Panthangi Rambabu Sagubadi
-
‘జాబ్స్ టియర్స్’..కొత్త మిల్లెట్ పంట!
కొత్త మిల్లెట్ పంట! ‘జాబ్స్ టియర్స్’.. ఇది మన దేశానిదే అయినా మనకు తెలియని పంట. మణిపూర్కు చెందిన మిల్లెట్ పంట. అధిక పోషక విలువతో కూడి ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే.. మల్టీకట్ మిల్లెట్ క్రాప్. అంటే, ఒక్కసారి నాటితే చాలు, మూడుసార్లు ధాన్యం కోసుకోవచ్చు. మొదటి కోత తర్వాత కొద్ది నెలల వ్యవధిలో మరో రెండుసార్లు పంట తీసుకోవచ్చు. మణిపూర్ ప్రాంతంలో ఇది సాగవుతోంది. అన్నంగా వండుకు తినొచ్చు. పశువులకు గ్రాసంగా, దాణాగా పెడతారు. మణిపూర్లోని సేనాపతి జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ కమీ ‘సాక్షి సాగుబడి’తో ఈ పంట విశేషాలు పంచుకున్నారు. గ్రామినే కుటుంబంలోని ఒక స్మాల్ మిల్లెట్ పంట ఇది. 1–2 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. గింజలు రకాన్ని బట్టి రంగు మారుతుంది. పసుపు, ఊదా లేదా గోధుమ రంగులో ఉంటాయి. కన్నీటì బిందువు రూపంలో ఉంటాయి. అందుకే ‘టియర్స్’ అనే పేరొచ్చింది. ఎటువంటి నేలల్లో, ఎంతటి ప్రతికూల వాతావరణాన్నయినా తట్టుకుంటుంది. దీని బియ్యంలో మాంసకృత్తులు 9%, కొవ్వు 0.5–6.1%, పిండిపదార్థం 58–77%, పీచు 0.3–8.4, 100 గ్రాముల బియ్యంలో 1500 కిలో కేలరీలుంటాయి. వరి బియ్యం, గోధుమలతో పోల్చితే కొవ్వు, ప్రొటీన్ చాలా ఎక్కువ. జాబ్స్ టియర్స్ పైపొట్టు తీసిన ముడి బియ్యాన్ని అన్నంగా వండుకొని తింటే ఆరోగ్యం. పిండితో రొట్టె చెయ్యొచ్చు. సూప్లలో చిక్కదనం కోసం కలుపుకోవచ్చు. సిరిధాన్యాలతో చేసే చిరుతిళ్లన్నీ చేసుకోవచ్చు. మద్యం తయారీకీ వాడుతున్నారు. కోళ్లకు, పశువులకు కూడా పుష్టికరమైన ఆహారం ఇది. ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్లో అఖిల్- జైనబ్కరువు కాలంలో ఇతర పంటలు పోయినా ఇది బతికి, మనుషుల్ని, పశువుల్ని బతికిస్తుంది. నీటి ముంపును తట్టుకుంటుంది. ఆమ్ల గుణం ఉండే నేలల్లో, లేటరైట్ నేలల్లో, కొండవాలులో నిస్సారమైన భూముల్లోనూ పెరుగుతుంది. సముద్రతలం నుంచి 2 వేల మీటర్ల వరకు ఎత్తు గల ప్రాంతాల్లో పండుతుంది. విత్తనాలను బాగా మసిలే వేడి నీళ్లలో 10 నిమిషాలు ఉంచి, విత్తుకుంటే తెగుళ్లు రావు. మే–జూలై మధ్య విత్తుకోవచ్చు. 8–10 అంగుళాల లోతు దుక్కిచేసి, సాళ్లుగా విత్తుకోవాలి/ వెద పెట్టాలి. 100–115 రోజుల పంట. గింజ గట్టిపడి, తేమ 20% కన్నా తగ్గినప్పుడు కోత కోసుకోవాలి. హెక్టారుకు 2–4 టన్నుల ధన్యం దిగుబడి నిస్తుంది. పైపొట్టు తీసేస్తే 30–50% వరకు ముడిబియ్యం వస్తాయి. హెక్టారుకు 34 టన్నుల పచ్చిగడ్డి, 8 టన్నుల ఎండు గడ్డి పండుతుంది. ఇతర వివరాలకు.. డా. డేవిడ్ కమీ davidkamei81@gmail.com -
పటిష్ఠ క్వారంటైన్తోనే చెక్!
