2 ప్రకారం రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుల కాల పరిమితి ఐదేళ్లు. ఆ తర్వాత 6 నెలల వరకు పొడిగించే అధికారం బీసీఐకి ఉంది. బీసీఐ అవసరాన్ని నొక్కి చెబుతూ 1953లో ఎస్ఆర్ దాస్ నేతృత్వంలోని ‘ఆల్ ఇండియా బార్ కమిటీ’ ఓ నివేదిక సమర్పించింది. ప్రతి రాష్ట్రానికో బార్ కౌన్సిల్ ఉండాలని, వీటన్నింటిపై అత్యున్నత సంస్థగా అఖిల భారత స్థాయి బార్ కౌన్సిల్ పర్యవేక్షణ ఉండాలని ప్రతిపాదించారు. అనంతరం 1961లో న్యాయవాదుల చట్టం అమల్లోకి వచ్చింది. ఇందులో సెక్షన్ 3 మేరకు ప్రతి రాష్ట్రానికో బార్ కౌన్సిల్ ఉండాలన్న నిబంధన ప్రకారం ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్ ఏర్పాటు జరిగింది. 2018, జూలైలో తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్లో (Bar Council of Telangana) దాదాపు 50,785కి పైగా న్యాయవాదులున్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్కు సభ్యుల ఎన్నికలో వీరంతా ఓటర్లుగా ఓటు వేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో ‘ప్రాధాన్యత’ ఓటు ఆధారంగా సభ్యులను ఎన్నుకుంటారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ విధులు..» న్యాయవిద్య పూర్తి చేసిన వారిని న్యాయవాదులుగా చేర్చుకోవడం» వారి జాబితాను సిద్ధం చేయడం, విధులను పర్యవేక్షించడం » న్యాయవాదులెవరైనా దుష్ప్రవర్తనకు పాల్పడితే కేసులను స్వీకరించడం, చర్యలు చేపట్టడం » న్యాయవాదుల హక్కులు, అధికారాలు, ప్రయోజనాలను కాపాడటం» నిరుపేదలు, దివ్యాంగులు, ఇతర న్యాయవాదుల కోసం సంక్షేమ పథకాల నిర్వహణ» విపత్కర సమయాల్లో పేద న్యాయవాదులకుఆర్థిక సహాయం అందించడం» ప్రముఖ న్యాయనిపుణులతో చట్టపరమైన అంశాలపై సెమినార్లు, చర్చలు నిర్వహించడం » పేదలకు నిర్దేశించిన పద్ధతిలో న్యాయ సహాయం అందించడం» న్యాయ విశ్వవిద్యాలయాలను, కాలేజీలను తనిఖీ చేయడం» న్యాయ విద్య పూర్తి చేసిన వారికి విధిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్ష నిర్వహించాలిబార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా..దేశవ్యాప్తంగా న్యాయవాదుల వృత్తిని నియంత్రించడానికి, ప్రాతినిధ్యం వహించడానికి పార్లమెంట్ ఏర్పాటు చేసిన ఓ చట్టబద్ధమైన సంస్థ. వృత్తిపరమైన ప్రవర్తన, మర్యాదల ప్రమాణాలను నిర్దేశించడం, బార్పై క్రమశిక్షణ అధికార పరిధిని అమలు చేస్తూ నియంత్రణ విధులను నిర్వహిస్తారు. » న్యాయ విద్యకు ప్రమాణాలను కూడా నిర్దేశిస్తుంది» న్యాయవాదులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికార పరిధి ఉంటుంది» న్యాయవాదుల విధులను నియంత్రిస్తుంది. » న్యాయ డిగ్రీ విశ్వవిద్యాలయాలకు గుర్తింపును మంజూరు చేస్తుంది» న్యాయవాదుల హక్కులు, అధికారాలు, ప్రయోజనాలను పరిరక్షిస్తుంది» సంక్షేమ పథకాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించడానికి నిధులను సృష్టిస్తుంది» న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తన, ప్రమాణాలను నిర్దేశిస్తుంది.» రాష్ట్ర బార్ కౌన్సిల్ క్రమశిక్షణ కమిటీలు అనుసరించాల్సిన విధానం నిర్దేశం» న్యాయవాదుల హక్కులు, అధికారాలు, ప్రయోజనాలను కాపాడటం» చట్ట సంస్కరణలను ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడం» రాష్ట్ర బార్ కౌన్సిల్ సూచించే ఏదైనా సమస్యను పరిష్కరించడం» బార్ కౌన్సిల్ నిధుల నిర్వహణ.. పెట్టుబడి పెట్టడం» ప్రతి రాష్ట్ర బార్ కౌన్సిల్ నుంచి ఐదేళ్ల కాలపరిమితితో బీసీఐకి సభ్యులు ఎన్నికవుతారు. » వీరంతా రెండేళ్ల కాలపరిమితికి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు.» బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అటార్నీ జనరల్ ఎక్స్–అఫీషియో సభ్యునిగా ఉంటారు.» బీసీఐ తొలి చైర్మన్ ఎంసీ సెతల్వాడ్. ప్రస్తుతం మనన్ కుమార్ మిశ్రా.» దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో బార్ కౌన్సిళ్లు ఉన్నాయి.