breaking news
positive thinking
-
లెమనేడింగ్ ఏడో రుచి.. కష్టాలను తట్టుకునే శక్తి!
మానవాళికి ప్రకృతి షడ్రుచులను ప్రసాదించింది. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏడో రుచిని కనిపెట్టారు. ఆ ఏడో రుచి పేరే... ‘లెమనేడింగ్’! నిజానికి ఇది రుచి కాదు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని సరదాగా తీసుకుని... చేదు అనుభవాల నుండి తీపి అనుభూతులను పొందే జీవన విధానం. ఈ స్వభావం మానవుల్లో మునుపు లేదని కాదు. దాన్నిప్పుడు పరిశోధకులు ఉందని రూఢీగా వెల్లడించారు. చెడు కాలంలోనూ చెదరని గుండెతో ఉండటమే లెమనేడింగ్.‘‘జీవితం మీకు నిమ్మకాయలను ప్రసాదిస్తే, నిమ్మరసమే చేసుకుని తాగండి’’ : 20వ శతాబ్దపు ప్రముఖ అమెరికన్ రచయిత, తత్త్వవేత్త, వ్యాపారవేత్త ఎల్బర్ట్ హబ్బర్డ్ చెప్పిన మాట ఇది. 1909లో ‘లిటరరీ డైజెస్ట్’ అనే పత్రికలో ఎల్బర్ట్ ఇలా రాశారు : ‘విధి తనకిచ్చిన నిమ్మకాయలను తీసుకుని, వాటితో నిమ్మరసం వ్యాపారం మొదలుపెట్టేవాడే అసలైన మేధావి’ – అని. అప్పట్నుంచీ ఈ మాట పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులలో వాడుకగా వినిపిస్తోంది. నిమ్మరసాన్ని ‘లెమనేడ్’ అంటారు. కనుక ఇది ‘లెమనేడ్ ఫిలాసఫీ’ అయింది. తాజాగా అమెరికన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనలో లెమనేడ్ ఫిలాసఫీ మానవ జీవితానికి ప్రశాంతతను చేకూర్చే మాట నిజమే అని నిర్థారణ అవటం విశేషం!నవ్వుతూ బతకాలిరా..!జీవితాన్ని సరదాగా తీసుకునే అలవాటు వల్ల కష్టాలను తట్టుకునే శక్తి పెరుగుతుందట! కష్టాలు, అడ్డంకులు ఎదురైనప్పుడు మనుషులు ఆ పరిస్థితులకు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనం కోసం వారు కోవిడ్–19 సమయంలోని 503 మంది అమెరికన్ల ప్రవర్తన, వారి భావోద్వేగాలను పరిశీలించారు.ఈ పరిశీలనలో శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. జీవితాన్ని కాస్త సరదాగా, ప్రశాంతంగా తీసుకునే మనస్తత్వం ఉన్నవారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నిజాయితీగా అంగీకరిస్తూనే, భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని తేలింది. వీరు తమకు ఎదురయ్యే సవాళ్లకు త్వరగా అలవాటు పడటమే కాకుండా, రోజువారీ పనులను ఆనందంగా, ఆ పనుల్లో లీనమై మరీ చేయగలిగారు. ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే శక్తిని (రెజిలియన్స్) కనబరచారు.ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చుకుంటూ, సృజనాత్మకంగా ఆలోచిస్తూ, అనుకూలమైన ఫలితాల కోసం ప్రయత్నించే ఈ అలవాటుకు శాస్త్రవేత్తలు ‘లెమనేడింగ్’ అని పేరు పెట్టారు. అంటే ‘చేదు’ లాంటి కష్టాలను కూడా నిమ్మరసంలా తీపిగా/సానుకూలంగా మార్చుకోవడం. దీనినే ఇంకోలా చెప్పాలంటే – జీవితంలో మనకు ఏది ఎదురైతే దానినే, దాని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్వీకరించటం.చేదులోనే తియ్యని రుచి!జీవితాన్ని కాస్త సరదాగా తీసుకోవడం అంటే, మనం ఉన్న పరిస్థితిని తేలికగా తీసుకుంటున్నామని కాదు, ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి మనలో పెరుగుతోందని అర్థం అని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్–19 లాక్డౌన్ సమయంలో ప్రజల అనుభవాలను వీరు అధ్యయనం చేసినప్పుడు ఓ నిజం వెల్లడైంది. సరదా మనస్తత్వం ఉన్నవారు భవిష్యత్తు పట్ల సానుకూలంగా ఉంటూ, సమస్యలను చాలా చురుగ్గా, సృజనాత్మకంగా ఎదుర్కొన్నారు. అంటే, జీవితం వారికి చేదు వాస్తవాలను (నిమ్మకాయలు) ఇచ్చినప్పుడు, వారు వాటిని తీపి అనుభవాలుగా (నిమ్మరసం) మార్చుకున్నారు!దీనికి సంబంధించిన పరిశోధనా వ్యాసం ‘ఫ్రంటియర్స్ ఇన్ సైకాలజీ’ పత్రిక తాజా సంచికలో అచ్చయింది. ‘‘మా పరిశోధనలో తేలిందేమిటంటే సరదా మనస్తత్త్వం, మానసిక స్థైర్యం అనేవి ‘లెమనేడింగ్’ అనే భావన ద్వారా ఒకదానికొకటి చాలా బలంగా ముడిపడి ఉన్నాయి. కష్ట సమయాల్లో కూడా సానుకూల అనుభవాలను సృష్టించుకునే సామర్థ్యమే ఈ లెమనేడింగ్’’ అని వ్యాసకర్త, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ షియాంగ్యూ ‘షారన్’ షెన్ అంటున్నారు.‘‘పాండమిక్ (మహమ్మారి) సమయంలో సరదా మనస్తత్వం ఉన్నవారు, లేనివారు ఇద్దరూ ఒకే రకమైన భయాన్ని, ఒంటరితనాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉండే వ్యక్తులు ఆ కష్టతరమైన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పోగొట్టుకున్న వాటికి ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు, అడ్డంకులను ఎదిగే అవకాశాలుగా చూశారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఆ పరిస్థితికి ఎలా స్పందించాలన్న విషయాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకున్నారు’’ అని షెన్ తెలిపారు.‘లెమనేడింగ్’ పరిశోధన వెనుకడాక్టర్ షెన్, ఆమె సహచర శాస్త్రవేత్తలు మనుషుల సరదా మనస్తత్త్వం (ప్లేఫుల్నెస్) అనేది కష్ట సమయాల్లో జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి చాలా కాలంగా ఆసక్తితో చూస్తున్నారు. కోవిడ్ మహమ్మారి వారికి ఆ విషయాన్ని పెద్ద ఎత్తున పరిశోధించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇందుకోసం వారు అమెరికాలో నివసిస్తున్న 503 మంది వయోజనులను ఎంచుకుని, 2021 ఫిబ్రవరి (కోవిడ్ రెండవ వేవ్, వ్యాక్సిన్ ప్రారంభ సమయం) ఒక సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో పాల్గొన్నవారిని – కరోనా సోకుతుందేమో అనే భయం ఎంతవరకు ఉంది? పరిస్థితులు బాగుపడతాయని నమ్ముతున్నారా? వారికి ఇతరుల మద్దతు ఉందా? వారి భావోద్వేగాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటు, వారు ఎంత సరదాగా ఉంటారు? ఎంత స్పాంటేనియస్గా (సహజంగా / వెంటనే) స్పందిస్తారు? ఆనందంగా ఉండటానికి ఎంతవరకు ప్రయత్నిస్తారు? అనే అంశాల ఆధారంగా వారి సరదా మనస్తత్వాన్ని కొలిచారు.ఈ వివరాల ఆధారంగా శాస్త్రవేత్తలు, సర్వేలో పాల్గొన్న వారిని వారి సరదా మనస్తత్వ స్థాయిని బట్టి నాలుగు భాగాలుగా విభజించారు. సరదా మనస్తత్వం అనేది మనుషుల ఆలోచనలను, ప్రవర్తనను ఎలా మారుస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అత్యంత సరదాగా ఉండే మొదటి 126 మందిని, అసలు సరదా లేని చివరి 126 మందితో పోల్చి చూశారు.సానుకూల అవకాశాలపై దృష్టిఅత్యంత సరదాగా ఉండే వ్యక్తులు భవిష్యత్తు పట్ల చాలా ఆశావాదంతో ఉన్నారని, వ్యాక్సిన్ విజయవంతంగా అందుబాటులోకి వస్తుందని; జీవితం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని నమ్మారని ఈ పరిశోధన వివరాలు స్పష్టం చేశాయి. అయితే దీని అర్థం వారు అప్పటి పరిస్థితిని పట్టించుకోకుండా, ఊహల్లో బతికారనడం కాదు!‘‘అతిగా ఆశావాదంతో ఉన్నవారు వాస్తవాలను గుర్తించకుండా ప్రతిదీ బాగుందని భ్రమిస్తుంటారు. కానీ మేము గమనించిన ‘స్పాట్లైట్’ (దృష్టి) ప్రభావం అలా కాకుండా చాలా స్పష్టంగా ఉంది’’ అని డాక్టర్ షెన్ వివరించారు. ‘‘సరదా మనస్తత్వం ఉన్నవారు కోవిడ్–19 ప్రమాదాలను తేలికగా తీసుకోలేదు, అలాగని రక్షణ చర్యల ప్రభావంపై అతిగా అంచనాలూ వేసుకోలేదు. వారు తమ ‘స్పాట్లైట్’ ని కేవలం సానుకూల మార్పులు, మెరుగవటానికి ఉండే అవకాశాలపైకి మళ్లించారు. చీకటి లాంటి కష్టసమయాల్లో కూడా ముందుకు సాగే మార్గాలను వెలుగులోకి తెచ్చుకున్నారు’’ అంటారు షెన్.అధిక సరదా మనస్తత్త్వం కలిగినవారు ఆనందాన్ని వెతుక్కోవడానికి ఎక్కువ ఉత్సాహపడ్డారు, సంకోచించకుండా ఆలోచించారు. ఇది అనిశ్చిత పరిస్థితుల్లో కూడా అనేక సానుకూల అవకాశాలను ఊహించడానికి వారికి సహాయపడింది. దీనికి తోడు వారి ప్రవర్తనలో ఉన్న సరళత, పనుల్లో వారు చూపించే శ్రద్ధ.. కష్టాలను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని అందించాయి.చిన్న చిన్న మార్పులు చేసుకున్నారుపాండమిక్ సమయంలో ఇరు వర్గాల వ్యక్తులూ సమానంగానే ఒంటరితనాన్ని, భయాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉన్నవారు ఆ పరిస్థితులను తట్టుకోవడానికి సృజనాత్మక, క్రియాశీలక అడుగులు వేశారు. వారు వేరే ఏవో కొత్త వినోద కార్యక్రమాలలో పాల్గొనలేదు, కానీ తాము చేసే పనుల్లోనే సమయాలను మార్చుకోవడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం లేదా చురుగ్గా ఉండటానికి కొత్త మార్గాలు వెతకడం ద్వారా పరిస్థితులకు అనుగుణంగా మారారు. వారు తమ రోజువారీ జీవితంలో మరింత చురుగ్గా, ఆనందంగా, లీనమై గడిపారు.‘‘మా పరిశోధన సరదా మనస్తత్త్వాన్ని కొలవడంపైనే దృష్టి పెట్టినప్పటికీ, ఈ గుణాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని మార్గాలను పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, మీకు ఆనందాన్నిచ్చే పనుల్లో పాల్గొనండి, కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని నవ్వించే వ్యక్తులతో సమయం గడపండి. సరదాగా ఉండటానికి ఆటలే ఆడాల్సిన పనిలేదు. మన రోజువారీ క్షణాల్లో కాస్త ఆనందం, స్వేచ్ఛ, అనుకూలమైన ఆలోచనా విధానాన్ని తెచ్చుకుంటే చాలు’’ అని షెన్ చెబుతున్నారు. జీవితంలో సరదాలు ఉండాలి‘‘ముఖ్యంగా కష్టకాలంలో మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరదా మనస్తత్వం అనేది చాలా కీలకమైనది. కానీ చాలామంది దీని ప్రాముఖ్యతను గుర్తించరు’’ అని అంటారు షెన్. ‘‘సరదాగా ఉండే వ్యక్తులు.. కష్టాలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారో అర్థం చేసుకోవడం వల్ల, ఇతరులు కూడా ఒత్తిడిని, అనిశ్చితిని జయించే వ్యూహాలను రూపొందించవచ్చు. మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రపంచ స్థాయి సవాళ్లకు వాస్తవిక అంచనా, సృజనాత్మకమైన సర్దుబాటు రెండూ అవసరం కాబట్టి, ఈ విషయం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.అయితే, ఈ పరిశోధన ఫలితాలను ప్రతి పరిస్థితికీ లేదా అందరికీ ఒకేలా వర్తింపజేయలేమని షెన్, ఆమె సహచరులు హెచ్చరిస్తున్నారు. వేర్వేరు పరిస్థితుల్లో ఈ సరదా మనస్తత్త్వం వేర్వేరు వ్యక్తులపై భిన్నమైన ప్రభావం చూపవచ్చు. అలాగే, అత్యంత సరదాగా ఉండేవారికి, లేనివారికి మధ్య ఉన్న తేడాలన్నీ కేవలం ఈ ఒక్క గుణం వల్లే వచ్చాయని చెప్పలేము. ‘‘మనుషుల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను మేము గుర్తించినప్పటికీ, రోజువారీ సంఘటనలకు వారు ఎలా స్పందిస్తారనే దానిపై ప్రభావం చూపే ఈ సరదా మనస్తత్త్వం ఇతర పరిస్థితులకు కూడా (రోజువారీ కానివీ, వివిధ రంగాలకు చెందినవీ) వర్తిస్తుందని చెప్పలేం అని షెన్ పేర్కొన్నారు. ‘‘ఈ ‘సరదా ఆలోచనా విధానం’ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో మరింత పూర్తిగా అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో జీవితంలోని ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిశోధనలు జరపవలసి ఉంది’’ అని షెన్ అంటున్నారు. – సాక్షి స్పెషల్ డెస్క్- షియాంగ్యూ ‘షారన్’ షెన్, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ -
'మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం'.. ఇది శాస్త్రీయ వాస్తవం!
“మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం" అనేది కేవలం ఒక వేదాంత సూక్తి మాత్రమే కాదు, ఇప్పుడిది నిర్ధారణ అయిన ఒక శాస్త్రీయ వాస్తవం కూడా! మన మనస్సు, ఆలోచనలు మన శరీరంపై, ముఖ్యంగా వ్యాధి నిరోధక వ్యవస్థపై ఎంతటి బలమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసా? ఆశావాద ఆలోచనలు కేవలం మానసిక ప్రశాంతతకే కాదు, మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలకు మరోసారి తాజాగా నిరూపణ అయింది. మెదడును మనం మన ఆలోచనలతోనే 'రీ-వైరింగ్' చేస్తూ 'ఇమ్యూనిటీ'ని పెంచుకోవచ్చని ఇటీవలి ఒక విప్లవాత్మక పరిశోధన స్పష్టం చేసింది! అసలు ఆలోచనలకు, ఆరోగ్యానికి ఉన్న ఈ అద్భుతమైన లంకె ఏంటి?! చూద్దాం రండి.ఇంతవరకూ తెలుసుకున్నదిశరీరంపై ఆలోచనలు ప్రభావం చూపుతాయనే భావన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, దీని వెనుక ఉన్న నాడీ మండల నిర్మాణ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో కీలక పురోగతి సాధించింది గత కొన్నేళ్లలోనే అని డార్ట్మౌత్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ అమెరికన్ న్యూరోసైంటిస్ట్ టామ్ వేగర్ అంటారు. ఆశావాద ఆలోచనలు, మంచే జరుగుతుందన్న తలంపు, మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను (ఆనందాన్ని ఇచ్చే భాగం) క్రియాశీలం చేస్తాయి. మంచి ఆహారం తిన్నప్పుడు, ఒక ఆటలో గెలిచినప్పుడు లేదా ఎవరైనా ప్రశ్నించినప్పుడు మనకు కలిగే ఆనందానికి ఈ భాగమే కారణం. ఈ ప్రాంతంలో ఉండే నాడీ కణాలు ‘డోపమైన్’ అనే రసాయనాన్ని విడుదల చేయడం ద్వారా స్పందిస్తాయి– ఇదీ ఇంతవరకు పరిశోధకులు తెలుసుకున్నది.తాజా పరిశోధనతో నిర్థారణఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ మెడికల్ సెంటర్కు చెందిన తామర్ కొరెన్ అనే వైద్య పరిశోధకురాలు, ఎలుకలలో ఈ ‘రివార్డ్ కణాలను’ ఉత్తేజపరచడానికి జన్యు పద్ధతులను ప్రయోగించినప్పుడు ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు కనిపించాయి. ఎలుకలు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో మరింత సమర్థంగా పోరాడగలిగాయి. గుండెపోటు నుండి త్వరగా కోలుకున్నాయి, అంతేకాకుండా వాటిలో కణుతుల పెరుగుదల కూడా నెమ్మదించింది. ఈ విధానం చాలా ఆశాజనకంగా కనిపించడంతో, ఇది మనుషులకు కూడా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలని తామర్ కొరెన్ బృందం భావించింది. అయితే ఎలుకలలో ఉపయోగించిన జన్యుపరమైన పద్ధతులను మనుషులపై ప్రయోగించటం సురక్షితం కాదు. అందుకే, వారు కొందరు వ్యక్తులకు ఒక శిక్షణ ఇచ్చారు. తమ సొంత ఆలోచనల ద్వారానే మెదడులోని ఆ రివార్డ్ భాగాన్ని ఎలా ఉత్తేజపరుచుకోవాలో ఆ వ్యక్తులకు నేర్పించారు. వారు ఈ ప్రయోగాన్ని ఎలా నిర్వహించారో ప్రఖ్యాత ‘నేచర్ మెడిసిన్’ పత్రిక ప్రచురించింది.తొలినాళ్ల ప్రయోగం కుక్కపైన!ఈ రకమైన పరిశోధనలు 1890ల చివర్లో ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త చేసిన ప్రయోగాల నుంచి మొదలయ్యాయి. మన శరీరం ఆహారం నుండి శక్తిని, పోషకాలను ఎలా తీసుకుంటుందో ఆయన అధ్యయనం చేశారు. ఆకలితో ఉన్న ఒక కుక్కకు ఆహారం ఇచ్చే ప్రతిసారీ ఆయన ఒక గంట మోగించేవారు. కొద్ది రోజులకే, ఆహారం ఇవ్వకపోయినా సరే... కేవలం ఆ గంట శబ్దం వినగానే కుక్క నోట్లోంచి లాలాజలం ఊరడం మొదలైంది. మనస్తత్త్వవేత్తలు దీన్ని ‘కండిషన్డ్ రెస్పాన్స్’ (అలవాటైన స్పందన) అని పిలుస్తారు. ఈ పరిశోధనలకు గాను పావ్లోవ్కు 1904లో నోబెల్ బహుమతి లభించింది.తర్వాత ఎలుకల మీదకొన్ని దశాబ్దాల తర్వాత, రాచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ అడెర్, నికోలస్ కోహెన్ ఎలుకలపై ఇలాంటి ప్రయోగమే చేశారు. వారు ఎలుకలకు ఒక తీపి పానీయాన్ని ఇచ్చాక, ఆ వెంటనే వాటి రోగనిరోధక శక్తిని తగ్గించే ఒక మందును ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవారు. కొంతకాలం తర్వాత, ఆ ఇంజెక్షన్ ఇవ్వకుండా కేవలం తీపి పానీయం మాత్రమే ఇచ్చినా ఎలుకల రోగనిరోధక వ్యవస్థలో ఆ మార్పులు కనిపించాయి! ఈ ప్రభావాన్ని ‘సైకోసోమాటిక్’ అంటారు. అంటే ఏదైనా ఒక సంకేతం (గంట శబ్దం వినడం లేదా తీపి పానీయం తాగడం వంటివి) ద్వారా మెదడు శరీరంలో నిజమైన మార్పులను తీసుకురాగలదని దీని అర్థం. ఈ ‘సైకోసోమాటిక్’ అనే మాటకు సమాజంలో కాస్త ప్రతికూల ముద్ర ఉంది. మానసిక ఒత్తిడి లేదా మానసిక స్థితి వల్ల వచ్చే తలనొప్పి, నొప్పులు, వికారం లేదా చర్మ సమస్యల గురించి చెప్పటానికి తరచుగా ఈ పదాన్ని వాడతారు. చాలామంది వీటిని కేవలం ‘భ్రమ’ అని లేదా ఒక చిన్న విషయమని కొట్టిపారేస్తుంటారు.సైకోసోమాటిక్ గీ ప్లాసిబో ఎఫెక్ట్కొన్నిసార్లు సైకోసోమాటిక్కు వ్యతిరేకంగా కూడా జరుగుతుంది. ఉదాహరణకు ‘అసలు మందు’ కాకుండా, కేవలం మందు బిళ్లలా కనిపించే ‘పంచదార బిళ్ల’ వేసుకున్నా కొందరికి జబ్బు నయమవుతుంది. దీన్నే ‘ప్లాసిబో ఎఫెక్ట్’ అంటారు. ఇది కూడా నిజమైన వైద్యం కాదని కొందరు తీసిపడేస్తుంటారు. అయితే, కొందరు పరిశోధకులు మాత్రం ఈ ప్లాసిబో ప్రభావాన్ని ఒక గొప్ప ‘మంత్రం’గా చూస్తున్నారు.ప్లాసిబో ప్రభావం అనేది శరీరంలో జరిగే నిజమైన భౌతిక/జీవక్రియ మార్పులను నియంత్రిస్తుంది. ఆశావాద ఆలోచనలు, మంచి ఫలితం వస్తుందనే నమ్మకం లేదా నిరీక్షణ వల్ల ఇది జరగవచ్చు. కారణం ఏదైనప్పటికీ, ‘ఇది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి’ అని కొరెన్ అంటున్నారు. అది అర్థమైతే, రోగులకు ఇచ్చే చికిత్సలు ఇంకా బాగా పనిచేసేలా ఒక తోడ్పాటు అవుతుందని ఆమె చెబుతున్నారు.‘కొరెన్’ వినూత్న పరిశీలనతామర్ కొరెన్ బృందం ఇప్పుడు ఆ ‘ప్లాసిబో’ ఆలోచనను నిజంగానే పరీక్షించి చూసింది. టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలోని సైకాలజీ ల్యాబ్తో కలిసి పనిచేస్తున్న కొరెన్ బృందం, 85 మంది యువకులను ఈ ప్రయోగం కోసం ఎంచుకుంది. ఆ యువకులందరూ ఆ మెడికల్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకోవటానికి సమ్మతించి వచ్చిన వారు. (హెపటైటిస్–బి అనే వైరస్ సోకకుండా నిరోధించడానికి ఈ టీకా ఇస్తారు. ఈ టీకా.. మనుషుల శరీరం, రోగనిరోధక వ్యవస్థలపై ఎలా స్పందిస్తుందో చూడటం ద్వారా, వారి రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పులను సులభంగా కొలవడానికి పరిశోధకులకు ఒక మార్గం లభిస్తుంది.)న్యూరోఫీడ్బ్యాక్ విధానంఈ ప్రయోగం మొదటి దశ కోసం, ఎంపిక చేసిన వారికి ఫంక్షనల్ ఎమ్ఆర్ఐ స్కాన్లు చేశారు. వారు మెదడును స్కాన్ చేసే యంత్రంలో పడుకున్నారు, ఈ యంత్రం మెదడులోని ఏ భాగాలు చురుకుగా పనిచేస్తున్నాయో చూపిస్తుంది. ప్రతి 40 సెకన్ల సెషన్లో, పాల్గొనేవారిని తమ మెదడుకు పని చెప్పమని (ఆలోచించమని) చెప్పారు. ప్రతి ఒక్కరికీ తాము ఎలా ఆలోచించాలో సొంతంగా ఎంచుకునే అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు: స్క్రీన్ మీద ఉన్న ఒక ఎర్రటి చుక్కను చూడటం, తాము వెళ్లిన ఒక ప్రయాణాన్ని / పర్యటనను గుర్తుచేసుకోవడం, భవిష్యత్తు గురించి ఆలోచించడం, లేదా ఒక గణిత లెక్కను పూర్తి చేయడం... ఇలా. లక్ష్యం ఏంటంటే మన ఆలోచనలు మెదడులోని ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోవటమే.మెదడుపై ఆలోచనల ప్రభావంప్రయోగం తర్వాత మెదడు స్కాన్ చేసిన భాగాలకు 0 నుండి 10 వరకు స్కోర్లు (రేటింగ్) ఇచ్చారు. ఈ స్కోర్లు మెదడు లోపల ఉన్న ‘రివార్డ్ మార్గం’లోని చురుకుదనాన్ని ఆధారంగా చేసుకుని ఇచ్చారు. ఇందులో ప్రధానమైన ఒక భాగాన్ని ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’ అంటారు. ఎలుకలలో ఆరోగ్యకరమైన మార్పులు తేవడానికి కొరెన్ బృందం ఉత్తేజపరిచింది కూడా ఈ భాగాన్నే. ప్రయోగంలో పాల్గొన్నవారిలో కొందరిని యాదృచ్ఛికంగా (ర్యాండమ్గా) ‘కంట్రోల్ గ్రూప్’లో పెట్టారు. వారి స్కోర్లు ఈ భాగంతో సంబంధం లేని వేరే మెదడు ప్రాంతం నుండి తీసుకున్నారు. ఎవరికైనా తక్కువ స్కోరు వస్తే, తదుపరి సెషన్లో తమ ఆలోచనలను వేరే విషయంపై కేంద్రీకరించమని వారికి చెప్పారు. ఒకవేళ వారి స్కోరు పెరిగితే, అదే విధంగా ఆలోచించే పద్ధతిని కొనసాగించమని లేదా ఇంకా మెరుగుపరచుకోమని చెప్పారు. ఈ విధమైన ‘ప్రయత్నిస్తూ నేర్చుకునే’ పద్ధతిని కొన్ని వారాల పాటు 45 నుండి 60 సెషన్లలో నిర్వహించారు. ఈ ప్రక్రియ అంతటా పాల్గొనేవారికి ఉన్న ఒకే ఒక లక్ష్యం.. వీలైనంత ఎక్కువ స్కోరు సాధించడం. అయితే ‘‘మాకు స్కోరు ఎంత వచ్చిందనే దానికంటే, ఆలోచనల ద్వారా ఎంత మెరుగుదల కనిపిస్తోంది అనేది చాలా ముఖ్యమైన విషయం’’ అని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన నిట్జన్ లుబియానకర్ అంటారు.