breaking news
roll model
-
చిన్నారి శిఖరం
పర్వతారోహణ ఒక సాహసం. సాహసం కన్నా కూడా ఒక దుస్సాహసం. ఇంకా చెప్పాలంటే అదొక జీవన్మరణ ప్రయత్నం. ‘ఆడపిల్ల ఇంత సాహసానికి ఒడిగట్టడం అవసరమా’ అని తన గ్రామంలో ఎవరైనా అంటే.. ‘‘ఆ సాహసమే చేయకపోతే అందరిలో ఒకమ్మాయిగా ఉండిపోయేదాన్ని. ఆ సాహసమే నన్నీ రోజు అరుదైన కొందరిలో ఒక అమ్మాయిగా నిలబెట్టింది. ఎందరో అమ్మాయిలకు నన్ను రోల్ మోడల్ని చేసింది’’ అంటుంది మలావత్ పూర్ణ. ‘అమ్మాయి అనే కారణంగా ఎవరూ తమకొచ్చిన అవకాశాలను, తమ ఆశయాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. లక్ష్యాన్ని చేరడానికి అమ్మాయిగా పుట్టడం అనేది అడ్డంకి కాబోదు’ అని నిరూపించింది పూర్ణ. ‘సంకల్పబలం ముందు పేదరికం పక్కకు తప్పుకుంటుంది’ అంటున్నప్పుడు ఆమె కళ్లలో కనిపించిన ఆత్మవిశ్వాసం శిఖర సమానం అనిపించింది. అందుకే పూర్ణ.. ఒక చిన్నారి శిఖరం. మలావత్ పూర్ణది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పాకాల గ్రామం. ఎనిమిది వందల జనాభా కూడా లేని ఓ కుగ్రామం. ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివింది. ఆరవ తరగతి నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకుంటోంది. ఇప్పుడు కామారెడ్డిలోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో బీ.ఎ. రెండవ సంవత్సరం చదువుతోంది. డిగ్రీ పూర్తయ్యాక సివిల్స్కి ప్రిపేరవ్వాలనేది ఆమె కెరీర్ ప్లాన్. తానీరోజు నడుస్తున్న విజయమార్గానికి తొలి అడుగులు వేయించింది అమ్మానాన్నల ముందుచూపే అంది పూర్ణ. ‘‘మమ్మల్ని (పూర్ణ, ఆమె అన్న నరేశ్) చదివించాలని అనుకోక పోయి ఉంటే ఈ రోజు ఈ సక్సెస్ మా ఊహకు కూడా అందేది కాదు. మా బంజారా తండాల్లో నా వయసు అమ్మాయిలు పెళ్లి చేసుకుని పిల్లల తల్లులయి ఇంటి బాధ్యతల్లో మునిగిపోయి ఉన్నారు. మా నాన్న కల మమ్మల్ని చదివించాలని. నాన్న కలను అమ్మ గౌరవించింది. ఆరవ తరగతిలో వాళ్లు మమ్మల్ని హాస్టల్కి పంపించడం వల్లనే నేను కొత్త ప్రపంచాన్ని చూడగలిగాను. మా నాన్న ఆరేడు కిలోమీటర్ల దూరం సైకిల్ మీద వెళ్లి ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకున్నాడు. తనకు చదువు లేదు, మేము చదువుకుంటే చూడాలనుకున్నాడు’’ అంటూ తాను మౌంటనీర్ కావడానికి దారి తీసిన సంఘటనలను పంచుకుంది పూర్ణ. అప్పుడు ఎయిత్ క్లాస్ ‘‘నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ శాఖ సెక్రటరీగా ఐపీఎస్ అధికారి ప్రవీణ్కుమార్ ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుకునే పిల్లల పట్ల సమాజంలో ఉన్న చిన్న చూపును తుడిచేయాలనుకున్నారాయన. ‘ఈ పిల్లలు దేనిలోనూ వెనుకబడరు, అవకాశాలు కల్పించి, ప్రోత్సహిస్తే దేన్నయినా సాధించి తీరుతారు, శిఖరాలను చేరుతారు’ అని సమాజానికి చెప్పాలనుకున్నారు. అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ కోసం రాష్ట్రంలోని అన్ని సోషల్ వెల్ఫేర్ స్కూళ్లకూ సర్క్యులర్ పంపించారు. నేను స్పోర్ట్స్లో చురుగ్గా ఉండేదాన్ని. ఆల్రౌండర్గా ఉండడంతో మా స్కూల్ నుంచి నా పేరు కూడా పంపించారు. అలా సెలెక్ట్ చేసిన నూట పదిమంది స్టూడెంట్స్ని భువనగిరికి రాక్ క్లైంబింగ్కి తీసుకెళ్లారు. అందులో అర్హత సాధించిన పదిమంది అమ్మాయిలు, పదిమంది అబ్బాయిలను పేరెంట్స్ నుంచి అంగీకారం తీసుకున్న తర్వాత స్పెషల్ కోచింగ్కి డార్జిలింగ్కి తీసుకెళ్లారు. కోచింగ్ తర్వాత పదిహేను వేల అడుగుల ఎత్తున్న రినాక్ పీక్కి చేరుకున్నాను. అది నా తొలి రికార్డు. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లల కేటగిరీలో ఆ రికార్డు వచ్చింది. అప్పటి వరకు ఎవరెస్టు ఆలోచన లేదు. ఆ రికార్డు తర్వాతనే ప్రవీణ్ సర్కి ఎవరెస్టు అధిరోహణలో కూడా వీళ్లు విజయవంతం అవుతారని ఎందుకు నిరూపించకూడదు అనిపించింది. ఎవరెస్టు ఎక్స్పెడిషన్ కోసం లధాక్ (3,000 మీటర్లు), స్టోక్ కాంగ్రి (ఎత్తు 6,153 మీటర్లు) పర్వతాలలో ప్రాక్టీస్ చేశాం. 2013 ఇలా ప్రిపరేషన్లో గడిచింది. ఎవరెస్టు శిఖరాన్ని 2014లో ఎక్కాను. అప్పుడు నేను నైన్త్ క్లాస్. నేపాల్కు దారి లేదు ఆ ఏడాది వాతావరణం ఏ మాత్రం అనుకూలించలేదు. మంచు చరియలు విరిగిపడడంతో రూట్ ఓపెన్ చేయడానికి వెళ్లిన 17 మంది షెర్పాలు (పర్వతారోహణ సహాయకులు) ప్రాణాలు కోల్పోయారు. దాంతో నేపాల్ వైపు నుంచి దారి మూసేసి, ఆ ఏడాదికి నిషేధం విధించారు. మేము చైనా వైపు నుంచి వెళ్లాం. నా బరువు 45 కిలోలు. మేము మోసుకెళ్లే బ్యాగ్ బరువు 15 కిలోలు. అదేమీ ఇబ్బంది కాలేదు, కానీ ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఇబ్బంది పెడుతుంది. ఆక్సిజన్ అందక తలనొప్పి, వాంతులు వచ్చాయి. రెస్ట్ కోసం రెండు రోజులు బేస్ క్యాంపుకి పంపేశారు. అడ్వాన్స్డ్ బేస్ క్యాంపునకు చేరిన తర్వాత మళ్లీ సిక్నెస్ వచ్చింది. ఆక్సిజన్ పెట్టుకున్న తర్వాత నార్మల్ అయ్యాను, తీసేస్తే వాంతులయ్యేవి. వాతావరణం సహకరించక పది రోజులు బేస్ క్యాంపులో ఉండాల్సి వచ్చింది. అయితే... అవేవీ భయపెట్టవు. మౌంటెనీరింగ్కి దేహం కంటే మైండ్ ఫిట్గా ఉండాలి. మానసిక స్థైర్యమే ముందుకు నడిపిస్తుంది. అయినప్పటికీ ఒక సంఘటన నాలో వణుకు పుట్టించింది. డ్రస్ కాదది! ఎవరెస్ట్ను చేరే క్రమంలో సంభవించే మరణాల్లో ఎక్కువ భాగం మూడవ క్యాంపు తర్వాతనే. నా జర్నీలో స్టెప్ త్రీ దాటిన తర్వాత మరో ఇరవై నిమిషాల్లో శిఖరాన్ని చేరుతాననగా, ఆరెంజ్ కలర్లో ఉన్న డ్రస్ ఒకటి కనిపించింది. పక్కనే ఉన్న షెర్పాతో ‘ఎందుకిలా డ్రస్ని ఇక్కడ వదిలేశారు’ అని అడిగాను. ‘డ్రస్ కాదు, డెడ్ బాడీ’ అన్నారు షెర్పా. పరిశీలనగా చూస్తే... బోర్లా తిరిగి ముడుచుకుని పడుకున్నట్లుగా ఉంది బాడీ. అప్పుడు వణికి పోయాను. వెంటనే నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ‘అమ్మాయిలు గెలవగలరని సమాజానికి చెప్పాలని ఇంతదూరం వచ్చాను. పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాలనేది నా మెంటార్ ప్రవీణ్ సర్ కల. నేను గెలిచి రావాలని ఎదురు చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. నేను ఓడిపోకూడదు, వెనుకడుగు వేయకూడదు’ అని కౌన్సెలింగ్ ఇచ్చుకుని, అందరిలాగానే డెడ్బాడీకి దణ్ణం పెట్టుకుని ముందుకు అడుగేశాను. ఎవరెస్టు ఆరోహణలో చివరి రోజు రాత్రి కాళ్లకు శవాలు తగులుతూ, ఒళ్లు గగుర్పొడిచేది. మూడవ క్యాంపు