చైనా తమపై ఆగ్రో టెర్రరిజానికి పాల్పడిందని ఇటీవల అమెరికా ప్రకటించింది. ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని చైనా నుంచి అక్రమంగా అమెరికాలోకి తీసుకువచ్చిన నేరానికి చైనా పౌరురాలు, మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకురాలు యుంకింగ్ జియాన్(33), ఆమె చైనా ప్రియుడు జున్యాంగ్ లియు(33)లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా చైనా పనిగట్టుకొని చేయిస్తున్న ‘ఆగ్రో టెర్రరిస్టు’ చర్యేనని అమెరికా ఆరోపించింది. శత్రు దేశంలో జీవ భద్రతను, వ్యవసాయ– ఆహార భద్రతను విచ్ఛిన్నం చేసే ఉగ్రవాద చర్యలను ‘ఆగ్రో టెర్రరిజం’ అని వ్యవహరిస్తారు. ఈ వార్తతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో.. అసలు ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రం పంటలకు ఎంతవరకు ప్రమాదకరం? ఒక దేశం నుంచి మరో దేశానికి ఏదైనా శిలీంధ్రాలు, వైరస్లు, సూక్ష్మజీవులు, విత్తనాలను పరిశోధనల కోసం అధికారిక అనుమతులతో తీసుకెళ్లే వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుంది? దాని అవసరం ఏమిటి? వంటి విషయాలను పరిశీలిద్దాం.కొత్త వాతావరణమే సమస్యఒక దేశం మరో దేశంపై ఆయుధాలతో విరుచుకుపడితే ఆ దాడి నష్టం ఏపాటిదో అప్పటికప్పుడే తెలిసిపోతుంది. అదే గనక.. ఒక విధ్వంసక శిలీంధ్రాన్నో, సూక్ష్మజీవినో, వైరస్నో జీవాయుధంగా ప్రయోగిస్తే ఈ ఆగ్రో టెర్రరిస్టు చర్య వల్ల కలిగే నష్టం వెంటనే తెలియదు. కొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే, ఒక దేశంలో ఉండే శిలీంధ్రం లేదా వైరస్ వేరు దేశపు కొత్త వాతావరణ పరిస్థితుల్లోకి ప్రవేశించినప్పుడు ఆ వాతావరణం నప్పితే చెలరేగిపోవచ్చు. అక్కడి పంట పొలాల్లో విధ్వంసం సృష్టించి ఆ దేశపు ఆహారోత్పత్తి పునాదుల్నే కదిలించి, కోలుకోలేని దెబ్బ తీయవచ్చు. లేదంటే, ఆ కొత్త వాతావరణం సరిపడకపోతే తేలిపోనూవచ్చు. ఆ కొత్త వాతావరణంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమపై ఈ శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాల ప్రవర్తన తీరు ఎంత విధ్వంసకరంగా ఉంటుందన్న విషయం ఆధారపడి ఉంటుంది. అందుకే పరిశోధనల కోసం విదేశాలకు ఇలాంటివి తీసుకెళ్లాలంటే పటిష్టమైన పరీక్షలు, నియమనిబంధనలతో కూడిన క్వారంటైన్ వ్యవస్థ ఏర్పాటైంది. అదేమీ లేకుండా ఫంగస్ను పంపటం ద్వారా చైనా ‘ఆగ్రో టెర్రరిస్టు (వ్యవసాయ ఉగ్రవాద)’ చర్యకు ఒడిగట్టిందని అమెరికా మండిపడింది. ‘ప్రమాదకరమైన జీవాయుధాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావటం వ్యవసాయ సంబంధమైన ఉగ్రవాద చర్య. ఇది పంటలకే కాదు మనుషులు, పశువుల ఆరోగ్యానికి కూడా గొడ్డలిపెట్టు. యావత్ జాతి భద్రతకే ప్రత్యక్ష ముప్పు’ వంటిదని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) డైరెక్టర్ కష్ పటేల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.అన్ని దేశాల్లోనూ ఉన్నదే! ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రంను ‘కిల్లర్ ఫంగస్’ అని కూడా అభివర్ణిస్తున్నారు. ‘గ్రామినే’ కుటుంబానికి చెందిన వరి, మొక్కజొన్న, గోధుమ, బార్లీ వంటి ప్రధాన ఆహార ధాన్యపు పంటలకు కంకి దశలో సోకటం ద్వారా దిగుబడిని దెబ్బతీసి తీవ్ర ఆర్థిక నష్టం కలిగిస్తుంది అయితే, ఇది ఇప్పటికే దాదాపు అన్ని దేశాల్లోనూ ఉన్న శిలీంధ్రమేనని నిపుణులు చెబుతున్నారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, కేంద్ర ప్రభుత్వ జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం మాజీ సంచాలకులు డాక్టర్ బలిజేపల్లి శరత్బాబు ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ.. ‘ఇది