breaking news
super series badminton
-
జ్వాల జోడి ఓటమి
కొరియా ఓపెన్ సియోల్: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్లో జ్వాల-అశ్విని జోడి ఓటమిపాలైంది. రెండోరౌండ్లో యి నా జంగ్-సో యంగ్ కిమ్ (కొరియా) 21-18, 21-12తో జ్వాల ద్వయంపై గెలిచింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో జ్వాల జోడి స్థాయి మేరకు రాణించలేకపోయింది. తొలి గేమ్లో ఓ దశలో 18-16 ఆధిక్యంలో ఉన్నా... కొరియా జంట వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి సొంతం చేసుకుంది. రెండో గేమ్లో 5-5తో స్కోరు సమమైనా... ప్రత్యర్థి జోడి ధాటికి క్రమంగా వెనుకబడింది. స్కోరు 11-10 ఉన్న దశలో జంగ్-కిమ్ జోడి వరుసగా 8 పాయింట్లు సాధించింది. తర్వాత మరో రెండు పాయింట్లతో గేమ్ను, మ్యాచ్ను కైవసం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో తరుణ్ కోనా-అశ్విని జంట 10-21, 15-21తో ఏడోసీడ్ మిచెల్ ఫుచ్స్-బిర్గిట్ మిచెల్స్ (జర్మనీ)ల చేతిలో ఓడింది. -
గురుసాయిదత్ సంచలనం
ఒడెన్స్ (డెన్మార్క్): అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత క్రీడాకారులు డెన్మార్క్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్ గురుసాయిదత్, పారుపల్లి కశ్యప్తోపాటు అజయ్ జయరామ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్లో మాత్రం మిశ్రమ ఫలితాలు లభించాయి. డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టగా... రైజింగ్ స్టార్ పి.వి.సింధు, అరుంధతి తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. ఈ ఏడాది నిలకడగా రాణిస్తోన్న 23 ఏళ్ల గురుసాయిదత్ సంచలన విజయంతో ముందంజ వేశాడు. ప్రపంచ 11వ ర్యాంకర్ హూ యున్ (హాంకాంగ్)తో జరిగిన తొలి రౌండ్లో గురుసాయిదత్ 21-17, 21-14తో గెలిచాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఇండియన్ ఓపెన్లో హూ యున్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకున్నాడు. 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఆటగాడు రెండు గేముల్లోనూ తొలుత వెనుకబడి ఆ తర్వాత పుంజుకొని గెలవడం విశేషం. రెండో గేమ్లోనైతే గురుసాయిదత్ 9-10తో వెనుకబడి దశలో ఒక్కసారిగా చెలరేగి వరుసగా 11 పాయింట్లు గెలిచాడు. మరోవైపు ప్రపంచ 25వ ర్యాంకర్ అజయ్ జయరామ్ కూడా సంచలన ప్రదర్శన కనబరిచి 21-11, 21-14తో ప్రపంచ 8వ ర్యాంకర్ బూన్సక్ పొన్సానా (థాయ్లాండ్)ను బోల్తా కొట్టించాడు. 32 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో జయరామ్ స్మాష్లతో 19 పాయింట్లు, నెట్వద్ద 11 పాయింట్లు గెలుపొందాడు. ప్రపంచ 16వ ర్యాంకర్ డారెన్ లూ (మలేసియా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 13వ ర్యాంకర్ కశ్యప్ తొలి గేమ్లో 11-4తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా డారెన్ లూ వైదొలిగాడు. మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్కు తొలి రౌండ్లో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. ప్రపంచ 64వ ర్యాంకర్ స్టెఫానీ (బల్గేరియా)తో జరిగిన మ్యాచ్లో సైనా కేవలం 27 నిమిషాల్లో 21-16, 21-12తో విజయం సాధించింది. మరోవైపు ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి.సింధు తొలి రౌండ్లోనే చేతులెత్తేసింది. ప్రపంచ 18వ ర్యాంకర్ ఎరికో హిరోస్ (జపాన్)తో జరిగిన పోరులో సింధు 19-21, 20-22తో ఓటమి చవిచూసింది. హిరోస్ చేతిలో సింధుకిది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. మరో మ్యాచ్లో మహారాష్ట్ర అమ్మాయి అరుంధతి 17-21, 15-21తో టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం 14-21, 14-21తో మైకేల్ ఫుక్స్-ష్కోట్లెర్ (జర్మనీ) జోడి చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప-కోనా తరుణ్ జంట 14-21, 13-21తో యోంగ్ డే లీ-చాన్ షిన్ (దక్షిణ కొరియా) జోడి చేతిలో ఓడింది. -
ముగ్గురూ క్వార్టర్స్లోనే...
టోక్యో: తొలిసారి ఓ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత పొందినా... ఒక్కరు కూడా ముందంజ వేయలేకపోయారు. శ్రీకాంత్, అజయ్ జయరామ్, ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలవ్వడంతో జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్లో భారత కథ ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో అన్సీడెడ్ కె.శ్రీకాంత్ 18-21, 9-21తో ఏడో సీడ్ కెనిచి టాగో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 39 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో శ్రీకాంత్ పోరాట పటిమను కనబర్చాడు. ఓ దశలో 13-18తో వెనుకబడ్డా నెట్ వద్ద మెరుగ్గా ఆడుతూ ప్రత్యర్థి ఆధిక్యాన్ని 17-18కి తగ్గించాడు. అయితే బలమైన స్మాష్లతో చెలరేగిన టాగో వరుసగా మూడు పాయింట్లు సాధించి గేమ్ను గెలుచుకున్నాడు. రెండో గేమ్లో మెరుగైన స్మాష్లతో ఆకట్టుకున్న ఈ ఏపీ కుర్రాడు నెట్ వద్ద విఫలమయ్యాడు. దీంతో గట్టిపోటీ ఇవ్వలేకపోయాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో ప్రణయ్ 11-21, 22-20, 13-21తో హుయాన్ గో (చైనా) చేతిలో;అజయ్ జయరామ్ 18-21, 13-21తో ఐదోసీడ్ టియాన్ మిన్ గుయాన్ (వియత్నాం) చేతిలో ఓడిపోయారు.