కంటే ముందయితే షెర్పాలు పర్వతారోహకులను రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. మూడవ క్యాంపు తర్వాత రక్షించడం సాధ్యమయ్యే పని కాదు. సంతోషంతో కన్నీళ్లు ఎవరెస్టు శిఖరాన్ని చేరిన తరువాత ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్లు ఉంది. ఓ పది నిమిషాల సేపు ఫొటోలు తీసుకుంటూ గడిపేశాం. ఎటు చూసినా మనుషులు కనిపించే వాతావరణం నుంచి ఎటు చూసినా మంచు పర్వతాలే కనిపించే శిఖరం మీద ఉన్నాం... అనే భావనను చెప్పడానికి పదాలు దొరకవు. నాకు తెలిసిన పదాల్లోనే ప్రతి జ్ఞాపకాన్నీ డైరీ రాశాను. ఏడు శిఖరాల ఆరోహణ పూర్తయిన తర్వాత పుస్తకం రాస్తాను. ఏడు శిఖరాల ఆలోచన మొదట్లో లేదు. ఎవరెస్టును సాధించిన తరువాత కలిగింది. ఎవరెస్టు తర్వాత మరో మూడు శిఖరాలను అధిరోహించాను. మొదటగా ఎల్తైన శిఖరాన్ని చేరడంతో కావచ్చు అదే తీపిగుర్తుగా ఉండిపోయింది. మిగిలినవి ప్రయాణంలో మైలురాళ్లుగా అనిపిస్తున్నాయి. నా విజయానికి బహుమతిగా ప్రభుత్వం పాతిక లక్షల డబ్బు, ఐదెకరాల వ్యవసాయ భూమి, ఇల్లు, చదువుకి అయ్యే ఖర్చు కూడా శాంక్షన్ చేసింది. స్పానిష్ నచ్చింది ఎవరెస్టు అధిరోహణకు ప్రభుత్వమే స్పాన్సర్ చేసింది. మిగిలిన వాటికి ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ మౌంటెనీరింగ్, ట్రెక్కింగ్ సర్వీసెస్ వాళ్లు స్పాన్సర్ చేస్తున్నారు. మాతోపాటు ఎవరెస్టు ఆరోహణలో కోచ్ శేఖర్బాబు కూడా ఉన్నారు కాబట్టి భాష ఇబ్బంది కాలేదు. శిఖరాధిరోహణలో నాకు ఎదురైన మనుషుల్లో అర్జెంటీనా వాళ్లు బాగా నచ్చారు. స్పానిష్, నేపాలీ భాషలు నచ్చాయి. నాకిప్పుడు బంజారా, తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలు వచ్చు. స్పానిష్, నేపాలీ భాషలు కూడా నేర్చుకుంటాను’’ అంటూ పరిపూర్ణంగా నవ్వింది మలావత్ పూర్ణ. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు : శివ మల్లాల అందరి బడి ప్రవీణ్ సర్ నా రోల్ మోడల్. ఆయనలాగే సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రామ్లు చేయాలని కోరిక. ప్రభుత్వం పేద ప్రజల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వ సేవలను ప్రజలందరూ ఉపయోగించుకునేటట్లు చూడాలి. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకంటే మెరుగ్గా తయారుచేస్తాను. గవర్నమెంట్ స్కూల్ పేదవాళ్ల బడి అనే దురభిప్రాయాన్ని పోగొట్టి, అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునేటట్లు మెరుగుపరుస్తాను. అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే మాట... ‘ఈ రోజుల్లో అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉంటున్నారు. ఎవరెస్టు మీదకే కాదు అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు. ఒకరి ఆసరా కోసం ఎదురు చూడవద్దు. మీ శక్తిని మీరు తెలుసుకోండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చదువుని నిర్లక్ష్యం చేయవద్దు’. – మలావత్ పూర్ణ, మౌంటనీర్ ఈ రికార్డు చెరిగిపోదు పూర్ణ మలావత్.. ఎవరెస్టును అధిరోహించిన భారతీయుల్లో అత్యంత చిన్న వయస్కురాలు. ఎవరెస్టు శిఖరం మీద అడుగుపెట్టే నాటికి ఆమె వయసు పదమూడు సంవత్సరాల పదకొండు నెలలు. ఈ రికార్డు కొంతకాలం డిక్కీ దోల్మాకు ఉండేది. డోల్మా 1974లో పుట్టారు, 1993లో ఎవరెస్టును అధిరోహించారు. అప్పటికి ఆమె వయసు 19. అప్పటి నుంచి 2003 వరకు పదేళ్ల పాటు ఆమెదే రికార్డు. 