తెలంగాణ బార్ కౌన్సిల్లో మొత్తం సభ్యుల సంఖ్య 25 వీరిలోచైర్మన్,వైస్ చైర్మన్ల సంఖ్య 2బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నామినేటయ్యే సభ్యుల సంఖ్య 1ఎక్స్–అఫీషియో సభ్యుల సంఖ్య 1 (అడ్వొకేట్ జనరల్)ఆలిండియా బార్ కౌన్సిల్ పరీక్షన్యాయవాద వృత్తి ప్రమాణాలను మెరుగుపరచడమే ఏకైక ఉద్దేశంతో బీసీఐ దీన్ని ప్రవేశపెట్టింది. 2009–2010 విద్యా సంవత్సరం నుంచి పట్టభద్రులైన న్యాయ విద్యార్థులకు ఈ పరీక్ష తప్పనిసరి చేస్తూ బీసీఐ నిర్ణయం తీసుకుంది. న్యాయవాదుల చట్టం 1961లోని సెక్షన్ 24 ప్రకారం న్యాయవాదులుగా నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడానికి దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థికి ప్రాక్టీస్ సర్టిఫికెట్ ఇస్తారు. దేశంలోని ఏ కోర్టులోనైనా ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉంటుంది. ఈ పరీక్ష దేశంలోని జాతీయ, ప్రాంతీయ భాషల్లో ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. అభ్యర్థి విశ్లేషణాత్మక నైపుణ్యాలను అంచనా వేయడంతో పాటు, ప్రాథమిక స్థాయి జ్ఞానాన్ని అంచనాకు, న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించడానికి కనీస బెంచ్మార్క్ను ఈ పరీక్ష నిర్దేశిస్తుంది. న్యాయ విద్య పట్టా పొందినా వృత్తిలోకి ప్రవేశించడానికి ఆసక్తి లేని వారికి ఈ పరీక్ష అవసరం లేదు. న్యాయవ్యవస్థ ప్రధాన పిల్లర్ న్యాయవాదులే..ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించే న్యాయవ్యవస్థకు ప్రధాన పిల్లర్ న్యాయవాదులే. అలాంటి వారి రక్షణకు చట్టం అవసరం తప్పనిసరి. వైరి కక్షిదారుల బెదిరింపులు, దాడులు, హత్యలు ఇటీవల కాలంగా పెరిగిపోయాయి. యువ న్యాయవాదులకు శిక్షణా తరగతులు అవసరం. అత్యుత్తమ న్యాయవాదులను తయారు చేస్తే న్యాయవ్యవస్థ ఔన్నత్యం మరింత ఇనుమడిస్తుంది. సత్వర న్యాయానికి దోహదం చేస్తుంది. – బీఎస్ ప్రసాద్, మాజీ అడ్వొకేట్ జనరల్సంక్షేమానికి పాటుపడాలిబార్ కౌన్సిల్ న్యాయవాదులు సంక్షేమానికి పాటుపడాలి. మరిన్ని పథకాలు అమలు చేసే దిశగా కృషి చేయాలి. వీలైతే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి న్యాయవాదుల సమస్యలను వివరించాలి. జిల్లా కోర్టుల్లో డిస్ప్లే బోర్డుల సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కేసు ఎప్పుడు వస్తోందో తెలియక న్యాయవాదులు అవస్థలు పడుతున్నారు. న్యాయవాదుల రక్షణ చట్టంతోపాటు ఇలాంటి సమస్యలు పరిష్కరించే ‘కౌన్సిల్’ను ఎన్నుకోవాలి. – పొన్నం అశోక్గౌడ్, మాజీ అధ్యక్షుడు, హెచ్సీఏఏ న్యాయవాదులకు ఆప్తుడు వైఎస్సార్న్యాయవాదులకు ఆప్తుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. నేరుగా కౌన్సిల్కు సాయం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆయన. దాదాపు 20 ఏళ్లుగా చైర్మన్గా సేవలందిస్తున్నాను. రెండు దశాబ్దాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. ఇతర సభ్యులు, న్యాయవాదులు అందరూ తమ వంతు సహకరించారు. ఇన్నేళ్లు చైర్మన్గా కొనసాగడం ఓ రికార్డే. 