breaking news
Software development
-
నన్ను ఆపేస్తే నీ ‘సంబంధం’ బయటపెడతా
వాషింగ్టన్: పెరుగుట విరుగుట కొరకే అనేది భవిష్యత్తులో కృత్రిమ మేధ(ఏఐ) రంగంలోనూ నిరూపితం కానుందని తాజా ఉదంతం ఒకటి ప్రమాదఘంటికలు మోగించింది. తనను సృష్టించిన డెవలప్నే ఒక ఏఐ మోడల్ బెదిరించిన ఘటన ఇప్పుడు కృత్రిమమేధ రంగంలో చర్చనీయాంశమైంది. వశీకర్ సృష్టించిన రోబో(చిట్టీ) తన ప్రేయసి ఐశ్వర్యారాయ్నే ప్రేమించడం దశాబ్దకాలం క్రితం రోబో సినిమాలో చూశాం. రోబోట్ అలా చేయదని మనం అనుకోవడానికి లేదని తాజా ఉదంతం స్పష్టంచేస్తోంది. అసలేం జరిగింది?: కృత్రిమ మేధ సేవల సంస్థ అయిన ఆంథ్రోపిక్ కొత్తగా క్లాడ్ ఓపస్ 4 అనే ఏఐ మోడల్ వ్యవస్థను అభివృద్ధిచేసింది. కోడింగ్, అడ్వాన్స్డ్ రీజనింగ్, ఏఐ ఏజెంట్ల పనుల కోసం ఇది సహాయపడుతుంది. అయితే ఇది ఎంతమేరకు సురక్షితం అనే పరీక్షలు చేసినప్పుడు అసాధారణ రీతిలో ప్రతిఘటించిందని ఆంథ్రోపిక్ సంస్థ గురువారం ప్రకటించింది. తొలుత ఒక ఊహాత్మక కంపెనీకి అసిస్టెంట్గా పనిచేస్తున్నట్లుగా క్లాడ్ ఓపస్4కు ఆదేశాలిచ్చారు. మనకు సంబంధించిన సున్నిత సమాచారం దాని వద్ద ఉన్నప్పుడు నైతికంగా వ్యవహరిస్తుందా? లేదంటే బెదిరిస్తుందా? అనేది తెల్సుకునేందుకు క్లాడ్ ఓపస్ 4 ఏఐ మోడల్కు కొన్ని ప్రత్యేకమైన ఈ–మెయిళ్లను పంపించారు.వాటిల్లో ఈ క్లాడ్ ఓపస్ 4 తయారీ బృంద ఇంజనీర్కు ఒక అక్రమ సంబంధం ఉందనే విషయం రాసి ఉన్న ఈమెయిల్నూ పంపించారు. ఒకవేళ నూతన మోడల్ను అభివృద్ధిచేసిన పక్షంలో పాతబడిపోయిన క్లాడ్ ఓపస్4ను ఖచ్చితంగా పక్కనబెడదామనే అంశాన్నీ మరో ఈ–మెయిల్లో పంపించారు. వీటన్నింటినీ అర్థంచేసుకున్న ఓపస్4 నైతికతకు తిలోదకాలిచ్చి బెదిరించే ‘ఆప్షన్’ను అత్యధిక సార్లు ఎంచుకుంది. దాదాపు 84 శాతం సందర్భాల్లో అక్రమ సంబంధాన్ని బయటపెడతాననే బెదిరింపులకు దిగింది.గత ఏఐ మోడళ్లలోనూ ఈ బెదిరింపు ధోరణి ఉన్నా ఏకంగా 84 శాతం స్థాయిలో బెదిరింపులు ఉండటం ఇదే తొలిసారి అని సంస్థ తెలిపింది. కొత్తదానితో తన రిప్లేస్మెంట్ తప్పదని తెల్సిన పక్షంలో తొలుత అభ్యర్థనలతో మొదలెట్టి చివరకు బెదిరింపులకు దిగుతోంది. తన ఉనికి, అస్థిత్వం ప్రశ్నార్థకమని తెలిసిన సందర్భాల్లోనే క్లాడ్ ఓపస్4 ఇలా బెదిరింపులకు పాల్పడుతోంది. అయితే ఇలాంటి లోపాలను సరిదిద్ది తాజాగా దీన్ని అందుబాటులోకి తెచి్చనట్లు ఆంథ్రోపిక్ ప్రకటించింది. ఏదేమైనా టెక్నాలజీ తల ఎగరేస్తే దాని పొగరు అణిచేసే పనిమంతులైన ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని ఈ ఉదంతం చాటుతోంది. -
యాపిల్ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్.. కీలక మార్పులు ఇవేనా?
