breaking news
Sun Raisers
-
పోయి గల్లీ క్రికెట్ ఆడుకో నాయనా.. కావ్య మారన్ ఎందుకు భరిస్తుంది?
-
చెన్నై సూపర్ రాయుడు
ఐపీఎల్లో మరోసారి ఆఖరి బంతి మాయ చేసింది. ఈ సీజన్లో ఒకసారి చివరి బంతికి గెలిచి మరోసారి ఆఖరి బంతికి ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ పక్షానే మరోసారి చివరి బంతి నిలిచింది. మూడు బంతుల్లో16 పరుగులు కావాల్సిన స్థితిలో బ్రేవో బౌలింగ్లో సిక్స్, ఫోర్తో ఉత్కంఠ పెంచిన రషీద్ ఖాన్ చివరి బంతికి సింగిల్కు పరిమితం కావడంతో రైజర్స్కు వరుసగారెండో పరాజయం ఎదురైంది. ఉప్పల్లో తమ గత మ్యాచ్లో ఆఖరి బంతికే ఫోర్తో గట్టెక్కిన హైదరాబాద్ ఈసారి గెలుపు గీత దాటలేకపోయింది. తొలి బంతి నుంచి దాదాపు ఒకే తరహాలో సాగిన మ్యాచ్లో చివరకు హైదరాబాద్పై చెన్నైదే పైచేయి అయింది. రెండు అత్యుత్తమ ప్రదర్శనల్లో అంబటి తిరుపతి రాయుడు గెలుపు వైపు నిలబడగా... విలియమ్సన్ ఓటమి పక్కనే నిలవాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో జోరు పెంచింది. ఆదివారం రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 4 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అంబటి రాయుడు (37 బంతుల్లో 79; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్కు సురేశ్ రైనా (43 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్కు 57 బంతుల్లోనే 112 పరుగులు జోడించడం విశేషం. అనంతరం రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేయగలిగింది. విలియమ్సన్ (51 బంతుల్లో 84; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్కు తోడు యూసుఫ్ పఠాన్ (27 బంతుల్లో 45; 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించినా లాభం లేకపోయింది. వీరిద్దరు ఐదో వికెట్కు 45 బంతుల్లోనే 79 పరుగులు జత చేశారు. దీపక్ చహర్కు 3 వికెట్లు దక్కాయి. భారీ భాగస్వామ్యం... 2, 2, 4... తొలి మూడు ఓవర్లలో చెన్నై చేసిన పరుగులు ఇవి. గత మ్యాచ్ సెంచరీ హీరో వాట్సన్ పరుగులు తీసేందుకు తీవ్రంగా తడబడ్డాడు. భువీ వేసిన నాలుగో ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన వాట్సన్ (9) తర్వాతి బంతికే వెనుదిరగడంతో ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న డు ప్లెసిస్ (11) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆరు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే చేసిన చెన్నై ఈ సీజన్లో పవర్ప్లేలో అతి తక్కువ పరుగులు నమోదు చేసిన జట్టుగా గుర్తింపు పొందింది. అయితే రైనా, రాయుడు జత కలిసిన తర్వాత ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. పది ఓవర్లు ముగిసేసరికి 54 పరుగులు మాత్రమే ఉన్న చెన్నై స్కోరు వీరిద్దరి జోరుతో వేగంగా దూసుకుపోయింది. రషీద్ ఓవర్లో రైనా వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టి దూకుడు పెంచాడు. ఈ జంట విధ్వంసం సృష్టిస్తున్న తరుణంలో సమన్వయ లోపం రాయుడు రనౌట్కు కారణమైంది. కౌల్ బౌలింగ్లో సింగిల్ తీసిన అనంతరం ఓవర్త్రోకు మరో పరుగు చేసేందుకు వీరిద్దరు ప్రయత్నించారు. రైనా పిలుపుపై రాయుడు ముందుకు దూసుకొచ్చాడు. అయితే