
‘పొగ’బట్టిన ‘ఏక’ పంటలు!
వాయుకాలుష్యం రూపంలో దేశ రాజధాని నగరంలో ‘పర్యావరణ అత్యవసర’ పరిస్థితిని సృష్టించింది.
వాయుకాలుష్యం రూపంలో దేశ రాజధాని నగరంలో ‘పర్యావరణ అత్యవసర’ పరిస్థితిని సృష్టించింది. పొలాల్లో వరిగడ్డి దహనానికి దీపావళి కాలుష్యం తోడైంది. ‘హరిత విప్లవం’ మన పొలాల్లోకి వచ్చి ఇప్పటికి సరిగ్గా ఏభయ్యేళ్లు. అప్పటి నుంచి పంట భూముల్లోపల తొలుస్తున్న పర్యావరణ సంక్షోభమే ఇవాళ అతి సూక్ష్మ ధూళికణాల మహా పడగై రాజధానిని చుట్టుముట్టింది. దేశ రాజధానివాసులను మునుపెన్నడూ ఎరుగనంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది.
‘హరిత విప్లవం’ వెంట తెచ్చిన ఏక పంటల (మోనోకల్చర్) దురలవాటే ఈ దుస్థితికి మూలకారణం. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల పొలాల్లో ఖరీఫ్లో వరి, రబీలో గోధుమ పంటల సాగు పద్ధతి రైతుల మనసుల్లో లోతుగా నాటుకుపోయింది. ఈ రెండు పంట దిగుబడులను మద్దతు ధరకు ప్రభుత్వం చప్పున సేకరిస్తుంది. కాబట్టి, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల మిశ్రమ పంటల సాగు వంటి ప్రత్యామ్నాయాల వైపు రైతులు చూడలేకపోతున్నారు.
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని సారవంతమైన నేలల్లో రైతులు కేవలం వరి, గోధుమ పంటలనే ఏక పంటలుగా సాగు చేస్తున్నారు. యంత్రాలతో వరి కోతలైన కొద్ది రోజుల్లోనే గోధుమ విత్తుకోవాలంటే.. పొలాల్లో మిగిలిన మోకాలెత్తు వరి మోళ్లను తగుల బెట్టడానికి మించి మరొక సులువైన మార్గం రైతులకు తోచడం లేదు. పశువులకు వరి గడ్డి కన్నా గోధుమ గడ్డి మేపడమే మేలన్న భావన అక్కడి రైతుల్లో ఉంది. అందుకే ప్రభుత్వం నిషేధించినప్పటికీ వరి గడ్డి మోళ్లకు రైతులు నిప్పంటిస్తున్నారు. భూమిలో అనేక అంగుళాల లోతు వరకూ సూక్ష్మజీవరాశి మాడిపోయి పొలం నిర్జీవంగా, నిస్సారంగా మారిపోతున్నా.. ఏటేటా రసాయనిక ఎరువుల మోతాదు పెంచుతున్నారే తప్ప.. ఏక పంటల సాగు విషవలయాన్ని రైతులు ఛేదించలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మండుతున్న లక్షలాది హెక్టార్ల పంట భూముల పొగ.. ఢిల్లీ నగరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
పరస్పరాధారితమైన జీవవైవిధ్యమే ప్రకృతి మనుగడకు మూల సూత్రం. ఏక పంటల రసాయనిక వ్యవసాయ నమూనా ఫలితం నేలతల్లి పొదుగు కోసి పాలుతాగడం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ విషవలయంలో చిక్కుకున్న అన్నదాతల ఆక్రందనలు, ఆత్మబలిదానాలు పాలకులను కదిలించలేకపోతున్నాయి. కానీ, వరి పొలాల పొగ.. ఢిల్లీ పాలకులకు, ప్రజానీకానికి పంట భూముల్లో రగులుతున్న సంక్షోభాన్ని రుచి చూపిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. పొలాల్లో పంటల జీవవైవిధ్యాన్ని, నేలతల్లి కడుపులో సూక్ష్మజీవరాశి వైవిధ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటేనే.. గ్రామీణులకైనా, దేశ రాజధానివాసులకైనా మనుగడ సాగుతుందని ఇప్పటికైనా గ్రహించడం మేలు. వాయుకాలుష్యం పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో.. ఆదివారం నాడు ఢిల్లీలో వ్యవసాయక జీవవైవిధ్యంపై ప్రధాని శాస్త్రవేత్తలతో కొలువుదీరడం కేవలం యాదృచ్ఛికమే! ప్రభుత్వ అపసవ్య వ్యవసాయ విధానమే అసలు సమస్యకు మూలమని గ్రహించడం అత్యవసరం!!
గడ్డిని భూమిలోకి కలియదున్నితే భూసారం పెరుగుతుంది. అయితే, ఇందుకు ఎకరానికి రూ. 5 వేలు ఖర్చవుతుంది. ఆ ఖర్చును ప్రభుత్వం భరించవచ్చు. వరి కోత యంత్రాల్లో మార్పులు చేయించడం మరో పరిష్కారం. వరి గడ్డిని నేలమట్టానికి కోయడంతోపాటు.. ఆ గడ్డిని ముక్కలు చేసి నేలపైన పరవడం లేదా గడ్డిని బేళ్లుగా చుట్టడానికి కంబైన్ హార్వెస్టర్లలో తగిన మార్పులు చేయించాలి. గడ్డిని సేకరించి కంపోస్టు చేయించాలి. ఈ పనులు చేయకుండా ప్రభుత్వం రైతులకు జరిమానా విధించడం సరికాదు.
- పంతంగి రాంబాబు,సాగుబడి డెస్క్