breaking news
policy rate
-
రేట్ల పెంపు బాటలో ఆర్బీఐ?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19)లో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశాలు ఉన్నప్పటికీ.. రేట్ల పెంపునకు క్రమంగా ద్వారాలు తెరచుకుంటున్నాయని నిపుణులు భావిస్తున్నారు. తాజాగా ఆర్బీఐ పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశ వివరాల్లో రేట్ల పెంపు సంకేతాలు వెలువడ్డాయని బ్రోకరేజి సంస్థలు కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్, మోర్గాన్ స్టాన్లీ పేర్కొన్నాయి. తాజా పాలసీలో కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ధరల పెరుగుదల రిస్కులను ఇందుకు కారణంగా చూపింది. ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రేట్లలో ఎలాంటి మార్పులు అక్కర్లేదని సూచించగా.. ఒకరు మాత్రం పావు శాతం రెపో రేట్ల పెంపునకు మొగ్గుచూపారు. ‘ఈ ఏడాది ఆర్బీఐ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చు. అయితే, పెంపు అంచనాలు మరింతగా పెరిగాయి. ఎంపీసీ భేటీలో ఎక్కువ మంది సరళ విధానానికి ఇక తెరదించాలని భావిస్తుండటమే దీనికి కారణం’ అని కోటక్ ఎకనమిక్ రీసెర్చ్ ఒక నోట్లో పేర్కొంది. కాగా, వచ్చే సమీక్ష(జూన్ 4–5)లో ప్రస్తుత యథాతథ పరిస్థితికి తెరదించాలని(రేట్ల పెంపు సంకేతాలు) ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య సూచించడం గమనార్హం. అయితే, ఇప్పుడప్పుడే ఆర్బీఐ రేట్లను పెంచకపోవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంటోంది. ఆర్బీఐ ఎంపీసీ తాజా భేటీలో కాస్త కఠిన వైఖరి సంకేతాలు వెలువడినప్పటికీ.. ఆగస్టులో జరిగే పాలసీ సమీక్షలో పావు శాతం రేట్ల కోతకు ఆస్కారం ఉందని అంచనా వేసింది. ‘ప్రధానంగా సాధారణ వర్షపాతం గనుక నమోదైతే ద్రవ్యోల్బణం ఇక తగ్గుముఖం పట్టేందుకు అవకాశాలున్నాయి. ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.3 శాతంగా నమోదుకావచ్చు. ఈ పరిణామాలతో ఆగస్టులో ఒక విడత రేట్ల కోత ఉండొచ్చని భావిస్తున్నాం’ అని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. -
పటేల్... నాలుగో‘సారీ’!
♦ ఆర్బీఐ పాలసీ రేటు యథాతథం.. ♦ ద్రవ్యోల్బణం భయాలే కారణం ♦ 6.25 శాతంగానే కొనసాగనున్న రెపో ♦ ఎస్ఎల్ఆర్ మాత్రం 0.5 శాతం తగ్గింపు ♦ బ్యాంకుల వద్ద పెరగనున్న లిక్విడిటీ ♦ వృద్ధి అంచనాలు 7.4% నుంచి 7.3 శాతానికి డౌన్ ముంబై: ద్రవ్యోల్బణం భయాలను కారణంగా చూపుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో మంగళ, బుధవారాల్లో సమావేశమైన ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) 2017–18 రెండవ ద్వైమాసిక పరపతి సమీక్ష నిర్ణయాలను బుధవారం ప్రకటించింది. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోను మాత్రం 0.5 శాతం తగ్గించింది. ఆర్బీఐ నిర్ణయాలను ఒక్కసారి పరిశీలిస్తే– ⇒ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపోను పాలసీ కమిటీ యథాతథంగా కొనసాగించింది. అంటే గడిచిన 8 నెలలుగా ఈ రేటు 6.5 శాతంగానే ఉంది. మారలేదు. ⇒ బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధుల నిల్వలను ఆర్బీఐ వద్ద ఉంచి, పొందే వడ్డీరేటు– రివర్స్ రెపో యథాపూర్వం 6 శాతంగా కొనసాగనుంది. ⇒ తన డిపాజిట్లలో బ్యాంకులు తప్పనిసరిగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఉంచాల్సిన