బంతి దగ్గరలోనే ఉండటం గమనించి రైనా మళ్లీ నివారించడంతో వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించి రాయుడు విఫలమయ్యాడు. అనంతరం 39 బంతుల్లో రైనా అర్ధ సెంచరీ పూర్తయింది. చివర్లో ధోని (12 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడటంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. భువనేశ్వర్ స్థాయి బౌలర్ పూర్తి కోటా వేయలేకపోవడం సన్ వ్యూహ వైఫల్యాన్ని చూపించింది. విలియమ్సన్ మెరుపులు... గత ఐదు సీజన్లలో వార్నర్, ధావన్ లేకుండా తొలి మ్యాచ్ ఆడుతున్న సన్రైజర్స్ ఊహించినట్లుగానే తడబడింది. రెండు ఏళ్ల పాటు జట్టులో సభ్యుడిగా ఉన్నా మ్యాచ్ దక్కని రికీ భుయ్ తొలి అవకాశాన్ని వాడుకోలేకపోయాడు. తీవ్ర ఒత్తిడిలో ఓపెనింగ్ చేసి భుయ్ (0) ఐదో బంతికి డకౌటయ్యాడు. పాండే (0), హుడా (1) కూడా అతడినే అనుసరించడంతో సన్ 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లు చహర్కే దక్కడం విశేషం. ఇలాంటి దశలో విలియమ్సన్, షకీబ్ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి ఆదుకున్నారు. షకీబ్ అవుటయ్యాక విలియమ్సన్, పఠాన్ జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి వేగంగా పరుగులు సాధించడంతో మ్యాచ్లో ఉత్కంఠ పెరిగింది. ముఖ్యంగా కరణ్ శర్మ వేసిన ఓవర్లో విలియమ్సన్ మూడు భారీ సిక్సర్లతో చెలరేగడంతో 22 పరుగులు వచ్చాయి. బ్రేవో వేసిన తర్వాతి ఓవర్లో పఠాన్ మరో రెండు సిక్సర్లు బాదాడు. అయితే ఏడు పరుగుల వ్యవధిలో వీరిద్దరు అవుట్ కావడంతో చెన్నై ఊపిరి పీల్చుకుంది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (సి) హుడా (బి) భువనేశ్వర్ 9; డు ప్లెసిస్ (స్టంప్డ్) సాహా (బి) రషీద్ ఖాన్ 11; సురేశ్ రైనా నాటౌట్ 54; అంబటి రాయుడు రనౌట్ 79; ధోని నాటౌట్ 25; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–14, 2–32, 3–144. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–22–1, స్టాన్లేక్ 4–0–38–0, షకీబ్ 4–0–32–0, సిద్ధార్థ్ కౌల్ 4–0–33–0, రషీద్ ఖాన్ 4–0–49–1, దీపక్ హుడా 1–0–8–0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: రికీ భుయ్ (సి) వాట్సన్ (బి) చహర్ 0; విలియమ్సన్ (సి) జడేజా (బి) బ్రేవో 84; మనీశ్ పాండే (సి) కరణ్ శర్మ (బి) చహర్ 0; హుడా (సి) జడేజా (బి) చహర్ 1; షకీబ్ (సి) రైనా (బి) కరణ్ శర్మ 24; యూసుఫ్ పఠాన్ (సి) రైనా (బి) ఠాకూర్ 45; సాహా నాటౌట్ 5; రషీద్ ఖాన్ నాటౌట్ 17 ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–0, 2–10, 3–22, 4–71, 5–150, 6–157. బౌలింగ్: దీపక్ చహర్ 4–1–15–3, శార్దుల్ ఠాకూర్ 4–0–45–1, వాట్సన్ 2–0–23–0, రవీంద్ర జడేజా 4–0–28–0, కరణ్ శర్మ 3–0–30–1, బ్రేవో 3–0–37–1. ముందుండి నడిపించి... రాయుడు... రాయుడు... ఆదివారం ఉప్పల్ స్టేడియం ఈ పేరుతో మార్మోగిపోయింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలవాలని కోరుకుంటూ వచ్చిన ఫ్యాన్స్ కూడా అంతే అభిమానంతో తమవాడిగా భావించి స్టేడియంలో ప్రతీ బంతికి తనను ప్రోత్సహిస్తుంటే రాయుడు ఎప్పటికీ గుర్తుంచుకునే ప్రత్యేక ఇన్నింగ్స్ ఆడాడు. బహుశా