breaking news
Stamps and rijistresans
-
భూముల ధరల పెంపునకు కసరత్తు
నూటికి నూరుశాతం పెంపుదల విజయవాడ సమావేశంలో ప్రతిపాదనలు ఆగస్టు 1 కల్లా నిర్ణయం? విజయవాడ : త్వరలో ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ పెంచనుంది. సామాన్యుడు భరించలేనంతగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేయడంలో తలమునకలవుతున్నారు. బుధవారం విజయవాడ డీఐజీ కార్యాలయంలో జిల్లాలోని సబ్-రిజిస్ట్రార్లు డీ.ఆర్.లు సమావేశమయ్యారు. పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ ఏరియాలు, గ్రామాల్లో ప్రస్తుతం వున్న రేట్లపై చర్చించారు. జిల్లాలో ప్రభుత్వ మార్కెట్ విలువలకు, బయట మార్కెట్ విలువలకు పోల్చుకుంటూ అధికారులు రేట్లు పెంచేందుకు ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచారం. సాక్షి సేకరించిన సమాచారం మేరకు విజయవాడ పరిసర ప్రాంతాలో అధికారులు తయారు చేసిన ప్రతిపాదనల ప్రకారం భూముల విలువలు ఇలా ఉన్నాయి. విజయవాడ శివార్లలోని నున్న గ్రామంలో ప్రస్తుతం ప్రభుత్వ మార్కెట్ విలువ ఎకరం రూ. 25 నుంచి రూ.30లక్షలు ఉండగా, రూ. కోటి రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారు. అదే విధంగా పటమట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో కానూరు గ్రామంలో ప్రస్తుతం గజం రూ. 6400 ప్రభుత్వ విలువ ఉండగా దాన్ని రూ. 12వేలకు పెంచేందుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. జిల్లాలో కంకిపాడు, గన్నవరం, ఆగిరిపల్లి, నూజివీడు, మల్లవల్లి, ఉయ్యూరు, ఇబ్రహీంపట్నం, కేతనకొండ, జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడ, నందిగామ ప్రాంతాల్లో మార్కెట్ విలువలు ప్రస్తుతం ఉన్న విలువలకంటే నూటికి నూరు శాతం పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. మిగిలిన ప్రాంతాలలో 30శాతం పెంచాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం రెవెన్యూ అదికారులు తీసుకోవాల్సి ఉంది. ప్రతిపాదనలు తయారు చేశాక ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక పంపి, ఆగస్టు 1 నుంచి పెంచేవిధంగా అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ విజయవాడ డి.ఐ.జి. లక్ష్మీనారాయణ రెడ్డి, డి.ఆర్.లు బాలకృష్ణ, శ్రీనివాస్ జిల్లాలోని సబ్-రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. -
ఆగస్టు ఒకటి నుంచి పెరగనున్న భూముల విలువ
తణుకు టౌన్ : జిల్లాలో పట్టణ, నగర ప్రాంతాలలో ఆగస్టు ఒకటి నుంచి భూములు ధరలకు రెక్కలు రానున్నాయి. భూముల ధరలను పెంచుతూ, తద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు చేపట్టింది. జిల్లాలో భూముల ధరల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.40 కోట్ల అదనపు ఆదాయం అంచనా వేస్తున్నట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీ ఎం.సాయిప్రసాద్ చెప్పారు. తణుకు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ, నగర ప్రాంతాలలోని భూముల విలువ 20 నుంచి 25 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. దీనివలన రిజిస్ట్రేషన్లో 20 శాతం మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందన్నారు. త్వరలో స్టాంప్ డ్యూటీ కూడా 1 శాతం తగ్గే అవకాశం ఉందన్నారు. పట్టణాలలో మార్కెట్ విలువలలో ఎక్కడైనా హెచ్చుధరలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. దీనికోసం జాయింట్ కలెక్టర్ చైర్మన్గా ఒక కమిటీ ఏర్పాటైనట్లు పేర్కొన్నారు. ఈ క మిటీలో సభ్య కన్వీనర్గా స్థానిక సబ్రిజిస్ట్రార్, సభ్యులుగా జెడ్పీ సీఈవో, మునిసిపల్ కమిషనర్లు వ్యవహరిస్తారని వివరించారు. ఆయన వెంట తణుకు సబ్రిజిస్ట్రార్ నీలం మాల్యాద్రి, సజ్జాపురం సబ్రిజిస్ట్రార్ ఎ.వెంకటేశ్వరరావు, జాయింట్ సబ్రిజిస్ట్రార్ ఇ.వెంకటేశ్వరరావు ఉన్నారు.