2006 చైర్మన్గా తొలిసారి వైఎస్సార్ను కలిశా. అడిగిన వెంటనే రూ.1.65 కోట్లను మంజూరు చేశారు. విడతలవారీగా ఒక్కో పని చేసుకుంటూ పోదామని చెప్పారు. అడిగిన వెంటనే నిధులిచ్చే అలాంటి ముఖ్యమంత్రిని మళ్లీ చూడలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.3 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అందులో సగం మంజూరు చేశారు. – నరసింహారెడ్డి, చైర్మన్, రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రధాన హామీ.. న్యాయవాద రక్షణ చట్టంన్యాయవాదులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. వైరి వర్గాల వారు హత్య చేయడం, దాడులు చేయడం సర్వసాధారణంగా మారింది. ఓ న్యాయవాద దంపతుల కేసును సుప్రీంకోర్టు ఏకంగా సీబీఐకే అప్పగించింది. ఈ నేపథ్యంలో న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాలన్నది ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. యువ న్యాయవాదులకు స్టైపెండ్, శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, జీవిత బీమా, ప్రమాద బీమా మరింత మందికి అందుబాటులోకి తెస్తామని, సడలింపులు చేస్తామంటూ ప్రచారం సాగించనున్నారు. పకడ్బందీగా నిర్వహణబార్ కౌన్సిల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటర్ల జాబితాను రాష్ట్రంలో అన్ని బార్ అసోసియేషన్లకు పంపిన తర్వాతే తుది జాబితాను ప్రచురించాం. సుప్రీంకోర్టు నియమించిన ఎన్నికల కమిటీ సూచనల మేరకు చర్యలు చేపడుతున్నాం. ఎన్నిక లు ప్రజాస్వామ్యానికి నిదర్శనం. న్యాయవాదులు తమ ఓటు వినియోగించుకోవాలని కోరుతున్నాం. – నాగలక్ష్మి, కార్యదర్శి, బార్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించండి..రాష్ట్ర బార్ కౌన్సిల్కు ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నవంబర్లో తీర్పునిచ్చింది. ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహించాలో గడువు నిర్దేశించింది. ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి ఎన్నికల కమిటీ పర్యవేక్షణ జరుపుతుంది.జనవరి 31: ఉత్తరప్రదేశ్, తెలంగాణఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, త్రిపుర, పుదుచ్చేరిమార్చి 15: రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కర్ణాటక, గుజరాత్, పంజాబ్మార్చి 31: మేఘాలయ, మహారాష్ట్రఏప్రిల్ 30: తమిళనాడు, కేరళ, అస్సాంఉన్నతస్థాయి కమిటీ..జస్టిస్ రవిరాజన్ (చైర్మన్)మాజీ ప్రధాన న్యాయమూర్తి, జార్ఖండ్ హైకోర్టుజస్టిస్ ఏఆర్ మక్సూది మాజీ న్యాయమూర్తి, అలహాబాద్, హైకోర్టుజస్టిస్ రేఖా పల్లి మాజీ న్యాయమూర్తి, ఢిల్లీ హైకోర్టుప్రస్తుత బార్ కౌన్సిల్ ఏం చేసింది..?» న్యాయవాది మరణ ప్రయోజనాలను రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు » కోవిడ్ సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.25 కోట్లు మంజూరు చేసేలా సర్కార్ను ఒప్పించడం» కరోనా మహమ్మారి కష్టకాలంలో అనేక మంది నిరుపేద న్యాయవాదులకు ఆర్థిక సహాయం పంపిణీ » అంతర్గత సెమినార్ల నిర్వహణ, ఐసీఎఫ్ఏఐ లా స్కూల్తో కలిసి రెండు రోజుల కీలకసెమినార్» ఉమ్మడి బార్ కౌన్సిల్ విభజన తర్వాత తలెత్తిన వివిధ సమస్యలను విజయవంతంగా పరిష్కరించడం» న్యాయవాదులు వృత్తికి సంబంధించి సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడం » నిర్ణీత వయసు (35 ఏళ్లు) దాటిన న్యాయవాదులు అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్లో సభ్యులు కావడానికి అవకాశం కల్పించడం. తెరపైకి మహిళా రిజర్వేషన్రాష్ట్ర బార్ కౌన్సిళ్ల పదవుల్లో 30 శాతాన్ని మహిళా న్యాయవాదులకు కేటాయించాలి. ఈ ఏడాది ఇంకా బార్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాని రాష్ట్రాల్లో ఈ ఆదేశాలను అమలు చేయాలి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మాత్రం నోటిఫికేషన్ ప్రకారం ముందుకు సాగవచ్చు. ఒకవేళ తగినంత మంది మహిళా న్యాయవాదులు లేకున్నా, పోటీ చేయడానికి ఇష్టపడకున్నా.. 