breaking news
sarojadevi
-
ఆ కంటిచూపు మన వెన్నంటి
‘శ్రీరామాంజనేయ యుద్ధం’లో సీత... ఆ కళ్లల్లో కరుణ ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో సుభద్ర... ఆ కళ్లల్లో ఆత్మవిశ్వాసం... పాత్రల్లోనేనా... పాటల్లోనూ ఆ కళ్లు ఎన్నో భావాలు పలికించాయి. ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’.... ఆ కళ్లు వెచ్చని హాయిని కనబర్చాయి... ‘గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి’.... ఆ కళ్లల్లో కవ్వింపు... ఇలా వెండితెరపై ఆమె కళ్లు జీవించాయి. అందుకే తెలుగులో ‘జగదేక నటి’, మాతృభాష కన్నడంలో ‘అభినయ సరస్వతి’, తమిళంలో ‘కన్నడత్తు పైంగిళి’ (కన్నడ చిలుక). బి. సరోజా దేవి కళ్లు ఇక విశ్రమించాయి... అవి కనబర్చిన అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో జీవించే ఉంటాయి. ప్రముఖ నటి బి. సరోజా దేవి (87) సోమవారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా ఆమె కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. బెంగళూరులోని మల్లేశ్వరంలో గల తన స్వగృహంలో సోమవారం ఎప్పటిలాగే ఉదయాన్నే నిద్రలేచిన సరోజా దేవి పూజ చేసి, టీవీ ఆన్ చేసి, కుర్చీలో కూర్చొని ఉండగా అస్వస్థతకు గురయ్యారని, సమీపంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమాలంటే ఇష్టం లేని ఓ తార ‘చతుర్భాష తారె’(నాలుగు భాషల తార)గా కితాబులు అందుకున్నారు. అవును... బి. సరోజా దేవికి సినిమాలంటే ఇష్టం లేదు. అయితే ఆమె తండ్రి భైరప్పకు నటనంటే ఇష్టం. వృత్తిరీత్యా ఆయన పోలీసు అయినప్పటికీ ఓ నాటక సంస్థలో నాటకాల్లో నటించేవారు. చిన్నప్పుడు సరోజా దేవితో కూడా నటింపజేసి, మురిసిపోయారు. బెంగళూరులో 1938లో జనవరి 7న సరోజా దేవి జన్మించారు. ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు కాగా సరోజా దేవి ఆఖరి అమ్మాయి. మగపిల్లలు లేకపోవడంతో ఆమెకి అబ్బాయిలా డ్రెస్సులు వేసేవారు. దాంతో స్కూల్లో అబ్బాయిలు వెక్కిరిస్తే... ఇంటికొచ్చి ఏడ్చిన కూతురితో ‘కావాలంటే మీరూ అమ్మాయిలా బట్టలేసుకోండి’ అని చెప్పు అంటూ ఆమె తల్లి రుద్రమ్మ ఆత్మవిశ్వాసం నూరిపోశారు.టీనేజ్లో వెండితెరపై...ఓవైపు చదివిస్తూ మరోవైపు కూతురితో నాటకాల్లో నటింపజేశారు భైరప్ప. పదిహేడేళ్ల వయసులో సరోజాదేవి నటించిన ఒక నాటకం చూసి, కన్నడ దర్శక–నిర్మాత హొన్నప్ప భాగవతార్ ఆమెకు ‘మహాకవి కాళిదాశ’ (1955) సినిమాలో అవకాశం ఇచ్చారు. జాతీయ అవార్డు సాధించిన ఆ చిత్రంతో సరోజా దేవికి మంచి పేరు వచ్చింది. నిజానికి సరోజా దేవిని నటిని చేయాలనుకుని, డ్యాన్స్ కూడా నేర్పించారు భైరప్ప. డ్యాన్స్ ప్రాక్టీస్ అప్పుడు కుమార్తె కాళ్లు వాచిపోతే, ఓపికగా మసాజ్ చేసేవారట. అలాగే రుద్రమ్మ మాత్రం ఎప్పటికీ స్విమ్ సూట్ ధరించకూడదని, స్లీవ్లెస్ బ్లౌజులు వేయకూడదని కూతురికి నిబంధన విధించారట. తన కెరీర్ మొత్తంలో ఆ నిబంధనను పాటించారు సరోజా దేవి. ‘మహాకవి కాళిదాస’ తమిళంలో ‘మహాకవి కాళిదాస్’గా అనువాదమై, 1956లో విడుదలైంది. ఆ రకంగా తమిళ పరిశ్రమ దృష్టి సరోజా దేవిపై పడింది. విశేషం ఏంటంటే... తమిళంలో రిలీజైన నాలుగేళ్లకు శివాజీ గణేశన్, షావుకారు జానకిల కాంబినేషన్లో ‘మహాకవి కాళిదాస్’ (1966)గా రీమేక్ కూడా చేశారు. ఇక తమిళంలో ‘తిరుమణమ్’ (1956)లో నటించే అవకాశం సరోజా దేవికి దక్కింది. ఆ తర్వాత వరుసగా కన్నడ, తమిళ చిత్రాలు చేస్తున్న ఆమెకు తెలుగు నుంచి ఆహ్వానం అందింది. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘పాండురంగ మహత్మ్యం’ (1957)లో నటించే చాన్స్ అందుకున్నారు సరోజ. ఏ భాషలో నటిస్తే అది ఆమె మాతృభాష ఏమో అనిపించేలా నటన ఉండటంతో తెలుగు, తమిళ, కన్నడంలో వరుసగా ఆఫర్స్ వచ్చి, బిజీ తారగా మారిపోయారు. అలా ఆమె ‘పైఘమ్, ససురాల్’ తదితర హిందీ చిత్రాల్లోనూ నటించారు.తెలుగులో పాతిక వరకూ... తెలుగులో ఓ పాతిక సినిమాలు చేశారు సరోజ. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎక్కువ చిత్రాలు చేశారామె. వాటిలో ‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ, శ్రీరామాంజనేయ యుద్ధం, దాన వీర శూర కర్ణ’ వంటివి ఉన్నాయి. అలాగే అక్కినేని సరసన ‘శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, అమర శిల్పి జక్కన్న’ వంటివి చేశారు. ‘ఆత్మ బలం’లో ఏఎన్నార్తో కలిసి ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ పాటలో సరోజ వేసిన స్టెప్స్, కళ్లల్లో పలికించిన రొమాన్స్కి నాటి ప్రేక్షకులు ‘భేష్’ అన్నారు. ఈ ‘చిటపట చినుకులు...’ పాటలో ఆమె తలకు స్కార్ఫ్ కట్టుకుని కనబడతారు. దానికో కథ ఉంది... అదేంటంటే...ట్రెండ్ అయిన స్కార్ఫ్ ‘చిటపట..’ చిత్రీకరించే ముందు సరోజ ఓ హిందీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఆ షూట్లో భాగంగా నెత్తిపై పాల కడవ పెట్టుకుని నడుస్తుంటే, ఆకతాయిలు ఆమెపై రాళ్లు విసురుతూ ఆట పట్టిస్తారు. ఓ రాయి సరిగ్గా సరోజ ముఖానికి తగిలి, గాయాలయ్యాయి. అదే సమయానికి ఇటు ఏఎన్నార్ కాంబినేషన్లో ‘చిట పట..’ పాట షూట్లో పాల్గొనాలి. దాంతో ముఖంపై మచ్చలు కనబడనివ్వకుండా స్కార్ఫ్తో మేనేజ్ చేశారు. ఆ తర్వాత ఆ స్కార్ఫ్ ఫ్యాషన్ ట్రెండ్గా మారిపోవడం విశేషం. ఇక తనకు బాగా నచ్చిన పాటల్లో ‘చిట పట’ ఒకటని సరోజ పలు సందర్భాల్లో చె΄్పారు.సరోజ చీరలు ఫేమస్ 1960లలో సరోజా దేవి ధరించిన చీరలు, జాకెట్టులు, నగలు, హెయిర్ స్టైల్కి ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఆ తరం అమ్మాయిలు ఆమె స్టైల్ని, మేనరిజమ్స్ని ఫాలో అయ్యేవారు. ముఖ్యంగా తమిళ చిత్రాలు ‘ఎంగ వీట్టు పిళ్లై, అన్బే వా’లోని చీరలు, నగలను ఫాలో అయ్యారు. బిజీగా ఉన్నప్పుడే వివాహం 1955లో నటిగా పరిచయమై, అక్కణ్ణుంచి పదేళ్లు బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలో సరోజా దేవికి ఇంజినీర్ శ్రీహర్షతో 1967లో పెళ్లయింది. పెళ్లయ్యాక సినిమాలు చేయాలా? వద్దా? అనే మీమాంసలో పడ్డారట సరోజ. అయితే భర్త శ్రీహర్ష ప్రోత్సాహంతో సినిమాల్లో కొనసాగారు సరోజ. ఇక ఆమె భర్త అనారోగ్యం బారిన పడక ముందు ‘లేడీస్ హాస్టల్’ (1985) అనే కన్నడ సినిమా అంగీకరించారు. ఆ సినిమా అప్పుడే శ్రీహర్ష అనారోగ్యానికి గురి కావడంతో ఆమె షూటింగ్స్కి దూరమయ్యారు. చివరికి 1986లో భర్త చనిపోవడంతో ఆమె ఏడాది పాటు షూటింగ్స్కి దూరంగా ఉండటంతో పాటు కుటుంబ సభ్యులు