అతనికి కూడా మొదటిసారి సొంత మైదానంలో ఆడుతున్న అనుభూతి కలిగినట్లుంది. ఎందుకంటే అతను ఐపీఎల్ ప్రారంభమయ్యాక దేశవాళీ క్రికెట్లో తొలిసారి ఇటీవలే హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత వచ్చిన ఐపీఎల్ ఇదే. అంబటి రాయుడు 2010 నుంచి 2017 వరకు ఎనిమిది సీజన్ల పాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇన్నేళ్ళలో అతను బరోడాకు చెందిన ఆటగాడిగానే గుర్తింపు పొందాడు. ఒక సీజన్ విదర్భకు ఆడినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇదే మైదానంలో 2017 ఫైనల్లో పుణే 4 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన స్థితిలో డీప్ కవర్లో స్మిత్ క్యాచ్ను అద్భుతంగా అందుకొని గర్జించిన రాయుడు అదే వేదికపై తన తర్వాతి మ్యాచ్లో మరో జట్టు తరఫున బ్యాటింగ్తో చెలరేగాడు. గతంలో సన్రైజర్స్పై హైదరాబాద్లో ఆడిన మూడు మ్యాచ్లలో రాయుడు 34, 68, 54 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ పరిస్థితి వేరు. మరొకరికి సహాయపాత్రలో కాకుండా తాను ముందుండి దూకుడుగా నడిపించిన తీరు చూస్తే ఈ ఇన్నింగ్స్ విశేషమైనదే. చెన్నై స్కోరు 2 వికెట్లకు 32 వద్ద రాయుడు క్రీజ్లోకి వచ్చాడు. రెండో బంతికి ఫోర్తో ఖాతా తెరిచిన అతను, భువనేశ్వర్ బౌలింగ్లో భారీ సిక్స్ బాదాడు. ఇదే సూపర్కింగ్స్ జోరుకు బీజం వేసింది. ముఖ్యంగా స్టాన్లేక్ వేసిన ఓవర్లో అతను రౌద్ర రూపం చూపించాడు. మూడు ఫోర్లు, ఒక సిక్స్తో ప్రత్యర్థి పనిపట్టాడు. ఈ మ్యాచ్లో రాయుడు ఆడిన ప్రతీ షాట్లో అమితమైన ఆత్మవిశ్వాసం కనిపించింది. ఏ దశలోనూ, ముఖ్యంగా రివర్స్ స్వీప్ ఆడేటప్పుడు కూడా అతను తడబాటుకు గురి కాలేదు. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X పంజాబ్ వేదిక: ఢిల్లీ, రా.గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
జిల్లాలో బెట్టింగ్ల జోరు!
చిత్తూరు(క్రైమ్), న్యూస్లైన్: క్రికెట్ మ్యాచ్లపై జిల్లాలో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. చాంపియన్స్లీగ్ (సీఎల్ టీ-20) మ్యాచ్లు ఇటు బుకీలతో పాటు అటు జూదప్రియులకు సైతం కాసులు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని మదనపల్లె, చిత్తురు, తిరుపతి ప్రాంతాల్లో బుకీలు మకాం వేసి బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. లా డ్జీలు, గెస్ట్హౌస్లు, అటవీప్రాంతాలు, పంట పొలాల వద్ద ఉన్న ఫామ్ హౌస్లను బెట్టింగ్కేంద్రాలుగా ఎంచుకొని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. జట్టు ప్రాముఖ్యత, మ్యాచ్ స్వరూపం, బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో దిగ్గజాలను ఎంచుకొని రూ.వెయ్యి నుంచి లక్షలు, కోట్ల రూపాయల వరకు వెచ్చిస్తున్నారు. అయితే బుకీ కి, హంటర్కు మధ్య ముఖ పరిచయం లేకుండానే బ్యాంకు ఖాతాలు, ఇంటర్నెట్ ద్వారానే బెట్టింగ్ లావాదేవీలు సాఫీగా జరిగిపోతున్నాయి. రూ.50 వేలు జమ చేస్తేనే.. బుకీలు ఎవరికంటేవారికి బెట్టింగ్కు అవకాశం ఇవ్వరు. ప్రస్తుతం కొనసాగుతున్న బెట్టింగ్లో ఉన్న ఏజెంట్లు కానీ, నమ్మకమైన సభ్యుడు కానీ ఎవరో ఒకరు సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఇలా బెట్టింగ్కు అర్హత పొందిన వారిని ‘హంటర్’ అంటారు.