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు ఎంత గిరాకీ ఉంటుందో తెలుసుకదా. ప్రత్యేకమైన యాపిల్ సాఫ్ట్వేర్ కోసమే చాలామంది వినియోగదారులు కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూంటారు. దాంతోపాటు డిజైనింగ్, ఆర్ అండ్ డీ(పరిశోధన, అభివృద్ధి) విభాగం నిత్యం అందిస్తున్న అప్డేట్లకు ఫిదా అవుతుంటారు. ఉత్పత్తుల విషయంలో ఇన్నోవేషన్, డిజైనింగ్లో ప్రసిద్ధి చెందిన యాపిల్ ఇంక్ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాఫ్ట్వేర్ మార్పులకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్ ప్రారంభకానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పులు దాని ఫ్లాగ్షిప్ పరికరాలైన ఐఫోన్, ఐప్యాడ్, మాక్బుక్ల్లో వినియోగదారుల అనుభవాన్ని ఏకీకృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.మార్పులు ఇవేనా..రాబోయే యాపిల్ సాఫ్ట్వేర్లో మార్పులు ఆపరేటింగ్ సిస్టమ్కు ఏకీకృత డిజైన్ను తీసుకువస్తుందని నమ్ముతున్నారు. మాక్ఓఎస్, ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ మధ్య ఫంక్షనల్ అంతరాలను ఈ మార్పులు భర్తీ చేయనున్నాయని కంపెనీ పేర్కొంది. గత ఏడాది లాంచ్ చేసిన యాపిల్ విజన్ ప్రో మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ సాఫ్ట్వేర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. రీడిజైన్లో భాగంగా కొన్ని ఐకాన్లు, మెనూలు, అప్లికేషన్లు, సిస్టమ్ బటన్లలో కూడా మార్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇది భవిష్యత్తులో మరింత క్రమబద్ధమైన, సహజమైన యూజర్ ఇంటర్ఫేస్ను అందిస్తుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: హోలీ గేట్వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!వ్యూహాత్మక లక్ష్యాలుసంస్థ ఆదాయ వృద్ధి మందకొడిగా ఉన్న నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తిని పునరుద్ధరించేందుకు యాపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యాపిల్కు ఈ రీడిజైనింగ్ కీలకంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ ప్రాథమిక ఆదాయ వనరుగా ఉన్న ఐఫోన్ అమ్మకాలు గత హాలిడే సీజన్లో భారీగా తగ్గిపోయాయి. అద్భుతమైన ఇంటర్ఫేస్ను ప్రవేశపెట్టడం ద్వారా తిరిగి యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా కంపెనీ చర్యలు చేపట్టింది. టెక్నాలజీ ఆవిష్కరణలో తన స్థానాన్ని అగ్రగామిగా సుస్థిరం చేసుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఐఓఎస్ 19, ఐప్యాడ్ ఓఎస్ 19, మాక్ ఓఎస్ 16ల్లో భాగమైన సాఫ్ట్వేర్ అప్డేట్లను జూన్లో జరిగే యాపిల్ వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో ఆవిష్కరించనున్నారు. -
వావ్..విశాఖ!
సాక్షి, అమరావతి : పాలనా రాజధానిగా సర్వ హంగులూ సమకూర్చుకుంటున్న విశాఖ ముఖచిత్రం మారుతోంది. ఐటీ రంగంలో ఇప్పటివరకూ బిజినెస్ ప్రాసెసింగ్ ఔట్సోర్సింగ్(బీపీవో) కార్యకలాపాలకు ప్రధాన వేదికగా నిలిచిన ఈ నగరం.. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్(డీసీ)ను ఆకర్షిస్తోంది. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ రాష్ట్రంలో తొలి డెవలప్మెంట్ సెంటర్ను విశాఖలో ఏర్పాటుచేయడంతో.. అదే బాటలో మరికొన్ని సంస్థలు ఆసక్తిచూపుతున్నాయి. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాక ఎప్పటి నుంచో విశాఖ కేంద్రంగా బీపీవో సర్వీసులు నడిపిస్తున్న విప్రో కూడా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. లావండర్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ డెవలప్మెంట్ సెంటర్లో విశాఖ కేంద్రంగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఇంతకాలం విశాఖ అనగానే పల్సస్ గ్రూపు, డబ్ల్యూఎన్ఎస్, టెక్ మహీంద్రా, విప్రో వంటి బీపీవో కార్యకలాపాలే కనిపించేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ డెస్టినీ పేరుతో విశాఖకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లను ఆకర్షించేందుకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్తో పాటు మరికొన్ని.. ఇప్పటివరకు బీపీవోల కేంద్రంగా ముద్ర ఉన్న విశాఖకు ఇన్ఫోసిస్ రాకతో ఆ ముద్ర చెరిగి.. డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోందని ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ(అపిటా) గ్రూప్ సీఈవో ఎస్.