మొత్తానికి సంబంధించిన స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోను (ఎస్ఎల్ఆర్) 0.5 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 20 శాతానికి తగ్గింది. దీనివల్ల బ్యాంకులకు మరిన్ని నగదు నిల్వలు అందుబాటులోకి వస్తాయి. మరిన్ని రుణాలను మంజూరు చేయగలుగుతాయి. ⇒ దీర్ఘకాలంలో వృద్ధికి మద్దతు లభించేలా... ద్రవ్యోల్బణం లక్ష్యాలకు అనుగుణంగా 2% అటు ఇటుగా(మైనస్/ప్లస్) 4 % కొనసాగించడానికి తగిన పాలసీని ప్రకటిస్తున్నటు ఆర్బీఐ పేర్కొంది. ⇒ పాలసీ రేటును యథాతథంగా కొనసాగించడానికి ఐదుగురు సభ్యులు సానుకూలంగా ఉండగా, ఒకరు– రవీంద్ర హెచ్ ధోలాకియా దీనిని వ్యతిరేకించారు. ⇒ ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణ జరగాలనీ, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య పరిష్కారం కావాలని, మౌలిక రంగంలో అడ్డంకులను తొలగించాలని సూచిన ఆర్బీఐ, ఆయా అంశాలు మెరుగుపడినప్పుడు పరపతి విధానం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని సూచించింది. ⇒ వ్యవసాయ రుణ రద్దు వల్ల ద్రవ్య క్రమశిక్షణా సమస్యలు పెరిగే వీలుంది. ప్రత్యేకించి ద్రవ్యోల్బణంపైనా ఈ ప్రభావం ఉంటుంది. ⇒ అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక సమస్యలు దేశంలో ద్రవ్యోల్బణాన్ని పెంచడానికి దారితీసే ఇబ్బంది ఉంది. 7వ వేతన సంఘం సిఫారసులూ ఈ దిశగా సమస్యను పెంచేవే. ⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను 7.4 శాతం నుంచి 7.3 శాతానికి పాలసీ కమిటీ తగ్గించింది. ⇒ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు స్థూలంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదు. ⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (2017–18, ఏప్రిల్–సెప్టెంబర్) రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 3.5% మధ్య నమోదయ్యే వీలుంది. ద్వితీయార్ధంలో(అక్టోబర్– మార్చి) ఇది 4.5 శాతానికి పెరగవచ్చు. పారిశ్రామిక రంగం నిరుత్సాహం.. ఆర్బీఐ రెపో రేటును తగ్గించకపోవడం పట్ల పారిశ్రామిక వర్గాలు నిరుత్సాహాన్ని వ్యక్తం చేశాయి. ఆర్బీఐ ద్రవ్యోల్బణం పట్ల అతి జాగ్రత్త ప్రదర్శించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ద్రవ్యోల్బణం పూర్తి అదుపులో ఉన్నప్పటికీ, పాలసీ రేట్లు తగ్గించకుండా పారిశ్రామిక రంగాన్ని ఆర్బీఐ నిరుత్సాహానికి గురిచేసిందని ఇండస్ట్రీ చాంబర్ అసోచామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడంతో ఆర్బీఐ నుంచి రేటు కోత ఆశించినట్లు పీహెచ్డీసీసీఐ ప్రెసిడెంట్ గోపాల్ జీవరాజ్ పేర్కొన్నారు. రుణ వ్యయాల తగ్గింపు సమీప భవిష్యత్తులో వృద్ధికి బాటలు వేస్తుందని హౌస్ ఆఫ్ హిరనందిని ఎండీ, చైర్మన్ సురేంద్ర హిరనందిని పేర్కొన్నారు. రీమోనిటైజేషన్ 83%! డీమోనిటైజేషన్ అనంతరం, రద్దు చేసిన మొత్తంలో 83% నగదును తిరిగి వ్యవస్థలోకి తెచ్చినట్లు (రీమోనిటైజేషన్) ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో తెలియజేశారు. వ్యవస్థలో నగదు కొరత లేదని స్పష్టం చేశారు. ‘‘మా వద్ద ఉన్న తాజా గణాంకాల ప్రకారం, 82.67 శాతం కరెన్సీ తిరిగి వ్యవస్థలోకి వచ్చింది’’ అని ఆయన పేర్కొన్నారు. నగదు లభ్యతపై ఆర్బీఐ రోజువారీ ప్రాతిపదికన సమీక్షిస్తోందని, ఏదైనా