కొత్త శిలీంధ్రం కాదు. అమెరికా, భారత్, పాకిస్తాన్, చైనా సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఉనికిలో ఉంది. అనేక పంటల కంకులను ఆశించి, దిగుబడికి పెను నష్టం చేస్తుంటుంది. ఇది సోకిన ధాన్యం తింటే వికారం, వాతులు వంటి సమస్యలు వస్తాయి. అయితే, పంటలకు విధ్వంసకమైనదైనప్పటికీ ఇది ప్రాణహాని కలిగించినట్లు ఆధారాలు లేవు. నిజానికి పప్పులు, మిరపకాయలు, వేరుశనగలను ఆశించే అఫ్లోటాక్సిన్లు దీనికన్నా ప్రమాదకరం. ఒక్కోసారి కేన్సర్ కారకం కూడా కావచ్చు’ అన్నారు.దిగుమతి, ఎగుమతికి క్వారంటైన్ తప్పనిసరి!శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాలు, మొక్కలు వంటి జీవ పదార్థాలను ఒక దేశం పరిశోధనల కోసం, వ్యాపార రీత్యా అధికారికంగా ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా అంత సులువేమీ కాదు. అంతర్జాతీయ మొక్కల సంరక్షణ ఒడంబడిక (ఐపిపిసి)లో పేర్కొన్న విధంగా కఠినమైన క్వారంటైన్ నియమ నిబంధనలను రెండు దేశాలూ త్రికరణశుద్ధితో పాటించాల్సిందే.ఎగుమతి చేసే దేశం ప్రమాదం లేదని ఫైటో శానిటరీ సర్టిఫెకెట్ ఇవ్వాలి. దిగుమతి చేసుకునే దేశ ప్రభుత్వం దిగుమతి చేసుకునే సంస్థ/వ్యక్తికి ఇంపోర్ట్ పర్మిట్ ఇవ్వాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకున్న తర్వాత ఒక సీజన్లో క్వారంటైన్ చట్టాల ప్రకారం ప్రయోగాలు చేసి, అందులో హానికారక చీడపీడలు ఏవీ రవాణా కావటం లేదని నిర్థారించుకున్న తర్వాతే ఆ దేశపు సహజ వాతావరణంలోకి ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు. ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది. చదవండి: జాబ్స్ టియర్స్.. కొత్త మిల్లెట్ పంట!ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాలన్నీ సాధారణ వ్యవసాయోత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు కూడా శానిటరీ, ఫైటో శానిటరీ నియమాలు పాటించాల్సిందే. ఈ నియమాలను అమలుచేసే పటిష్ట క్వారంటైన్ వ్యవస్థ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉంటుంది. ఎయిర్పోర్టులు, సీపోర్టుల్లో తనిఖీలు అతి కఠినంగా ఉంటాయి. అమెరికా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న హవాయి రాష్ట్రం నుంచి దాదాపు అన్ని రకాల పండ్లు కూరగాయలు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లడానికి నిర్దిష్టమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయన్నారు డాక్టర్ శరత్బాబు.మన క్వారంటైన్ వ్యవస్థ బలహీనం చైనా నుంచి ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రాన్ని అమెరికాకు తీసుకెళ్లింది పరిశోధనల కోసమైనప్పటికీ క్వారంటైన్ నిబంధనలు పాటించలేదు. అనుమతులు లేవు కాబట్టే ఈ పనిని ‘వ్యవసాయ ఉగ్రవాద’ చర్యగా అమెరికా సీరియస్గా పరిగణించింది. జియోపొలిటికల్ ఉద్రిక్తతలు కూడా దీనికి కారణమై ఉండొచ్చు. ఈ శిలీంధ్రం అన్ని దేశాల్లోనూ ఉన్న జాతే. అయినా, వేర్వేరు దేశాల్లో అనేక ఉపజాతులు ఉంటాయి. ఒక ఉపజాతి ఒక దేశంలో పెద్ద సమస్య కాకపోయినా, వేరే దేశంలోని విభిన్న వాతావరణంలోకి వెళ్లిన తర్వాత పెను విపత్తు సృష్టించవచ్చు లేదా నిద్రాణంగా ఉండిపోవచ్చు. అందుకే జీవపదార్థాలేవైనా దేశ సరిహద్దులు దాటించేటప్పుడు కఠినమైన క్వారంటైన్ పరీక్షలు చెయ్యటం తప్పనిసరి. మన దేశంలో ఈ క్వారంటైన్ వ్యవస్థ బలహీనంగా ఉంది. ఇకనైనా పటిష్టం చెయ్యాలి.– డాక్టర్ బలిజేపల్లి శరత్బాబు, అధ్యక్షులు, ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మాజీ సంచాలకులు, జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం. -
ఒకే మోటారుతో రెండు బోర్ల నుంచి నీరు!