కానివారిని కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఏడాది తర్వాత ‘లేడీస్ హాస్టల్’ సినిమాతో పాటు అప్పటికే అంగీకరించిన ఎనిమిది చిత్రాలను పూర్తి చేశారామె. ఆ తర్వాత ఐదేళ్లు బ్రేక్ తీసుకున్నారు. ఫస్ట్ కన్నడ ఫిమేల్ సూపర్ స్టార్ నిర్మాతలు, అభిమానుల కోరిక మేరకు మళ్లీ కథానాయికగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత క్యారెక్టర్ నటిగానూ చేశారు. దాదాపు 200 చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన చివరి కన్నడ చిత్రం ‘నట సార్వభౌమ’ (2019). కన్నడంలో ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ రికార్డ్ ఆమెదే. ఇక వరుసగా 150కి పైగా చిత్రాల్లో కథానాయికగా నటించడం ఓ అరుదైన ఘనత.జాతీయ అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా... 1998, 2005లో సరోజా 45వ జాతీయ సినిమా అవార్డు, 53వ జాతీయ సినిమా అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. కర్నాటక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అధ్యక్షురాలిగా, కన్నడ చలన చిత్ర సంఘ ఉపాధ్యక్షురాలిగానూ చేశారు. ఇక 60వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సరోజా దేవిని ‘జీవిత సాఫల్య’ పురస్కారంతో సత్కరించింది. అలాగే అంతకు ముందు 1969లో ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’, 1992లో ‘పద్మభూషణ్’ పురస్కారాలు అందుకున్నారామె. ఇంకా కన్నడ, తెలుగు, తమిళ రాష్ట్రాలకు చెందిన పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఈ అభినయ సరస్వతికి దక్కాయి.చివరి కోరిక అదే ఇప్పటివరకూ సరోజకు రీప్లేస్మెంట్గా మరో తార రాలేదు... భవిష్యత్తులోనూ రాకపోవచ్చు. అయితే ఆ కళ్లు కొన్నేళ్ల పాటు చూస్తుంటాయి. ఎందుకంటే మరణించిన తర్వాత నేత్రదానం చేయాలన్నది సరోజ చిట్ట చివరి కోరిక. కుటుంబ సభ్యులు ఆ కోరికను నెరవేర్చారు. ఇక... నటిగా ఆ కళ్లు ప్రేక్షకుల హృదయాల్లో జీవించే ఉంటాయి.నేడు అంత్యక్రియలు సరోజ మృతి పట్ల పలువురు కన్నడ, తెలుగు, తమిళ తదితర భాషల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళ వారం సరోజా దేవి స్వగ్రామం రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా దశవార గ్రామంలో ఒక్కలిగ సామాజిక వర్గ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆ కళ్లల్లో ఆరిన తడి సరోజా దేవికి ఇద్దరు కూతుళ్లు (ఇందిర, భువనేశ్వరి), ఒక కుమారుడు (గౌతమ్ రామచంద్రన్‡). కాగా భువనేశ్వరి అనారోగ్యంతో కన్నుమూయడం సరోజా దేవికి ఓ షాక్. అలాగే 1986లో ఆమె భర్త కూడా చనిపోయారు. ‘నా అనుకున్నవాళ్లు నా కళ్ల ముందే దూరం కావడం నాకు బాధగా అనిపించింది’ అంటూ ఆమె కంట తడిపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక భర్త చనిపోయాక సరోజా దేవికి కంటి సమస్య వచ్చింది. బాగా ఏడవడం వల్ల కళ్ల తడి ఆరిపోయి, ‘డ్రై ఐస్’తో బాధపడ్డారామె. చాన్నాళ్లపాటు ఆమెను ఈ బాధ వెంటాడింది. దీన్నిబట్టి భర్త పట్ల సరోజా దేవికి ఎంత మమకారం ఉండేదో ఊహించవచ్చు., ఇక కుమార్తె భువనేశ్వరి పేరిట అవార్డు ప్రవేశపెట్టి, సాహిత్య రంగంలో ప్రతిభావంతులకు అందజేస్తూ వచ్చారు.