జిల్లాకు తుపాను ముప్పు!
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాకు తుపాను ముప్పు పొంచి ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ హుదూద్.. రానున్న మూడు నాలుగు రోజుల్లో విశాఖ-గోపాలపట్నం మధ్య ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ బుధవారం అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. 11 తీర మండలాల అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తహశీల్దార్లు, ఆర్డీవోలు తుపాను ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు తగు సూచనలు చేయాలని, తుపాను షెల్టర్లు, సహాయ కేంద్రాలను సిద్ధం చేయడంతోపాటు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలని సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున వేటకు వెళ్లరాదని మత్స్యకారులను హెచ్చరించారు. బోట్లు తదితరాలను సిద్ధం చేయాలని మత్స్య శాఖ ఉప సంచాలకుడిని ఆదేశించారు. తుపాను సమాచారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇందులో టోల్ ప్రీ నెం. 1800 425 6625తోపాటు 225361 నెంబరుతో ల్యాండ్లైన్ ఫోనును అందుబాటులో ఉంచారు. సముద్ర తీర మండలాలు, నదీ తీర మండలాల తహశీల్దారు కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలని ఆదేశించారు.
ట్రాన్స్కో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలోని విద్యుత్శాఖ ఎస్ఈ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్టు ట్రాన్స్కో ఎస్ఈ సత్యనారాయణ బుధవారం తెలిపారు. తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ఈ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్య తలెత్తితే తక్షణం 227361 అనే నంబరుకు సంప్రదించాలన్నారు.