టీకా స్పందనలో మార్పులుచివరి ఎం.ఆర్.ఐ. సెషన్ పూర్తయిన వెంటనే, ప్రయోగంలో పాల్గొన్న వారందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ టీకా శరీరంలో ‘యాంటీబాడీలు’ (వ్యాధి నిరోధక ప్రొటీన్లు) తయారయ్యేలా చేస్తుంది. ఈ యాంటీబాడీలు హెపటైటిస్–బి వైరస్ను గుర్తించి, కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడతాయి. టీకా ఇవ్వడానికి ముందు, ఇచ్చిన రెండు వారాల తర్వాత వారి రక్త పరీక్షలు చేసి యాంటీబాడీలను కొలిచారు. ఎవరైతే తమ ఆలోచనల ద్వారా ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’లో మెదడు చురుకుదనాన్ని పెంచుకోగలిగారో, వారిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హెపటైటిస్–బి యాంటీబాడీల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది! ఇది వారిలో రోగనిరోధక శక్తి బలపడిందని స్పష్టంగా చూపించింది. ఈ యాంటీబాడీల పెంపు 7 నుండి 10 శాతం మాత్రమే అయినప్పటికీ, ఇది చాలా గొప్ప విషయమని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జోనాథన్ కిప్నిస్ అంటున్నారు. ఆయనకు ఈ పరిశోధనతో సంబంధం లేకపోయినా.. మెదడుకి, రోగనిరోధక వ్యవస్థకి ఉన్న సంబంధాలపై ఆయన ప్రత్యేక అధ్యయనాలు చేస్తున్నారు.మనస్సుకు, శరీరానికి ఉన్న ముడి‘‘ఈ పరిశోధనలో నిజంగానే ఒక స్పష్టమైన ఫలితం కనిపించటంతో మేమంతా చాలా ఆశ్చర్యపోయాం’’ అని కొరెన్ తన సిద్ధాంత పత్రంలో రాశారు. ల్యాబ్లోని ఎలుకలలో కనిపించిన ఫలితం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు వాటి నాడీ కణాలను నేరుగా ఉత్తేజపరిచారు. కానీ, మనుషులు కేవలం తమ సొంత ఆలోచనలతో మాత్రమే మెదడులోని ఆ భాగాన్ని యాక్టివేట్ చేసుకోవడం అనేది ఒక సైన్స్ ఫిక్షన్ (కల్పిత కథ) లాగా అనిపించిందని ఆమె అన్నారు.అంతేకాకుండా, ఈ విజయం అనేది ఒకరి వ్యక్తిత్వంపై ఆధారపడి లేదు. తాము చాలా ఆశావాదులమని లేదా నమ్మకంతో ఉంటామని సర్వేలో చెప్పిన అందరికీ ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’ స్కోర్లు ఏమీ ఎక్కువగా రాలేదు. అయితే, ఎక్కువ స్కోర్లు సాధించిన వారిలో ఒక ఉమ్మడి లక్షణం కనిపించింది. వారు ఆశావాద ఆలోచనలను (మంచి జరుగుతుందనే ఆశను) పెంచే మానసిక విధానాలను ఎంచుకున్నారు. కొందరు తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించారు. మరికొందరు తమ జీవితంలో జరిగిన మంచి అనుభవాలపై ధ్యాస పెట్టారు.పాల్గొనేవారు దేని గురించి ఆలోచించాలో పరిశోధకులు స్పష్టంగా చెప్పలేదు కాబట్టి, ఆలోచనలోని చిన్న చిన్న వివరాలు పెద్దగా తేడాను చూపలేదు. బదులుగా, పాల్గొన్నవారు స్క్రీన్ కనిపించే స్కోర్లను బట్టి తమ ఆలోచనలను మార్చుకుంటూ వచ్చారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయమని లుబియానకర్ తెలిపారు. ఈ ఫలితం ‘మన మానసిక స్థితి’ అనేది మన ఆరోగ్యంపై, రోజువారీ శరీర క్రియలపై ఎంత ప్రభావం చూపుతుందో స్పష్టంగా చెబుతోంది... మనకు తెలియకుండానే అది పనిచేస్తుంది’’ అని కొరెన్ అంటున్నారు.ఆశావాదం ఆరోగ్యదాయకంఈ అంతర్జాతీయ పరిశోధన మనకొక స్పష్టమైన, బలమైన సందేశాన్ని ఇస్తోంది: ‘శారీరక ఆరోగ్యానికి ఉదయం చేసే వ్యాయామం, తినే మంచి ఆహారం ఎంత ముఖ్యమో... మన రోజువారీ ఆలోచనా విధానం కూడా అంతే ముఖ్యం!’ అని.మనం నిత్యం అనుభవించే ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు మన వ్యాధినిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంటే... ఆశావాదం, ప్రేమ, మధుర జ్ఞాపకాలు, నమ్మకాలు మన శరీరంలో అదనపు రక్షణ కవచాన్ని నిర్మిస్తాయి. మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను మన సొంత ఆలోచనలతో క్రియాశీలం చేసుకోవడం ద్వారా ఏ వైద్యానికీ లభించని ‘సైకోసోమాటిక్ బూస్ట్’ మన శరీరానికి లభిస్తుంది.కాబట్టి, అనునిత్యం ఆశావాదంతో ఆలోచిద్దాం... మన మెదడును సానుకూలంగా రీ–వైర్ చేసుకుందాం... సహజమైన రోగనిరోధక శక్తితో సంపూర్ణ ఆరోగ్యం పొందుదాం. - సాక్షి స్పెషల్ డెస్క్- తామర్ కొరెన్, వైద్య శాస్త్రవేత్త, టెల్ అవీవ్ మెడికల్ సెంటర్ -
మీ ఆలోచనలే.. దుష్ట చతుష్టయం
అసమాన నాయకత్వ ప్రతిభ కనబరిచే టీమ్ లీడర్లు బయటి నుంచి ఎదురయ్యే సవాళ్ల వల్ల కాకుండా.. తమ అపరిమితమైన ఆత్మవిశ్వాసం వల్ల విఫలమవుతుంటారని ‘హార్వర్డ్ బిజినెస్ రివ్యూ’ (హెచ్.బీ.ఆర్.) తాజా సంచికలోని ఒక వ్యాసం విశ్లేషించింది. ఇందులో ముఖ్యంగా కొన్ని లక్షణాలు.. ఇటు నాయకులు / లీడర్లు / బాస్లకే కాదు.. ఇంటిని నడిపే ఇంటి యజమానులకూ వర్తిస్తాయి అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.‘ఇనుమును ఏదీ నాశనం చేయలేదు.. దాని తుప్పు తప్ప. అలాగే ఒక మనిషి పురోగతిని ఆపేసేది తన మనస్తత్వమే తప్ప బయటి వ్యక్తులో, అంశాలో కాదు’– రతన్ టాటాప్రతి పనిలో నేనుండాలితమ ముద్ర కనిపించాలి అనే తాపత్రయంతో ప్రతి పనిలో ‘నేనుండాలి’ అని అనుకుంటారు చాలామంది.దుష్ఫలితం: అలసట, నిస్సత్తువ పెరుగుతాయి. టీమ్లో చొరవ లోపిస్తుంది. ‘అన్నీ ఆయన చూసుకుంటాడులే’ అనే ధోరణి కిందివారిలో పెరిగిపోతుంది. సృజనాత్మకంగా ఆలోచించడం మానేస్తారు. పిల్లలు పెద్దయ్యాక కూడా చాలామంది తల్లిదండ్రులు వాళ్లను స్వతంత్రంగా పనిచేయనివ్వరు.ఇలా మార్చుకొని చూడండి: ‘నేను ఏదైనా చేయగలను. కానీ ప్రతి పనీ నేనే చేయాల్సిన అవసరం లేదు’ అనే ధోరణి మంచిది. అప్పుడు అందరికీ పనిచేసే అవకాశం వస్తుంది. వినూత్నంగా ఆలోచిస్తారు. నాయకుడు అంటే నడిపించాలి కానీ ప్రతి స్థాయిలో ప్రతి పనీ తానే చేయాల్సిన అవసరం లేదు.సంస్థల్లోని నాయకులు లేదా ఇంటికి యజమానిలో అజ్ఞాతంగా ఉండే ఆధిపత్య భావనలు వారి పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేసి, వారి అభివృద్ధికి ఆటంకంగా మారతాయి. మొదట బలాలుగా కనిపించిన ఈ భావనలు క్రమేణా బలహీనతలుగా మారతాయి. బాహ్య అడ్డంకుల్లా ఇవి పైకి కనిపించవు. ఎవరికి వారు వీటిని గుర్తించి, సానుకూలంగా మలుచుకుంటే వైఫల్యాలను నివారించవచ్చు. ఎందుకంటే.. నిజమైన నాయకత్వ పురోగతి అంతర్గతంగా ప్రారంభమవుతుంది. ఏమిటీ భావనలు.. వీటి దుష్ఫలితాలేంటి.. వీటిని ఎలా అధిగమించాలి?వెంటనే పని పూర్తి చేసేయాలిప్రాధాన్యతలతో సంబంధం లేకుండా.. ప్రతి పనినీ తక్షణమే పూర్తి చేయాలి, వెంటనే ఫలితాలు కనిపించాలి అనే ధోరణితో చాలామంది ఉంటారు.దుష్ఫలితం: పిల్లలకు అన్ని అంశాల్లోనూ ఇలాగే చెప్పడం వల్ల వారికి ప్రాధాన్యతలు తెలియవు. బృందం విషయానికొస్తే.. ప్రతి పనిలోనూ ‘ఎమర్జెన్సీ’ పరిస్థితి ఏర్పడి తప్పులు జరగొచ్చు.ఇలా మార్చుకొని చూడండి: ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి’ అన్నట్టు అవసరమైన పనిపై ముందు దృష్టి పెడతాను అనుకోవాలి. ప్రాధాన్యతలు గుర్తించడమే సగం విజయం. పిల్లలు కూడా రోజువారీ చేసే పనుల్లో ఎక్కువ ఫలితం ఇచ్చే పనికి అధిక ప్రాధాన్యత.. తక్కువ ఫలితం ఇచ్చే దానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుంటారు. దానికి తగ్గట్టుగా సమయం, ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు వినియోగిస్తారు.నేను తప్పులు చెయ్యకూడదుపనిలో కచ్చితత్వం కోసం తపన పడుతూ ఇలా ఆలోచిస్తుంటారు. దుష్ఫలితం: వినూత్న విధానాలను ప్రయత్నించే ధైర్యం చేయలేకపోవడం, అతి జాగ్రత్త, ఎప్పుడూ ఫలితంపైనే అధిక శ్రద్ధ.ఇలా మార్చుకొని చూడండి: ‘తప్పులు జరగకుండా చూడటం కాదు, సరిగ్గా పని జరిగేటట్లు చూడాలి’ అనే ధోరణి ఏర్పరచుకోవాలి. ఇది కింది వాళ్లను మూస ధోరణిలో కాకుండా కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఫలితంపై శ్రద్ధ కాకుండా.. పనిని సరిగ్గా చేయడం అలవాటవుతుంది.అందరూ నాలాగే పని చెయ్యాలిఇంట్లో లేదా ఆఫీసులో అందరూ తమలాగే ఆలోచించాలని, పనిచేయాలని.. ఆలోచిస్తారు, ఆశిస్తారు.దుష్ఫలితం: వ్యక్తిగత సామర్థ్యాలలోని వ్యత్యాసాలు గుర్తించరు. ఎవరి సామర్థ్యానికి, పనిచేసే ఒడుపునకు తగ్గట్టు వారిని స్వేచ్ఛగా పనిచేయనివ్వరు. ముఖ్యంగా పిల్లల విషయంలో వారి వయసును కూడా ఒక్కోసారి మర్చిపోయి వారిపై ఒత్తిడి పెంచుతుంటారు.ఇలా మార్చుకొని చూడండి: ‘నాలా అందరూ ఆలోచించలేకపోవచ్చు, పనిచేయలేకపోవచ్చు’ అనే వాస్తవాన్ని గుర్తించండి. వారి వారి సామర్థ్యాలు, తెలివితేటలకు అనుగుణంగా పనిచేసే వాతావరణం కల్పించండి. ముఖ్యంగా ఇది పిల్లల మానసిక వికాసానికి దోహదపడుతుంది. -