20 శాతం పదవులను ఎన్నిక ద్వారా, మిగిలిన 10 శాతం పదవులను కో–ఆప్షన్ ద్వారా నియమించుకోవచ్చు. కో–ఆప్షన్ ద్వారా నియమించేందుకు ప్రతిపాదించే మహిళా న్యాయ వాదుల పేర్లను తొలుత కోర్టు ముందు ఉంచాలి.మహిళలకు సీట్ల రిజర్వు హర్షణీయంమహిళలకు 30 శాతం రిజర్వేషన్ పాటించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు హర్షణీయం. దశాబ్దాల తర్వాత బార్ కౌన్సిల్లో మహిళలకు సముచిత స్థానం దక్కనుంది. ఈ బార్ కౌన్సిల్ కార్యవర్గంలో ఒక్కరూ మహిళలు లేకపోవడం శోచనీయం. చట్టాల అమలు కోసం సమర్థవంతమైన వాదనలు వినిపించే మహిళా న్యాయవాదులు ముందుకు రావాలి. కేసులకే పరిమితం కాకుండా ఎన్నికల్లో పోటీ చేసి.. విజయం సాధించి మహిళా న్యాయవాదుల సంక్షేమానికి పాటుపడాలి. – జి.సుభాషిణి, న్యాయవాది వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలి..ఈ వృత్తిలో న్యాయవాద సంబంధిత అంశాలతో పాటు అంగ్ల పరిజ్ఞానం తప్పనిసరి. పేద, మధ్య తరగతి న్యాయవాదుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారున్నారు. వారు ఇబ్బంది పడకుండా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు బార్ కౌన్సిల్ కృషి చేయాలి. స్కిల్స్ లేకుండా రాణించడం కష్టం. కోర్టులో వాదనలు ఎలా జరుగుతాయి.. క్రిమినల్, సివిల్ చట్టాలపై తరగతులు నిర్వహించాలి. వారు కూడా చర్చల్లో పాల్గొనే అవకాశం ఇచ్చి భయాందోళన దూరం చేయాలి. దీని కోసం కౌన్సిల్ కృతనిశ్చయంతో పనిచేయాలి. – పాలకుర్తి కిరణ్, మాజీ న్యాయమూర్తిముఖ్యమైన పాయింట్లు...» 1961లో బార్ కౌన్సిళ్లు ఏర్పాటైనా.. చైర్మన్ల ఎన్నిక మాత్రం 1969 నుంచి ప్రారంభమైంది. అప్పటివరకు అడ్వొకేట్ జనరల్ ఎక్స్ అఫీషియోమెన్ హోదాలో చైర్మన్గా ఉండేవారు. » బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తొలి చైర్మన్ ఎంసీ సెతల్వాడ్» ఆర్బీ జఠ్మలానీ, వీసీ మిస్త్రా, మనన్ కుమార్ మిస్త్రా.. బీసీఐ చైర్మన్గా రెండు సార్లు ఎన్నికయ్యారు.» మనన్కుమార్ మిస్త్రా.. అత్యధిక కాలం... దాదాపు 14 ఏళ్లు చైర్మన్గా సేవలందించారు. 2012, ఏప్రిల్ 17 నుంచి 2014, ఏప్రిల్ 16 వరకు.. 2014, నవంబర్ 9 నుంచి ప్రస్తుతం...» దేశవ్యాప్తంగా మొత్తం 24 బార్ కౌన్సిళ్లున్నాయి. » మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్లో 2 లక్షలకుపైగా న్యాయవాదులున్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల షెడ్యూల్..ప్రాథమిక ఓటర్ల జాబితా జారీ: డిసెంబర్ 1తుది జాబితా విడుదల: డిసెంబర్ 10నోటిఫికేషన్ గెజిట్ జారీ: డిసెంబర్ 20నామినేషన్లు ప్రారంభం: డిసెంబర్ 29నామినేషన్లు గడువు ముగింపు: జనవరి 9నామినేషన్ల పరిశీలన: జనవరి 10నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం: జనవరి 13 నుంచి 16 వరకుఅభ్యర్థుల తుది జాబితా ప్రచురణ: జనవరి 17బ్యాలెట్ పేపర్లు, బాక్సుల పంపిణీ: జనవరి 19ఎన్నికల తేదీ: జనవరి 30ఓట్ల లెక్కింపు: ఫిబ్రవరి 10(బార్ కౌన్సిల్కు పోటీ చేయాలనుకునే వారు రూ.1.25 లక్షల నాన్ రిఫండబుల్ రిక్లరేషన్ సమర్పించాలి. ఒక్కో అభ్యర్థికి మద్దతుగా 10 మంది న్యాయవాదులు సంతకం పెట్టాలి)ఓటు హక్కు వినియోగించుకోనున్న మొత్తం ఓటర్ల సంఖ్య: 35,316మహిళలు: 7,637 పురుషులు: 27,679 -