తన ఆవిష్కరణ లోగుట్టును వెల్లడించిన రైతు శాస్త్రవేత్త పుల్లారెడ్డి హెచ్.డి.పి. పైపుతో ఇక ఎవరైనా అనుసంధానించుకోవచ్చు! ఖర్చు అంతా కలిపి రూ. 10 వేల లోపే దగ్గర్లో ఉన్న రెండు బోరు బావుల నుంచి ఒకే మోటారుతో నీటిని తోడుకునే పరిజ్ఞానాన్ని కనుగొన్న రైతు శాస్త్రవేత్త పందిరి పుల్లారెడ్డి అద్భుత ఆవిష్కరణ గురించి ‘పల్లెసృజన’ సౌజన్యంతో రెండేళ్ల క్రితమే ‘సాక్షి’ దినపత్రిక ‘సాగుబడి’ ద్వారా తెలుగు రైతు లోకానికి తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక మంది రైతులు ఇప్పటికే ఈ పద్ధతిని అనుసరిస్తూ విద్యుత్తును ఆదా చేస్తూ సంతోషంగా పంటలు పండించుకుంటున్నారు. కోరిన రైతుల ఊళ్లకు పుల్లారెడ్డి స్వయంగా వెళ్లి రెండు బోర్లను అనుసంధానం చేసి చూపుతూ వచ్చారు. అయితే, తెలంగాణలో భూగర్భ నీటి మట్టం పెరిగి, వరి సాగు విస్తీర్ణం పెరగడంతో ఇటీవల చాలా మంది రైతులు ఈ పద్ధతి గురించి అదేపనిగా ఫోన్లు చేస్తుండడంతో పుల్లారెడ్డి ఆలోచనలో పడ్డారు. అన్ని ఊళ్లకూ తానే స్వయంగా వెళ్లడం సాధ్యం కాని పని. కాబట్టి, రెండు బోర్లను అనుసంధానం చేసే పద్ధతిలో గుట్టుమట్లను రైతు లోకానికి విడమరచి చెబితే.. ఎవరికి వారే ఆ పనిని త్వరలోనే అమలు చేసుకోగలుగుతారని ఆయన భావించడం అభినందనీయం. తనను కన్న వారి పేరిట ‘వెంకట శేషాద్రి వాటర్ పంపింగ్ స్కీం’ను రైతాంగానికి అంకితం ఇస్తున్నానని పుల్లారెడ్డి ‘సాగుబడి’తో చెప్పారు. ఆయన స్వగ్రామం సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ముకుందాపురం. తన పొలంలోని రెండు బోర్లు ఆగి, ఆగి నీరు పోస్తుండడం.. రెండో మోటారుకు విద్యుత్ కనెక్షన్ పొందే అవకాశం లేకపోవడంతో వేరే విధంగా ఏమైనా పరిష్కారం దొరుకుతుందా అని కొత్తదారిలో ఆలోచించి రైతు లోకానికే వెలుగుబాట చూపారు. బోర్లను అనుసంధానం చేసుకోవడానికి అన్నీ కలిపి సుమారు రూ. 10 వేలు ఖర్చవుతుంది. ఆయన చెప్పిన ప్రకారం బోర్ల అనుసంధానం చేసుకునే తీరు ఇదీ. ఈ పద్ధతి విజయవంతం కావాలంటే.. బోర్ల లోతు 150 అడుగులు ఉండాలి. రెండు బోర్ల మధ్య దూరం 35 అడుగులు ఉండాలి. ఈ రెండు బోర్లలో నీరు నేలమట్టం నుంచి 20 అడుగుల లోతులో ఉన్నప్పుడు మాత్రమే అనుసంధానం చేయడం సాధ్యపడుతుంది. ఆ తర్వాత కాలంలో నీటి మట్టం పడిపోయినా ఇబ్బంది ఉండదు. 1.5 – 1.25 ఇంచుల నీరు పోసే 2 బోర్లను కలిపినప్పుడు చక్కని ఫలితం కనిపిస్తుంది. ప్రభుత్వానికి విద్యుత్ ఆదా అవుతుంది. రైతుకు కనీసం రూ. 50 వేలు ఆదా అవుతుంది. రెట్టింపు భూమికి సాగునీరు అందుతుందని పుల్లారెడ్డి తెలిపారు. బోర్ల అనుసంధానానికి కావాల్సిన వస్తువులు: ఎ) 200 అడుగుల పొడవు గల హెచ్.డి.పి. పైపు (10 గేజ్, 1.5 ఇంచులు); బి) 36 అడుగుల పొడవైన 8 ఎం.ఎం. ఇనుప చువ్వలు– రెండు; సి) మోపెడ్కు వాడే ట్యూబు ఒకటి (అడుగు పొడవైన ముక్కలుగా కత్తిరించి ఉంచుకోవాలి). హెచ్.డి.