థింక్ ట్యూన్ అప్
‘ఆలోచనను బట్టే ఆచరణ, ఆచరణను బట్టే కర్మఫలం’ ప్రతిదానికీ ఆలోచనే మూలం. అందుకే ఒక మనిషి మనుగడకు ప్రాణవాయువు, అన్నపానీయాలు ఎంత అవసరమో ఆలోచించడం కూడా అంతే అవసరం. నిజానికి మనిషిని సమస్తజీవకోటి నుంచి వేరు చేసిందే ఆలోచన. మానవాళి మనుగడకు మార్గం వేసేదే ఆలోచన. మరి అలాంటి ఆలోచనలు సక్రమంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ‘మంచి ఆలోచనకు మించిన మనుగడ లేదు, చెడ్డ ఆలోచనకు పోలిన చావు లేదు’ అంటారు పెద్దలు. అవసరాన్ని బట్టి బుద్ధికుశలతను ఉపయోగించడం, పరిస్థితిని బట్టి వివేకంగా వ్యవహరించడం, సందర్భానుసారంగా విచక్షణతో నడుచుకోవడం, క్లిష్టమైన సమయాల్లో కూడా జ్ఞానాన్ని ప్రదర్శించడం.. ఇవన్నీ ఆలోచన పరిధికి గుణకారాలే! అయితే అందుకు సాధన ఎంతో అవసరం. థింక్ ట్యూన్ అప్ ట్యూన్ అప్ అంటే స్వరాన్ని పెంచడం.. లేదా అడ్జస్ట్ చేసుకోవడం. సాధారణంగా రేడియోకో.. ఇయర్ ఫోన్ కో, బ్లూటూత్కో ఉండే ట్యూన్ బటన్ ని మనకు తగ్గట్టుగా.. మనకు కావాల్సినట్లుగా సెట్ చేసుకుంటాం. మరి మది ఆలోచల్ని ఎలా ట్యూన్ అప్ చేసుకోవాలి? మనసు స్వరాల్లో మంచి స్వరాన్ని ఎలా ఎంచుకోవాలి? ఎలా పెంచుకోవాలి? ‘ఒక సీసా నిండా గాలి ఉన్నప్పుడు అందులోని గాలిని బయటకు పంపాలంటే, ఆ సీసాలో నీళ్లు నింపడమే మార్గం. అలాగే మనసులోని ప్రతికూల భావాలు ఆవిరైపోవాలంటే, మనసు నిండా సానుకూల ఆలోచనలను పెంచుకోవాలి. పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్.. ఈ రెండింటికీ ప్రభావవంతమైన శక్తులు ఉంటాయని, మనం దేన్ని నమ్ముతామో అదే జరుగుతుందని చెబుతారు సానుకూలపరులు. ‘సే సమ్థింగ్ పాజిటివ్ అండ్ యు విల్ సీ సమ్థింగ్ పాజిటివ్’... ‘మంచి గురించి మాట్లాడితే, మంచే కనిపిస్తుంది’ అని దీని అర్థం. అంటే మాట మంత్రంలా పని చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ వైర్లెస్గా పనిచేస్తాయి. ఇక్కడే ఆధ్యాత్మికతకు.. శాస్త్రీయతకు పొంతన కుదురుతుంది. మనస్సుకు ఆహారం శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, మనసు ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆలోచనలు కూడా అంతే అవసరం. ఉన్నతమైన ఆలోచనలు, ఆదర్శాల కోసం మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. మంచివాళ్ళతో స్నేహాన్ని పెంచుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచిని మాత్రమే కోరుకోవాలి. అందుకే ‘మంచి ఆలోచనలే మనసుకు మంచి ఆహారం’ అంటారు మానసిక నిపుణులు. ఒక మంచి విషయాన్ని మనం బలంగా నమ్మితే, ప్రపంచం మొత్తం ఆ కోరికను నిజం చేయడానికి కుట్ర చేస్తుందట. అంటే ప్రకృతి ఆజ్ఞతో.. తెలియకుండానే చుట్టూ ఉండే పరిస్థితులు, మనుషులు మనకు సహకరిస్తారు. ఆలోచనలు సానుకూలంగా ఉంటే, జీవితం సాఫీగా సాగుతుంది. మనసులో తలెత్తే అపోహలు, భయాలు, ప్రతికూల భావాలకు వ్యతిరేకంగా, మంచి సంకల్పాలను మనంతట మనమే సృష్టించుకోవాలి. ఉదయం లేవగానే.. ‘ఈ రోజు నాకు మంచి జరుగుతుంది. ఈ రోజు చాలా బాగుంటుంది’ అని మనసును ఉత్తేజపరచేలా ప్రకృతికి చెప్పడం నేర్చుకోవాలి. ‘ఎందుకొచ్చిన జీవితంరా సామీ?’ అంటూ ఏడుస్తూ నిద్రలేస్తే ఆ రోజు మొత్తం అంతే అసంతృప్తిగా ముగుస్తుందట. ఆలోచనలతో ఆరోగ్య ప్రయోజనాలు సానుకూల ఆలోచనలతో.. ప్రమాదకరమైన జబ్బుల్ని కూడా తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆశావాద దృక్పథం ఉంటే.. అది తీవ్ర అనారోగ్యాలను సైతం అరికడుతుందట. రొమ్ము క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, స్ట్రోక్, మానసిక రుగ్మతలు ఇలా ఎన్నో ప్రాణాంతక వ్యాధులను సమూలంగా తగ్గించే గుణం.. కేవలం సానుకూల ఆలోచనలకే ఉందట. ‘నాకేం కాదు’ అనే సంకల్పంతోనే బతికి బయటపడుతున్నారట. అందుకే ‘పాజిటివ్ థింకింగ్.. మెరుగైన రోగనిరోధక శక్తి’ అంటున్నారు నిపుణులు. పాజిటివ్ థింకింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? 1. ప్రతిక్షణం ఆలోచనలను గమనించుకోవాలి. ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వెంబడిస్తుంటే, అందుకు రివర్స్లో.. ‘అలా జరగదు.. ఇలా జరుగుతుంది.. అలా కాదు.. ఇలా అవుతుంది’ అని మనసులోనే మాటలు అల్లుకోవడం నేర్చుకోవాలి. ప్రతికూలమైన ఊహలు కలిగినప్పుడు.. నిట్టూర్పులను పక్కన పెట్టి.. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా తీసుకుని.. మళ్లీ మనసుకు అనుకూలమైన ఊహలను రీఫ్రేమ్ చేసుకోవాలి. ఎలాగంటే.. మనకు బాగా ఇష్టమైన మనిషికి ప్రమాదం జరిగి ఉంటుందేమో? అని మనసు భయపడుతుంటే, దానికి వ్యతిరేకంగా ఆలోచించాలి. ఆ మనిషి తిరిగి మీ కళ్ల ముందుకు వచ్చినట్లుగా, తనతో మీరు చెప్పాలనుకున్న కొన్ని మాటలుచెబుతున్నట్లుగా ఊహించుకోవాలి. ఆ వైబ్రేషన్సే నిజంగా జరగబోయే ప్రమాదం నుంచి సైతం ఆ మనిషిని కాపాడే అవకాశం ఉంటుంది. 2. కృతజ్ఞతతో కూడిన ఆలోచనలు కూడా మనిషిని సానుకూలంగా మారుస్తాయి. మనసులోని క్రూరత్వాన్ని, అహంకారాన్ని పక్కకు నెడతాయి. ఇప్పటి దాకా సాఫీగా సాగుతున్న జీవితానికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలి. మీతో పాటు పని చేసే ల్యాప్టాప్కి మీరెప్పుడైనా థాంక్స్ చెప్పారా? మిమ్మల్ని గమ్యానికి చేర్చే వాహనాన్ని మీరెప్పుడైనా కృతజ్ఞతా భావంతో చూశారా? వింతగా అనిపించినా ఇది నిజం. ప్రయత్నించి చూస్తే ఫలితం అందుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రపంచంలోని చాలా మతాలు చలనం లేని వస్తువుకు కూడా ప్రాణం ఉంటుందని నమ్ముతాయి. హిందూమతంలో యంత్రపూజ కూడా ఆ కోవకే వస్తుంది. నెగటివ్ అయినా పాజిటివ్ అయినా ఒక ఎనర్జీ అక్కడుందని భావించి, బలంగా నమ్మితే.. దాని కిరణాలు మీ మదిని తాకుతాయి. అదే ‘యద్భావం తద్భవతి’ అనే నానుడిలోని సారాంశం. 3. ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు మనసును ప్రతికూలమైన ఆలోచనలే చుట్టుముడతాయి. అప్పుడు సానుకూలమైన ఆలోచనలను ప్రేరేపించడానికి మనసులోనే చర్చ జరగాలి. ఒక మనిషితో ఎలా మాట్లాడతామో, మనసుతో కూడా అలానే మాట్లాడుకోగలగాలి. ఆ చర్చ, ఆ ఆలోచన పరిష్కారం దిశగా ఉండాలి. అలాంటి చర్చ మదిలో జరిగితే.. ఒత్తిడి మాయమవుతుందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. 4. ప్రతిక్షణం క్షమాగుణంతోనే ఆలోచించాలి. శత్రువు కారణంగానే మన విజయం ముడిపడి ఉందనే నిజాన్ని గ్రహించుకోవాలి. చాలాసార్లు అవమానాలు, అవహేళనలు మనలో పట్టుదలను పెంచి, మనల్ని లక్ష్యం దిశగా నడిపిస్తాయి. అందుకే శత్రువుకు కూడా కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోమంటారు కొందరు జ్ఞానబోధకులు. మంచి మార్గం ఉదయాన్నే నిద్ర లేవడం, వ్యాయామాలు, ధ్యానం, యోగాలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోవడంతో పాటు.. పాజిటివ్ సంకల్పాలు స్వయంగా రాసుకుని, చదువుకోవడం అలవరచుకోవాలి. దాని వల్ల కూడా సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. అలాంటి సంకల్పాలతో పాజిటివిటీని అందిపుచ్చుకునే ఎన్నో మార్గాలు నెట్టింట దొరుకుతూనే ఉన్నాయి. వాటిల్లోంచి అనుకూలమైన మార్గాన్ని ఎన్నుకుని అనుసరించొచ్చు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈయన మనిషి ఆలోచనా విధానాన్ని మూడు రకాలుగా విభజించాడు. ఇడ్, ఇగో, సూపర్ ఇగో అనే పేర్లతో ఆలోచనా తీరును వివరించాడు. ఇడ్: ఈ ఆలోచన మనిషి మనసులో అచేతనావస్థలో ఉంటుంది. ఇది నైతిక విలువలను పాటించదు. నియమాలు, తప్పొప్పులు దానికి తెలియవు. మనసులో కలిగే కోరికలను తీర్చుకోవడానికి ఎక్కువగా మనిషిని తొందరపెడుతుంది. ఎక్కువ స్వార్థ చింతనతో ఉంటుంది. ఇగో: ఈ ఆలోచన చేతనావస్థలో ఉంటుంది. ఇది వాస్తవిక సూత్రాన్ని పాటిస్తుంది. అనైతిక ఆలోచనలను కట్టడి చేస్తుంది. వాస్తవాలను గ్రహించి.. సమయానుకూలంగా, తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది. సూపర్ ఇగో: ఇదే మనిషి అంతరాత్మ. నైతిక, సామాజిక విలువలను కచ్చితంగా పాటిస్తుంది. ఇగోకు మంచి చెడులను గుర్తు చేసి.. సాంఘిక ఆచారాలను పాటించేట్లు చేస్తుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న మనుషుల ప్రభావానికి ఇది మరింత పరిణతి పొందుతుంది. ఇది ఎక్కువగా నైతిక సూత్రాలపై ఆధారపడి అడుగులు వేస్తుంది. ఉదాహరణకు.. ‘దొంగతనంగా సినిమాకు వెళ్దాం’ అని ఇడ్ ప్రోత్సహిస్తే.. ‘దొంగతనంగా ఎలా వెళ్లొచ్చో?’ ఆలోచిస్తుంది ఇగో. కానీ ‘దొంగతనంగా వెళ్లడం సరికాదు, తప్పు, ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది, దాని వల్ల మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది’ అని హెచ్చిరిస్తూనే నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది సూపర్ ఇగో. ఇలా మనిషి ఆలోచన సరళిని విశ్లేషించాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. బానిసత్వాన్ని వ్యతిరేకించిన స్వాతంత్య్ర సమరయోధులు, కట్టుబాట్లపై, మూఢత్వాలపై తిరుగుబాటు చేసిన సంఘసంస్కర్తలు.. వీళ్లంతా ఉన్నతమైన ఆలోచనాపరులే. గొప్ప ఆలోచనల నుంచి ఉద్భవించిన కొన్ని సూక్తులు ధైర్యం అంటే దేనికి భయపడకూడదో తెలుసుకోవడమే. దయతో జీవించండి, ఎవరినీ ఎప్పుడూ నిరుత్సాహపరచకండి. ఎవరు ఎంత తక్కువగా కనిపించినా.. ఏదో ఒకరోజు పురోగతిని సాధిస్తారు. -ప్లేటో చెడు ఆలోచనలే సగం సమస్యలకు కారణం -రవీంద్రనాథ్ టాగోర్ ప్రేమ, స్నేహం, ఆగ్రహం, కరుణలతో ఇతరుల జీవితానికి విలువను ఆపాదించినంత కాలం.. మీకు కూడా విలువ ఉంటుంది -సిమోన్ ది బూవా మొదట అర్థం చేసుకోలేకపోతే.. దేన్నీ ప్రేమించలేరు, దేన్నీ ద్వేషించలేరు. ∙ఇబ్బందుల్లో కూడా నవ్వగల వారిని నేను ప్రేమిస్తున్నాను, నేర్చుకోవడానికి మనసు ఎప్పటికీ అలసిపోదు. -లియోనార్డో డా విన్సీ ‘చెయ్యాల్సిన పని పట్ల అవగాహన లేకపోతే.. భయపడటం పరిష్కారం కాదు.. నేర్చుకోవడమే మార్గం’ -ఐన్ రాండ్ మేధస్సుకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు, ఊహ. -అల్బర్ట్ ఐన్ స్టీన్ సమానత్వంలోనే ధర్మం వర్ధిల్లుతుంది. స్త్రీ హక్కులను పంచుకోనివ్వండి. ఆమె పురుషుల ధర్మాలను కూడా అనుకరిస్తుంది. ఎందుకంటే విముక్తి పొందినప్పుడు ఆమె మరింత పరిపూర్ణంగా ఎదగాలి. -మేరీ వోల్స్టోన్ క్రాఫ్ట్ శత్రువును రెచ్చగొడితే అది మనకే నష్టం. అందరినీ ప్రేమించండి, కొందరిని నమ్మండి, ఎవరికీ నష్టం చేయకండి -షేక్స్పియర్ ప్రపంచంలో ప్రభావవంతమైన ఆలోచనాపరులు ఈ మానవాళిలో ఎందరో ఆలోచనపరులు.. తమ కోసం కాకుండా ప్రపంచం కోసం ఆలోచించారు. అందుకే నేటికీ ఆదర్శంగా నిలిచారు. ‘ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్నారు కాళోజీ. కానీ తమ ఒక్క ఆలోచనతో కోట్లాది ప్రజలను కదల్చగలిగారు ఎందరో విశ్లేషకులు. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ వంటి గ్రీకు తత్వవేత్తలతో పాటు.. డార్విన్ , కార్ల్ మార్క్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి వారు తమ ఆలోచనలతో చరిత్ర గమనాన్ని మార్చారు. డార్విన్ మనుషుల్లోని మూఢనమ్మకాలను చెదరగొడితే.. కార్ల్ మార్క్స్.. మనిషి బతకడం ఎలానో నేర్పించారు. చార్లెస్ డార్విన్ ఈయన ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతం భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పులను తెచ్చింది. మూఢ నమ్మకాలను విభేదించడంలో కూడా డార్విన్ సిద్ధాంతం కీలక పాత్ర పోషించింది. కార్ల్ మార్క్స్ ఈయన ఆలోచనలను, సిద్ధాంతాలను కలిపి సమష్టిగా.. ఈ ప్రపంచం ‘మార్క్సిజం’ అని పిలుస్తోంది. ప్రతి అంశంలోనూ న్యాయమైన వాదన వినిపించిన ఆలోచనాపరుడు కార్ల్ మార్క్స్. పిల్లలు పనికి పోకూడదని, బడికి వెళ్లాలని వాదిస్తూ భావితరాల గళం అయ్యాడు. ‘ఎంతసేపు ఉద్యోగమే కాదు.. మనిషికి వ్యక్తిగత జీవితం కూడా ఉండాలి. మనకూ ఇష్టాయిష్టాలు ఉండాలి. జీవితంలో ఏం కావాలో మనమే నిర్ణయించుకోవాలి’ అనే కాంక్షను బలపరచింది మార్క్సిజం. మనిషి ఉన్నతమైన జీవితానికి ఉద్యోగ సంతృప్తి చాలా అవసరమని చెప్పింది ఈయనే. మార్పుకి ప్రజలే ప్రతినిధులు అనే మార్క్స్ రాతలతోనే.. ప్రపంచరూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వాలపైన, మీడియాపైన ఓ కన్ను వేస్తూ ఉండాలని ప్రజలకు తెలిపింది మార్క్సిజం. ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? న్యాయాన్యాయాల మధ్య నిలిచే అశాంతి నేటి ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేస్తుంది. మనిషి ఆలోచనాశక్తిని కుంగదీస్తోంది. బలవంతుడు అన్యాయం చేసి గెలిస్తే, బలహీనుడు మరో నలుగురు బలహీనుల సాయం తీసుకుని వాడిపై గెలవగలడట. మనం ఎంతటి బలవంతులమైనా ఆలోచనలో సవరణలు, సడలింపులు లేకపోతే పతనం వెన్నంటే ఉంటుంది. ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె’ అన్న సుమతీ శతకం చెప్పే నీతి అదే! ఆవు–పులి కథ ఒకనాడు మేత కోసం అడవికి వెళ్ళిన ఓ ఆవు పెద్దపులి కంటపడుతుంది. వెంటపడిన ఆ పులి తనని తినబోతుంటే.. ‘నీ చేతిలో చనిపోవడం నాకు ఇష్టమే కాని, నాకు కొంత సమయం కావాలి’ అని వేడుకుంటుంది ఆవు. ఆవు కన్నీళ్లు చూసి కరిగిన పులి.. ‘సమయం దేనికి?’ అని అడుగుతుంది. ‘ఇంటి దగ్గర పాలకు ఏడ్చే నా బిడ్డ ఉంది. దానికి కడుపు నిండా పాలిచ్చి, మంచి చెడు చెప్పి వస్తాను’ అంటుంది ఆవు. మొదట అనుమానించిన పులి చివరికి ఒప్పుకుని పంపిస్తుంది. ఆవు అన్న మాట ప్రకారం చెప్పిన సమయానికి వచ్చి.. ‘ఇక నన్ను తిను’ అంటుంది. ఆవు నిజాయితీకి మెచ్చిన పులి జాలితో ఆవును విడిచిపెట్టేస్తుంది. చిన్నప్పుడు ఈ ‘ఆవు–పులి’ కథ వినే ఉంటారు. ఈ కథలో ఆవు మంచిది. మాట మీద నిలబడింది. ఆవులో కన్నతల్లి ప్రేమ, ఇచ్చిన మాటకోసం ప్రాణాలను త్యాగం చేసేంత ఔదార్యం, కష్టాన్ని మొరపెట్టుకోగలిగేంత వినయం.. ఇలా మనిషి నేర్చుకోదగ్గ ఎన్నో గొప్ప సత్యాలు ఉన్నాయి. కానీ, కథలో ఉన్న నీతి అక్కడి వరకే అనుకుంటే పొరబాటు. కథలో నిజమైన హీరో పులి. పులి స్వతహాగా బలమైన ప్రాణి. దానికి ఆవు మాట వినాల్సిన అవసరమే లేదు. కానీ.. ఆవుకి దాని ఆవేదన చెప్పుకునే సమయాన్నిచ్చింది. ఆకలితో ఉన్న తన బిడ్డ దగ్గరకు ఆవు వెళ్తానంటే నమ్మి.. పంపించింది. తిరిగి వస్తే.. ఆ నిజాయితీని మెచ్చి జాలితో విడిచిపెట్టింది పులి. ఈ రోజు ప్రతి బలవంతుడు నేర్చుకోవాల్సిన నీతి ఇది. ఆలోచించాల్సిన తర్కమిది. పులికి పంజా విసరగలిగే సత్తా ఉంది. అంతకు మించి.. అవకాశం ఉంది, బలంతో కూడిన అధికారం ఉంది, తినాలనేంత ఆకలుంది, ఏం చేసినా ప్రశ్నించలేని నిస్సçహాయత ఆవు రూపంలో ఎదురుగా ఉంది. అయినా పులి ఆలోచించింది. అదే నైతికతంటే. ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది. అయితే ఆ మార్పు ఎలా ఉండాలో మన చేత్లులోనే ఉంది. కాదు కాదు మన ఆలోచనల్లోనే ఉంది. స్వచ్ఛమైన మనసులో చెలరేగే ఊహలను ఈ విశ్వం చెవులారా వింటుందట. మరింకెందుకు ఆలస్యం? సానుకూలమైన ఆలోచనలను శాంతి పావురాల్లా ఎగరనివ్వండి -సంహిత నిమ్మన -
మంచి మాట: మీ చిత్తం ఎలాంటిది?
