హిల్లరీ పాకిస్తాన్ను సపోర్టు చేస్తున్నారా..?
టంపా : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కొద్దీ, ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఓ వైపు ప్రవాస భారతీయులందరూ డెమొక్రాటిక్ అభ్యర్థురాలు హిల్లరీ క్లింటన్కే మొగ్గుచూపుతున్నారనే తరుణంలో, రిపబ్లిక్ హిందూ ఆర్గనైజేషన్ మాత్రం హిల్లరీ క్లింటన్పై మండిపడింది. ఆమె పాకిస్తాన్కు సానుభూతిపరురాలని, హిల్లరీకి దీర్ఘకాలంగా సహచరిణిగా ఉంటున్న హుమా అబేదిన్, పాకిస్తానీకి సంతతికి చెందిన వ్యక్తి అని పేర్కొంది. ఇండియన్-అమెరికన్ టెలివిజన్ చానెల్లో హిల్లరీ క్లింటన్ వ్యతిరేకంగా రిపబ్లిక్ హిందూ ఆర్గనైజేషన్ ఈ ప్రకటన చేసింది. హిల్లరీ క్లింటన్ పాకిస్తాన్కు పరోపకారశీలని, భారత్కు వ్యతిరేకంగా దాడులు చేయడానికి పాక్కు బిలియన్ డాలర్ల సైనిక పరికరాలను సమకూర్చారని ఆరోపించింది.
ప్రధాని మోదీకి వీసాను కావాలనే బ్లాక్ చేశారని, రాడికల్ ఇస్లాం మద్దతుకు ఆమె దేశాలు, వ్యక్తుల నుంచి సహాయం తీసుకుంటారని తెలిపింది. హిల్లరీ క్లింటన్కు వ్యతిరేకంగా చేసిన ఈ ప్రకటనలో మాజీ అమెరికా అధ్యక్షుడు, ఆమె భర్త బిల్ క్లింటన్పై కూడా మండిపడింది. బిల్ క్లింటన్ కశ్మీర్ను పాకిస్తాన్కు ఇవ్వాలనుకున్నారని పేర్కొంది. ఒకవేళ హిల్లరీ గెలిస్తే, పాకిస్తానీ సంతతికి చెందిన ఆమె సహచరిణి హుమా అబేదిన్, స్టాఫ్కు చీఫ్గా మారుతుందని ప్రకటన చేసింది. రిపబ్లికన్ అభ్యర్థికి ఓటు వేయాలని, దీంతో అమెరికన్లకు, అమెరికా-భారత సంబంధాలకు మంచి చేకూరుతుందని అభ్యర్థించింది. అయితే నవంబర్ 8 జరుగబోయే ఎన్నికలకు ముందు ఆర్హెచ్ఎస్లో ఈ యాడ్ బ్రాడ్ కాస్ట్ కావడంపై ఆ చానెల్ అధినేత సులాభ్ కుమార్ స్పందించడం లేదు.