పి. పైపును మట్టి కింద ఉంచితే మేలు.. 2 బోర్ల మధ్యన హెచ్.డి.పి. పైపును నేల పైన ఉంచే కన్నా.. మట్టి లోపలికి ఉండేలా పెట్టుకుంటే కదిలిపోకుండా ఉంటుంది. ఇలా చేయడానికి రెండు బోర్లకు ఉన్న కేసింగ్ పైపులను పై నుంచి నేల మట్టం వరకు హెచ్.డి.పి. పైపు పట్టే సైజులో కత్తిరించి.. అందులో నుంచి హెచ్.డి.పి. పైపును కిందికి దింపితే బాగుంటుంది. సందేహాలుంటే పుల్లారెడ్డి (99632 39182)ని సంప్రదించవచ్చు. పుల్లారెడ్డి తన జ్ఞానాన్ని ఉచితంగా పంచిపెట్టడం వల్ల ఈ సీజన్లోనే రైతులందరికీ ఎంతో ప్రయోజనం చేకూరుతుందని భావించిన గొప్ప మనిషి పుల్లారెడ్డి ఆదర్శప్రాయుడని ‘పల్లెసృజన’ అధ్యక్షులు బ్రిగేడియర్ (రిటైర్డ్) పోగుల గణేశం (98660 01678) అన్నారు. విలక్షణ రైతు శాస్త్రవేత్త పుల్లారెడ్డికి ప్రభుత్వం పింఛనుతో గౌరవించాల్సిన అవసరం ఉంది. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ బోర్లను అనుసంధానించుకోవడం ఇలా.. 1. తొలుత.. హెచ్.డి.పి. పైపును తీసుకొని.. పైపు రెండు చివరలను ఆకాశం వైపు తిప్పి.. గుంజలకు కట్టేయాలి. పైపులో పూర్తిగా నీరు నింపాలి. 2. నీరు నింపిన తర్వాత.. తడి బంక మట్టిని గోనె సంచిలో చుట్టి.. పైపు రెండు చివరల్లోనూ కూర్చాలి. 3. ఆ తర్వాత.. అడుగు పొడవైన ట్యూబు ముక్క ఒక వైపును మూసివేసి తాడుతో గట్టిగా కట్టి, రెండో వైపును.. హెచ్.డి.పి. పైపునకు తొడగాలి. హెచ్.డి.పి. పైపును బోర్ల లోపలికి దింపే సమయంలో రెండు చివర్ల నుంచి నీరు కారిపోకుండా చూడడానికి రెండు మోపెడ్ ట్యూబు ముక్కలను ఉపయోగిస్తున్నామన్న మాట. 4. హెచ్.డి.పి. పైపు చివరల్లో తొడిగిన ట్యూబు ముక్కల లోపలికి ఆ చివర ఒకటి, ఈ చివర ఒకటి ఇనుప చువ్వలను కలిపి.. ఆ ఇనుప చువ్వల సాయంతో హెచ్.డి.పి. పైపు చివరలను బోర్ల కేసింగ్ పైపుల లోపలికి చేర్చాలి. 5. హెచ్.డి.పి. పైపు చివరలు రెండు బోర్లలో నీటిలోకి పెట్టిన తర్వాత.. ఇనుప చువ్వలను కిందికి నెడుతూ.. పైపు చివరల్లో తొడిగిన మోపెడ్ ట్యూబు ముక్కలను హెచ్.డి.పి. పైపుల నుంచి తొలగించాలి. ఆ తర్వాత ఇనుప చువ్వలను బయటకు తీసేయాలి. పైపును గట్టిగా కుదిపితే.. పైపు చివరల్లో నుంచి బంకమట్టి కూడా బయటకు వచ్చేస్తుంది. 6. బొమ్మలో చూపిన విధంగా.. హెచ్.డి.పి. పైపు ఒక చివరను.. మోటారు బిగించిన బోరు కేసింగ్ పైపు లోపలికి దశల వారీగా 90 అడుగుల లోతునకు దింపాలి. రెండో చివరను.. మోటారు లేని ఖాళీ బోరు లోపలికి దశల వారీగా 80 అడుగుల లోతునకు దింపాలి. 7. ఈ విధంగా హెచ్.డి.పి. పైపును రెండు బోర్ల లోపలికి దింపి నీటితో అనుసంధానం చేసిన తర్వాత మోటారు స్విచ్ ఆన్ చేయాలి. 8. మోటారు ఆన్ చేసిన తర్వాత బోర్ల మధ్య భూమిపైన ఉన్న హెచ్.డి.పి పైపుపై చెవిని ఉంచితే నీరు ఒక బోరు లోనుంచి మరో బోరులోకి ప్రవహిస్తున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. -
‘పొగ’బట్టిన ‘ఏక’ పంటలు!