కొంతమంది ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, కాని కొందరు ఏది అనుకొంటే అదే జరుగుతుంది. దీనికి మూలకారణం ఆలోచనలే. అవే సానుకూల ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు. ఈ రెండింటికి మూలం చిత్తం. జ్ఞానాన్ని భద్రపరిచే స్థానాన్నే చిత్తం అంటారు. చిత్తంలో ఉన్న చెడు ఆలోచనలు మంచి ఆలోచనలుగా మారాలి. అప్పుడే మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. కర్మ చే యించేది మనస్సు, మనస్సుని నియంత్రించేది బుద్ధి. అహంకారం అంటే ప్రకృతి సిద్ధమైన... తన చుట్టూ వున్న పరిస్థితులను తనకు అనుకూలంగా సృష్టించుకోవాలనుకోవటమే. దీనినే మన పెద్దలు ఏమైంది ఇతనికి నిన్నటివరకు బాగానే ఉన్నాడు కదా, ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారాడు అనీ లేదా ఇంతలోనే ఇతనిలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది అనే వారు. దీనికి కారణం చిత్తం నుండి కర్మ ఆ సమయానికి ఆలా పనిచేయడమే. జీవికి వచ్చిపోయే జబ్బులు కూడా కొన్ని చిత్తానికి సంబంధించినవే, మనసు అనియంత్రిత అవయవాలను నియంత్రిస్తుంది. ఇది కలుషితమైతే దీనికి సంబంధించిన గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు మొదలైన అవయవాల పై ప్రభావం ఉంటుంది. నియంత్రించే వ్యవస్థ మొత్తం మెదడులో ఉంటుంది. మెదడులో ఏ అవయవానికి సంబంధించిన వ్యవస్థ చెడితే ఆ అవయవం పనిచేయదు. మెదడులో వున్న ఈ వ్యవస్థ సరికావాలంటే మనస్సులో ప్రక్షాళన జరగాలి. అందుకే ఈ మధ్యన వైద్యులు ప్రతి జబ్బుకు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి లేదా ధ్యానం చెయ్యండి అని విరివిగా చెబుతున్నారు. మరి అవయవాలకు వచ్చే జబ్బుకు మనస్సుకు సంబంధించిన ధ్యానాలు ఎందుకు అంటే అన్నిటికి మూలం మనసే కనుక. మనసనేది ఆలోచనల ప్రవాహం. కోరికలు, వాంఛలూ ఆలోచనలతో సంక్రమించేవే. అంత వరకూ అనుభవంలోకి రాని దాన్ని అనుభవించాలనుకోవడం కోరిక. అదే అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనుకోవడం వాంఛ. మనసు అల్లకల్లోలమైనప్పుడు మనం ఊపిరి వేగంగా తీసుకుంటాం. శ్వాసప్రక్రియలోక్రమబద్ధత ఉండదు. మనసును శాంత పరచడానికి శ్వాసను క్రమబద్ధం చేయడం ఒక పద్ధతి. నిండుగా గాలిని పీల్చి వదలడాన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే నిశ్చలమైన మానసిక స్థితిని పొందవచ్చు. ప్రాణశక్తి మీద పట్టు సాధించడం కోసం ఊపిరిని నియంత్రించడమే ప్రాణాయామం. కోరికలు, వాంఛల నుంచి మనసును అధిగమించి స్వతంత్రంగా, వ్యక్తిగా ఉండగలిగే వారే యోగి. మనసును అధిగమించడమంటే దాన్ని నొక్కిపెట్టి ఉంచడం, నియంత్రించడం కాదు. మన ప్రవర్తనలో మార్పు చేసుకోవాలి. ఎదుటి వారి విజయానికి అసూయ చెందకుండా, అపజయాన్ని హేళన చేయకుండా ఉండాలి. విజయం, అపజయం, ఒకటి ఒకరు పొందితే. ఇంకొకరు కోల్పోతున్నారు, ఇంకొకరు కోల్పోతే, అది ఇంకెవరికో దక్కుతుంది. సుఖం, దుఃఖం. డబ్బు, ఆస్తి, అంతస్తులు అన్నీ నేడు నాది నాది అనుకున్నవి నిన్న వేరొకరివి, రేపు ఇంకెవరివో. అంటే ఏది ఎవరికి శాశ్వతం కాదు. నాది, నాకు అనే సుడిగుండాలలో ఇరుక్కొని మనసు పాడుచేసుకోవడమే సకల జబ్బులకు మూలం. ఈ సూత్రం అర్థం చేసుకొంటేనే ప్రశాంతత. ఏ ఇద్దరి మనస్సు, జీవన విధానం ఒకలాగే ఉండదు. కాని అందుకు విరుద్ధంగా తనకు అనుకూలంగా ఉండాలనుకోవడమే అహంకారం. ఈ అహంకారాన్ని మార్చుకొంటే చిత్తంలో వున్న చెడు కర్మలు అన్నీ మంచి కర్మలుగా మారి మనిషి జీవన విధానం మొత్తం మారిపోతుంది. అందుకే వెయ్యిమందిని వెయ్యిసార్లు యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనసును జయించిన వాడే పరాక్రమవంతుడు’ అంటాడు గౌతమ బుద్ధుడు. మనస్సు అంటే సంకల్ప, వికల్పాల కలయిక నీరు నిర్మలంగా ఉన్నప్పుడు అందులో మన ప్రతిబింబం కనిపిస్తుంది. అందులో వేరే ఏమి కలిపినా నీరు కలుషితం అవుతుంది. ప్రతిబింబం అగోచరమౌతుంది. అలానే మనస్సులో మొదట చెడు ఆలోచనలు తరిమేయడానికి మంచి ఆలోచనలు చేయాలి. క్రమంగా మంచి ఆలోచనలూ తగ్గించాలి. అలా తగ్గించగా మనసు నిర్మలం అవుతుంది. –భువనగిరి కిషన్ యోగి -
దేవుని కాడి సులువు
స్వాభిమానం, స్వయంకృషి, స్వాతంత్య్రం... ఇవి కదా ఆధునిక సమాజంలో వినిపించే మాటలు. పాజిటివ్ ఆలోచనా సరళిని గురించి దాని ప్రభావానికి సంబంధించిన వాదనలు, దృకృథాలు వినబడని రోజే లేదు. ఎవరికి వాళ్లు వ్యక్తిగతంగా ఇతరులతో సంబంధం లేకుండా బతకడమే ఆధునికతగా మారింది. అది ఏ సమాజమైనా, యుగమైనా, కాలమైనా, ఎంత గొప్పగా జీవించినా, జీవితానికి సంబంధించిన ‘అకౌంట్’ అంతా దేవునికి అప్పగించే రోజు ఒకటుంటుందని, దాన్నే తీర్పు దినమంటారని బైబిలు చెబుతుంది (ప్రసంగి 11:9). అనుకున్నది సాధించడమే ధ్యేయంగా, అంచెలంచెలుగా పైకి ఎగబాకడమే విజయ చిహ్నంగా, అంతా భావిస్తున్న నేటి తరంలో ‘పైన దేవుడున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు’ అని చెప్పడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే అదేదో పాతచింతకాయ పచ్చడి సిద్ధాంతమంటూ తేలిగ్గా కొట్టేసే అవకాశాలే ఎక్కువ. దేవుడు లేకుండా జీవించగలమన్న ధీమా ఉంటే మంచిదే! కాని అందుకు అవసరమైనదానికన్నా ఎక్కువగా ‘స్వీయజ్ఞానం’ మీద ఆధారపడవలసి ఉంటుంది. అది ప్రమాదమే!’ దేవుడున్నాడు సుమా! అనేది ఒక బెదిరింపు కాదు, హెచ్చరిక అసలే కాదు. ఆదరణతో కూడిన స్పష్టీకరణ అది. పెరిగే జ్ఞానంతో, విశృంఖలత్వంగా వెర్రితలలు వేస్తున్న స్వేచ్ఛా ధోరణులతో సమాజానికేమైనా మేలు జరిగిందా అంటే అదీ లేదు. మద్యానికి, లైగింక విశృంఖలత్వానికి, నేరప్రవృత్తికి, మాదకద్రవ్యాలకు బానిసలైన తరాన్ని అది పెంచి పోషిస్తోంది. పెద్ద జీతం గొప్ప జీవితాన్నిస్తుందనుకుంటే, పరుపు మెత్తదనం గాఢనిద్రనిస్తుందనుకుంటే, విశాలమైన భవనంలో సుఖశాంతులుంటాయనుకుంటే, అందం జీవితానికి సౌశీల్యాన్నిస్తుందనుకుంటే, ఇవే కదా ఎండమావుల భ్రమలంటే!! ఎంత ప్రయాసపడ్డా, బయట ఎంతకాలమున్నా చీకటి వేళకు సొంతగూటికి చేరుకోవలసిందే! వైఫల్యాలు, కన్నీళ్ళు, అవమానాలు, అన్యాయాలన్నీ సహించి బలహీనపడ్డాక సేదతీరేది మాత్రం దేవుని ఒడిలోనే! ప్రయాసపడి భారం మోసే సమస్త జనులకు ఆయనిచ్చే ‘విశ్రాంతి’ని పొందడమంటే, మండుటెండలో దప్పికతో అలమటిస్తున్న బాటసారికి చల్లటి, తియ్యటి మంచినీళ్ళు దొరకటమే! ప్రతివ్యక్తి జీవితంలో ఏదో ఒక కాడి మోయక తప్పదు. కాని సాత్వికుడు, దీన మనస్సుగలవాడైన దేవుడిచ్చే కాడి సులువైనది, తేలికైనది అని బైబిలు చెబుతోంది (మత్తయి 11:28–30). – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
సానుకూల దృక్పథమే విజయానికి సోపానం
పటాన్చెరు: ‘రోజువారీ కార్యకలాపాలను సాధారణంగా ఎడమవైపు ఉన్న మెదడు నయంత్రిస్తుందని, సమాజంలోని చాలా మంది సహజంగానే దానికి అలవాటు పడిపోతారని ’ బార్క్ పూర్వ శాస్త్రవేత్త జి.ఎ.రామారావు అన్నారు. గురువారం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ‘సాఫ్ట్ స్కిల్స్ ఫర్ ఎ హెల్తీ మైండ్’ అనే అంశంపై జరిగిన ఓ వర్క్షాప్లో ఆయన శిక్షకుడిగా పాల్గొన్నారు. బాబా అణు పరిశోధన సంస్థ(బార్క్) పూర్వ శాస్త్రవేత్తగా జి.ఎ.రామారావు విద్యార్థులకు మెదడు పనితీరుతో పాటు సానుకూల దృక్పథంపై పలు కీలక సూచనలు, వివరణలు ఇచ్చారు. అంతా బాగుందనే మానసిక భావనే సానుకూల దృక్పథమని అదే విజయానికి సోపానమని వివరించారు. సానుకూల ఆలోచన పురోగతి వైపు సాగుతుందన్నారు. మన శరీరంలోని అంగాలన్నీ బాగా పనిచేస్తున్నాయనే భావన కలిగి ఉంటే చన్ని చిన్న రుగ్మతలు కూడా మననేమీ చేయలేవని ఆయన చెప్పారు. కాని ఏదో నలతగా ఉందే ఆందోళన మానసింగా కృంగదీస్తుందని, ప్రతికూల ఆలోచనలను (నెగెటివ్ మైండ్సెట్) విడనాడాలని సూచించారు. నిద్రలేమి గురించి కలత చెందవద్దని, బాగా నిద్రించాననే సానుకూల భావన ద్వారా దానిని అధిగమించి పునరుత్తేజితులు కావాలన్నారు. మెదడు పనితీరును ఆయన వివరిస్తూ ఎడమవైపు మెదడునే ఎక్కువగా వాడుతామన్నారు. అందువల్ల కుడివైపున ఉన్న మెదడును మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతున్నామన్నారు. రోటీన్కు భిన్నంగా పనులు చేస్తుంటే రెండు మెదడుల మధ్య సమన్వయం పెరిగి ఆలోచనలను వస్తిరింప చేసుకోవచ్చని సూచించారు. రోజూ కొద్దిసేపు నేలపై కూర్చోవడం, ఒక్క చేత్తో చేయడానికి అలవాటు పడ్డ పనిని మరో చేతితో చేసేందుకు ప్రయత్నించడం వంటి చిన్ని చిన్న అభ్యాసాల(మార్జాలసనం, శలభాసనంలో కొన్ని మార్పుల) ద్వారా మేధస్సును వికసింప చేసుకోవచ్చన్నారు. ‘సంతోషమే సగం బలం’ అనేది నానుడని ఆనందంగా ఉంటేనే కుడివైపు మెదడు పనిచేస్తుందని రామారావు వివరించారు. కొంత సాధనతో విద్యార్థులు ఏకాగ్రతను అలవరచుకోవడం సాధ్యమేనన్నారు. ఒంటి కాలిపై నిలబడి ఒక కేంద్రాని్న ఎంపిక చేసుకుని దానిపై దృష్టినిలిపి తేదకంగా గమనించాలని, ఆలోచనలను నియంత్రించి ఏకాగ్రత సాధించే ప్రయత్నం చేయాలన్నారు.యోగలోని వృక్షాసనం, గరుడాసనం, నటరాజాసనం, వంటి బ్యాలెన్సింగ్ ఆసనాలను సాధన చేయాలన్నారు. చివరగా యోగనిద్ర ద్వారా సౌభ్రాతృత్వ, ఏకత్వ భావనలను పెంపొందించుకోవచ్చన్నారు. సానుకూల సమైక్య భావనలను యోగనిద్రలో పెంపొందించుకోవచ్చని ఆయన వివరించారు. దాదాపు వంద మంది బిటెక్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో శిక్షణ పొందారు. -
లవ్వా... లక్ష్యమా... తేల్చుకునేదెలా?!