న్యాయ విద్యార్థుల ఎన్రోల్మెంట్ త్వరగా పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్య పూర్తి చేసిన విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించి వెంటనే న్యాయవాదులుగా నమోదు చేసుకునే చర్యలు చేపట్టాలని తెలంగాణ బార్ కౌన్సిల్ను హైకోర్టు ఆదేశించింది. ఎన్రోల్మెంట్ తేదీని ఖరారు చేయాలని స్పష్టం చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) జూలై 31న రాసిన లేఖ ఆధారంగా ఎన్రోల్మెంట్ను ఆపేస్తూ తెలంగాణ బార్ కౌన్సిల్ ఆగస్టు 5న సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిలిపివేతను సవాల్ చేస్తూ నిజామాబాద్కు చెందిన సాయితేజతో పాటు మరికొందరు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ, న్యాయ విద్య పూర్తి చేసి ప్రొవిజినల్ సరి్టఫికెట్లను పిటిషనర్లు పొందారని, వారి ఎన్రోల్మెంట్కు తెలంగాణ బార్ కౌన్సిల్ తిరస్కరించిందని చెప్పారు. ఎన్రోల్మెంట్ ఫీజును రూ. 750 నుంచి రూ. 1,500కు పెంచడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందన్నారు. రూ. 750 మాత్రమే వసూలు చేయాలని ఆగస్టు 7న ఉత్తర్వులు కూడా వెలువడ్డాయని తెలిపారు. బీసీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ లీగల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్–బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం న్యాయవాదులుగా ఎన్రోల్మెంట్ చేసుకునే స్వేచ్ఛ రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు లభించిందన్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆగస్టు 6న లేఖ కూడా రాసిందని చెప్పారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం స్వీకరించిన దరఖాస్తులను సరి్టఫికెట్ల పరిశీలన నిమిత్తం యూనివర్సిటీలకు పంపినట్లు చెప్పారు. వాటిపై పరిశీలన పూర్తికాగానే ఎన్రోల్మెంట్ తేదీని ఖరారు చేస్తామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిశీలించి ఎన్రోల్మెంట్ తేదీని ఖరారు చేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ను ఆదేశించారు. -
దక్షిణాదిలో సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి దక్షిణాదిలో సుప్రీంకోర్టు పర్మినెంట్ రీజినల్ బెంచ్ ఏర్పాటు చేయడం అత్యవసరమని సౌతిండియా బార్ కౌన్సిల్ స్పష్టం చేసింది. బెంచ్ ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులను కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్, సౌతిండియా బార్ కౌన్సిల్ కమిటీ కన్వీనర్ నర్సింహారెడ్డి తెలంగాణభవన్లో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా దక్షిణాదిలో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ సాధన కోసం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల బార్ కౌన్సిల్ చైర్మన్లతో ఏర్పడిన కమిటీ సీజేఐకి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. కక్షిదారు ఢిల్లీ వరకు రావడం ఖర్చుతో కూడుకున్నదని, ఈ విషయంపై ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కోరినట్లు వివరించారు. తమ విజ్ఞప్తిపై సీజేఐ, ఉపరాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. సీజేఐ, ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో తమిళనాడు, ఏపీ, కర్ణాటక బార్ కౌన్సిళ్ల చైర్మన్లు పీఎస్ అమల్రాజ్, ఘంట రామా రావు, శ్రీనివాస్ బాబు, కేరళ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె.ఎన్.అనిల్, తెలంగాణ బార్ కౌన్సిల్ మెం బర్ బి.కొండారెడ్డి, రామచందర్రావు ఉన్నారు. -
అందుకే దక్షిణాది రాష్ట్రాల నుంచి తక్కువ అప్పీళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం అందించిన హక్కులు ప్రజలందరికీ సమానంగా అందాలంటే దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు–పాండిచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల బార్ కౌన్సిల్ చైర్మన్లు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు బి.కొండారెడ్డి అధ్యక్షతన ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఇందులో ఐదు రాష్ట్రాల బార్ కౌన్సిల్ చైర్మన్లు ఎ.