వాయుకాలుష్యం రూపంలో దేశ రాజధాని నగరంలో ‘పర్యావరణ అత్యవసర’ పరిస్థితిని సృష్టించింది. పొలాల్లో వరిగడ్డి దహనానికి దీపావళి కాలుష్యం తోడైంది. ‘హరిత విప్లవం’ మన పొలాల్లోకి వచ్చి ఇప్పటికి సరిగ్గా ఏభయ్యేళ్లు. అప్పటి నుంచి పంట భూముల్లోపల తొలుస్తున్న పర్యావరణ సంక్షోభమే ఇవాళ అతి సూక్ష్మ ధూళికణాల మహా పడగై రాజధానిని చుట్టుముట్టింది. దేశ రాజధానివాసులను మునుపెన్నడూ ఎరుగనంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ‘హరిత విప్లవం’ వెంట తెచ్చిన ఏక పంటల (మోనోకల్చర్) దురలవాటే ఈ దుస్థితికి మూలకారణం. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల పొలాల్లో ఖరీఫ్లో వరి, రబీలో గోధుమ పంటల సాగు పద్ధతి రైతుల మనసుల్లో లోతుగా నాటుకుపోయింది. ఈ రెండు పంట దిగుబడులను మద్దతు ధరకు ప్రభుత్వం చప్పున సేకరిస్తుంది. కాబట్టి, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల మిశ్రమ పంటల సాగు వంటి ప్రత్యామ్నాయాల వైపు రైతులు చూడలేకపోతున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని సారవంతమైన నేలల్లో రైతులు కేవలం వరి, గోధుమ పంటలనే ఏక పంటలుగా సాగు చేస్తున్నారు. యంత్రాలతో వరి కోతలైన కొద్ది రోజుల్లోనే గోధుమ విత్తుకోవాలంటే.. పొలాల్లో మిగిలిన మోకాలెత్తు వరి మోళ్లను తగుల బెట్టడానికి మించి మరొక సులువైన మార్గం రైతులకు తోచడం లేదు. పశువులకు వరి గడ్డి కన్నా గోధుమ గడ్డి మేపడమే మేలన్న భావన అక్కడి రైతుల్లో ఉంది. అందుకే ప్రభుత్వం నిషేధించినప్పటికీ వరి గడ్డి మోళ్లకు రైతులు నిప్పంటిస్తున్నారు. భూమిలో అనేక అంగుళాల లోతు వరకూ సూక్ష్మజీవరాశి మాడిపోయి పొలం నిర్జీవంగా, నిస్సారంగా మారిపోతున్నా.. ఏటేటా రసాయనిక ఎరువుల మోతాదు పెంచుతున్నారే తప్ప.. ఏక పంటల సాగు విషవలయాన్ని రైతులు ఛేదించలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మండుతున్న లక్షలాది హెక్టార్ల పంట భూముల పొగ.. ఢిల్లీ నగరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పరస్పరాధారితమైన జీవవైవిధ్యమే ప్రకృతి మనుగడకు మూల సూత్రం. ఏక పంటల రసాయనిక వ్యవసాయ నమూనా ఫలితం నేలతల్లి పొదుగు కోసి పాలుతాగడం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ విషవలయంలో చిక్కుకున్న అన్నదాతల ఆక్రందనలు, ఆత్మబలిదానాలు పాలకులను కదిలించలేకపోతున్నాయి. కానీ, వరి పొలాల పొగ.. ఢిల్లీ పాలకులకు, ప్రజానీకానికి పంట భూముల్లో రగులుతున్న సంక్షోభాన్ని రుచి చూపిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. పొలాల్లో పంటల జీవవైవిధ్యాన్ని, నేలతల్లి కడుపులో సూక్ష్మజీవరాశి వైవిధ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటేనే.. గ్రామీణులకైనా, దేశ రాజధానివాసులకైనా మనుగడ సాగుతుందని ఇప్పటికైనా గ్రహించడం మేలు. వాయుకాలుష్యం పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో.. ఆదివారం నాడు ఢిల్లీలో వ్యవసాయక జీవవైవిధ్యంపై ప్రధాని శాస్త్రవేత్తలతో కొలువుదీరడం కేవలం యాదృచ్ఛికమే! ప్రభుత్వ అపసవ్య వ్యవసాయ విధానమే అసలు సమస్యకు మూలమని గ్రహించడం అత్యవసరం!! గడ్డిని భూమిలోకి కలియదున్నితే భూసారం పెరుగుతుంది. అయితే, ఇందుకు ఎకరానికి రూ. 