కొన్ని ప్రాంతాల్లో నగదు సమస్య ఉన్నా... తక్షణం పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. సమస్య దీర్ఘకాలంగా, యథాతథంగా కొనసాగే రీతిలో ఉంటోందన్న విమర్శతో మాత్రం తాను అంగీకరించనని స్పష్టంచేశారు. వృద్ధిపై డీమోనిటైజేషన్ ఎఫెక్ట్ లేదు... డీమోనిటైజేషన్ తక్కువ స్థాయి వృద్ధికి దారితీయలేదని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. డీమోనిటైజేషన్కు ముందే అంటే 2016–17 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే ఆర్థిక క్రియాశీలత మందగించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయన్నారు. రేట్ల తగ్గింపునకు తగిన సమయమే: కేంద్రం సరళతర పాలసీ విధానాన్ని అవలంభించడానికి తగిన ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ‘ఆర్బీఐ అభిప్రాయాలను, నిర్ణయాలను మేం గౌరవిస్తున్నాం. ఇటు రిటైల్ ద్రవ్యోల్బణం, అటు టోకు ద్రవ్యోల్బణం రెండు పూర్తి కట్టడిలో ఉన్నాయి. రేటు తగ్గింపునకు అవకాశం కల్పిస్తున్నాయి’ అని ఆయన అన్నారు. మొండిబకాయిలపై దృష్టి కొనసాగుతుందని ఆర్బీఐ మరోసారి స్పష్టం చేయడం ఆహ్వానించతగినది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఎస్ఎల్ఆర్ తగ్గింపు, గృహ రుణాలకు రిస్క్ వెయిటేజీ తగ్గించడం సానుకూలం. ఇవి బ్యాంకు లిక్విడిటీని పెంచడంతోపాటు గృహరుణాల వృద్ధికి ప్రోత్సాహాన్నిస్తాయి – చందా కొచర్, ఎండీ, సీఈవో, ఐసీఐసీఐ బ్యాంక్ హౌసింగ్ రంగానికి బూస్ట్! కొత్త గృహ రుణాలకు సంబంధించి భారాన్ని తగ్గించే కీలక విధాన నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకుంది. వ్యక్తిగత గృహ రుణాలపై స్టాండర్డ్ అసెట్స్ ప్రొవిజన్స్ను (రుణానికి సంబంధించి రిస్కులను తట్టుకోవడానికిగాను పక్కనబెట్టాల్సిన మొత్తం) పావుశాతానికి ఆర్బీఐ తగ్గించింది. ఇంతక్రితం ఈ రేటు 0.4 శాతంగా ఉండేది. ఈ తరహా రుణాలపై రిస్క్ వెయిటేజ్నీ తగ్గించింది. ‘‘వ్యక్తిగత గృహ రుణాలకు సంబంధించి ఎల్టీవీ (లోన్ టూ వ్యాల్యూ) రేషియోలు, రిస్క్ వెయిటేజ్, స్టాడెర్డ్ అసెట్ ప్రొవిజనింగ్ రేట్ను సమీక్షిస్తున్నాం’’ అని ఆర్బీఐ పాలసీ ప్రకటన తెలిపింది. ప్రయోజనాలు ఇవీ... ⇒ స్టాండెర్డ్ అసెట్ ప్రొవిజన్స్ తగ్గింపు వల్ల గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపునకు వీలు కలుగుతుంది. ⇒ కొన్ని క్యాటగిరీలకు చెందిన రుణాలపై రిస్క్ వెయిటేజ్నీ ఈ నిర్ణయం తగ్గిస్తుంది. క్యాపిటల్ అడిక్వెషీ (మూలధన లభ్యత) కోణంలో బ్యాంకులకు ప్రయోజనం కల్పించే అంశం ఇది. మరిన్ని రుణాలను మంజూరు చేయడానికి ఇది వీలు కలిగిస్తుంది. ⇒ రూ.75 లక్షల పైన వ్యక్తిగత గృహ రుణాలకు సంబంధించి రిస్క్ వెయిటేజ్ ప్రస్తుత 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుంది. రూ.30 నుంచి రూ.75 లక్షల మధ్య రుణాలపై రిస్క్ వెయిటేజ్ 35 శాతం వరకూ తగ్గుతుంది. ⇒ మందగమన వృద్ధి అంకెలకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యంగా ఆర్బీఐ తీసుకుంటున్న చర్య ఇదని గవర్నర్ ఉర్జిత్ పటేల్ వివరించారు. పటిష్ఠంగానే! స్వయంప్రతిపత్తి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్వయం ప్రతిపత్తి పటిష్టంగా ఉందనడానికి సంబంధించిన తాజా పరిణామం ఒకదానిని గవర్నర్ ఉర్జిత్ పటేల్ వివరించారు. దీనిప్రకారం– పాలసీ సమావేశానికి ముందు గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ)తో సమావేశం కావాలని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను విధాన కమిటీ ఏకగ్రీవంగా తోసిపుచ్చింది. విలేకరుల సమావేశంలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా గవర్నర్ ఈ విషయాన్ని చెప్పారు. రేటు తగ్గించాలని ఆర్థికశాఖ కోరుకుంటున్నట్లు పలు వార్తలు వెలువడ్డాయి. సంబంధిత శాఖ అధికారులు–పరపతి విధాన సభ్యుల మధ్య జూన్ 1న ఒక సమావేశం జరగనుందని వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా పటేల్ ఈ విషయాన్ని తెలిపారు. వృద్ధే లక్ష్యంగా పలు సందర్భాల్లో ప్రభుత్వం రేటు తగ్గింపు కోరుకుంటుంటే, ద్రవ్యోల్బణంపైనే దృష్టి సారిస్తూ... ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇలాంటి సందర్భాల్లో కేంద్రం–ఆర్బీఐ మధ్య కొంత ఘర్షణాత్మక వైఖరి నెలకొంటోంది. కేంద్రం డీమోనిటైజేషన్ నిర్ణయం అనంతరం కూడా ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
వడ్డీ రేట్లు 1% తగ్గాల్సిందే..
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా - రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని - జీఎస్టీ అమలుపై వ్యాఖ్య న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ రేటును ఒకశాతం వరకూ తగ్గించడానికి తగిన సమయం ఇదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా పేర్కొన్నారు. ఒక వార్తా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రెపో రేటు (బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే స్వల్పకాలిక రుణంపై వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.25%) అర శాతం నుంచి ఒక శాతం వరకూ తగ్గించే అవకాశం ఆర్బీఐకి వుందని అన్నారు. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నా... భారత్లో రెపో రేటును అరశాతం వరకూ తగ్గించే వీలుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వృద్ధి రేటు 8% దాటే అవకాశం ఉందని అన్నారు. పెట్టుబడుల సెంటిమెంట్ పునరుద్ధరణ దీనికి కారణమని ఆయన విశ్లేషిస్తూ... రానున్న మూడు త్రైమాసికాల గణాంకాల్లో మంచి ఫలితాలు వెలువడటం ఖాయమన్నారు. క్యూ1లో 7 శాతం వృద్ధి రేటును ప్రస్తావిస్తూ... దీనిని ఎగువముఖంగా సవరించే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. జీఎస్టీపై కామెంట్ ఇదీ...: రాజకీయ వాతావరణంలో ఇది ఇలా జరిగిపోతుందని చెప్పడం సాధ్యం కాదు. పరిస్థితులు మారుతుంటాయి. మొత్తంగా చూస్తే... వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు ప్రక్రియ జరుగుతుంది. నిజానికి ఈ ప్రక్రియ 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచీ ఎట్టి పరిస్థితుల్లోనైనా అమలు జరపాలన్నది ప్రభుత్వ సంకల్పం. కానిపక్షంలో మరో ఆరు నెలలు పట్టచ్చు. అమలు ఖాయం. కాంగ్రెస్ అడ్డుపడితే ఏప్రిల్ నుంచి జీఎస్టీ అమలు మరింత ఆలస్యం కావచ్చని బుధవారంనాడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఈ పరోక్ష పన్ను వ్యవస్థకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందినా... బీజేపీకి మెజారిటీ లేని రాజ్యసభలో ఆమోదం లభించలేదు. భారత్లో పెట్టుబడుల పట్ల అంతర్జాతీయ పెట్టుబడులు సానుకూల రీతిలో స్పందిస్తున్నట్లు పనగారియా పేర్కొన్నారు. -
మూడో వడ్డింపు తప్పదా?