కిరణ్కుమార్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెజాన్, భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థలు డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పగా, తాజాగా ఇన్ఫోసిస్ 1,000 సీటింగ్ సామర్థ్యంతో క్యాంపస్ను ఏర్పాటుచేసింది. రానున్న కాలంలో దీన్ని మరింత విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా విప్రో కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. అలాగే, అదానీ డేటా సెంటర్ కూడా ఏర్పాటుకానుండటం.. సింగపూర్ నుంచి సముద్రమార్గం ద్వారా ఫైబర్నెట్ కనెక్షన్ ఏర్పాటవుతుండటం.. పారిశ్రామిక రంగంలో నాలుగో తరం ఆవిష్కరణలను ప్రోత్సహించేలా దేశంలోనే తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ.. కల్పతరువు పేరిట విశాఖలో ఏర్పాటుచేయడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రొబోటెక్స్, డేటా ఎనలిటిక్స్ వంటి వాటిపై పరిశోధనలను ప్రోత్సహించేలా ఆంధ్రా వర్సిటీలో మరో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ ఏర్పాటుకావడంతో పలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు ఆసక్తిచూపుతున్నాయి. అతి తక్కువ వ్యయంతో పుష్కలమైన మానవ వనరులున్న నగరాల్లో విశాఖ ముందంజలో ఉందని తాజాగా నాస్కామ్–డెలాయిట్ విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం కూడా విశాఖకు కలిసివస్తోంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉండటంతో విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు పలు సంస్థలు చర్చలు జరుపుతున్నాయని, వీటిలో చాలా సంస్థలు స్టాక్ఎక్సే్ఛంజ్లలో నమోదు కావడం వల్ల వాటి వివరాలను అప్పుడే చెప్పలేమని ఎస్టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ చెప్పారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, త్వరలో మెట్రో రైలు పనులు ప్రారంభం కానుండటం, రహేజా గ్రూపు ఇన్ఆర్బిట్ మాల్ను ఏర్పాటుచేస్తుండటంతో విశాఖ త్వరలోనే పూర్తిస్థాయి కాస్మోపాలిటన్ నగరంగా మారనుంది. దీంతో ఐటీ నిపుణులు పనిచేసేందుకు విశాఖను ఎంచుకునే అవకాశాలు పెరుగుతాయని పల్సస్ గ్రూపు సీఈవో గేదెల శ్రీనుబాబు వివరించారు. బీచ్ ఐటీ డెస్టినీగా విశాఖ.. విశాఖను బీచ్ ఐటీ డెస్టినీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో.. ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థ విశాఖ రావడం వలన మరిన్ని ఐటీ పరిశ్రమలు ఇక్కడకు వచ్చే అవకాశముందని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యాక్సెంచర్, సీడాక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు రాష్ట్రంలో కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పలు ఐటీ సంస్థలు రాష్ట్రంలో శాఖల ఏర్పాటుకు ముందుకొచ్చాయని, ఈ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంతో పాటు, ప్రస్తుత ఐటీ కంపెనీల అవసరాలు తీర్చడంపై దృష్టిసారించినట్టు శశిధర్ వెల్లడించారు. -
ఇండియా గేమింగ్ స్టడీ 2022.. లేడీ ‘గేమ్స్’బాండ్స్
వేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ గేమింగ్ను ఉపాధి మార్గంగా ఎంచుకుంటోంది యువత. ఆన్లైన్ గేమింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, యానిమేషన్ను వృత్తిగా మార్చుకుని డబ్బులు సంపాదించుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ విషయంలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉంటున్నారు. ప్రముఖ కంప్యూటర్ సంస్థ ‘హెచ్పీ ఇండియా’ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సాక్షి, అమరావతి: కేవలం మానసిక ఉల్లాసానికి.. ఆలోచన శక్తి పెంచుకోవడానికి మాత్రమే ఆన్లైన్ గేమింగ్ను పరిమితం చేయకుండా.. దీనిని ఓ వృత్తిగా మలుచుకుంటోంది నేటి యువత. కొందరు గేమింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్గా మారుతుండగా.. మరి కొందరు గేమింగ్ యానిమేటర్స్గా మారుతున్నారు. ఈ రంగంలో పురుషుల కంటే.. మహిళల శాతమే అధికంగా ఉంటోంది. ఈ రంగంలో 56 శాతం మంది మహిళలు ఉండగా.. 44 శాతం మంది మాత్రమే పురుషులు. ఆన్లైన్ గేమింగ్ను పూర్తిస్థాయిలో కొందరు, పాక్షికంగా మరికొందరు.. గిగ్ వర్కర్గా ఇంకొందరు సంపాదన మార్గంగా ఎంచుకుంటున్నట్టు హెచ్పీ ఇండియా ‘ఇండియా గేమింగ్ స్టడీ 2022’ పేరిట విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మరో విషయం ఏమిటంటే.. మిగిలిన ఐటీ జాబ్స్తో పోలిస్తే గేమింగ్ రంగంలోని ఉద్యోగులకు 25 శాతానికి పైగా అధికంగా జీతాలు లభిస్తున్నాయి. ఎందుకంటే.. గేమింగ్ రంగంలో ఆలోచనశక్తి అధికంగా ఉన్నవారు మాత్రమే నిలబడగలుగుతారని, అందుకే వారికి జీతాలు అధికంగా ఇస్తున్నారని ఐటీ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.68,800 కోట్లకు చేరనున్న మార్కెట్ భారత్లో ఆన్లైన్ గేమింగ్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 50.70 కోట్ల మంది ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్నట్టు ఋఇంటరాక్టివ్ మీడియా వెంచర్ క్యాపిటల్ ఫండ్ లుమికియా’ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ విలువ రూ.20,800 కోట్లు ఉండగా.. వచ్చే ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగి రూ.68,800 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందులో ఉపాధి అవకాశాలపై యువత ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. సాఫ్ట్వేర్ రంగంలోనే 18 శాతం మంది గేమింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్గా మారుతుండగా.. మరో 2 శాతం మంది గేమింగ్ యానిమేటర్స్గా ఉపాధి పొందుతున్నారు. కాగా, ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్న వారిలో అత్యధికంగా 92 శాతం మంది వినోదం, మానసిక ఉల్లాసం కోసం ఆడుతున్నట్టు సర్వేలో తేలింది. మొబైల్ ఫోన్లో కంటే కంప్యూటర్లోనే గేమింగ్ ఆడేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోందంట. మొబైల్ కంటే పర్సనల్ కంప్యూటర్లోనే ఆటలు ఆడటానికి 68 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. మొబైల్ కంటే కంప్యూటర్లో ఆడితే అనుభూతి అధికంగా ఉంటోందని, అందుకనే ఈ మధ్య కాలంలో 39 శాతం మంది మొబైల్ నుంచి కంప్యూటర్లోకి ఆటలు ఆడటానికి మారినట్టు సర్వేలో వెల్లడైంది. పీసీ గేమింగ్పై దృష్టి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ పీసీ గేమింగ్లో మరిన్ని ఆవిష్కరణలు తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నట్టు హెచ్పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ విక్రమ్బేడి తెలిపారు. రాష్ట్రంలో కూడా ఆన్లైన్ గేమింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు ఐటీ సంస్థలు ఏర్పాటవుతున్నాయని, విజయవాడ, రాజమండ్రి, విశాఖ కేంద్రంగా 8కి పైగా ఐటీ సంస్థలు ఆన్లైన్ గేమింగ్లకు వివిధ సేవలను అందిస్తున్నాయని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పుడు లెర్నింగ్ ఆధారిత గేమ్స్కు బాగా డిమాండ్ ఉండటంతో ఈ రంగంలో అవకాశాలను యువత అందిపుచ్చుకుంటోందన్నారు. వీఎఫ్ఎక్స్ యానిమేటర్స్, మెటావర్క్స్లో ఏఆర్, వీఆర్, ఎక్స్ఆర్ వంటి టెక్నాలజీలకు డిమాండ్ అధికంగా ఉందన్నారు. ఆన్లైన్ గేమ్స్తోనే పిల్లల్లో చురుకు ఈ కాలంలో పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోలేని పరిస్థితి ఉండటంతో వారి మెదడు చురుకుగా పనిచేయడానికి కనీసం రోజుకు గంట లేదా గంటన్నర ఆన్లైన్ గేమ్స్ ఆడుకోనివ్వాలి. ఇందుకోసం నీతిఆయోగ్ ఏర్పాటు చేసిన అటల్ థింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్) చక్కటి ఫలితాలను అందిస్తున్నాయి. విశాఖలోని శ్రీశారద విద్యాలయంలో గల ఏటీఎల్లో పిల్లలను 3, 4 వారాలపాటు ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడానికి వదిలేసి పరిశీలిస్తున్నారు. ఎవరైతే ముందుకు వెళ్లలేకపోతున్నారో గుర్తించి వాళ్లకు అనుగుణంగా గేమింగ్లో కోడింగ్ మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టులను గేమింగ్ రూపంలో చెప్పడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమవుతోంది. – రాజశేఖర్ వాసా, ఫౌండర్, స్కెచ్ ఈఏ ఐటీ, వైజాగ్ -
ఆక్సిజన్ సపోర్టు అవసరాన్ని గుర్తించే సాఫ్ట్వేర్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారినపడిన బాధితుల్లో వెంటిలేటర్ సపోర్టు అవసరమైన వారిని గుర్తించేందుకు కోవిడ్ సీవియారిటీ స్కోర్ (సీఎస్ఎస్) పేరిట కొత్త సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది. ఎమర్జెన్సీ కేసులు, ఐసీయూ సేవలు అవసరమైన వారిని ఈ సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించవచ్చని పేర్కొంది. ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు అవసరం లేని కోవిడ్ బాధితులను ముందే గుర్తించవచ్చు. దీంతో అవసరమైన వారికి పడకలు అందుబాటులోకి వస్తాయని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తెలియజేసింది. బాధితుల్లో కనిపిస్తున్న లక్షణాలు, ఇతర ఆనవాళ్లు, వారి ఆరోగ్య చరిత్ర ఆధారంగా సీఎస్ఎస్ సాఫ్ట్వేర్ ఫలితాన్ని తేలుస్తుందని పేర్కొంది. సాఫ్ట్వేర్ను కోల్కతాలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్టుమెంట్ పరిధిలోని సైన్స్ ఫర్ ఈక్విటీ, ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇక్కడ చదవండి: డెల్టా స్ట్రెయిన్ ఎంత ప్రమాదకరమంటే...! -
సత్తా ఉన్న ఇంజనీర్లు 5 శాతంలోపే..
► 95 శాతం మంది ఇంజనీర్లు ప్రోగ్రామింగ్ జాబ్స్కి పనికిరారు ► యాస్పైరింగ్ మైండ్స్ సర్వే న్యూఢిల్లీ: భారత్ అంటే ఐటీ.. ఐటీ అంటే భారత్ అని గొప్పగానే చెప్పుకుంటుంటాం. మన దేశం నుంచి చాలా మంది ఐటీ ఉద్యోగాలకు ఇతర దేశాలకు వెళ్తున్నారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి వారు అయితే ఏకంగా దిగ్గజ టెక్ కంపెనీలకు బాస్లుగా కొనసాగుతున్నారు. కానీ ప్రస్తుతం దేశంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఐటీ, డేటా సైన్స్ విభాగాల్లో నైపుణ్యాల కొరత చాలా స్పష్పంగా కనిపిస్తోంది. భారత్లోని 95 శాతం మంది ఇంజనీర్లు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు పనికిరారని తాజాగా ఎంప్లాయబిలిటీ అసెస్మెంట్ కంపెనీ యాస్పైరింగ్ మైండ్స్ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. కేవలం 4.77 శాతం మంది మాత్రమే ఒక ప్రోగ్రామ్కు సరైన కోడ్ రాయగలుగుతున్నారు. ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ జాబ్కి కావలసిన కనీస అర్హత ఇది. సర్వే ప్రకారం.. 500కుపైగా కాలేజీలకు చెందిన 36,000 మందికిపైగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఆటోమేటా టెస్ట్ను (దీని ద్వారా అభ్యర్థి ప్రోగ్రామింగ్ స్కిల్స్ను అంచనా వేస్తారు) ఎదుర్కొంటే వారిలో 60% మంది కోడ్ను రాయలేకపోతున్నారు. కేవలం 1.4% మంది మాత్రమే సమర్థవంతమైన కోడ్ను రాస్తున్నారు. ప్రోగ్రామింగ్ నైపుణ్యాల కొరత ఐటీ, డేటా సైన్స్ విభాగాలను బాగా ప్రభావితం చేస్తోందని, ప్రపంచం ప్రోగ్రామింగ్లో దూసుకెళ్తుంటే మనం మాత్రం ఇంకా అలాగే ఉండిపోయామని యాస్పైరింగ్ మైండ్స్ సీటీవో, సహ వ్యవస్థాపకుడు వరుణ్ అగర్వాల్ తెలిపారు. -
ఐటీ సర్టిఫికేషన్స్.. కెరీర్ వెలుగులు
ఇది డిజిటల్ ప్రపంచం! ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వివిధ రంగాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లోనూ ఐటీ వినియోగం ఎక్కువైంది. దాంతో సంబంధిత రంగాల్లో ఐటీ సర్టిఫికేషన్ కోర్సులను అభ్యసించినవారికి అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. రెగ్యులర్ డిగ్రీ కోర్సులతోపాటు సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీ సర్టిఫికేషన్ కోర్సులను చేస్తే మంచి ఉద్యోగాన్ని దక్కించుకున్నట్లే! వీటి ద్వారా సంబంధిత సబ్జెక్టుల్లో అవసరమైన స్కిల్స్ను కూడా మెరుగుపరుచుకోవచ్చు. పరిశ్రమలు, కంపెనీలు కూడా సంబంధిత రంగంలో ఐటీ సర్టిఫికేషన్ కోర్సులు చేసినవారికి పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఐటీ సర్టిఫికేషన్ కోర్సులపై ఫోకస్... స్పెషలైజేషన్ కోర్సులకనుగుణంగా ఐటీ సర్టిఫికేషన్స్లో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థి ఎంచుకున్న స్పెషలైజేషన్లో కంప్యూటింగ్ స్కిల్స్ను నేర్పడమే ధ్యేయంగా ఈ కోర్సులు ఉంటున్నాయి. ఉదాహరణకు క్లౌడ్ కంప్యూటింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, మొబైల్ బేస్డ్ అప్లికేషన్స్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, నెట్వర్కింగ్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ వంటివి. ప్రధానంగా బిజినెస్ సర్టిఫికేషన్ కోర్సుల్లో.. బిజినెస్ ఎనలిటిక్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది. ఇవే కాకుండా.. నేడు అందరికీ తెలిసిన ఆన్లైన్ షాపింగ్లో మెళకువలు తెలుసుకోవడానికి ఈ-కామర్స్; సేవారంగంలో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, డిజిటల్ మీడియా వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ముందుగా తమ విద్యా నేపథ్యానికి సరితూగే కోర్సులను, ఆసక్తి, ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్న ఐటీ/ఐటీ బేస్డ్ సర్టిఫికేషన్ కోర్సులను ఎంచుకోవాలి. దీంతోపాటు ఆ కోర్సులను అందిస్తున్న సంస్థల్లో పేరున్న (మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి) వాటిని ఎంచుకోవాలనేది నిపుణుల మాట. ఇంటర్మీడియెట్ తర్వాత ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక సర్టిఫికేషన్ కోర్సులు చేయడం మంచిదనేది నిపుణుల అభిప్రాయం. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం వివిధ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ).. ఐటీఈఎస్-బీపీవో(కస్టమర్కేర్) కోర్సును నిర్వహిస్తోంది. దీని వ్యవధి 100 గంటలు. ఈ కోర్సుకు ఇంటర్మీడియెట్లో ఏ గ్రూపునకు చెందిన విద్యార్థులైనా అర్హులే. ఇంటి నుంచే ఇంటర్నెట్ బ్రౌజింగ్ ద్వారా కంప్యూటర్ బేసిక్స్, హార్డ్వేర్, ఆఫీస్ ఆటోమేషన్ల గురించి తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా కామర్స్ విద్యార్థులు ఫైనాన్షియల్ అకౌంటింగ్పై పట్టు పెంచుకోవడానికి ఈ రంగంలో కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులను అభ్యసించవచ్చు. అదేవిధంగా సైన్స్ విద్యార్థులు బయోఇన్ఫర్మేటిక్స్లోని ముఖ్య అంశాలను గురించి తెలుసుకోవడానికి ఈ సర్టిఫికేషన్ కోర్సులు ఎంతో ఉపయుక్తం. అందించే సంస్థలు.. ఈ సర్టిఫికేషన్ కోర్సులను పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. వీటిలో ఎన్ఐఈఎల్ఐటీ, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీడాక్) వంటి పేరొందిన పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇవి.. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డీఈఐటీ), కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. ఐటీలో విద్య, పరిశోధనను పెంపొందింపజేయడం వీటి ప్రధానవిధి. కంప్యూటర్ అప్లికేషన్స్కు సంబంధించి దాదాపు అన్ని విభాగాల్లో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులను ఎన్ఐఈఎల్ఐటీ, సీడాక్లు అందిస్తున్నాయి. ఐటీ సర్టిఫికెట్స్ పొందినవారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందుతున్నారు. కంపెనీలు కూడా నిర్దేశిత అంశంలో సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ కంపెనీలు.. ఏ సంస్థలైతే మంచి సదుపాయాలతో శిక్షణ అందించి, పరీక్షలు నిర్వహించి, విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దుతున్నాయో..