-
ఎక్కువ దరఖాస్తులు వాటికే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే దరఖాస్తుల్లో ఎక్కువగా ఇంటిగ్రేటెడ్, ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసమే వస్తున్నాయి. ఆ తర్వాత ఫ్యామిలీ సర్టిఫికెట్, పుట్టిన తేదీ, డెత్ సర్టిఫికెట్ల కోసం అందుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ వెబ్ అప్లికేషన్లు, కాల్ సెంటర్ల ద్వారా వచ్చే ఈ దరఖాస్తులకు సంబంధించిన సర్టిఫికెట్లను సులభంగా జారీచేసేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అమలుచేస్తోంది. అలాగే, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుండడంతో క్షేత్రస్థాయిలో మార్పు కనపడుతోంది. సర్టిఫికెట్ల కోసం ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తులు పెండింగ్లో ఉండడానికి కారణాలు గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన మార్గదర్శకాలు ఇస్తున్నారు. దరఖాస్తుల తీరూతెన్నూ ఎలా ఉందంటే.. ► గత నెలలో 26 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ (క్యాస్ట్, నేటివిటీ, పుట్టిన తేదీ) సర్టిఫికెట్ల కోసం 1.34 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 92 వేల సర్టిఫికెట్లను ఆమోదించి జారీచేయగా, 1,050 సర్టిఫికెట్లను తిరస్కరించారు. 40 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అంటే 30 శాతం సర్టిఫికెట్లు పెండింగ్లో ఉన్నాయి. మూడు నెలలుగా చూస్తే ఈ సర్టిఫికెట్ల కోసం 2.68 లక్షల దరఖాస్తులు రాగా, 2.15 లక్షల దరఖాస్తులను మంజూరు చేశారు. 8,100 దరఖాస్తులను తిరస్కరించగా, 45 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 3 నెలల్లో ఈ సర్టిఫికెట్ల పెండింగ్ శాతం 16 శాతంగా ఉంది. ► అలాగే, గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం 1.15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 95 వేల దరఖాస్తులను మంజూరు చేశారు. 2,700 దరఖాస్తులను తిరస్కరించగా, 18 వేల దరఖాస్తులను పెండింగ్లో పెట్టారు. మూడు నెలలుగా చూసుకుంటే.. మొత్తం 2.20 లక్షల దరఖాస్తులు రాగా 1.93 లక్షల దరఖాస్తులను ఆమోదించి, 7,500 దరఖాస్తులను తిరస్కరించారు. 18 వేల దరఖాస్తులు పెండింగ్లో పెట్టారు. ► ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం గత నెలలో 15,500 దరఖాస్తులు రాగా 7,500 దరఖాస్తుల్ని ఆమోదించి జారీచేశారు. 1,600 దరఖాస్తుల్ని తిరస్కరించగా, 6,500 దరఖాస్తుల్ని పెండింగ్లో పెట్టారు. ఈ దరఖాస్తులు 41% పెండింగ్లో ఉంటున్నాయి. మూడు నెలలుగా చూసుకుంటే 44 వేల దరఖాస్తులు రాగా 28 వేల దరఖాస్తుల్ని ఆమోదించి జారీచేశారు. 8,300 దరఖాస్తుల్ని తిరస్కరించగా, 7,500 దరఖాస్తుల్ని పెండింగ్లో ఉంచారు. 3 నెలల్లో ఈ దరఖాస్తులు 16% పెండింగ్లో ఉన్నాయి. ఈ దరఖాస్తుకు సంబంధించి గతంలో కుటుంబ పెద్ద సర్టిఫికెట్ పొంది ఉంటే దాని ప్రకారం అప్పటికప్పుడు వెంటనే సర్టిఫికెట్ జారీచేయాల్సి ఉంటుంది. ► పుట్టిన తేదీ సర్టిఫికెట్ కోసం ఆలస్యంగా చేసుకున్న దరఖాస్తులు గత నెలలో 4,100 రాగా ఇందులో 570ని జారీచేశారు. 17 దరఖాస్తులను తిరస్కరించగా, 3,500కి పైగా పెండింగ్లో ఉంచారు. వీటి పెండింగ్ శాతం 86గా ఉండడం గమనార్హం. ► డెత్ సర్టిఫికెట్ కోసం ఆలస్యంగా పెట్టుకున్న దరఖాస్తులు గత నెలలో 1,600 రాగా కేవలం 128నే ఆమోదించి జారీచేశారు. 17 దరఖాస్తులను తిరస్కరించారు. 1,400కి పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 90 శాతానికి పైగా పెండింగ్లో ఉండడం గమనార్హం. ► అలాగే, పుట్టిన తేదీ సర్టిఫికెట్ కోసం ఆలస్యంగా వచ్చే దరఖాస్తులకు సంబంధించి పదో తరగతి సర్టిఫికెట్ను ప్రామాణికంగా తీసుకోవాలని సీసీఎల్ఏ ఆదేశాలిచ్చింది. -
లంచగొండులపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల మాట వినిపించకూడదని, ఎక్కడ అవినీతి ఉన్నా కూకటివేళ్లతో పెకిలించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ చేసిన ఆదేశాలతో అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) లంచ గొండుల భరతం పడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దాడులకు శ్రీకారం చుట్టింది. అవినీతి నిరోధానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘14400’ కాల్ సెంటర్లకు పెద్దఎత్తున కాల్స్ వస్తుండడంతో వీటిపైనా ఏసీబీ వేగంగా స్పందిస్తోంది. ఇప్పటికే ఈ కాల్సెంటర్పై ప్రజల్లో అవగాహన బాగా పెరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. అలాగే, లంచగొండులపై నిఘాను ముమ్మరం చేసింది. 10 నెలల్లో 44,999 కాల్స్ ► గత ఏడాది నవంబర్లో ‘14400’ కాల్ సెంటర్ను ప్రారంభించారు. ► ఇప్పటివరకు ఈ కాల్ సెంటర్కు 44,999 కాల్స్ రాగా ఇందులో అవినీతికి సంబంధించిన కాల్స్ 1,747 ఉన్నాయి. ► ఇందులో 1,712 ఫిర్యాదులను పరిష్కరించారు. మరో 161 కాల్స్పై చర్యలు తీసుకుంటున్నారు. ఈ కాల్ సెంటర్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 13 ట్రాప్ కేసులను కూడా ఏసీబీ నమోదు చేసింది. మూడు కేసుల్లో క్రిమినల్ దుష్ప్రవర్తన చర్యలను చేపట్టింది. ► మరో 67 ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ► 46 రెగ్యులర్ విచారణలు.. 32 డిస్క్రీట్ విచారణలను చేపట్టారు. ► దీంతో ఈ కాల్సెంటర్ సూపర్హిట్ అయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ► అలాగే, వస్తున్న కాల్స్ ద్వారా ఏఏ శాఖల్లో ఏఏ అంశాలపై అక్రమార్కులు ప్రజలను లంచాలు డిమాండ్ చేస్తున్నారో ఏసీబీ గుర్తించింది. ► దీని ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన తిమింగలాలతో పాటు సామాన్య ప్రజలను లంచాల పేరుతో పీడించే వారిపై తక్షణం దృష్టిసారించాలని నిర్ణయించింది. ► ఇందులో భాగంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖల్లో అక్రమార్కులపై ప్రధానంగా నిఘా పెట్టనుంది. -
రిజిస్ట్రేషన్లకు ‘నెట్వర్క్’ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు ‘నెట్వర్క్’ కష్టాలు తప్పేట్టు లేవు. రిజిస్ట్రేషన్లకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించే నెట్వర్క్ను తహసీల్దార్ కార్యాలయాలకు అనుసంధానం చేయడం సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇటీవల ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ను ఇప్పుడు మరో 473 తహసీల్దార్ కార్యాలయాలకు విస్తృతం చేయాల్సి రావడమే ఇబ్బందిగా మారనుంది. నెట్వర్క్ను యేటా సమకూరుస్తున్న రెయిల్టెల్.. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మాత్రమే నెట్వర్క్ను సమకూరుస్తుందా.. లేదా అన్ని చోట్లకు విస్తరిస్తుందా.. అనే దానిపై స్పష్టత రావట్లేదు. విస్తరించని పక్షంలో తహసీల్దార్ కార్యాలయాల్లో స్వాన్ నెట్వర్క్ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరపాల్సి వస్తుందా అన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. నెట్వర్క్.. చాలా టఫ్! రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు ఇటీవల రైల్వే శాఖ టెక్నికల్ విభాగమైన ‘రెయిల్టెల్’ సహకారంతో రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్వర్క్ ద్వారానే ప్రస్తుతం రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఇందుకు ఏటా రెయిల్టెల్కు రూ.1.20 కోట్ల రుసుము చెల్లిస్తోంది. ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగాలంటే ఈ నెట్వర్క్ను తప్పకుండా పొడిగించాల్సిన పరిస్థితి. అయితే మారుమూల ప్రాంతాల్లోని తహసీల్దార్ కార్యాలయాలకు నెట్వర్క్ను సమకూర్చి, నిర్వహించేందుకు రెయిల్టెల్ సంసిద్ధత వ్యక్తం చేస్తుందా అనేది అనుమానంగా కనిపిస్తోంది. స్వాన్తో చుక్కలే.. ఒకవేళ రెయిల్టెల్ చేతులెత్తేస్తే తహసీల్దార్ కార్యాలయాల్లో రిజి స్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఐటీ శాఖ అందించే స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ (స్వాన్)తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈ నెట్వర్క్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. రెండు, మూడు రోజులకోసారి సర్వర్లు డౌన్ అయి తరచూ ఆటంకాలు ఎదురయ్యేవి. ఎక్కడ సమస్య వచ్చినా రాష్ట్రమంతటా కార్యకలాపాలు నిలిచిపోయేవి. ఈ నేపథ్యంలో రెయిల్టెల్ అంగీకరించకుండా స్వాన్తో సరిపెట్టుకోవాల్సి వస్తే మాత్రం మారుమూల ప్రాంతాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగడం గగనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తహసీల్దార్ రిజిస్ట్రేషన్లు.. అంత ఈజీ కాదట!
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించే ప్రతిపాదనపై భిన్నాభి ప్రాయం వ్యక్తమవుతోంది. అటు ప్రభుత్వ పెద్దలుగానీ, ఇటు ఉన్నతాధికారులుగానీ పైకి ఏమీ మాట్లాడకపోయినా ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై తీవ్రమైన తర్జనభర్జన జరుగుతోంది. కొత్త విధానం అమలు అంత సులువుకాదని, ప్రస్తుత విధానం కొనసాగింపే మేలన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈనెల 8న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అంతర్గతంగా ఇచ్చిన నివేదిక కీలకంగా మారింది. ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవల అమలు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఆ నివేదికలో పేర్కొన్న గణాంకాలు, సూచనలు ప్రభుత్వ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. ప్రస్తుత విధానాన్ని కొనసాగించడమే మంచిదని ఆ నివేదిక స్పష్టం చేసినట్లు తెలిసింది.నివేదికలోని ముఖ్యాంశాలివీ.. రోజుకు ఒకటి రెండు డాక్యుమెంట్లే! గతేడాది రాష్ట్రంలోని 567 గ్రామీణ మండలాల్లో వ్యవసాయ భూముల కేటగిరీలో 4,54,607 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. అందులో 373 మండలాల్లో సగటున రోజుకు మూడు అంతకన్నా తక్కువ సంఖ్యలో (260 మండలాల్లో రోజుకు రెండు.. ఇందులో 128 మండలాల్లో రోజుకో డాక్యుమెంట్ మాత్రమే) డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. మిగతా 194 మండలాలకుగాను 65 చోట్ల సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అంటే సబ్రిజిస్ట్రార్లు లేని 129 మండలాల్లో మాత్రమే రోజుకు మూడు కన్నా ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని మండల కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల కల్పన అనవసరపు భారంగా మారుతుంది. ‘శిక్షణ’తో తలనొప్పి ప్రస్తుతం డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ల చట్టం–1908, స్టాంపుల చట్టం–1899 ప్రకారం రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పుడు ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్టర్ చేయాలంటే.. ఎమ్మార్వోలకు ఈ చట్టాలు, నియమ నిబంధనలు, స్టాండింగ్ ఆర్డర్ల గురించి శిక్షణ ఇవ్వాలి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుతం అమలు చేస్తున్న ‘కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)’ వ్యవస్థపై కూడా 443 మంది ఎమ్మార్వోలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్లున్న మండలాల్లో పనిచేస్తున్న ఎమ్మార్వోలకు వీటి గురించి అవగాహన ఉండదు. వారు తర్వాత సబ్రిజిస్ట్రార్లు లేని మండలాలకు బదిలీ అయితే శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. బోలెడు సిబ్బంది అవసరం ప్రతి సబ్రిజిస్ట్రార్కు ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు సబార్డినేట్లు, క్లర్కులు కావాలి. మార్కెట్ విలువ సర్టిఫికెట్ల జారీ, చెక్స్లిప్ల తయారీ, డాక్యుమెంట్ల స్కానింగ్, చలానాలు, ఈసీల తయారీ, బయోమెట్రిక్ వివరాల సేకరణ, వెబ్ల్యాండ్ను పోల్చడం, పాస్ పుస్తకాల పరిశీలన, రికార్డుల మెయింటెనెన్స్, స్టాంపుల అమ్మకాల వంటి బాధ్యతలు ఉంటాయి. ఈ మేరకు పోస్టులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ‘నెట్వర్క్’ ఎలా..? రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)’ వ్యవస్థ ఆధారంగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఎమ్మార్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయాలంటే ఆ మేరకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ నెట్వర్క్ అనుసంధానం అవసరం. రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతమున్న 141 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు నెట్వర్క్ను నిర్వహించడమే గగనంగా ఉంది మారుమూల ప్రాంతాల్లోని 584 ఎమ్మార్వో కార్యాలయాలకు నెట్వర్క్ అందించడం చాలా కష్టం. సబ్రిజిస్ట్రార్ల పరిధితో తిప్పలు ప్రస్తుతం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు మండలాల ప్రాతిపదికన లేవు. కొన్ని మండలాల్లో సగం గ్రామాలు ఓ సబ్రిజిస్ట్రార్, మరిన్ని గ్రామాలు మరో సబ్రిజిస్ట్రార్ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మార్వో కార్యాలయాల వారీగా విధానం అమలుతో.. పలు సబ్రిజిస్ట్రార్ల కార్యాలయాల పరిధిని మార్చాల్సి ఉంటుంది. పర్యవేక్షణకు ఇబ్బందులు ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారం సబ్రిజిస్ట్రార్లు జిల్లా రిజిస్ట్రార్లకు, వారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్కు బాధ్యులుగా ఉంటారు. ఎమ్మార్వోలు నేరుగా కలెక్టర్లకు బాధ్యులుగా ఉంటారు. ఇప్పుడు సబ్రిజిస్ట్రార్లతోపాటు ఎమ్మార్వోలు రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తే.. వారు ఎవరికి బాధ్యులుగా ఉండాలన్న సందేహం తలెత్తుతోంది. దీనితో ఇరు శాఖల సమన్వయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది. ఎమ్మార్వోలు అందుబాటులో లేకుంటే..? ఎమ్మార్వోల వ్యవస్థ అత్యంత క్రియాశీలంగా ఉంటుంది. వారు వారంలో మూడు రోజుల పాటు తమ పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలనలతోపాటు వ్యవసాయం, సాగునీరు, ప్రోటోకాల్ లాంటి విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ‘క్రాస్ చెకింగ్’కు ఇబ్బందే ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలను సబ్రిజిస్ట్రార్లు కన్వీనర్లుగా ఉన్న కమిటీ నిర్ధారిస్తుంది. అందులో ఎమ్మార్వో సభ్యుడిగా ఉంటారు. ఇప్పుడు ఈ రెండూ ఎమ్మార్వోనే చేయాల్సి వస్తుంది. ఇక నిషేధిత భూముల జాబితాలను ఎమ్మార్వోలే సబ్రిజిస్ట్రార్లకు ఇస్తారు. సబ్ రిజిస్ట్రార్లు వాటిని పరిశీలించి రిజిస్ట్రేషన్ల సమయంలో క్రాస్ చెకింగ్ చేస్తారు. కొత్త విధానంతో రెండు పనులూ ఎమ్మార్వోనే చేయాల్సి వస్తే క్రాస్ చెకింగ్కు అవకాశం లేకుండా పోతుంది. ఏటా తప్పని ఖర్చు రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించాలంటే ఏర్పాట్ల కోసం ఒక్కో మండలంలో రూ.10 లక్షల వరకు అవసరం. ఈ లెక్కన రూ.44.3 కోట్లు ఖర్చవుతాయి. తర్వాత నిర్వహణ కోసం కూడా ఏటా రూ.5 కోట్ల వరకు అదనంగా ఖర్చవుతుంది. ఇది అనవసరపు భారంగా పరిణమిస్తుంది. ఈ యోచన సమంజసం కాదు! కొత్త పాస్ పుస్తకాలు రైతులకు ఇబ్బంది లేకుండా సకాలంలో అందించాలంటే.. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలను ఎలక్ట్రానిక్ అనుసంధానం చేస్తే సరిపోతుంది. ప్రభుత్వం అప్పటికీ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ల చట్టానికి అనుగుణంగా ప్రతి మండలానికి, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలి. -