ఆ ముగ్గురి జోడీ హిట్ అటు కన్నడ స్టార్ రాజ్కుమార్ ఇటు తెలుగు స్టార్ ఎన్టీఆర్ మరోవైపు తమిళ స్టార్ ఎంజీ రామచంద్రన్లకు జోడీగా సరోజా దేవి ఎక్కువ సినిమాల్లో నటించారు. ఈ ముగ్గురు హీరోలు–సరోజాదేవిది ‘హిట్ పెయిర్’. జయలలిత తర్వాత ఎంజీఆర్కి జోడీగా ఎక్కువ సినిమాల్లో నటించిన రికార్డ్ సరోజా దేవిదే. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘నాడోడి మన్నన్’ బ్లాక్ బస్టర్. సరోజా దేవికి ఎంజీఆర్ అంటే చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే... తన తనయుడికి ఆయన పేరు వచ్చేట్లుగా ‘గౌతమ్ రామచంద్రన్’ అని పెట్టుకున్నారు. ఇక ఇంకో విశేషం ఏంటంటే.... తమిళ హీరో శివాజీ గణేశన్తో బ్యాక్ టు బ్యాక్ 22 హిట్ చిత్రాల్లో నటించారు సరోజా దేవి. వాటిలో ‘తంగమలై రహస్యం, భాగ పిరవినై, పార్తాల్ పసి తీరుమ్’ వంటివి ఉన్నాయి. అలాగే జెమినీ గణేశన్తో 15కి పైగా తమిళ చిత్రాల్లో నటించారు. ముద్దు మాటల ముద్దుగుమ్మసరోజా దేవి మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయి. చిన్నపిల్లలు మాట్లాడినట్లే. అయితే తన సహజ ధోరణి అది అని, కావాలని మాట్లాడలేదని ఓ ఇంటర్వ్యూలో సరోజా దేవి పేర్కొన్నారు. ప్రేక్షకులు తన మీద అభిమానంతో అలా ముద్దు మాటలు అనేవారని ఆమె అన్నారు.గాసిప్ లేని నటిదాదాపు ఏడు దశాబ్దాల కెరీర్లో నాలుగు (కన్నడ, తెలుగు, తమిళ, హిందీ) భాషల్లో ఎందరో స్టార్ హీరోల సరసన నటించారు సరోజా దేవి. అయితే ఏ ఒక్క హీరోతోనూ తనకు లింకులు పెట్టి వదంతులు రాకపోవడం తన అదృష్టం అని ఓ సందర్భంలో సరోజా దేవి తెలిపారు. అలా గాసిప్ లేని నటి అనిపించుకోవడం తన పుణ్యం అని కూడా అన్నారామె.శక్తిమంతమైనస్త్రీ పాత్రల్లో ...1824లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన భారతీయ వీర వనిత కిత్తూరు చెన్నమ్మ పాత్రను చేశారు సరోజా దేవి. ‘కిత్తూరు రాణి చెన్నమ్మ’ టైటిల్తో రూపొందిన ఆ చిత్రంలో సరోజా దేవి అభినయం అద్భుతం. ఆ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. అలాగే ‘చింతామణి, శకుంతల’ వంటి కన్నడ చిత్రాల్లోనూ తెలుగులో ‘పండంటి కాపురం, గృహిణి’ తదితర చిత్రాల్లోనూ శక్తిమంతమైన స్త్రీ పాత్రలు పోషించి, మెప్పించారు. – డి.జి. భవాని -
సీనియర్ నటి సరోజాదేవి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
-
సీనియర్ నటి బీ.సరోజాదేవి కన్నుమూత
-
చిటపట చినుకులు పాట పాడుతుంటారు
‘‘నేనెక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే..’ పాట పాడుతూ ఉంటారు. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో నేను యన్టీఆర్ను అన్నయ్యా అంటాను. ఆ సంభాషణను గుర్తుచేసి మళ్లీ మళ్లీ ఆ డైలాగులు చెప్పమని అడుగుతుంటారు. మరోసారి ఈ విషయాలను గుర్తు చేసుకోవటం ఆనందంగా ఉంది అన్నారు’’ ప్రముఖ నటి బి.సరోజాదేవి. ఆమెకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘విశ్వనట సామ్రాజ్ఙి’ బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సరోజాదేవి మాట్లాడుతూ– ‘‘సుబ్బరామిరెడ్డికి కళలన్నా, కళాకారులన్నా ఎంతో గౌరవం. శివరాత్రి రోజున ఈ పురస్కారం అందుకోవటం ఆనందంగా ఉంది’’ అన్నారు. టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆ రోజుల్లో హీరోల్ని మించి పారితోషికం అందుకున్న నటి సరోజాదేవి. ఆమెకి తెలుగు ప్రజల తరఫున ప్రదానం చేసిన బిరుదు ఇది’’ అన్నారు. ఈ వేడుకలో ప్రముఖ నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, గాయని పి.సుశీల తదితరులు పాల్గొన్నారు. -