2003లో 15 ఏళ్ల మింగ్ కిపా ఆ రికార్డును బ్రేక్ చేసింది. కిపా పేరుతో ఆ రికార్డు 2010 వరకు కొనసాగింది. ఆ ఏడాది అమెరికాకు చెందిన పదమూడేళ్ల పది నెలల కుర్రాడు జోర్డాన్ రోమెరో సొంతం చేసుకోగా 2014, మే నెల 25వ తేదీన పూర్ణ కొత్త రికార్డును రాసుకుంది. ‘యంగెస్ట్ ఇండియన్, యంగెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ స్కేల్ మౌంట్ ఎవరెస్ట్’ రికార్డులు పూర్ణ సొంతం చేసుకుంది. పూర్ణకు కలిసి వచ్చిన మరో అంశం ఏమిటంటే... ఎవరెస్టును అధిరోహించడానికి కనీస వయసును నేపాల్ 16 ఏళ్లకు, చైనా 18 ఏళ్లకు పెంచేశాయి. ఈ నిబంధన ప్రకారం ఇక ఇంకా చిన్న వయసు వాళ్లెవరూ ఎవరెస్టును అధిరోహించడానికి వీలుకాదు. కాబట్టి పూర్ణకు ఈ రికార్డు ఎప్పటికీ అలాగే ఉంటుంది. పూర్ణ చేరిన శిఖరాలు 2014 : ఆసియాలో ఎవరెస్టు (29 వేల అడుగుల ఎత్తు) 2016 : ఆఫ్రికాలో కిలిమంజారో (19 వేలకు పైగా అడుగులు) 2017 : యూరప్లో ఎల్బ్రస్ (18 వేల ఐదొందల అడుగులు) 2019 : సౌత్ అమెరికాలో అకాంకగువా (దాదాపు 23 వేల అడుగులు) (పూర్ణ ఈ నెల 14వ తేదీన అకాంకగువా శిఖరారోహణ పూర్తి చేసి, 21వ తేదీన ఇండియాకి తిరిగొచ్చింది) -
శారద ఇన్స్పిరేషన్..శ్యామల రోల్మోడల్
కర్నూలు(కల్చరల్) : ‘‘నేను 8వ తరగతి చదివేటప్పుడు న్యాయం కావాలి సినిమా చూశాను. అందులో శారద పాత్ర నాపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపింది. అన్యాయానికి గురైన రాధికకు అండగా నిలిచి న్యాయం జరిగేటట్లు లాయర్ శారద పోరాటం చేయడం నాకు చాలా నచ్చింది. దీంతో నేను కూడా ఒక ‘అన్కాంప్రమైజింగ్’(రాజీలేని) ఫైటర్స్ పక్షాన నిలబడాలనే సదాశయంతో న్యాయవాద వృత్తి చేపట్టి ఈ స్థాయికి వచ్చాను’’ అని అన్నారు జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జి అనుపమ చక్రవర్తి. మౌనపోరాటం సినిమాలో యమున పాత్ర కూడా తనకు చాలా నచ్చిందని, మ హిళలు ధైర్యంగా నిలబడితే న్యాయం వారి పక్షాన నిలుస్తుందనే వాస్తవికతను ఈ పాత్ర చూపిందన్నారు. అన్యా యానికి గురైనప్పుడు మహిళలు కుంగిపోకూడదని, చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు సైతం..మహిళలపై వివక్ష చూపకూడదని, వారి ఇష్టా ఇష్టాలను గౌరవించాలన్నారు. జిల్లా జడ్జి అనుభవాలు ఆమె మాటల్లోనే.. ‘‘ మా సొంత ఊరు శ్రీకాకుళం. అమ్మ మహాలక్ష్మి, నాన్న కృష్ణచందర్రావు..ఇద్దరూ నన్ను చాలా ప్రేమగా పెంచారు. ఆడపిల్లనని వివక్ష చూపలేదు. ఏం చదవాలో, ఏం కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకిచ్చారు. ప్రాథమిక విద్య నుంచి మెట్రిక్యులేషన్ వరకు శ్రీకాకుళంలోని సెయింట్జోసెఫ్ స్కూలులో చదివాను. ఇంటర్ శ్రీకాకుళం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో పూర్తి చేశాను. ఇంటర్ పూర్తి కాగానే పెళ్లి.... ఆ రోజుల్లో ఉండే పరిస్థితులను బట్టి నాకు ఇంటర్ పూర్తి కాగానే పెళ్లి చేశారు. అయితే నాన్న.. మా