breaking news
Revenue Confederation
-
రెవెన్యూ ఉద్యోగుల వర్క్ టు రూల్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్ : రెవెన్యూ - పోలీసు అధికారుల మధ్య నెలకొన్న వివాదం చినికిచినికి గాలివానగా మారింది. చివరకు ఎన్నికల విధులపై తీవ్ర ప్రభావం చూపనుంది. రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై పోలీసు అధికారులు దౌర్జన్యం చేసినా ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ రెవెన్యూ కాన్ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం వర్క్ టు రూల్ పాటించారు. ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విధులు నిర్వర్తించారు. గ్రామ రెవెన్యూ సహాయకుడి నుంచి తహశీల్దార్ వరకు వర్క్ టు రూల్ పాటించడంతో సాయంత్రానికి రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగాలు ఖాళీగా కనిపించాయి. జిల్లా ఎన్నికల అధికారి స్పందించకుంటే శుక్రవారం కూడా వర్క్ టు రూల్ పాటించాలని రెవెన్యూ కాన్ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీన జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో మార్కాపురం డివిజన్ బద్వీడు పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న పెద్దారవీడు తహశీల్దార్తో పాటు సిబ్బందిపై ఒంగోలు టూటౌన్ సీఐ సూర్యనారాయణ దౌర్జన్యానికి దిగడం, అది జరిగి నాలుగు రోజులు తిరగకుండానే కొండపి మండలం ఇలవరలో ఎన్నికల విధుల్లో ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకుడిపై సీఐ లక్ష్మణ్ తప్పుడు కేసు బనాయించి ఇబ్బందులకు గురిచేశారని నాయకులు మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సీఐ సూర్యనారాయన విధులు నిర్వర్తించడం, విచారణకు సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి పంపించకపోవడాన్ని రెవెన్యూ కాన్ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించింది. అందులో భాగంగా వర్క్ టు రూల్కు సిద్ధమైంది. నిలిచిన పోస్టల్ బ్యాలెట్ వెరిఫికేషన్ మరో 12 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి స్థాయిలో ఎన్నికల విధుల్లో నిమగ్నమైన సమయంలో వర్క్ టు రూల్తో తీవ్ర ఆటంకం కలిగింది. పోస్టల్ బ్యాలెట్ వెరిఫికేషన్ నిలిచిపోయింది. శుక్రవారం కూడా వర్క్ టు రూల్ పాటించేందుకు రెవెన్యూ కాన్ఫెడరేషన్ సన్నద్ధం అవుతోంది. జిల్లా ఎన్నికల అధికారి వెంటనే జోక్యం చేసుకోకుంటే ఎన్నికల విధులకు విఘాతం కలిగే అవకాశం ఉంది. -
నిరసన దిశగా రెవెన్యూ ఉద్యోగులు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్ : ఎన్నికల విధుల్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగులపై పోలీసులు దౌర్జన్యం చేసినా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడాన్ని రెవెన్యూ కాన్ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించింది. వరుస సంఘటనలతో రెవెన్యూ ఉద్యోగులు అభద్రతా భావానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లా అధికారుల చర్యలను నిరసిస్తూ గురువారం నుంచి వర్క్ టూ రూల్ పాటించాలని నిర్ణయించింది. స్థానిక రెవెన్యూ భవన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు జిల్లా అధికారుల తీరును తప్పుపట్టారు. ఈ నెల 6వ తేదీ మార్కాపురం డివిజన్లోని బద్వీడు పోలింగ్ కేంద్రంలో విధి నిర్వహణలో పెద్దారవీడు తహసీల్దార్, సిబ్బందిపై ఒంగోలు టూటౌన్ సీఐ సూర్యనారాయణ దౌర్జన్యం చేసినా జిల్లా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఆయనపై విచారణ నివేదికను ఎన్నికల సంఘానికి పంపించలేదని చెప్పారు. ఈ నెల 11వ తేదీన కొండపి మండలం ఇలవరలో ఎన్నికల విధుల్లో ఉన్న వీఆర్ఏపై సీఐ లక్ష్మణ్ తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. ఈ సంఘటనలపై జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్, ఎస్పీ విచారించకపోవడం దారుణమన్నారు. రెవెన్యూ కాన్ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు ఈ నెల 28వ తేదీన ఒంగోలు వస్తున్నారని, ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు కూడా వస్తారని, ఉద్యోగ జేఏసీతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ ఉద్యోగులమని చెప్పినప్పటికీ పోలీసులు కొట్టడాన్ని ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తీవ్రంగా ఆక్షేపించారు. కలెక్టరేట్ వద్ద నామినేషన్ల సందర్భంగా సీఐ రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా అధికారులు పోలీసులతో కుమ్మక్కై ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోకుంటే ఎన్నికల విధులు బహిష్కరిస్తామన్నారు. సమావేశంలో ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే శరత్బాబు, ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి ఆర్ వాసుదేవరావు, నాయకులు తోటకూర ప్రభాకర్, శెట్టి గోపి, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు జీ సుబ్రహ్మణ్యం, ఊతకోలు శ్రీనివాసరావు, గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పీ రాము పాల్గొన్నారు.