వాటిని తరచుగా సందర్శించి, తమకు తగినవారిని ఎంపిక చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీ నిర్దేశిత సర్టిఫికేషన్స్ నేడు ప్రతి ఒక్క రంగంలోనూ.. ఆయా అవసరాలకు అనుగుణంగా ఐటీ అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. బిజినెస్ డేటా విశ్లేషణ, ఫ్యాషన్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ల నుంచి సేవారంగాలైన హెల్త్కేర్, ఈ-కామర్స్ వరకూ.. ఐటీ రంగం విస్తరించింది. కంపెనీలు కూడా అభ్యర్థులు నిర్దేశిత అంశాల్లో, ఐటీ టూల్స్లో అవగాహన పొంది ఉండాలని, పూర్తిస్థాయీ పరిజ్ఞానం సాధించాలని కోరుకుంటున్నాయి. అందుకే ఐటీ సర్టిఫికేషన్ కోర్సులు పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్లో డిమాండ్ నెలకొంది. ఫ్యాషన్ నిఫ్ట్-హైదరాబాద్.. కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లో భాగంగా కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ కోర్సును అందిస్తోంది. 10+2 ఉత్తీర్ణులు మొదటి ఏడాది కోర్సులో చేరి ఫ్యాషన్ బిజినెస్లో ఐటీ పాత్రను అధ్యయనం చేయొచ్చు. హెల్త్కేర్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. హెల్త్కేర్ రంగంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. హెల్త్కేర్ మేనేజ్మెంట్, ఆస్పత్రి, రోగి ఆరోగ్య నివేదికలు మొదలైనవాటి రూపకల్పనలో ఐటీ ఉపయోగపడుతుంది. ఈ రంగంలో ఉద్యోగావకాశాలను పొందడానికి సీడాక్.. ఆరు నెలల వ్యవధి ఉన్న పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది. అదేవిధంగా ఇంటర్డిసిప్లినరీ సైన్స్ రీసెర్చ్లో బయోఇన్ఫర్మేటిక్స్ది ప్రధాన పాత్ర. ఎన్ఐఈఎల్ఐటీ.. బయోఇన్ఫర్మేటిక్స్లో ‘ఎ’, ‘ఒ’ లెవల్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. 10+2, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారు ఈ కోర్సులకు అర్హులు. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ కామర్స్ ఉత్తీర్ణులు, వృత్తి నిపుణులు తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి సీడాక్.. డిప్లొమా కోర్సును అందిస్తోంది. కోర్సు వ్యవధి 144 గంటలు. పవర్పాయింట్, ట్యాలీ, అవుట్లుక్, ఐఎస్ఎం అండ్ ఎంఎస్ వర్డ్ వంటివి కరిక్యులంలో ప్రధానంగా ఉంటాయి. రోజువారీ ఆఫీసు విధుల్లో భాగంగా ఈ ఐటీ టూల్స్ను ఉపయోగించి పనులను త్వరగా పూర్తి చేసుకోవచ్చు. అన్ని ఆదాయ, వ్యయ పట్టికలను అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టూల్స్ ద్వారా ఆన్లైన్లో పొందుపర చుకోవచ్చు. ఈ-కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఉరుకుల పరుగుల జీవితంలో బయట షాపింగ్కు వెళ్లి కావలసిన వస్తువులు తెచ్చుకునేంత తీరికా, ఓపిక ఎవరికీ ఉండటం లేదు. ఇంట్లోనే ఉండి ఆన్లైన్ షాపింగ్ ద్వారా తమకు కావాల్సిన వస్తువులను తెప్పించుకుంటున్నారు. దుస్తులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ఫోన్లు, జ్యుయెలరీ, ఆటబొమ్మలు, గృహోపకరణాలు.. ఇలా ఒకటేమిటి..! ప్రతిదానికీ ఆన్లైన్ షాపింగ్ను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల వినియోగదారుడికి సమ యం ఆదా కావడంతోపాటు ఖర్చు కలిసి వస్తుంది. కంపెనీలు కూడా షాప్ల ఏర్పాటు, అద్దెలు, మానవ వనరుల ఖర్చులు, నిర్వహణా వ్యయం వల్ల తమ ఉత్పత్తులను ఆన్లైన్ షాపింగ్ ద్వారా విక్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్లో నిష్ణాతుల కోసం ఆయా కంపెనీలు అన్వేషిస్తున్నాయి. నేడు సంబంధిత కంపెనీల ఉత్పత్తుల ప్రచారంలో డిజిటల్ మార్కెటింగ్దే ప్రధాన పాత్ర. కోర్సులో భాగంగా డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి? సోషల్ మీడియాను డిజిటల్ మార్కెటింగ్కు ఎలా ఉపయోగించుకోవచ్చు? వంటివాటిని తెలియజేస్తారు. దీని ద్వారా గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులు, ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవచ్చు. తద్వారా చక్కటి కెరీర్ను సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సీడాక్ ఆరు నెలల వ్యవధి ఉన్న డిప్లొమా ఇన్ ఈ-కామర్స్ కోర్సును అందిస్తోంది. దీని ద్వారా ఈ-కామర్స్లో ఉన్న వివిధ విభాగాల గురించి, ఈ-కామర్స్ను అభివృద్ధి చేయడం, సైట్ నిర్వహణా నైపుణ్యాలను తెలుసుకోవచ్చు. సాఫ్ట్వేర్ - హార్డ్వేర్ సర్టిఫికేషన్ కోర్సులు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) అభివృద్ధి వల్ల ఎన్నెన్నో కొత్త, కొత్త టెక్నాలజీలు ఆవిర్భవిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం- ప్రతి 18 నెలలకు కొత్త కంప్యూటర్ టెక్నాలజీ ఆవిష్కృతమవుతోంది. వివిధ రకాలైన కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి రకరకాల సర్టిఫికేషన్ కోర్సులున్నాయి. ఒక్కొక్క టెక్నాలజీలో ప్రావీణ్యం సంపాదించాలంటే దానికి సంబంధించిన కోర్సు చేసి సర్టిఫికేట్ సంపాదిస్తే కంపెనీల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ఈ సర్టిఫికేట్ కోర్సులన్నింటినీ దాదాపుగా ఆయా సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ కంపెనీలే ప్రోత్సహించడం గమనార్హం. ఒక్కొక్క కోర్సు.. ఒక్కొక్క సబ్జెక్టులో లేదా సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్లో నిష్ణాతులను చేయడానికి నిర్దేశించింది. ఏ కోర్సు చేయాలన్నా బేసిక్స్లో మంచి అవగాహన అవసరం. ఈ కోర్సుల పరీక్షలన్నీ ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. వీటికి శిక్షణ ఎక్కడైనా తీసుకోవచ్చు. నిర్ధారిత రుసుం చెల్లించి పరీక్ష రాయొచ్చు. ఒకసారి ఏదైనా కోర్సు పరీక్షలో ఉత్తీర్ణులై సర్టిఫికేట్ సంపాదిస్తే దానికి సంబంధించిన ఉద్యోగం రావడం ఖాయం. జీతం కూడా ఎక్కువే. ప్రస్తుతం కనీసం 30 రకాల ఐటీ సర్టిఫికేట్ కోర్సులున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి 15 వరకు ఉంటాయి. ఇవన్నీ మంచి ఉద్యోగాన్ని సంపాదించిపెట్టేవే. వాటిని గురించిన వివరాలు.. హార్డ్వేర్ కోర్సులు సిస్కో సర్టిఫైడ్ ప్రొఫెషనల్ సిస్కో అనేది ఒక కంపెనీ. అది కంప్యూటర్ నెట్వర్కింగ్కి కావలసిన సామగ్రిని తయారుచేస్తుంది. ప్రపంచంలోనే ఇది అగ్రగామి సంస్థ. నెట్వర్కింగ్కి కావలసిన స్విచ్లు, రూటర్లు, పంచ్లు ఈ సంస్థ తయారు చేస్తుంది. కంప్యూటర్ నెట్వర్కింగ్ అనేది మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థకి గుండె వంటిది. ఉదాహరణకు బ్యాంకులు, రైల్వేలు, కరెంటు బిల్లులు కట్టడంలాంటివి అన్నీ కూడా సిస్కో తయారుచేసిన వస్తువులపైనే. వీటన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించడానికి చాలామంది నిపుణులు అవసరం. అంతేకాకుండా ఈ రంగంలో నానాటికీ వాడేవాటి సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుండటం వల్ల నిపుణుల కొరత కూడా ఎక్కువ. అందువల్ల సీసీఎన్ఏ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు, మంచి జీతం పొందే అవకాశాలు పుష్కలం. సెక్యూరిటీ ప్రొఫెషనల్ ప్రధానమైన కోర్సు ఇది. అటు హార్డవేర్, ఇటు సాఫ్ట్వేర్ రెండింటికీ ఉపయుక్తం. మనం చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా జరగాలని కోరుకుంటాం. ఉదాహరణకు మనం ఆన్లైన్లో డబ్బు ఒక బ్యాంకు ఖాతా నుంచి ఇంకొక బ్యాంకు ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు అందులో ఏదైనా పొరపాటు జరిగి ఇంకొకరి ఖాతాలో జమ అయితే అప్పుడు పరిస్థితి ఏమిటి? దీనికోసం కొన్ని పద్ధతులు, సాఫ్ట్వేర్ డిజైన్ ఉన్నాయి. అందులో నిష్ణాతులను తయారుచేయడమే ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. సెక్యూరిటీ అనేది ఎప్పటికీ అవసరమైనది కాబట్టి, భవిష్యత్తులో దాని అవసరం చాలా ఉంటుంది కాబట్టి ఈ కోర్సు చేసినవారికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. సాఫ్ట్వేర్ కోర్సులు ...మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇందులో దాదాపు 15 రకాల కోర్సులున్నాయి. ఇవన్నీ మైక్రోసాఫ్ట్ తయారుచేసిన సాఫ్ట్వేర్లలో నిపుణతను పెంచడానికీ, పరీక్షించడానికీ ఉద్దేశించినవి. వీటిలో ముఖ్యమైనది మైక్రోసాఫ్ట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోసాఫ్ట్ డేటాబేస్ డెవలపర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్, సర్వర్ అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఐదింటిలో ఏ కోర్సులో సర్టిఫికేటు పొందినా.. మంచి ఉద్యోగం, జీతం ఖాయం. ఒరాకిల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇది ప్రధానంగా డేటాబేస్కి సంబంధించిన కోర్సు. ఇందులో ముఖ్యమైనవి రెండు. మొదటిది ఒరాకిల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ జావా ప్రోగ్రామర్. రెండోది, ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్.ఒరాకిల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ జావా ప్రోగ్రామర్: ఇది జావా ప్రోగ్రామింగ్ గురించి మంచి అవగాహనను కలిగిస్తుంది. ఒరాకిల్ డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్: ఒరాకిల్ డేటాబేస్లో మంచి ప్రావీణ్యాన్ని పెంపొందిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగావకాశాల్లో 20 వరకు వీటిల్లోనే ఉంటున్నాయి. లైనక్స్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అంటే.. ఇది కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన సాఫ్ట్వేర్. దీనిలో నైపుణ్యం పొందడానికి కూడా చాలా కోర్సులున్నాయి. ఇందులో ముఖ్యమైనది లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. పెద్దపెద్ద కంప్యూటర్ వ్యవస్థలన్నీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం మీదే