
చేను కిందే చెరువును సృష్టిద్దాం!!
పంటలను బతికించుకోవడానికే కాదు.. గొడ్డూ గోదాను కాపాడుకోవడానికి.. చివరికి తమ ప్రాణం నిలుపుకోవడానికీ చుక్క నీరు దొరక్క అలో లక్ష్మణా అంటూ అన్నదాతలు అలమటిస్తున్నారు.
పొలంలోనే కందకాలు తీసి.. వాన నీటిని తాపుదాం!
సాగునీటి భద్రత కోసం ‘సాక్షి’ మీడియా గ్రూప్, విశ్రాంత ఇంజనీర్ల వేదిక సంయుక్త ప్రచారోద్యమం
పంటలను బతికించుకోవడానికే కాదు.. గొడ్డూ గోదాను కాపాడుకోవడానికి.. చివరికి తమ ప్రాణం నిలుపుకోవడానికీ చుక్క నీరు దొరక్క అలో లక్ష్మణా అంటూ అన్నదాతలు అలమటిస్తున్నారు. సమస్య ఎక్కడ ఉందో.. పరిష్కారం కూడా అక్కడే ఉంటుందంటారు పెద్దలు. కురిసే ప్రతి చినుకునూ ఒడిసి పట్టుకుంటే మనకు, జీవాలకు, పంటలక్కూడా శాశ్వతంగా నీటి కొరతన్న మాటే ఉండదంటున్నారు నిపుణులు. ఈ స్ఫూర్తిని అన్నదాతలందరి మనసుల్లో రగిలించి.. కార్యోన్ముఖులను చేయడానికి ‘సాక్షి’ మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక సంయుక్తంగా ప్రచారోద్యమానికి శంఖం పూరించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తీవ్ర దుర్భిక్ష పరిస్థితులున్న కొన్ని జిల్లాల్లో వర్క్షాపులు వరుసగా రెండో ఏడాది కూడా నిర్వహించబోతున్నాం. గత ఏడాది వర్క్షాప్లలో పాల్గొన్న అనేకమంది రైతులు కందకాలు తవ్వుకుని లబ్దిపొందారు. ఈ ఏడాదీ మరికొందరు అన్నదాతలు ఉద్యమ స్ఫూర్తితో తమ పొలాల్లో కందకాలు తవ్వుకుంటారని.. ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నాం..
కాలం మారిపోయింది. వాతావరణంలో పెనుమార్పు వచ్చింది. కార్తెల ప్రకారం వాన దేవుడు కరుణించడం అనుమానాస్పదంగా మారింది. స్థిమితంగా వర్షం కురిసే రోజుల సంఖ్య తగ్గింది. కుండపోత వర్షాల సంఖ్య పెరిగింది. ఉన్నట్టుండి విరుచుకుపడే అకాల వర్షాల సంఖ్య పెరిగింది. కొద్ది రోజుల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఈ అస్తవ్యస్థ పరిస్థితి వల్ల భూమిలోకి ఇంకే వాన నీటి శాతం తగ్గిపోయింది. అంటే.. కుండపోత వర్షం కురిసినప్పుడు కూడా ఆ వరద నీటిని సాధ్యమైనంత ఎక్కువగా భూమిలోకి ఇంకింప జేసుకోవడమే సర్వోత్తమం. ఇదే కరువుపై మనం చేసే పోరాటం. అందుకనే పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. కందకాలు తవ్వుకోవాలి.
ఈ కందకాల లోతు అడుగో, అడుగున్నరో ఉంటే వరద నీటిని ఒడిసిపట్టలేం. కాబట్టి, కందకాల లోతు మీటరుండాలి. వెడల్పు కూడా మీటరుండాలి. పొడవు 25 మీటర్ల వరకు ఉండొచ్చు. ఆ తర్వాత 5 మీటర్లు వదిలి.. అదే వరుసలో మరో కందకం తవ్వాలి. ఈ విధంగా వాన నీటిని కందకాల ద్వారా పొలం కిందే నిల్వ చేసుకోవాలి. చేను కిందే చెరువును సృష్టించుకొని సాగు నీటి భద్రతను కల్పించుకోవాలి. అవసరమైనప్పుడు కావలసినంత నీటిని బోర్ల ద్వారా, బావుల ద్వారా తోడుకొని సమృద్ధిగా పంటలు పండించుకోవచ్చు. చుక్క నీరు లేక పంట ఎండిపోయే దుర్భర నీటి దారిద్య్రాన్ని పారదోలడానికి ఇదే చక్కని దారి. చేను కిందే చెరువును సృష్టించుకోవాలంటే.. వర్షాలకు ముందే పొలంలో లోతైన కందకాలు తవ్వుకోవాలి.
ఏయే పొలాల్లో కందకాలు తవ్వేదెలా?
సమతల కందకాలు: పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. మీటరు లోతు, మీటరు వెడల్పున సమతల (ఒకే లెవల్) కందకాలను తవ్వుకోవాలి. కందకం పొడవు 25 మీటర్లుండాలి. తర్వాత 5 మీటర్లు ఖాళీ వదిలి మరో కందకం తవ్వాలి. కందకంలో తవ్విన మట్టిని పొడవుగా ఒకే కట్టగా లోతట్టు వైపున పోయాలి. ఇలా చేస్తే కందకంలోకి వచ్చిన వాన నీరు పొర్లిపోకుండా ఉంటుంది. ఎర్రనేలలు: ఇసుక కలిసిన ఎర్ర నేలలు, చల్కానేలల్లో నీరు తొందరగా భూమిలోకి ఇంకిపోతుంది. ఇటువంటి పొలాలు ఏటవాలుగా ఉంటే పొలం మధ్యలో 50 మీటర్లకు ఒక్కటి చొప్పున కందకాలు తవ్వుకోవాలి. ఒక వేళ ఎర్ర చల్కా చేను ఏటవాలుగా కాకుండా సమతలంగా ఉంటే.. అర ఎకరం లేదా ఎకరానికి ఒక మడి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. మడుల కట్టలు కనీసం అర మీటరు ఎత్తుగా వేసి.. పక్కనే కందకం తవ్వాలి.
నల్లరేగడి నేలలు: ఈ నేలల్లో నీరు త్వరగా ఇంకదు. కాబట్టి ఈ నేలలు ఏటవాలుగా ఉన్నా, సమతలంగా ఉన్నా, పొలం మధ్యలో కందకాలు తవ్వకూడదు. పొలం చివరన బావి లేదా బోరు కింద వాలులో.. ఒకే ఒక పెద్ద కందకం 2,3 మీటర్ల లోతున తవ్వుకుంటే చాలు.
- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
పొలాల్లో కందకాలతోనే సాగునీటి భద్రత
వ్యవసాయానికి సాగు నీరు అందించడానికి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల ఖర్చుతో నదులపై ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తూ ఉంటాయి. అయితే, పాలకులు తలపెట్టిన ఒక ప్రాజెక్టు పూర్తయి, నీరు అందుబాటులోకి రావాలంటే చాలా సంవత్సరాలే గడచిపోతాయి. కాబట్టి, అన్ని ప్రాంతాల రైతులూ వర్షపు నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలాలను ఒడిసిపట్టుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలి. పొలంలో కందకాలు తవ్వుకొని ఈ సీజన్లోనే తమ పంటలకు సాగు నీటి భద్రత కల్పించుకోవచ్చు. చిన్నపాటి వర్షాలు కురిసినప్పుడు పొలంలో నుంచి వర్షపు నీరు పెద్దగా బయటకు పోదు. కానీ, భారీ వర్షాలు కురిసినప్పుడు చాలా నీరు బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. అయితే, మీటరు లోతు, మీటరు వెడల్పున లోతైన కందకాలు తవ్వుకుంటే భారీ వర్షం కురిసినప్పుడు వరద నీటిని సైతం భూగర్భంలోకి ఇంకింపజేసుకోవచ్చు. ఖర్చు ఎకరానికి రూ. 2 వేలకు మించదు. రైతన్నలారా.. కదలండి..!
- సంగెం చంద్రమౌళి (98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి (99638 19074), అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఇంజినీర్ల వేదిక.