విశ్వనటసామ్రాజ్ఞి
అద్భుతమైన అభినయ ప్రతిభతో జాతీయ స్థాయి నటిగా పేరు సంపాదించుకున్నారు బి. సరోజాదేవి. ఆమెను ‘పద్మశ్రీ, పద్మభూషణ్’ అవార్డులు వరించాయి. తాజాగా ‘విశ్వనటసామ్రాజ్ఞి’ అనే బిరుదును ఆమె అందుకోబోతున్నారు. విశాఖ రామకృష్ణ బీచ్లో టీఎస్సార్ లలితా కళాపరిషత్ ఆధ్వర్యంలో ఆమె ఈ అవార్డును స్వీకరించనున్నారు. మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో వైభవంగా జరిగే ఈ వేడుకలో బి. సరోజాదేవికి ‘విశ్వనటసామ్రాజ్ఞి’ అనే బిరుదును ప్రదానం చేయనున్నట్లు కళాబంధు డా. టి. సుబ్బరామిరెడ్డి తెలిపారు. సాలూరి వాసూరావు సంగీత విభావరి ఉంటుంది. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్, నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, మీనా, ప్రముఖ గాయని పి. సుశీలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినాన్ని టి. సుబ్బరామిరెడ్డి వైజాగ్లో జరుపుతుంటారు. పాతికేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. -
బి.సరోజాదేవికి ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు ప్రదానం
అలనాటి అందాల నటి బి.సరోజాదేవిని టీఎస్ఆర్ లలితకళాపరిషత్ ‘విశ్వనట సామ్రాజ్ఞి' బిరుదు తో సత్కరించనుంది. కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి మార్చి 4 మహాశివరాత్రి సందర్భంగా విశాఖలో లో వైభవంగా జరిగే వేడుక లో ఈ బిరుదును ప్రదానం చేయనున్నట్టుగా తెలిపారు. విశాఖ రామకృష్ణా బీచ్ లో మార్చి 4 సాయంత్రం ఐదు గంటల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజలచేతనే కోటి శివలింగాల ప్రతిష్ఠాపన, మహాకుంభాభిషేకం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గత పాతికేళ్ల ఈ కార్యక్రమాలను టీఎస్సార్ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మిస్తున్న బి.సరోజాదేవి సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటీనటులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, సుమన్, మీనా, గాయని పి.సుశీల పాల్గొననున్నారు. కన్నడ నాట జన్మించిన బి.సరోజాదేవి, తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితులు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమా ద్వారా బి.సరోజాదేవిని తెలుగుతెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత ఎన్టీఆర్ సరసన సీతారామకళ్యాణం, జగదేకవీరుని కథ, దానవీరశూర కర్ణ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావుతోనూ పెళ్ళికానుక, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న లాంటి సినిమాలో అలరించారు. తెలుగునాటనే కాకుండా, మాతృభాష కన్నడలోనూ, తమిళ, మళయాళ, హిందీ భాషల్లోనూ సరోజాదేవి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను సైతం అందుకున్నారు. -