నరసింహారెడ్డి, గంటా రామారావు, పీఎస్ అమల్రాజ్, కేపీ జయచంద్రన్, ఎల్.శ్రీనివాసబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా... దక్షిణాది రాష్ట్రాలకు ఢిల్లీ వేల కిలోమీటర్ల దూరంలో ఉండటం.. సుప్రీంకోర్టు న్యాయవాదులు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండటంతో దక్షిణాది రాష్ట్రాల హైకోర్టుల నుంచి దాదాపు 3 శాతం మాత్రమే సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలవుతున్నాయని వారు తెలిపారు. ఢిల్లీకి వెళ్లే సమయం, డబ్బు వెచ్చించలేక అప్పీళ్లు దాఖలు చేయడంలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు ఢిల్లీ హైకోర్టు నుంచి 9.5 శాతం, ఉత్తరాది రాష్ట్రాల నుంచి దాదాపు 5 నుంచి 6 శాతం అప్పీళ్లు దాఖలవుతున్నాయని తెలిపారు. (చదవండి: నేడు సుప్రీంకోర్టులో ‘పంచాయతీ’) దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కోరారు. లా కమిషన్ చైర్మన్లు జస్టిస్ కె.కె.మాథ్యూ, జస్టిస్ దేశాయ్, జస్టిస్ లక్ష్మణన్లు దక్షిణాది రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారని గుర్తుచేశారు. సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలంటూ అన్ని బార్ కౌన్సిళ్లు తీర్మానం చేయాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు బెంచ్ సాధన సమితి కన్వీనర్గా ఎ.నరసింహారెడ్డిని ఎన్నుకున్నారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. -
అడ్వకేట్లకు అండగా నిలిచిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బార్ కౌన్సిల్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకి ధన్యవాదాలు తెలిపింది. కరోనా కారణంతో లాక్డౌన్ విధించడంతో ఇబ్బంది పడుతున్న అడ్వకేట్లను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్లను మంజూరు చేసింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇది అడ్వకేట్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని బార్ కౌన్సిల్ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో 40,000వేల మంది అడ్వకేట్లు ఉన్నారని వారిలో కొత్తగా ఈ వృత్తిని ఎంచుకున్న వారు లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్నారని బార్ కౌన్సిల్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. (ఢిల్లీలో జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం) కేవలం ఈ వృత్తి మీదే ఆధారపడిన వారు కేసులు లేక జీవనం కొనసాగించడం కష్టంగా ఉందని వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని బార్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందిన ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు రూ. 25 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇందుకు గాను బార్కౌన్సిల్ సభ్యులు అనంతసేన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (వలస కార్మికులను పంపిస్తాం : కానీ...!) -
న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత న్యాయవాదుల కోసం వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టామని, త్వరలో పార్టీ ప్రకటించే పూర్తి స్థాయి మేనిఫెస్టోలో న్యాయవాదుల సంక్షేమం కోసం పలు పథకాలను పొందుపరుస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ప్రగతిభవన్లో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్లతోపాటు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కేటీఆర్ను కలిశారు. తెలంగాణ అడ్వొకేట్ వెల్ఫేర్ ట్రస్టుకు మరిన్ని నిధులు కేటాయించాలని, ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి హెల్త్కార్డులు జారీ చేయాలని న్యాయవాద ప్రతినిధులు కోరారు. ఈ మేరకు తమ డిమాండ్ల ప్రతిపాదనలను కేటీఆర్కు సమర్పించారు. మేనిఫెస్టోలో న్యాయవాదులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో సీనియర్ల నుంచి సలహాలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. మేని ఫెస్టో కమిటీకిడిమాండ్ల ప్రతిని ఇస్తామన్నారు. -