జీవన గమనం నేను ఎంబీబీఎస్కి లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను. రెండేళ్ల క్రితం ఫేస్బుక్లో ఓ అమ్మాయితో పరిచయం అయింది. అప్పటి నుంచీ తనతో మాట్లాడుతూనే ఉన్నాను. నాకు తెలియ కుండానే తన మీద ఇష్టం పెరిగిపోయింది. ఒక్కరోజు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేక పోతున్నాను. దాంతో చదువు మీద శ్రద్ధ తగ్గింది. ఇలా అయితే నా లక్ష్యం దెబ్బ తింటుందేమోనని భయంగా ఉంది. తనతో మాట్లాడకుండా బాగా చదువుకోవాలంటే ఏం చేయాలి? - రాజేశ్, మెయిల్ ఇంటర్మీడియెట్ అంటే ల్యాటిన్ భాషలో ‘ఇన్-ది-మిడిల్’ అని అర్థం. విద్యార్థి జీవితం ఒక రైలు ప్రయాణం అనుకుంటే, ఇంటర్ ‘విజయవాడ ప్లాట్ఫామ్’ లాంటిది. అక్కడికి చాలా రైళ్లు (ఆకర్షణలు, అలవాట్లు) వస్తాయి. ‘సెల్లు, టీవీ’ నుంచి ‘ప్రేమ, మందు’ వరకూ రకరకాల ఆకర్షణలున్న రంగురంగుల బండి ఎక్కితే, అది మిమ్మల్ని జెసైల్మీరు ఎడారికి తీసుకెళ్లి దింపుతుంది. పదివేల రూపాయల జీతానికి స్థిరపడి అక్కడితో సంతృప్తిపడాలి. మంచి స్నేహితులు, పుస్తకాలూ ఉన్న బండి కాశ్మీరు ఉద్యానవనానికి తీసుకెళ్తుంది. ఏ రైలు ఎక్కుతారు? ముక్కు, ముఖం తెలియని అమ్మాయితో ప్రేమలో పడటం... మీరన్నట్టు అది ప్రేమ కాదు, ఇష్టం. మరో భాషలో చెప్పాలంటే ఆకర్షణ. అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘‘ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను’’ అని పాట కూడా రాశారు. మీ లక్ష్యం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా? చదువుకోవడమా? ఒకవేళ పెళ్లి చేసుకోవడమే అయితే ఇప్పుడేనా? అయిదేళ్లు పోయాకా? అప్పటివరకు ఆ అమ్మాయి మీకోసం ఆగుతుందా! వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? అసలిన్ని గొడవలు కావాలా! నేనేదో ప్రశ్న అడిగితే చాట భారతం రాస్తున్నాడేంటి అనుకోకండి. మీ ప్రశ్న ఆఖరి వాక్యంలోనే సమాధానం ఉంది. చదువుకోండి. నేను మొదట్నుంచీ బాగా చదివేదాన్ని. జీవితంలో బాగా స్థిరపడి అమ్మానాన్నలకు పేరు తేవాలి అనుకునేదాన్ని. ఇంత వరకూ అన్నీ అను కున్నట్టుగానే జరిగాయి. కానీ తర్వాత నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా సీఏలో చేర్పించారు. అయినా ఎలాగో కష్టపడేదాన్ని. నాన్న కోసమైనా బాగా చదవాలని ప్రయత్నించేదాన్ని. కానీ నా వల్ల కాలేదు. ఫెయిలైపోయాను. దాంతో తిరిగి డిగ్రీలో చేరాను. కానీ నా జూనియర్స్తో కలిసి డిగ్రీ చదవాలంటే బాధగా ఉంది. డిప్రెస్ అయిపోయాను. అంతలో పెళ్లి సంబంధాలు చూశారు. నన్ను అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి నా ఫ్రెండ్. తనకు దూరం అవ్వడం ఇష్టం లేక పెళ్లి వద్దన్నాను. దాంతో అన్నిటికీ ఆ అమ్మాయే కారణం అంటూ అమ్మ నా ఫ్రెండ్ను తిట్టింది. అది తట్టుకోలేక పెళ్లికి ఒప్పేసుకున్నాను. కానీ ఎందుకో మనసంతా అలజడిగా ఉంది. నాకిష్టం లేనివే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ఈ బాధను నేను ఎలా అధిగమించాలి? - హరిత, ఊరు రాయలేదు ఇష్టం లేనివి జరుగుతున్నప్పుడు, జరుగుతున్నవాటిని ఇష్టంగా చేసుకోవటాన్ని ‘పాజిటివ్ థింకింగ్’ అంటారు. నేను చదువుకునే రోజుల్లో, నాకూ ఇదే సమస్య ఎదురైంది. నాకు లెక్కలు చాలా ఇంట్రెస్ట్. జువాలజీ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇంట్లో వాళ్ల బలవంతం మీద సైన్స్లో చేరాను. కానీ ఎంత బాగా చదివినా, మెడిసిన్లో సీట్ సంపా దించలేకపోయాను. అదృష్టవశాత్తూ కామర్సుతో డిగ్రీ చదివి, ఆ తర్వాత నాలుగేళ్ల సీఏ కోర్సును కేవలం మూడేళ్లలోనే పూర్తి చేశాను. మన అభిరుచి పెద్దలు అర్థం చేసుకోలేక పోతే వచ్చే సమస్య 90 శాతం కుటుంబాల్లో ఉన్నదే! ఇక పోతే మీ జూనియర్స్తో కలిసి చదవాలనే బాధ మీకు ఎక్కువగా ఉంటే, ప్రైవేటుగా చదివే వెసులుబాటు ఉన్నదేమో ఆలోచించండి. ఇక తర్వాతి సమస్య... మీ వివాహం. భవిష్యత్తులో మీరు వివాహం చేసుకుంటారా లేదా అనేది వేరే విషయం కానీ, కేవలం స్నేహితురాలికి దూరమవుతానన్న భయంతో వివాహం వద్దనుకుంటున్న మీ ఆలోచన మాత్రం అంత ఆరోగ్యమైనది కాదు. కొంత కాలానికి మీ ఫ్రెండ్ కూడా పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది కదా! కేవలం స్నేహితురాలి గురించి వివాహం మానుకోకండి. కొన్ని వాస్తవాల్ని భరించక తప్పదు. మీకు వివాహం చేసుకోవాలనే కోరిక ఉండి, అబ్బాయి నచ్చితే చేసుకోండి. లేదూ ఇంకా చదువుకోవా లనుంటే ప్రైవేట్గా మీ చదువును కొనసా గించండి. అదీ కాకపోతే, వివాహం చేసుకుని ఆ తర్వాత చదువును కొనసాగించండి. ఎందు కంటే... చదువుకు, వయసుకు సంబంధం లేదు. - యండమూరి వీరేంద్రనాథ్ -
అంతరాత్మ మాట వినండి
అక్టోబర్ 24 నుంచి 30 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఈ వారంలో చాలా సాహసోపేతమైన పనులు చేస్తారు. దృఢనిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. మీలోని భయాలను జయించండి. పాజిటివ్ థింకింగ్ వల్ల అనేకమైన అడ్డంకులను, చిక్కుసమస్యలను అధిగమిస్తారు. ఎవరు, ఎంతగా బలహీనపరచాలని చూసినా చెదరకండి. విజయం తథ్యం. కలిసొచ్చే రంగు: సముద్రపు పాచి రంగు టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఉత్సాహాన్ని, జయాలను చేకూర్చే వారమిది. మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు వస్తుంది. పెద్దహోదాలో ఉన్న ఉద్యోగులు, అధికారులు మంచి గుర్తింపును పొందుతారు. కిందిస్థాయి వారితో ఉదారంగా వ్యవహరించడం, దానధర్మాలు చేయడం మంచిది. అలసిన శరీరాన్ని విహార యాత్రలతో సేదతీర్చండి. కలిసొచ్చే రంగు: పచ్చరాయి రంగు జెమిని (మే 21-జూన్ 21) అందమైన మీ శరీరం, మృదువైన మీ మాట మీకు ఇబ్బందులు తేవచ్చు. అయితే స్వచ్ఛమైన మీ మనసు, ప్రేమించే మీ తత్వం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మీ ప్రేమబంధాన్ని వివాహ బంధంగా మార్చుకోండి. అవివాహితులకు తగిన సంబంధం కుదురుతుంది. నాన్పుడు ధోరణిని మాని, చకచకా నిర్ణయాలు తీసుకోండి. కలిసొచ్చే రంగు: కెంపు రంగు క్యాన్సర్ (జూన్22-జూలై 23) మీ కలలను ఫలప్రదం చేసుకోవడానికి ఇది తగిన సమయం. మీది తీరని కోరిక అనుకుని నిరుత్సాహపడకండి. మీ లక్ష్యం నెరవేరదు అని నీరుకారిపోకండి. ఆ రెంటినీ ఎంతో అవలీలగా సాధిస్తారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు కుట్రలు, కుతంత్రాలను వాటితోనే ఎదుర్కోవాలని గ్రహించండి. కలిసొచ్చే రంగు: తెలుపు లియో (జూలై 24-ఆగస్టు 23) మార్పు అనివార్యం. అందుకు సిద్ధంగా ఉండండి. మీ అంతరాత్మ మాట వినండి. వివిధ విషయాలపట్ల మీకున్న అపారమైన పరిజ్ఞానానికి మీ చుట్టుపక్కల వారందరూ అమితంగా ఆశ్చర్యపోతారు. మీ అంతరంగిక శక్తులను మరింతగా వెలికి తీసేందుకు ప్రయత్నించండి. మేధస్సుకు మరింత పదును పెట్టండి. కలిసొచ్చే రంగు:వంకాయరంగు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మిమ్మల్ని మభ్యపెట్టి, మీ ద్వారా పనులు చేసుకునేందుకు యత్నాలు జరగవచ్చు. ఏమాత్రం ప్రలోభపడినా, చిక్కుల్లో పడక తప్పదు. మీ నీతి, నిజాయితీలని విడిచిపెట్టకండి. చీకటి శక్తులు, అరాచకవాదులతో తీవ్రపోరాటం తప్పదు. రేఖీని ఫాలో అవడం మంచిది. నచ్చిన వారితో ఆనందంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: తుప్పు రంగు లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) పకి మెచ్చుకుంటూనే వెనకాల గోతులు తవ్వేవారు, రకరకాల వదంతులు ప్రచారం చేసేవాళ్లు కాచుకుని ఉన్నారు. అందమైన స్త్రీలని మీ మీద ఎరగా ప్రయోగించి, మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేసేవారు కూడా ఉన్నారు. అలాంటివారితో అప్రమత్తంగా వ్యవహరించండి. సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు కష్టంగా ఉన్నా, ధైర్యంగా ముందుకెళ్లండి. కలిసొచ్చే రంగు:ముదురు ఎరుపు స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) మీరు ఎదురు చూసే ముఖ్యమైన మార్పు రానుంది. అందుకు తగ్గట్టు మీ జీవనశైలిలో మార్పులు చేసుకోండి. కట్లను చూసి భయపడితే ఎలా? పగలు ఉంటుంది, వెలుగూ ఉంటుంది కదా! మీకున్న జ్ఞానాన్ని, మీ సహజమైన ధైర్యాన్ని, సానుకూల దృక్పథాలనే ఆయుధాలుగా చేసుకుని సమస్యలను తరిమి కొట్టండి. కలిసొచ్చే రంగు: బూడిద రంగు, వెండిరంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీ నిరాడంబర జీవనవిధానం వల్లే మీకు మేలూ, కీడూ కూడా! ఇది ఇలాగే ఇంకొంతకాలం కొనసాగించడం మంచిది. సమాజం దృష్టిలో మీరు ఎంతో మంచివారిగా, నిరాడంబరులుగా నిలిచిపోతారు. అయితే కొన్ని అనూహ్యమైన, అవాంఛనీయమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రేమలో పడవచ్చు. కలిసొచ్చే రంగు: నీలిమందు రంగు క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఎంతో ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉంటారు. మీ మూలంగా మీ చుట్టుపక్కల వారు కూడా సంతోషంగా ఉంటారు. మీ సాన్నిధ్యంలో అందరూ ఎంతో ఊరట పొందుతారు. ఎన్ని పనులున్నా ఆడుతూ పాడుతూ అవలీలగా చేసేస్తారు. మొన్నటి దసరా పండుగ మీకు మిగిల్చిన ఆనందాన్ని, కలిగించిన అదృష్టాన్ని వదులుకోకండి. కలిసొచ్చే రంగు: బంగారు రంగు అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) మీరు ఎంతో శక్తిమంతులు. అయితే చంద్రుని ప్రభావం వల్ల ఒక్కోసారి మీలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం సడలుతుంటుంది. ఆ సమయంలో ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించి, మీ శక్తిసామర్థ్యాలను మీకు గుర్తు చేస్తే తిరిగి ఉత్సాహం తెచ్చుకుంటారు. ఆధ్యాత్మికంగా మీలో మార్పు కలుగుతుంది. దీనివల్ల ఎంతో మేలు కలుగుతుంది.. కలిసొచ్చే రంగు: మీగడలాంటి తెల్లటి రంగు పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) మీ ప్రేయసి లేదా జీవిత భాగస్వామి మిమ్మల్ని నిందించవచ్చు. వారితో విభేదాలు రావచ్చు. ఆర్థికంగా శుభవార్తలు వింటారు. అయితే దీనిమూలంగా కొన్ని కొత్త సమస్యలు, ససవాళ్లు ఎదురు కావచ్చు. మిమ్మల్ని చేతకానివాళ్లు అనుకునే అవకాశం ఎవరికీ ఇవ్వద్దు. మీ శక్తిసామర్థ్యాలను వెలికి తీసుకు వచ్చి, వాటిని నిరూపించుకోండి. కలిసొచ్చే రంగు: మెరిసే నీలిరంగు ఇన్సియా కె. టారో అండ్ ఫెంగ్షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20) తొందరపాటు ఆలోచనలు చేసి, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలు చేయవద్దు. అలాగే అనవసరమైన చర్చలు, వాదోపవాదాలూ లేవదీయడం కూడా మంచిది కాదు. నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. వాటిని సజావుగా అమలు చేయండి. మీ అభిప్రాయాన్ని ముఖం మీద కొట్టినట్లుగా కాకుండా మృదువుగా చెప్పడం మంచిది. టారస్ (ఏప్రిల్ 21-మే 20) కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ఐకమత్య పరిస్థితినీ ఓ కంట కనిపెట్టండి. అనవసర ఘర్షణలతో వ్యక్తుల మధ్య కొన్ని తేడాలు వస్తూ ఉండవచ్చు. దీనివల్ల సంసారం బయటపడవచ్చు. ముఖ్యంగా మాట పట్టింపు ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి. అన్నింటినీ మించి బంధువులు మనింటి విషయాలను ఆరాతీస్తున్నారేమో కనిపెట్టి ఉండండి. జెమిని (మే 21-జూన్ 21) అతి ముఖ్యమూ, జీవితాన్ని ఓ చక్కటి మలుపు తిప్పే ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారేమో గమనించుకోండి. వీలయినంత తొందరగా పూర్తి చేసుకోండి. సంతానం గురించిన శ్రద్ధని పాటించి తీరాలి. బంధువులతో సత్సంబంధాలు నెరపండి కానీ, బంధువులే లోకంగా ఉంటే పనులన్నీ వెనకబడతాయి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఏ సమయానికి ఏది వీలో, ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో ఎప్పటికప్పుడు ఆలోచించుకుని లౌక్యంగా ఇవతలకి వచ్చేయడం అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. నిజాయితీగా ఇది నాకు నచ్చదు అనే విషయాన్ని సమయానుకూలంగా స్పష్టంగా చెప్పేయండి. మొగమాటాన్ని వీడండి. అంతర్భయం వద్దు. లియో(జూలై 24-ఆగస్టు 23) లోగడ చేసిన రుణాలు ఒకటో రెండో కొద్దిగా బాధించవచ్చు. అయితే వాటివల్ల అంత ఇబ్బంది లేదని గమనించండి. కొత్తవ్యాపారం ప్రారంభించడం ఇప్పట్లో అంత మంచిది కాదు. మీ కులవృత్తిని లేదా లోగడ మీకు అనుభవం ఉన్న వృత్తినీ ఎంచుకున్న పక్షంలో మీకు తిరుగుండదు. మీకున్న పలుకుబడి కారణంగా ఎందరెందరో మీకు సాయపడవచ్చు. దిగులు పడకండి. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) పరాకు పడుతూ చేస్తున్న ఉద్యోగంలో కొన్ని పొరపాట్లని చేసే అవకాశం ఉంది. ఆడంబరం కోసం కొంత వ్యయం చేస్తారనిపిస్తోంది. ప్రయాణ సందర్భాల్లో వస్తువుల జాగ్రత్త అవసరం. ప్రభుత్వానికి చెల్లించవలసిన వాటిని సకాలంలో చెల్లించడం, ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు పాటించడం, కిందిస్థాయి ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళనకి గురి చేయవచ్చు. ఇంటాబయటా చిన్న చిన్న సమస్యల కారణంగా మానసికంగా కొంత నలిగిపోయే అవకాశముంది. ఆర్థికంగా కొంత లోటు ఉండవచ్చు. దానిని పూడ్చుకునేందుకు తగిన మార్గాలను అన్వేషించుకోండి. సమస్యలకు రాజీ మార్గమే సరైనదేమో ఆలోచించుకోండి. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీరు ఎంతో విశ్వసించిన వ్యక్తి మిమ్మల్ని మోసగించడం లేదా మీకే ద్రోహం చేయడం వంటివి జరగవచ్చు. అతిగా నమ్మడమనేది మీ దోషమే తప్ప వారిది కాదనుకుని, భవిష్యకాలాన్ని గురించి ఆలోచించండి. జరిగిన దాని మీద దృష్టి పెడుతూ, వర్తమానాన్ని పాడు చేసుకోకండి. మీకు ద్రోహం చేసిన వారి విషయంలో పగ, ద్వేషం, అరాచకం వంటి దిశగా ఆలోచించకండి. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీరు రైతులయిన పక్షంలో చెప్పలేని ఆనందాన్ని పొందుతారు. బంధువుల్లో జరిగే శుభకార్య నిర్వహణా భారాన్ని మీరే మోస్తారు. ఒకవిధంగా ఆలోచిస్తే మీకు పెద్దరికాన్ని ఇస్తే కాదనకుండా చేయడం మీకెంతో ఇష్టం. అయితే శరీర శ్రమని గుర్తించి సహాయపడండి. స్వతంత్రంగా ఏదైనా వ్యాపారం తలపెట్టే ఆలోచన ఉంటే దానిని జనవరి 15 వరకూ వాయిదా వేయడం మంచిది. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ఆధ్యాత్మిక గురువులను కలవడం, పుణ్యక్షేత్రాలని సందర్శించడం జరగవచ్చు. మీ సంతానం ఇంకా విద్యార్థి దశలో ఉన్నట్లయితే మంచి విజయాన్ని సాధించగలుగుతారు. వీలయినంత వరకూ దూరప్రయాణాలని మానుకుని ఉన్నచోటులోనే ఎదగడానికి యత్నించడం ఉత్తమం. తొందరపడి ఎవ్వరికీ మాట ఇవ్వవద్దు. ఇచ్చాక వెనుకాడద్దు. అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) మీ పై అధికారులు ఏమాత్రపు దోషం మీలో దొరుకుతుందనే దృష్టితో పరిశీలిస్తున్నారనే భావంతో ఉద్యోగం, వ్యాపారం, వృత్తి వంటివానిని అప్రమత్తంగా నిర్వహించండి. పాత వాహనాలని అమ్మి కొత్తవి కొనాలనుకోవడం, ఇంటిని మార్చడం లేదా పాత ఇంటిని అమ్మి కొత్తదాన్ని అప్పు చేసి మరీ కొనాలనుకోవడం వంటివాటిని కొద్దికాలంపాటు వాయిదా వేయండి. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ఆర్థికమైన పేచీలు కుటుంబంలో అన్నదమ్ములు, తండ్రీకొడుకులు, భార్యాభర్తల మధ్య కూడా వచ్చే అవకాశం ఉందని గ్రహించి, ముందే మేల్కొని ఆర్థిక క్రమశిక్షణని పాటించండి. మీరు తీసుకోవలసిన పత్రాలని జాగ్రత్తగా పరిశీలించడం, ప్రయాణాలలో మీ వస్తువులను ఇతరులకు అప్పగించకుండా మీరే జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
మన జీవితం.. మన చేతుల్లోనే..!
- ఉమేష్చంద్ర, జయప్రకాశ్ నారాయణే నాకు స్పూర్తి - సన్మానసభలో సివిల్స్విజేత పాతకోట విజయ భాస్కర్ రెడ్డి చాపాడు : ఎవరి జీవితమైనా వారి చేతుల్లోనే ఉంటుందని.. విద్యార్థి దశ నుంచే పాజిటివ్ థింకింగ్తో చదుకుంటూ పోతే ఎలాంటి విజయమైనా సాధించవచ్చని ప్రొద్దుటూరుకు చెందిన సివిల్స్ విజేత పాతకోట విజయభాస్కర్ రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నగురువళూరు గ్రామంలోని శ్రీస్వామి వివేకానందా విద్యానికేతన్లో కరస్పాండెంటు నాగేశ్వరరెడ్డి మంగళవారం ఆయనకు సన్మానించారు. ఈ సందర్భంగా విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ కష్టపడితే ఐఏఎస్, ఐపీఎస్ ఎలాంటివాటినైనా సాధించవచ్చన్నారు. పేపర్లలో చదివి ఐపీఎస్ ఉమేష్చంద్ర, ఐఏఎస్ జయప్రకాశ్నారాయణ వంటి వారి స్పూర్తితో ఐఏఎస్ సాధించానన్నారు. ప్రతి రోజూ 13గంటలకు పైగా చదవివానని, రెండు సార్లు విఫలమైన మూడో సారి ఐఏఎస్కు ఎంపికయ్యానన్నారు. సమాజం కోసం సేవ చేయాలనే తపన గాంధీ, మధర్థెరిసా, వివేకానందుడు వారి స్ఫూర్తితో వచ్చిందన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రిపేరైతే సులువు: విద్యార్థి దశ నుంచే ఫలాణా రంగంలో రాణించాలనే తలంపుతో ప్రిపిరైతే ఐఏఎస్, ఐపీఎస్ ఇలా ఏదైనా సాధ్యమవుతున్నారు. చిన్న అంశాన్ని బట్టి వ్యాసం రాయటం అలవర్చుకోవాలన్నారు. సమాజం పట్ల చిన్నతనం నుంచే అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఇంగ్లీషు భాషపై పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. పోటీ ప్రపంచంలో ముందుండాలంటే అన్ని రంగాలలోనూ అవగాహన కల్పించుకోవాలన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు అడిన పలు ప్రశ్నలకు ఐఏఎస్ విజయాభాస్కర్రెడ్డి సమాధానాలు ఇచ్చి స్ఫూర్తి నింపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద విద్యానికేతన్ హెచ్ఎం సుబ్రమణ్యం, డీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్ నాయభ్స్రూల్, కవి జింకా సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
పాజిబుల్ ఎఫెక్ట్స్
బయటేదో పది నిమిషాల పనుందనుకోండి... గదిలో ఫ్యాన్ ఆపకుండా వెళ్లిపోతుంటాం. కాసేపే కదా అనేది మన ఆలోచన. ఇలా అందరూ ఆలోచిస్తే ఎంత విద్యుత్ వృథా అవుతుంది! కరెంటే కాదు... అన్ని వనరుల వినియోగంలో చాలామంది ఆలోచనా ధోరణి ఇదే. అలా కాకుండా ఎవరికి వారు ఈ వృథాను ఆపితే ఎంతో ఆదా అవుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి మనోహర్ చిలువేరు చిత్రాలు. ఇవే కాదు.. కుటుంబంలో తలెత్తే చిన్న చిన్న మనస్పర్థలు... అనుబంధాలు, పిల్లలపై ఎంతలా ప్రభావం చూపుతున్నాయో... అందరూ కలసి పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళితే ఎంత ప్రయోజనం ఉంటుందో పెయింటింగ్స్లో చూపారు ఆయన. ట్యాంక్బండ్ హోటల్ మారియట్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో మనోహర్ మలచిన చిత్రాలు, వ్యర్థాలతో చేసిన కళాఖండాల ఎగ్జిబిషన్ ‘పాజిబుల్ ఎఫెక్ట్స్’ కళాభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ‘సిటీ ప్లస్’ ఆయనను పలకరించింది... రోజువారి జీవితంలో తెలిసి మరీ చిన్న చిన్న విషయాలే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాం. ఇంట్లో కరెంటు కానివ్వండి... బైక్లో ఇంధనం కానివ్వండి. మన ఒక్కరి వల్ల ఈ పర్యావరణానికి వచ్చిన ముప్పేమీ లేదనుకోవడంతో మనకు తెలియకుండానే పర్యావరణ కాలుష్యానికి కారకులమవుతున్నాం. అలాగే కుటుంబ కలహాలు కూడా. కొంచెం కాంప్రమైజ్ అయితే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా జరిగే విధ్వంసం కన్నా పర్యావరణ కాలుష్యం వల్ల కలిగేదే ఎక్కువ. రోజూ భూమికి, మానవులకు మధ్య నిశ్శబ్ద యుద్ధం సాగుతోంది. విరుద్ధ ప్రక్రియలతో భూమిని విధ్వంసం చేసే పనిలో మనుషులు పడ్డారు. పట్టనట్టు వ్యవహరిస్తున్న మనిషి ఇది తెలుసుకుంటే ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుంది. అణు బాంబుకన్నా అశ్రద్ధ ప్రమాదరకరమైనది. ఇలా ఇవన్నీ నా చిత్రాల్లో చూపా. గ్రామీణ ప్రాంతాలకూ... మాటల్లో చెప్పడం కన్నా నాకు వచ్చిన ఆర్ట్ ద్వారా చెబితే త్వరగా ప్రజలను చేరుతుంది. ఇప్పటివరకు వివిధ అంశాలపై ఎన్నో బొమ్మలు గీశా. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బస్సు యాత్ర ద్వారా ఈ ఆర్ట్ సందేశాన్ని గ్రామీణ ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నా. ఈ నెలాఖరులో కేరళలో, అక్టోబర్ ఇటలీలో జరిగే ఫ్లోరెన్స్ ఆర్ట్ బై నాలాజీలోనూ ఈ చిత్ర ప్రదర్శన చేసేందుకు అనుమతి వచ్చింది. వరంగల్లో పుట్టిన నాకు పుస్తక పఠనమంటే ఇష్టం. నాకు తెలియకుండానే నేను ఎన్నో విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించా. ఆ విధానాన్ని మార్చుకోవడంలో సక్సెస్ సాధించగలిగా. అలాగే ఎంతో చరిత్ర ఉన్న తెలంగాణ బోనాల విశిష్టతను ప్రపం వ్యాప్తం చేయాలనుకుంటున్నా. దేనికైనా ‘బ్యాలెన్స్’ ముఖ్యం. బోనాలను నెత్తిన పెట్టుకున్న మహిళలు ఎంతో బ్యాలెన్స్తో సాగిపోతుంటారు. ప్రయాణం సాఫీగా సాగాలంటే బ్యాలెన్స్ అవసరమనే కాన్సెప్ట్తో మహిళలు బోనాలెత్తిన పెయింటింగ్ రూపొందించా. దీన్ని ఇటలీలో ప్రదర్శిస్తా. వరంగల్లో ఎక్కువ మంది ఆర్టిస్టులున్నారు. వారి కోసం అక్కడ ‘ఆర్ట రెసిడెన్సీ’ ఏర్పాటు చేస్తున్నా. విదేశీ ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చి తమ చిత్రాలు ప్రదర్శిస్తారు. స్థానిక కళాకారులతో ముచ్చటిస్తారు. తద్వారా గ్రామాల్లో కళలపై మరింత అవగాహన పెరుగుతుంది. ఈ ఆర్ట్ షో ఈ నెల 7 వరకు కొనసాగుతుంది. వాంకె శ్రీనివాస్ ‘పీకే’ సూపర్హిట్ ఉత్సాహం, బాయ్ఫ్రెండ్ విరాట్ కొహ్లీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఇప్పటివరకు మునిగి తేలిన ముద్దుగుమ్మ అనుష్కాశర్మ మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. రణబీర్కపూర్తో కలసి ఈ భామ చేస్తున్న తాజా చిత్రం ‘బాంబే వెల్వెట్ క్లబ్’ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కారణం... లేటెస్ట్గా రిలీజైన్ అనుష్కా ‘ఫస్ట్ లుక్’. సెవెన్టీస్లో బ్లాక్ అండ్ వైట్ చిత్రం పోస్టర్లా ఉన్న అనుష్క డిఫరెంట్గా కనిపిస్తోంది. ఇందులో అమ్మడి క్యారెక్టర్ పేరు రోజీ. బాంబే వెల్వెట్ క్లబ్లో సింగర్. ఆమె లవర్ రోల్ రణబీర్ చేస్తున్నాడు.