బంధువుల వద్ద, మా వారి వద్ద నా చదువు పట్ల హామీ తీసుకునే పెళ్లి చేశారు. అందుకే నేను అమితంగా ఇష్టపడే ఐదేళ్ల లా కోర్సు విశాఖపట్టణంలోని నందమూరి బసవతారకం లా కళాశాలలో దిగ్విజయంగా పూర్తి చేయగలిగాను. నేనొక్కదాన్నే కాదు.. నాతో పాటు మా తమ్ముడు కూడా అదే కాలేజీలో చేరి లా కోర్సు పూర్తి చేశాడు. మా నాన్న గర్వపడ్డారు... నేను, మా తమ్ముడు హైదరాబాద్లో ఒకే రోజు లాయర్లుగా పేర్లు నమోదు చేసుకొని నల్ల కోటు తొడుక్కొని హైకోర్టులో అడుగుపెట్టాం. ఆ రోజున మా నాన్న చాలా గర్వంతో ఆనందించారు. 1994 నుంచి 2008 వరకు హైకోర్టు లాయర్గా సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించాను. 2008లో ప్రవేశ పరీక్షరాసి జి ల్లా జడ్జిగా ఎంపికయ్యాను. చిత్తూరు, కడప జిల్లాల్లో జడ్జిగా పలు సవాళ్లను ఎదుర్కొన్నాను. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక విజయవాడలో మహిళా సెషన్స్ జడ్జిగా, కృష్ణా జిల్లా ఫుల్ అడిషనల్ చార్జ్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జిగా పనిచేశాను. 2016 జూలై నుంచి కర్నూలు జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా చేస్తున్నాను. స్త్రీ తల్లి పాత్రను బాగా పోషిస్తే.. సమాజంలో ప్రతీ స్త్రీ తల్లి పాత్రను బాగా పోషిస్తే బిడ్డలు నేరస్తులు కారు. ఏది తప్పో, ఏది ఒప్పో చక్కగా చెప్పి మానవీయ విలువలను నేర్పితే సమాజం తీరుతెన్నులు మారిపోతాయి. స్త్రీల పట్ల అఘాయిత్యాలు, అత్యాచారాలు వేధింపులు జరగడానికి దుర్మార్గులు ఒక కారణమైతే స్త్రీలలోని పిరికితనం, అవగాహన లోపం కూడా ఒక కారణం. మహిళా సాధికారత బాగా ప్రచారంలోనికి వచ్చిన ఈ రోజుల్లో కూడా స్త్రీలు వివక్షకు, వేధింపులకు గురికావడం సబబు కాదు. మహిళలు కూడా తమ వేషధారణ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. హక్కుల కోసమే కాకుండా బాధ్యతల నిర్వహణ కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.’’ గర్భిణిగా పరీక్షలకు హాజరు.. లా చదువుతున్న రోజుల్లో నేను నిండు గర్భిణిగా ఉండి పరీక్షకు హాజరై పాసయ్యాను. అంతేకాదు... బాబు పుట్టిన కొన్ని రోజులకే మరో పరీక్షకు వెళ్లవలసి వచ్చింది. ఏ మాత్రం మానసిక ఒత్తిడికి గాని, శారీరక ఒత్తిడికి గాని గురి కాకుండా అందరి ప్రోత్సాహంతో నేను హాయిగా పరీక్ష రాశాను. మానసికంగా బలవంతులైతే మనం ఏ పనినైనా సాధించవచ్చు. పిరికితనం, అధైర్యం వల్ల అడుగడుగునా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చట్టాలపై అవగాహన ఉండాలి.. మహిళలు చట్టాలు తెలుసుకొని వాటిని బాగా వినియోగించుకోవాలి. నిర్భయ, గృహహింస నిరోధక, చైల్డ్ అబ్యూజ్ , పీసీసీ.. చాలా అద్వితీయమైన చట్టాలు. వీటిని వినియోగించుకోవడంలో చదువుకున్న మహిళలు విఫలం కాకూడదు. ఈ చట్టాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు మేం నేషనల్ లీగల్ అథారిటీ ఆధ్వర్యంలో లీగల్ లిటరసీ క్యాంపులు నిర్వహిస్తున్నాం. మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకున్న నాడు నిర్భయంగా నిస్సంకోచంగా సమాజంలో జీవించగలరు. ఆమె చూపిన అభిమానం మరువలేనిది.. సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ (శ్రీకాకుళం)లో చదువు చెప్పిన శ్యామలా టీచర్ నాకు రోల్ మోడల్. ఆమె ఇంగ్లిష్ బోధించిన తీరు ఇప్పటికీ నన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఎంత పెద్ద పదాన్నైనా సిలబల్ చేసి ఆమె నేర్పిం చిన తీరు మరచిపోలేను. నేర్చుకోకపోతే ఆమె వేసిన చిన్న శిక్షలు, నేర్చుకున్నాక ఆమె చూపిన అభిమానం నాలో క్రమశిక్షణను పెంచాయి. మానవీయ బంధాలు ఏర్పడాలి.. ‘‘ ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటారు’’ అన్నది ఒక ఆర్యోక్తి. కాని నా విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. నా విజయం వెనుక మా నాన్న, మా వారు, మా తమ్ముడు ఉన్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. సమాజంలో ఇటువంటి మానవీయ బంధాలు ఏర్పడితే స్త్రీలు ఏ ఆంక్షలు లేకుండా తమ ఆకాంక్షల మేరకు ఆశయాలు సాధిస్తారు. చాలా కుటుంబాల్లో కట్టుబాట్లతో స్త్రీల చదువును నిరోధిస్తారు. దీంతో స్త్రీలు ఆశయాలను, ఆకాంక్షలను అణగదొక్కుకోవాల్సి వస్తోంది. -
రోల్ మోడల్
-
పి.వి.సింధు విజయోత్సవ ర్యాలీ
గుంటూరు స్పోర్ట్స్: సింధును స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ఒలింపియన్లు తయారు కావాలని హైకోర్టు జడ్జి జస్టిస్ కైత్ సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్డేడియంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్స్ రజత పతక విజేత పి.వి.సింధు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి జస్టిస్ కైత్ సురేష్ కుమార్, తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఒలింపిక్స్లో సింధు ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చిందన్నారు. ఆమె స్ఫూర్తితో క్రీడాకారులు ముందుకు సాగాలన్నారు. ఆలపాటి రాజా మాట్లాడుతూ సింధు విజయం ఒక సంచలనం అన్నారు. ర్యాలీ స్డేడియం ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమంలో స్డేడియం పాలకవర్గ సభ్యులు, శిక్షకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
25న సివిల్స్ టాపర్ టీనాదాబికి సన్మానం
విజయవాడ (గాంధీనగర్) : ఆల్ ఇండియా సివిల్స్ టాపర్ టీనాదాబి సన్మాన సభ ఏ–కన్వెన్షన్ సెంటర్లో ఈనెల 25న నిర్వహిస్తున్నట్లు జాయింట్ యాక్షన్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఇంజినీర్ కొర్లపాటి విజయకుమార్ తెలిపారు. ప్రెస్క్లబ్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సన్మానానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతారని తెలిపారు. టీనాదాబీతో సహా ఇతర సివిల్స్ టాపర్స్ విద్యార్థులకు సూచనలు, సలహాలు అందజేస్తారన్నారు. టీనాదాబి మధ్యప్రదేశ్లో దళిత కుటుంబంలో జన్మించారని, సివిల్స్ చరిత్రలో దళిత యువతి టాపర్గా నిలవడం ఇదే ప్రథమమన్నారు. సన్మాన సభకు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్బాబు, కొల్లు రవీంద్ర హాజరవుతారన్నారు. సమావేశంలో రిటైర్డ్ ఐఆర్ఎస్ పల్లెపోగు సీమోను, ఎస్.రాజన్బాబు, గొర్రె గాంధీ, పోలుమట్ల విజయ్కుమార్, పరిశపోగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.