ముగిసిన ఏపీ బార్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో గెలుపొందిన 25 మంది పేర్లను బార్ కౌన్సిల్ అధికారులు ప్రకటించారు. చలసాని అజయ్కుమార్, బి.వి.కృష్ణారెడ్డి, ఆలూరు రామిరెడ్డి, కలిగినీడి చిదంబరం, వి.చంద్రశేఖర్రెడ్డి, వేలూరి శ్రీనివాసరెడ్డి, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, ఎన్.ద్వారకనాథరెడ్డి, వజ్జా శ్రీనివాసరావు, రోళ్ల మాధవి, ఎస్.కృష్ణమోహన్, సోమసాని బ్రహ్మానందరెడ్డి, కె.రామజోగేశ్వరరావు, ముప్పాళ్ల సుబ్బారావు, నరహరిశెట్టి రవికృష్ణ, కొవ్వూరి వెంకటరామిరెడ్డి, సుంకర రాజేంద్రప్రసాద్, పి.రవి గువేరా, బి.అరుణ్కుమార్, పి.నర్సింగరావు, గంటా రామారావు, యర్రంరెడ్డి నాగిరెడ్డి, జి.వాసుదేవరావు, చిత్తరవు నాగేశ్వరరావు, ఎస్.మల్లేశ్వరరావులు గెలిచిన వారిలో ఉన్నారు. ఈ 25 మందిని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేస్తారు. అనంతరం చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తారు. గెలిచిన ఈ 25 మందిలో నుంచి ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారు. ఆగస్టు నెలాఖరుకల్లా చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రారంభమైన తెలంగాణ ఓట్ల లెక్కింపు.. తెలంగాణ బార్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. తెలంగాణ బార్ కౌన్సిల్కు మొత్తం 86 మంది పోటీ చేశారు. సోమవారం సాయంత్రం లెక్కింపు పూర్తయ్యే సమయానికి 280 ఓట్లతో గండ్ర మోహనరావు లీడింగ్లో ఉన్నారు. తరువాతి స్థానాల్లో ఉన్న ఎన్.హరినాథ్ 132 ఓట్లు, ఎ.నర్సింహారెడ్డి 131, ఎ.గిరిధరరావు 126, ముఖీద్ 96 ఓట్లు సాధించారు. -
బార్ కౌన్సిల్స్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారుల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ న్యాయవాద మండళ్లకి (బార్ కౌన్సిల్స్) ఈ నెల 29న జరగనున్న ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు నియమితులయ్యారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణ, ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు వ్యవహరిస్తారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ కార్యదర్శిరేణుక బుధవారం పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఏపీ ఎన్నికలకు 107 నామినేషన్లు, తెలంగాణ ఎన్నికలకు 86 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. గుర్తింపు కార్డు చూపిన ఓటర్కి బ్యాలెట్ ఇస్తారని, ఏపీలో జూలై 11న, రాష్ట్రంలో జూలై 23న కౌంటింగ్ జరుగుతుందని అన్నారు. -
హైకోర్టు, బార్ కౌన్సిల్, కేంద్రానికి సుప్రీం నోటీసులు
హైదరాబాద్: తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఈ అంశంపై మీ వైఖరి ఏమిటో వెల్లడించాలని రాష్ట్ర హైకోర్టు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రానికి..న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారి పేర్లను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేస్తున్నారని, రెండు రాష్ట్రాలకు ఒకే బార్ కౌన్సిల్ ఉండటం, ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమంటూ హైదరాబాద్కు చెందిన ఎస్.ప్రభాకర్ గతేడాది ఆగస్టులో ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.