5 వేలు ఖర్చవుతుంది. ఆ ఖర్చును ప్రభుత్వం భరించవచ్చు. వరి కోత యంత్రాల్లో మార్పులు చేయించడం మరో పరిష్కారం. వరి గడ్డిని నేలమట్టానికి కోయడంతోపాటు.. ఆ గడ్డిని ముక్కలు చేసి నేలపైన పరవడం లేదా గడ్డిని బేళ్లుగా చుట్టడానికి కంబైన్ హార్వెస్టర్లలో తగిన మార్పులు చేయించాలి. గడ్డిని సేకరించి కంపోస్టు చేయించాలి. ఈ పనులు చేయకుండా ప్రభుత్వం రైతులకు జరిమానా విధించడం సరికాదు. - పంతంగి రాంబాబు,సాగుబడి డెస్క్ -
చేను కిందే చెరువును సృష్టిద్దాం!!
పొలంలోనే కందకాలు తీసి.. వాన నీటిని తాపుదాం! సాగునీటి భద్రత కోసం ‘సాక్షి’ మీడియా గ్రూప్, విశ్రాంత ఇంజనీర్ల వేదిక సంయుక్త ప్రచారోద్యమం పంటలను బతికించుకోవడానికే కాదు.. గొడ్డూ గోదాను కాపాడుకోవడానికి.. చివరికి తమ ప్రాణం నిలుపుకోవడానికీ చుక్క నీరు దొరక్క అలో లక్ష్మణా అంటూ అన్నదాతలు అలమటిస్తున్నారు. సమస్య ఎక్కడ ఉందో.. పరిష్కారం కూడా అక్కడే ఉంటుందంటారు పెద్దలు. కురిసే ప్రతి చినుకునూ ఒడిసి పట్టుకుంటే మనకు, జీవాలకు, పంటలక్కూడా శాశ్వతంగా నీటి కొరతన్న మాటే ఉండదంటున్నారు నిపుణులు. ఈ స్ఫూర్తిని అన్నదాతలందరి మనసుల్లో రగిలించి.. కార్యోన్ముఖులను చేయడానికి ‘సాక్షి’ మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక సంయుక్తంగా ప్రచారోద్యమానికి శంఖం పూరించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తీవ్ర దుర్భిక్ష పరిస్థితులున్న కొన్ని జిల్లాల్లో వర్క్షాపులు వరుసగా రెండో ఏడాది కూడా నిర్వహించబోతున్నాం. గత ఏడాది వర్క్షాప్లలో పాల్గొన్న అనేకమంది రైతులు కందకాలు తవ్వుకుని లబ్దిపొందారు. ఈ ఏడాదీ మరికొందరు అన్నదాతలు ఉద్యమ స్ఫూర్తితో తమ పొలాల్లో కందకాలు తవ్వుకుంటారని.. ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నాం.. కాలం మారిపోయింది. వాతావరణంలో పెనుమార్పు వచ్చింది. కార్తెల ప్రకారం వాన దేవుడు కరుణించడం అనుమానాస్పదంగా మారింది. స్థిమితంగా వర్షం కురిసే రోజుల సంఖ్య తగ్గింది. కుండపోత వర్షాల సంఖ్య పెరిగింది. ఉన్నట్టుండి విరుచుకుపడే అకాల వర్షాల సంఖ్య పెరిగింది. కొద్ది రోజుల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఈ అస్తవ్యస్థ పరిస్థితి వల్ల భూమిలోకి ఇంకే వాన నీటి శాతం తగ్గిపోయింది. అంటే.. కుండపోత వర్షం కురిసినప్పుడు కూడా ఆ వరద నీటిని సాధ్యమైనంత ఎక్కువగా భూమిలోకి ఇంకింప జేసుకోవడమే సర్వోత్తమం. ఇదే కరువుపై మనం చేసే పోరాటం. అందుకనే పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. కందకాలు తవ్వుకోవాలి. ఈ కందకాల లోతు అడుగో, అడుగున్నరో ఉంటే వరద నీటిని ఒడిసిపట్టలేం. కాబట్టి, కందకాల లోతు మీటరుండాలి. వెడల్పు కూడా మీటరుండాలి. పొడవు 25 మీటర్ల వరకు ఉండొచ్చు. ఆ తర్వాత 5 మీటర్లు వదిలి.. అదే వరుసలో మరో కందకం తవ్వాలి. ఈ విధంగా వాన నీటిని కందకాల ద్వారా పొలం కిందే నిల్వ చేసుకోవాలి. చేను కిందే చెరువును సృష్టించుకొని సాగు నీటి భద్రతను కల్పించుకోవాలి. అవసరమైనప్పుడు కావలసినంత నీటిని బోర్ల ద్వారా, బావుల ద్వారా తోడుకొని సమృద్ధిగా పంటలు పండించుకోవచ్చు. చుక్క నీరు లేక పంట ఎండిపోయే దుర్భర నీటి దారిద్య్రాన్ని పారదోలడానికి ఇదే చక్కని దారి. చేను కిందే చెరువును సృష్టించుకోవాలంటే.. వర్షాలకు ముందే పొలంలో లోతైన కందకాలు తవ్వుకోవాలి. ఏయే పొలాల్లో కందకాలు తవ్వేదెలా? సమతల కందకాలు: పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. మీటరు లోతు, మీటరు వెడల్పున సమతల (ఒకే లెవల్) కందకాలను తవ్వుకోవాలి. కందకం పొడవు 25 మీటర్లుండాలి. తర్వాత 5 మీటర్లు ఖాళీ వదిలి మరో కందకం తవ్వాలి. కందకంలో తవ్విన మట్టిని పొడవుగా ఒకే కట్టగా లోతట్టు వైపున పోయాలి. ఇలా చేస్తే కందకంలోకి వచ్చిన వాన నీరు పొర్లిపోకుండా ఉంటుంది. ఎర్రనేలలు: ఇసుక కలిసిన ఎర్ర నేలలు, చల్కానేలల్లో నీరు తొందరగా భూమిలోకి ఇంకిపోతుంది. ఇటువంటి పొలాలు ఏటవాలుగా ఉంటే పొలం మధ్యలో 50 మీటర్లకు ఒక్కటి చొప్పున కందకాలు తవ్వుకోవాలి. ఒక వేళ ఎర్ర చల్కా చేను ఏటవాలుగా కాకుండా సమతలంగా ఉంటే.. అర ఎకరం లేదా ఎకరానికి ఒక మడి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. మడుల కట్టలు కనీసం అర మీటరు ఎత్తుగా వేసి.. పక్కనే కందకం తవ్వాలి. నల్లరేగడి నేలలు: ఈ నేలల్లో నీరు త్వరగా ఇంకదు. కాబట్టి ఈ నేలలు ఏటవాలుగా ఉన్నా, సమతలంగా ఉన్నా, పొలం మధ్యలో కందకాలు తవ్వకూడదు. పొలం చివరన బావి లేదా బోరు కింద వాలులో.. ఒకే ఒక పెద్ద కందకం 2,3 మీటర్ల లోతున తవ్వుకుంటే చాలు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ పొలాల్లో కందకాలతోనే సాగునీటి భద్రత వ్యవసాయానికి సాగు నీరు అందించడానికి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల ఖర్చుతో నదులపై ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తూ ఉంటాయి. అయితే, పాలకులు తలపెట్టిన ఒక ప్రాజెక్టు పూర్తయి, నీరు అందుబాటులోకి రావాలంటే చాలా సంవత్సరాలే గడచిపోతాయి. కాబట్టి, అన్ని ప్రాంతాల రైతులూ వర్షపు నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలాలను ఒడిసిపట్టుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలి. పొలంలో కందకాలు తవ్వుకొని ఈ సీజన్లోనే తమ పంటలకు సాగు నీటి భద్రత కల్పించుకోవచ్చు. చిన్నపాటి వర్షాలు కురిసినప్పుడు పొలంలో నుంచి వర్షపు నీరు పెద్దగా బయటకు పోదు. కానీ, భారీ వర్షాలు కురిసినప్పుడు చాలా నీరు బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. అయితే, మీటరు లోతు, మీటరు వెడల్పున లోతైన కందకాలు తవ్వుకుంటే భారీ వర్షం కురిసినప్పుడు వరద నీటిని సైతం భూగర్భంలోకి ఇంకింపజేసుకోవచ్చు. ఖర్చు ఎకరానికి రూ. 2 వేలకు మించదు. రైతన్నలారా.. కదలండి..! - సంగెం చంద్రమౌళి (98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి (99638 19074), అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఇంజినీర్ల వేదిక.