ముంబై: ధరల సెగతో వడ్డీరేట్లకు మరోసారి రెక్కలు రానున్నాయి! ఈ నెల 18న చేపట్టనున్న పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వరుసగా మూడో విడత కీలక పాలసీ రేట్లను పెంచడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. రెపో రేటు(ఆర్బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక నిధులపై బ్యాంకులు చెల్లించే వడ్డీ)ను మరో పావు శాతం పెంచవచ్చనేది బ్రిటిష్ బ్రోకరేజి దిగ్గజం హెచ్ఎస్బీసీ అభిప్రాయం. ఒక పక్క వృద్ధి మందగమనం ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ వడ్డీరేట్ల పెంపునకే రాజన్ మొగ్గుచూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడు అన్నింటికంటే ప్రధానంగా ఎగబాకుతున్న ధరలకు కళ్లెం వేయడంపైనే ఆర్బీఐ పూర్తిస్థాయిలో దృష్టి పెడుతుందని హెచ్ఎస్బీసీ పేర్కొంది. రాజన్కు కత్తిమీదసామే... నవంబర్లో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం అనూహ్యంగా 1.07 శాతం ఎగబాకి 11.24 శాతానికి(అక్టోబర్లో 10.17%) దూసుకెళ్లడం తెలిసిందే. ఇది తొమ్మిది నెలల గరిష్టం. మరోపక్క, అక్టోబర్లో పారిశ్రామికోత్పత్తి తిరోగమనంలోకి జారిపోయి మైనస్ 1.8 శాతం క్షీణించింది. ఈ రెండు గణాంకాలూ వెలువడిన మర్నాడే హెచ్ఎస్బీసీ తాజా అంచనాలను ప్రకటించింది. ఒకపక్క పరిశ్రమల రివర్స్గేర్.. మరోపక్క ధరలు చుక్కలనంటుతుండటంతో రాజన్కు ఈసారి పాలసీ సమీక్ష అత్యంత సవాలుగానే నిలవనుంది. సెప్టెంబర్లో ఆర్బీఐ పగ్గాలు చేపట్టిన రాజన్... వరుసగా రెండు సమీక్షల్లో కూడా వడ్డీరేట్లను పావు శాతం చొప్పున పెంచడం తెలిసిందే. ప్రధానంగా ధరల పెరుగుదలకు అడ్డుకట్టవేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన ప్రకటించారు కూడా. ఇప్పుడు ద్రవ్యోల్బణం మరింత ఎగబాకుతున్న నేపథ్యంలో వడ్డీరేట్లను మరింత పెంచకతప్పని పరిస్థితి నెలకొందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే జరిగితే పారిశ్రామిక రంగం మరింత కుదేలవడం ఖాయమని కార్పొరేట్లు గగ్గోలు పెడుతున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికాదీ అదేమాట... ద్రవ్యోల్బణం ఆందోళనల ప్రభావంతో 18న మధ్యంతర త్రైమాసిక పాలసీ సమీక్షలో ఆర్బీఐ పావు శాతం రేట్ల పెంపు తప్పదని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్(బీఓఎఫ్ఏ-ఎంఎల్) అభిప్రాయపడింది. రెపో రేటు వరుస పెరుగుదల, ఈ విధానంలో నిధులసమీకరణ పరిమితుల నేపథ్యంలో బ్యాంకులు ఇక తమ అదనపు లిక్విడిటీ అవసరాలకోసం మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్)పై అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కూడా పేర్కొంది. ప్రస్తుతం రెపో రేటు 7.75%, రివర్స్ రెపో 6.75%, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4%గా కొనసాగుతున్నాయి. కాగా, ఎంఎస్ఎఫ్ 8.75 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం కట్టడే తమ ప్రధాన కర్తవ్యమని తాజాగా రాజన్ మరోసారి స్పష్టీకరించిన సంగతి తెలిసిందే. మరోపక్క లిక్విడిటీ మెరుగుదలపై దృష్టిసారిస్తామని కూడా చెప్పారు. తద్వారా మరోవిడత వడ్డీరేట్ల పెంపు, ఎంఎస్ఎఫ్ తగ్గింపు సంకేతాలిచ్చారు. ‘ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. అయితే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు అంతకంతకూ ఎగబాకుతుండటంతో వృద్ధి, ధరల కట్టడి మధ్య సమతూకంతో వ్యవహరించాల్సి ఉంది’ అని రాజన్ అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా.. టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రేటు కూడా నవంబర్లో కాస్త పెరిగి.. 7.1 శాతానికి చేరొచ్చని బీఓఎఫ్ఏ-ఎంఎల్ అంచనా వేసింది. అక్టోబర్లో ఈ రేటు 7%.