రెవెన్యూ ప్రాంగణాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులు
- రాజస్థాన్ తరహా వ్యవస్థ ఏర్పాటుకు సర్కారు నిర్ణయం - అనువైన స్థలాలను గుర్తించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం - భవనాల నిర్మాణానికి ముందుకొచ్చిన పోలీస్ హౌసింగ్ బోర్డు సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ కార్యాలయాల ప్రాంగణాల్లోనే రిజిస్ట్రేషన్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని సర్కారు సంకల్పించింది. వివిధ ఆస్తుల విక్రయాలకు సంబంధించి జరిగే ప్రతి రిజిస్ట్రేషన్కు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాల్సి ఉన్నందున, ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా రాజస్థాన్ తరహా విధానాన్ని అవలంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో ఏవైనా అనుమానాలు వ్యక్తమైతే, సంబంధిత మండల తహశీల్దార్లతో చర్చించి ఆయా డాక్యుమెంట్లను, పాస్బుక్, టైటిల్డీడ్లను వెనువెంటనే తనిఖీ చేసుకునేందుకు వెసులుబాటు కలుగనుందని చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటుచేయబోయే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తహశీల్దారు కార్యాలయాల ప్రాంగణాల్లో నిర్మించాలని ప్రభుత్వం కూడా ఆదేశించడంతో స్థల సేకరణ నిమిత్తం అన్ని జిల్లాల కలెక్టర్లకు రిజిస్ట్రేసన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ తాజాగా లేఖరాశారు. ఒకవేళ తహశీల్దారు కార్యాలయ ప్రాంగణంలో స్థలం దొరకనట్లయితే, పరిసర ప్రాంతాల్లోనైనా అనువైన స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రెవెన్యూ ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేసేలా స్థానికంగా ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్లను కూడా ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రానిక్ పాస్బుక్లు పంపిణీ చేస్తున్న తరుణంలో సదరు సమాచారాన్ని ఆన్లైన్లోనే తనిఖీ చేసే వీలున్నందున కార్యాలయాలు పక్కపక్కనే ఉండాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 460 రెవెన్యూ మండలాలు ఉండగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కేవలం 144 మాత్రమే ఉండడాన్ని మరో అడ్డంకిగా చూపుతున్నారు. పోలీస్ హౌసింగ్ బోర్డుకు నిర్మాణ బాధ్యతలు! రాష్ట్రవ్యాప్తంగా 87 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మూడు విడతలుగా సొంత భవనాలను ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్లశాఖ నిర్ణయించింది. తొలిదశలో 22 భవనాల నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టగా, అందులో ఇప్పటికి 5 భవనాలు పూర్తయ్యాయి. అయితే.. తరచుగా భవనాల డిజైన్లను ఉన్నతాధికారులు మార్చుతుండడం, మార్చిన డిజైన్లను సకాలంలో ప్రభుత్వం ఆమోదించకపోతుండడం ఫలితంగా.. ఇకపై భవన నిర్మాణాలను తాము చేయలేమంటూ కార్పొరేషన్ చేతులెత్తేసింది. ఈ నే పథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఈవోఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) పిలవగా ఈడబ్ల్యుఐడీసీ, పోలీస్ హౌసింగ్ బోర్డు సంస్థలు ముందుకు వచ్చాయి. వీటిలో పోలీస్హౌసింగ్ బోర్డుకు నూతన భవనాల నిర్మాణ పనులను అప్పగించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అయితే.. నిర్మాణ వ్యయంలో 10 శాతం సొమ్మును ముందుగానే తమఖాతాలో జమ చేయాలంటూ సదరు నిర్మాణ సంస్థ షరతు పెట్టడం రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు మింగుడు పడని అంశంగా తయారైంది. ఈ విషయమై తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- 'శబరి' సినిమాలో 'అలిసిన ఊపిరి' పాట రిలీజ్
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఒక విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
Advertisement