బుకీ అకౌంట్లో రూ.50 వేలు జమచేసిన రోజు నుంచే హంటర్ బెట్టింగ్లో పాల్గొనవచ్చు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి అర్ధ గంట ముందు ఎంతమంది హంటర్లు బెట్టింగ్కు దిగుతారో బుకీకి ఫోన్ చేసి తెలుపుతారు. ఇంటన్నెట్లో హంటర్లు రూ.5 వేల నుంచి 50 లక్షల వరకు బెట్టింగ్ కాస్తారు. రూ.50 వేలు అంతకు మించి వెచ్చించేవారు డిపాజిట్లు కూడా అంతే స్థాయిలో జమ చేయాల్సి ఉంటుంది. గెలుపొందిన తరువాత బుకీ మరుసటిరోజు 10, 11 గంటల లోపు హంటర్ ఖాతాలో డబ్బు జమ చేస్తాడు. ఒకవేళ హంటర్ ఓడిపోతే వారు కూడా 11 గంటల్లోపు బ్యాంక్ ఖాతాలో ఖచ్చితంగా జమచేయాల్సిందే. ఒక్కోదానికి ఒక్కో రేటు ఫోర్, సిక్స్, హాఫ్సెంచరీ, సెంచరీ అంటూ బ్యాట్స్మెన్లపై, బౌలింగ్లో ఫలానా ఓవర్లో ఏ బ్యాట్స్మెన్ ఔట్ అవుతారు అనే వాటిపై బెట్టింగ్కు డబ్బు వెచ్చిస్తారు. మ్యాచ్ స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చే సత్తావున్న బ్యాట్స్మెన్లు, బౌలర్ల పైనా అధికమొత్తంలో బెట్టింగులకు దిగుతున్నారు. ఫలానా బ్యాట్స్మేన్ ఇన్ని ఫోర్లు, ఇన్ని సిక్సర్లు బాదతాడని ఒక్కోఫోర్, సిక్స్కు రూ.5 వేల నుంచి రూ. 10 వేల వరకు పందెం కాస్తున్నారు. దీంతో పాటు ఈ చాంపియన్స్లీగ్లో హాట్ ఫేవరెట్ జట్లుగా బరిలోకి దిగిన చెన్నై, సన్రైజర్స్, రాజస్థాన్, ముంబై టీములపై రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు పందెంకాసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పల్లెలకు తాకిన బెట్టింగ్ సెగ బెట్టింగ్ సెగ నగరాలు, పట్టణాలతో పాటు పల్లెలకు కూడా పాకింది. పల్లెల్లో చెట్లకింద దాయాలు, పేకాట ఆడేవారందరూ క్రికెట్ బెట్టింగ్పై పడుతున్నారు. మొబైల్లో ఇంటర్నెట్, రేడియోల ద్వారా ఎప్పటికప్పుడు స్కోర్లు తెలుసుకుంటూ మోజు పెంచుకుంటున్నారు. పల్లెల్లో రూ.10 నుంచి 50, 100, 200 ఇలా రూ.1000 వరకు వెచ్చించడానికి సిద్ధపడుతున్నారు. మరి కొన్ని బ్యాచ్లు పలమనేరు, శ్రీకాళహస్తి, పీలేరు, పుత్తూరు మొలకలచెరువు ప్రాంతాల్లో జనావాసాల మధ్య ఖాళీగా ఉన్న ఇళ్లను అద్దెకు తీసుకొని ఎవరికీ అనుమానం రాకుండా ఇంటిముందు తాళం వేసి లోపల టీవీలు పెట్టుకొని బెట్టింగులు కాస్తున్నారు. ఈ తరహా బెట్టింగ్లో అప్పటికప్పుడే డబ్బులు వెచ్చించి, అప్పటికప్పుడే వసూలు చేస్తున్నారు. బెట్టింగులో పోలీసుల పాత్ర ? క్రి కెట్ బెట్టింగ్లో కొంతమంది కిందిస్థాయి పోలీసు సిబ్బంది సహకారం ఉన్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. పోలీసుల నుంచి ఏ సమస్య తలెత్తకుండా ఉండేలా బుకీలు, ఏజెంట్లు మదనపల్లె, చిత్తూరు, పీలేరు తదితర ప్రాంతాల్లో కొంతమంది చోటాలీడర్లు, క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. భారీ మొత్తంలో బెట్టింగులు పెట్టినట్లయితే ఆ పరిసర ప్రాంతాల్లో గూఢచారులను నియమించి పోలీసుల కదలికలను గుర్తిస్తూ ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారం అందుకొని జాగ్రత్త పడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికైనా పోలీసులు దృష్టి సారించి బెట్టింగ్ను అరికట్టాల్సి ఉంది.