34 ఏళ్ల తర్వాత
తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో ఒకప్పుడు వెండితెరను ఏలిక నాయిక బి. సరోజా దేవి. తమిళ, కన్నడ భాషలతో పోల్చితే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఇక్కడ కూడా బాగా ఫేమస్. ఇప్పుడామె తొమ్మిదేళ్ల తర్వాత కెమెరా ముందుకు వస్తున్నారు. 2009లో సూర్య నటించిన ‘ఆదవన్’లో కీలక పాత్ర చేశారామె. ఇప్పుడు కన్నడ స్టార్ పునీత్ రాజ్కుమార్ హీరోగా పవన్ వడియార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నటసార్వభౌమ’ చిత్రంలో ఈ సీనియర్ నటి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. దాదాపు 34 ఏళ్ల తర్వాత సరోజా దేవి, పునీత్ రాజ్కుమార్ సిల్వర్ స్క్రీన్ను షేర్ చేసుకుంటున్నారు. సరోజా దేవి కథానాయికగా నటించిన ‘యారివాను’లో పునీత్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. కన్నడ కంఠీరవ, పునీత్ తండ్రి రాజ్కుమార్ సరసన సరోజా దేవి కథనాయిక పలు చిత్రాల్లో నటించడం విశేషం. ఆ సంగతలా ఉంచితే అప్పట్లో సరోజా దేవి సినిమాలో పునీత్ బాల నటుడిగా నటిస్తే, ఇప్పుడు అతను హీరోగా నటిస్తోన్న సినిమాలో ఆమె కీలక పాత్ర చేయడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. -
కొత్త గెటప్ గురూ
కొత్త గెటప్లో కనిపించేందుకు రెడీ అవుతున్నారు కన్నడ స్టార్ పునీత్ రాజ్కుమార్. ఎందుకంటే ఆయన హీరోగా నటించనున్న కొత్త సినిమా కోసం. పవన్ వడియార్ దర్శకత్వంలో రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పునీత్ రాజ్కుమార్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో అలనాటి కన్నడ స్టార్ సరోజా దేవి కీలక పాత్రలో కనిపించనున్నారట. పునీత్ తండ్రి రాజ్కుమార్ సరసన హిట్ మూవీస్లో నటించారు సరోజా దేవి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్కు స్కోప్ ఉండగా, ప్రియాంక జవాల్కర్ను ఒక హీరోయిన్గా తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తుదంట. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన ‘టాక్సీవాలా’ చిత్రంలో ప్రియాంకనే కథానాయిక అన్న విషయం తెలిసిందే. -
'ఆయన మై ఫెవరేట్ హీరో....'
తిరుమల : అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన 'ఆత్మబలం'లోని చిటపట చినుకులు పడుతూ ఉంటే... పాట ఎన్నటికీ మరువలేనని అలనాటి సినీనటి సరోజాదేవి అన్నారు. బుధవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సరోజాదేవి మీడియాతో మాట్లాడుతూ 'ఆంధ్రాకు రాగానే నాగేశ్వరరావు గుర్తొచ్చారు. ఆయన మై ఫెవరేట్ హీరో. హాయ్ హీరోయిన్ ఎలా ఉన్నావ్ అని నాగేశ్వరరావు నన్ను అడిగేవారు' అని తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అలాగే ఎన్టీ రామారావు కూడా తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. తెలుగులో నటించిన ప్రతి సినిమా హిట్ అయిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనతోపాటు సినిమాల్లో నటించిన నటీనటులను మిస్సయ్యాను అనే ఫీలింగ్ వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరువాత మనస్సుకు సంతృప్తిగా ఉందని తెలిపారు.