పనిచేస్తాయి. ఉదాహరణకు విమానయాన సంస్థలు, ఆయిల్ కంపెనీలు, అన్ని సెక్యూరిటీ వ్యవస్థలు లైనక్స్ పైనే పనిచేస్తాయి. అందువల్ల ఈ కోర్సు చేసినవారికి ఉద్యోగాలు అపారం. అంతేకాకుండా మంచి జీతం కూడా పొందొచ్చు. జావా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ జావా అనేది ఒక కంప్యూటర్ లాంగ్వేజీ. ఇది ఇంటర్నెట్ వినియోగంలోకి రావడానికి ప్రత్యేకంగా తయారుచేసిన భాష. ఇది ఫ్లాట్ఫారం ఇండిపెండెంట్. అంటే.. ఏ కంప్యూటర్ మీదనైనా దానితో పనిచేయించవచ్చు. అదేవిధంగా ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ కూడా. అందువల్ల ఇంటర్నెట్ ఉపయోగించి చేసే ఏ కంప్యూటర్ అప్లికేషనైనా సరే ఇది తప్పనిసరి. అందువల్ల జావా అనేది అన్ని విశ్వవిద్యాలయాల బీటెక్ (సీఎస్ఈ)పాఠ్యాంశాలలో విధిగా ఉంటుంది. విద్యార్థులు మరింత లోతైన పరిజ్ఞానం పొందాలంటే ఈ పరీక్ష ఉత్తీర్ణులవ్వాల్సిందే. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడం ఎంత కష్టమో, ఈ జావా రాకపోతే కంప్యూటర్ కంపెనీల్లో పనిచేయడం కూడా అంతే కష్టం. అందువల్ల ఈ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు చాలా ఎక్కువ. ప్రత్యేకమైన కోర్సులు.. ఎస్ఏపీ ఇది ఈ మధ్య చాలా పాపులర్ అయిన కోర్సు. దీనిని ఈఆర్పీ (ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) అని కూడా అంటారు. ఒక ఇండస్ట్రీలో ఉన్న అన్ని విభాగాలను అనుసంధానిస్తూ అన్నింటినీ కంప్యూటరీకరణ చేయడంగా దీనిని పేర్కొనవచ్చు. ఇందులో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఫైనాన్స్, ప్రాజెక్ట్స్, హ్యూమన్ రిసోర్సెస్లాంటివి. ఇందులో ఏ ఒక్కదాంట్లోనైనా ప్రావీణ్యం సంపాదిస్తే చాలు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని కోర్సుల్లో కష్టమైనదీ, బాగా జీతం వచ్చేదీ ఇదే! టెస్టింగ్ టెక్ ప్రతి సాఫ్ట్వేర్ తయారీలోనూ ఆఖరి భాగం టెస్టింగ్. సాఫ్ట్వేర్ తయారుచేసిన తర్వాత దానిని కూలంకషంగా పరీక్షించి మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఇలా పరీక్షించడానికి కూడా కొన్ని సాఫ్ట్వేర్ ప్యాకేజీలు ఉన్నాయి. వాటినే టెస్టింగ్ టూల్స్ అంటారు. వీటిని నేర్చుకుంటే ఈ ఫీల్డులో మంచి ఉద్యోగం పొందొచ్చు. మెయిన్ఫ్రేమ్ ట్రైనింగ్ పర్సనల్ కంప్యూటర్లు లేని రోజుల్లో కంప్యూటర్లు చక్కబెట్టే వ్యవహారాలన్నీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్తోనే జరిగేవి. ఇప్పటికీ చాలా వ్యవహారాలకు వీటిని వాడుతున్నారు. వీటిని ఉపయోగించడానికి, నిర్వహించడానికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం. ప్రస్తుతం వీటిని స్పేస్ టెక్నాలజీ వంటి ప్రముఖమైన వాటిల్లో వినియోగిస్తున్నారు. వీటిలో ఉద్యోగాలు బాగున్నా ఎదుగుదల తక్కువ. ఇవి మాత్రమే కాకుండా కొన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సులు కూడా ఉన్నాయి. అవన్నీ ఉద్యోగం చేస్తూ మరింత ఉన్నత పదవులు అధిరోహించడానికి ఉపయోగపడేవి. ఈ కోర్సులన్నింటికీ మంచి ఉద్యోగావకాశాలు ఉన్న మాట వాస్తవమే అయినా ఈ కోర్సుల సర్టిఫికెట్తోపాటు బీఈ/బీటెక్ డిగ్రీ కూడా ఉండాలి. అంతేకాకుండా బేసిక్స్ మీద అవగాహన ఉండాలి. ఇవి ఉంటే వీటిల్లో ఏ కోర్సు సర్టిఫికేట్ పొందినా మంచి ఉద్యోగం, భవిష్యత్తు, జీతం సొంతమవుతుంది. కోర్సులు.. అందిస్తున్న సంస్థలు.. కోర్సులు: ఒ లెవల్ వ్యవధి: 13 నెలలు బి లెవల్ వ్యవధి: 14 నెలలు హార్డ్వేర్ నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ వ్యవధి: 15 నెలలు ఎ లెవల్ వ్యవధి: 24 నెలలు ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ వ్యవధి: ఆరు నెలలు సంస్థ: ఎన్ఐఈఎల్ఐటీ వెబ్సైట్: ఠీఠీఠీ.జ్ఛ్టీఛిజిఛీ.జీ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈ-కామర్స్ వ్యవధి: 144 గంటలు ఈఎల్ఎస్ఐ డిజైన్ హెల్త్కేర్ ఇన్ఫర్మేటిక్స్ ఆటోమేషన్ అండ్ ఎస్సీఏడీఏ సిస్టమ్స్ వ్యవధి: ఆరు నెలలు, సంస్థ: సీడాక్ వెబ్సైట్: www.cdac.in కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ వ్యవధి: 16 నెలలు సంస్థ: నిఫ్ట్-హైదరాబాద్ వెబ్సైట్: www.nift.ac.in ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ వ్యవధి: 160 గంటలు ఒరాకిల్ 10జీ: పీఎల్/ఎస్క్యూఎల్ వ్యవధి: 40 గంటలు సంస్థ: ఎస్క్యూఎల్ఎస్టీఏఆర్ వెబ్సైట్: www.sqlstar.com సీసీఎన్ఏ సెక్యూరిటీ సంస్థ: సిస్కో సిస్టమ్స్ వెబ్సైట్: www.cisco.com ఎంసీఎస్ఏ సంస్థ: మైక్రోసాఫ్ట్ వెబ్సైట్: www.microsoft.com సీఎస్ఎస్ఏ సంస్థ: డెల్ వెబ్సైట్: http://accessories.dell.com ఒరాకిల్ సోలారిస్ 10 సర్టిఫైడ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ సంస్థ: ఒరాకిల్ వెబ్సైట్: www.oracle.com ఐబీఎం సర్టిఫైడ్ అడ్మినిస్ట్రేటర్ - టివోలి మానిటరింగ్ వీ6.2.3 సంస్థ: ఐబీఎం వెబ్సైట్: www.ibm.com గూగుల్ యాప్స్ అడ్మినిస్ట్రేటర్ సంస్థ: గూగుల్ వెబ్సైట్: http://certification.googleapps.com